Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download అపరిచిత పద్యాలు Questions and Answers.
TS 8th Class Telugu అపరిచిత పద్యాలు
1. క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి.
తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
ఖాళీలు:
ప్రశ్న 1.
పాముకు విషం ____________ లో ఉంటుంది.
జవాబు.
తల
ప్రశ్న 2.
వృశ్చికమనగా ____________
జవాబు.
తేలు
ప్రశ్న 3.
శరీరమంత విషం ____________ ఉంటుంది.
జవాబు.
ఖలునకు
ప్రశ్న 4.
పై పద్య మకుటం ____________
జవాబు.
సుమతీ
ప్రశ్న 5.
పై పద్యాన్ని రచించిన కవి ____________
జవాబు.
బద్దెన
2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు.
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.
ప్రశ్న 2.
పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు.
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.
ప్రశ్న 3.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.
ప్రశ్న 4.
ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు.
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.
ప్రశ్న 5.
ఈ పద్యం వల్ల ఏమి తెలుస్తోంది ?
జవాబు.
సమాధానాలు
ఈ పద్యం వల్ల పల్నాటి సీమ పల్లెటూళ్ళ గురించి తెలుస్తోంది.
3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షు రసము
అక్షరంబు తన్ను రక్షించు గావున
నక్షరంబు లోక రక్షితంబు. ప్రశ్నలు
ప్రశ్న 1.
మానవులకు ఏం కావాలి ?
జవాబు.
మానవులకు అక్షరం (విద్య) కావాలి.
ప్రశ్న 2.
అక్షరం జిహ్వకు ఎటువంటిది ?
జవాబు.
అక్షరం జిహ్వకు చెరకురసం వంటిది.
ప్రశ్న 3.
అక్షరము దేనిని రక్షిస్తుంది ?
జవాబు.
అక్షరము తనను (చదువుకున్నవానిని) రక్షిస్తుంది.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘అక్షరాలు నేర్చుకో.
ప్రశ్న 5.
ఈ పద్యంలో దేన్ని గురించి తెలియజేయబడింది?
జవాబు.
ఈ పద్యంలో ‘చదువు’ గురించి తెలియజేయబడింది.
4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కందుకము వోలె సుజనుడు.
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మంధుడు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
సుజనుడు ఎట్లా ఉంటాడు ?
జవాబు.
సుజనుడు కందుకంలా ఉంటాడు.
ప్రశ్న 2.
మందుడు ఎలా ఉంటాడు ?
జవాబు.
మందుడు మృత్పిండంలా ఉంటాడు.
ప్రశ్న 3.
సుజనుని కవి దేనితో పోల్చాడు ?
జవాబు.
సుజనుని కవి బంతితో పోల్చాడు.
ప్రశ్న 4.
ఈ పద్యంలోని అలంకారమేమి ?
జవాబు.
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.
ప్రశ్న 5.
ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘నీతిపద్యం’.
5. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కలహపడునింట నిలువదు
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములులేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
కలహపడే ఇంట్లో ఏం నిలువదు ?
జవాబు.
కలహపడే ఇంట్లో లక్ష్మి (సంపద) నిలువదు.
ప్రశ్న 2.
కలకాలం ఎలా మెలగాలి ?
జవాబు.
కలకాలం ఏ విధమైన కలహాలు లేకుండా మెలగాలి.
ప్రశ్న 3.
ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది ?
జవాబు.
ఈ పద్యం కుమారీని సంబోధిస్తూ అంటే ఆడపిల్లలను సంబోధిస్తూ చెప్పబడింది.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘కలహం వద్దు’.
ప్రశ్న 5.
ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు.
ఈ పద్యం కుమారీ శతకం లోనిది.
6. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత ?’
వెఱచిరే ఘోర కాకోల విషము చేత ?
విడిచిరే యత్న మమృతంబు వొడుముదనుక ?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఉదధి రత్నముల చేత తృప్తి చెందని వారెవరు ?
జవాబు.
వేల్పులు ఉదధి రత్నములచేత తృప్తి చెందలేరు.
ప్రశ్న 2.
నిపుణమతులు ఎటువంటివారు ?
జవాబు.
నిపుణమతులు తాము అనుకున్న కార్యం నెరవేరే వరకు తమ ప్రయత్నాన్ని వదలరు.
ప్రశ్న 3.
వేల్పులు దేన్ని చూసి భయపడలేదు ?
జవాబు.
వేల్పులు ఘోర కాకోల విషాన్ని చూసి భయపడలేదు.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక “నిపుణమతుల లక్షణం”.
ప్రశ్న 5.
ఉదధి అంటే ఏమిటి ?
జవాబు.
ఉదధి అంటే సముద్రం.
7. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
విద్యచే భూషితుండయి వెలయుచున్నం
దొడరి వర్ణింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
చదువుకున్నప్పటికీ విడువదగినవాడు ఎవరు ?
జవాబు.
దుర్జనుడు చదువుకున్నప్పటికీ విడువదగినవాడు.
ప్రశ్న 2.
ఎటువంటి పాము భయంకరమైనది ?
జవాబు.
మణులచేత అలంకరింపబడిన శిరస్సుగల పాము భయంకరమైనది.
ప్రశ్న 3.
ఈ పద్యం’లోని దుర్జనుడు దేనితో పోల్చబడ్డాడు ?
జవాబు.
ఈ పద్యంలో దుర్జునుడు పాముతో పోల్చబడ్డాడు.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జనుడితో స్నేహం పనికిరాదు.
ప్రశ్న 5.
మస్తకము అంటే ఏమిటి ?
జవాబు.
మస్తకం అంటే తల.
8. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆత డేల గలుగు యావత్ప్రపంచంబు
నీత డేల గలుగు ఇహము పరము
ప్రశ్నలు:
ప్రశ్న 1.
రాజు చేతి కత్తి దేన్ని వర్షిస్తుంది?
జవాబు.
రాజు చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది.
ప్రశ్న 2.
సుధలు కురిపించునది ఏది?
జవాబు.
సుకవి చేతి కలము సుధలు కురిపిస్తుంది.
ప్రశ్న 3.
యావత్ప్రపంచాన్ని పరిపాలించగలిగింది ఎవరు?
జవాబు.
రాజు యావత్ప్రపంచాన్ని పరిపాలించగలడు.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘రాజు సుకవి’.
ప్రశ్న 5.
ఇహము పరము ఏలగలిగేది ఎవరు ?
జవాబు.
ఇహము పరము ఏలగలిగేది సుకవి.
9. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను,
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
అల్పుడు మాట్లాడే తీరు ఎలాంటిది?
జవాబు.
అల్పుడు మాట్లాడే తీరు ఆడంబరంగా ఉంటుంది.
ప్రశ్న 2.
సజ్జనుడు ఎలా మాట్లాడుతాడు?
జవాబు.
సజ్జనుడు చల్లగా మాట్లాడుతాడు.
ప్రశ్న 3.
కంచు మ్రోగునట్లు మ్రోగనిదేది?
జవాబు.
కంచు మ్రోగునట్లు మ్రోగనిది బంగారం.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘అల్పుడు – సజ్జనుడు’.
ప్రశ్న 5.
ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు.
ఈ పద్యం వేమన శతకం లోనిది.
10. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కుసుమ గుచ్ఛంబునకుఁబోలె బొసగు శౌర్య
మానవంతున కివి రెండు మహితగతులు
సకలజన మస్తక ప్రదేశములనైన
వనమునందైన జీర్ణభావంబుఁ గనుట
ప్రశ్నలు:
ప్రశ్న 1.
శౌర్య మానవంతుడు ఎవరితో పోల్చబడ్డాడు?
జవాబు.
శౌర్య మానవంతుడు పుష్పగుచ్ఛంతో పోల్చబడ్డాడు.
ప్రశ్న 2.
కుసుమ గుచ్ఛం ఎక్కడ అలంకరింపబడుతుంది.?
జవాబు.
కుసుమ గుచ్ఛం సమస్త ప్రజల శిరస్సులందు అలంకరింపబడుతుంది.
ప్రశ్న 3.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘శౌర్య మానవంతుని లక్షణం’.
ప్రశ్న 4.
ఈ పద్యంలోని అలంకారం రాయండి.
జవాబు.
ఈ పద్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది.
ప్రశ్న 5.
శౌర్యమానవంతునకు మహితగతులు ఎన్ని ?
జవాబు.
శౌర్యమానవంతునకు రెండు మహిత గతులు.
11. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ద్యుమణి పద్మాకరము వికచముగఁ జేయుఁ
గుముద హర్షంబు గావించు నమృతసూతి,
యర్థితుడుగాక జలమిచ్చు నంబుధరుడు;
సజ్జనులు దారె పరహితాచరణమతులు
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పద్మాకరమును వికసింపజేసేది ఎవరు?
జవాబు.
సూర్యుడు (ద్యుమణి) పద్మాకరమును వికసింపజేస్తాడు.
ప్రశ్న 2.
చంద్రుడు వేటిని వికసింపజేస్తాడు?
జవాబు.
చంద్రుడు కలువలను వికసింపజేస్తాడు
ప్రశ్న 3.
కోరకుండానే నీటిని ఇచ్చేది ఎవరు?
జవాబు.
కోరకుండానే నీటిని ఇచ్చేది మేఘుడు.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘పరోపకారుల స్వభావం’
ప్రశ్న 5.
అమృతసూతి అంటే ఎవరు ?
జవాబు.
అమృతసూతి అంటే చంద్రుడు.
12. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ధరణి ధేనువుఁ బిదుకంగఁ దలఁచితేని
జనులు బోషింపు మధిప! వత్సముల మాడ్కి
జనులు పోషింపబడుచుండ జగతి కల్ప
లత తెఱంగున సకల ఫలంబు లొసఁగు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
అధీపులు ఎవరిని పోషించాలి ?
జవాబు.
అధిపులు జనులను పోషించాలి.
ప్రశ్న 2.
జగతి ఏమి యొసంగును ?
జవాబు.
జగతి సకల ఫలము లొసగును.
ప్రశ్న 3.
ధరణి దేనితో పోల్చబడినది ?
జవాబు.
ధరణి ధేనువుతో పోల్చబడినది.
ప్రశ్న 4.
పై పద్యమునకు శీర్షిక నిర్ణయింపుము.
జవాబు.
ఈ పద్యమునకు శీర్షిక ‘రాజ్యపాలన’.
ప్రశ్న 5.
ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది ?
జవాబు.
ఈ పద్యం అధిపుని (రాజుని సంబోధిస్తూ చెప్పబడింది.
13. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మొదలు జూచినఁ గడు గొప్ప పిదపఁ గుఱుచ,
యాదిఁ గొంచెము తర్వాత నధిక మగుచుఁ
దనరు, దిన పూర్వ పరభాగ జనితమైన
ఛాయపోలిక గుజన సజ్జనుల మైత్రి
ప్రశ్నలు:
ప్రశ్న 1.
కుజనుల మైత్రి ఎటువంటిది ?
జవాబు.
కుజనుల మైత్రి ఉదయకాలపు నీడవలె మొదట ఎక్కువగా ఉండి తరువాత తగ్గిపోతూ ఉంటుంది.
ప్రశ్న 2.
సజ్జనుల మైత్రి ఎటువంటిది ?
జవాబు.
సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడవలె మొదట తక్కువగా ఉండి తరువాత పెరుగుతూ ఉంటుంది.
ప్రశ్న 3.
కుజన, సజ్జనుల మైత్రిని కవి దేనితో పోల్చి చెప్పాడు ?
జవాబు.
కవి కుజనుల మైత్రిని ఉదయకాలపు నీడతోను, సజ్జనుల మైత్రిని సాయంకాలపు నీడతోను పోల్చి చెప్పాడు.
ప్రశ్న 4.
ఈ పద్యం వల్ల మనకు ఏం తెలుస్తోంది ?
జవాబు.
ఈ పద్యం వల్ల మనకు సజ్జనుల మైత్రి మంచిదని తెలుస్తోంది.
ప్రశ్న 5.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘మైత్రి’.
14. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అఘము వలన మరల్చు, హితార్థ కలితుఁ
జేయుఁ గోప్యంబు దాచుఁ, బోషించుగుణము,
విడువ డాపన్ను, లేవడివేళ నిచ్చు,
మిత్రు డీలక్షణమ్ముల మెలగుచుండు
ప్రశ్నలు:
ప్రశ్న 1.
మిత్రుడు దేని నుండి మరలిస్తాడు?
జవాబు.
మిత్రుడు పాపం నుండి మరలిస్తాడు.
ప్రశ్న 2.
మిత్రుడు ఎట్టివారిని విడిచిపెట్టడు ?
జవాబు.
మిత్రుడు ఆపదలో నున్నవారిని విడిచిపెట్టడు.
ప్రశ్న 3.
మిత్రుడు పోషించేది ఏది?
జవాబు.
మిత్రుడు సద్గుణాన్ని పోషిస్తాడు.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘మిత్ర లక్షణం’.
ప్రశ్న 5.
గోప్యము అంటే ఏమిటి ?
జవాబు.
గోప్యము అంటే రహస్యం.
15. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తివిరి యిసుమునఁ దైలంబుఁ దీయవచ్చుఁ
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఎవరి మనసు రంజింపచేయలేము ?
జవాబు.
మూర్ఖుని మనసు రంజింపచేయలేము.
ప్రశ్న 2.
ఇసుక నుండి ఏమి తీయవచ్చును ?
జవాబు.
ఇసుక నుండి తైలము తీయవచ్చు.
ప్రశ్న 3.
మృగతృష్ణలో ఏమి త్రాగవచ్చు ?
జవాబు.
మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక “మూర్ఖుని స్వభావం”.
ప్రశ్న 5.
మృగతృష్ణ అంటే అర్థం ఏమిటి ?
జవాబు.
మృగతృష్ణ అంటే ఎండమావి.
16. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కమలములు నీటఁ బాసినఁ
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే ఏం జరుగుతుంది?
జవాబు.
కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే సూర్యరశ్మి సోకి వాడిపోతాయి.
ప్రశ్న 2.
ఎప్పుడు మిత్రులు శత్రువులౌతారు?
జవాబు.
తమ తమ స్థానాలను విడిచిపెడితే మిత్రులు శత్రులౌతారు.
ప్రశ్న 3.
తామరలకు మిత్రుడెవరు?
జవాబు.
తామరలకు మిత్రుడు సూర్యుడు.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘స్థానబలం’
ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది సుమతీ శతకంలోని పద్యం.
17. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగినదానిని.
మఱువ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఎవరి చరిత్ర తెలుసుకోవాలి ?
జవాబు.
జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.
ప్రశ్న 2.
ధర్మాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి ?
జవాబు.
ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.
ప్రశ్న 3.
దేనిని అనుష్ఠించాలి ?
జవాబు.
ధర్మాన్ని అనుష్ఠించాలి.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘నీతిబోధ’.
ప్రశ్న 5.
గోష్ఠి అంటే ఏమిటి ?
జవాబు.
గోష్ఠి అంటే సభ.
18. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినురవేమ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పూజకంటె ముఖ్యమైనది ఏది ?
జవాబు.
పూజకంటే ముఖ్యమైనది బుద్ధి.
ప్రశ్న 2.
మాటకంటే దృఢమైనది ఏది?
జవాబు.
మాటకంటె దృఢమైనది మనస్సు.
ప్రశ్న 3.
కులముకంటె ప్రధానమైనది ఏది?
జవాబు.
కులముకంటె ప్రధానమైనది గుణం.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘దేనికంటె ఏది ప్రధానం?
ప్రశ్న 5.
ఇది ఏ శతకం’ లోని పద్యం.
జవాబు.
ఇది వేమన శతకంలోని పద్యం.
19. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తను లోకము గొనియాడగ
విని యుబ్బడు సజ్జనుండు వెండియుఁ గడు మే
లొనరించుఁ గీడొకించుక
యును దనదెసఁ దోఁపనీక యుడుపుచు వచ్చున్.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
లోకం తనను పొగిడితే పొంగిపోనివాడు ఎవరు ?
జవాబు.
లోకం తనను పొగిడితే పొంగిపోనివాడు సజ్జనుడు.
ప్రశ్న 2.
సజ్జనుడు లోకానికి ఏం చేస్తాడు?
జవాబు.
సజ్జనుడు లోకానికి మేలు చేస్తాడు.
ప్రశ్న 3.
తనవల్ల ఏమాత్రం హాని కలుగకుండ చూసేవాడు ఎవరు ?
జవాబు.
తనవల్ల ఏమాత్రం హాని కలుగకుండ చూసేవాడు సజ్జనుడు.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘సజ్జన స్వభావం’.
ప్రశ్న 5.
‘మేలు’ అంటే ఏమిటి ?
జవాబు.
‘మేలు’ అంటే ఉపకారం.
20. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
సదోష్ఠి సిరియు నొసగును
సదోష్ఠియె కీర్తిఁబెంచు; సంతుష్టియు నా
సదోష్ఠియె యొనగూర్చును;
సదోష్ఠియె పాపములను చఱచు కుమారా!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
సద్దోష్ఠి దేన్ని ఇస్తుంది?
జవాబు.
సద్దోష్ఠి సంపదను ఇస్తుంది.
ప్రశ్న 2.
కీర్తిని పెంచేది ఏది?
జవాబు.
కీర్తిని పెంచేది సన్గోష్ఠి.
ప్రశ్న 3.
పాపములను పోగొట్టేది ఏది?
జవాబు.
పాపములను పోగొట్టేది సదోష్ఠి.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘సద్దోష్ఠి ప్రయోజనం’.
ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది కుమార శతకంలోని పద్యం.
21. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పాలను గలసిన జలమును
బాల విధంబుననె యుండుఁ బరికింపంగా
బాల చవిఁ జెరచుఁ గావున
బాలసుఁడగు వాని పొందు వలదుర సుమతీ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పాలతో కలిసిన నీరు ఎలా ఉంటుంది?
జవాబు.
పాలతో కలిసిన నీరు పాలలాగానే ఉంటుంది.
ప్రశ్న 2.
పాల రుచిని చెడగొట్టేది ఏది?
జవాబు.
పాల రుచిని చెడగొట్టేది అందులో కలిసిన నీరు.
ప్రశ్న 3.
ఎవరితో స్నేహం చేయగూడదు?
జవాబు.
చెడ్డవారితో స్నేహం చేయగూడదు.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జన స్నేహం’.
ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది సుమతీ శతకంలోని పద్యం.
22. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆచార్యున కెదిరింపకు
బ్రోచినదొర నింద సేయబోకుము కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువబోకుమయ్య కుమారా !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఎవరిని ఎదిరింపరాదు ?
జవాబు.
ఆచార్యుని (గురువును) ఎదిరింపరాదు.
ప్రశ్న 2.
ఎవరిని నింద చేయకూడదు ?
జవాబు.
కాపాడిన (రక్షించిన) వారిని నిందచేయకూడడు.
ప్రశ్న 3.
వేటిని ఒంటరిగా చేయకూడదు ?
జవాబు.
వనులకై చేయు ఆలోచనలు ఒంటరిగా చేయకూడదు.
ప్రశ్న 4.
విడిచిపెట్టకూడనిది ఏది ?
జవాబు.
మంచి నడవడిని విడిచిపెట్టకూడదు.
ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది కుమార శతకంలోని పద్యం.
23. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక విషయ మెరుగుచున్
కనికల్ల నిజము దెలియుచు
మనవలె మహితాత్ముడుగను మరువక ఎపుడున్.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
చెప్పినది ఎట్లు వినవలెను ?
జవాబు.
చెప్పినది తొందరపడకుండా విషయమును తెలిసి కొనుచు వినవలెను.
ప్రశ్న 2.
విని తెలియవలసిన దేమి ?
జవాబు.
విని అబద్ధమేదో, నిజమేదో తెలియవలెను.
ప్రశ్న 3.
ఎట్లు మనవలెను ?
జవాబు.
ఎప్పుడు మహితాత్ముడుగ మనవలెను.
ప్రశ్న 4.
దీనికి శీర్షికను సూచించండి.
జవాబు.
దీనికి శీర్షిక ‘మహితాత్ముడు’.
ప్రశ్న 5.
కల్ల అంటే అర్థం ఏమిటి ?
జవాబు.
కల్ల అంటే అసత్యం.
24. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
మేడిపండు జూడ మేలిమైయుండును
పొట్టవిచ్చిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగుర
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పిరికివాడు దేనితో పోల్చబడినాడు ?
జవాబు.
పిరికివాడు మేడిపండుతో పోల్చబడినాడు.
ప్రశ్న 2.
మేడిపండు పైకి ఏ విధంగా వుంటుంది ?
జవాబు.
మేడిపండు పైకి చక్కగా ఉంటుంది.
ప్రశ్న 3.
మేడిపండులోపల ఎలా ఉంటుంది ?
జవాబు.
మేడిపండు లోపల పురుగులతో కూడి ఉంటుంది.
ప్రశ్న 4.
ఈ పద్యం వల్ల తెలిసిందేమిటి ?
జవాబు.
ఈ పద్యంవల్ల పిరికివాని స్వభావం తెలుస్తోంది.
ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది వేమన శతకంలోని పద్యం.
25. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
తేనెటీగ తేనెను ఎవరికి యిస్తున్నది?
జవాబు.
తేనెటీగ తేనెను తెరువరికి (బాటసారికి) ఇస్తున్నది.
ప్రశ్న 2.
తాను తినక, కూడబెట్టువారి నేమందురు?
జవాబు.
తాను తినక, కూడబెట్టువారిని పిసినారి అంటారు.
ప్రశ్న 3.
పై పద్యము నందలి భావమేమి?
జవాబు.
కూడబెట్టిన ధనం సద్వినియోగం చేయకపోతే వృథా అవుతుంది.
ప్రశ్న 4.
కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును?
జవాబు.
కూడబెట్టిన ధనం దానం చేసినా లేదా తాను అనుభవించినా సద్వినియోగం అవుతుంది.
ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు.
ఇది వేమన శతకంలోని పద్యం.
26. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది ?
జవాబు.
అంటూ ఉంటే రాగం అతిశయిల్లుతుంది.
ప్రశ్న 2.
తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు.
తింటూ ఉంటే వేపాకు తీయనవుతుంది.
ప్రశ్న 3.
సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు.
సాధనతో పనులు సమకూరుతాయి.
ప్రశ్న 4.
ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు.
‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది ఈ పద్యానికి మకుటం.
ప్రశ్న 5.
అతిశయిల్లు అంటే ఏమిటి ?
జవాబు.
అతిశయిల్లు అంటే హెచ్చు.
27. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
మేరు నగము వంటి ధీరత కలిగియు
పరమశివుడు తనదు పదములంట
ఇంచుకంత చంచలించె పర్వతరాజు
దేవదేవుడన్న భావనమున.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పర్వతరాజు ఎటువంటి ధీరత గలవాడు ?
జవాబు.
పర్వతరాజు మేరు నగము వంటి ధీరత గలవాడు.
ప్రశ్న 2.
పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినదెవరు?
జవాబు.
పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినది పరమ శివుడు.
ప్రశ్న 3.
ఇంచుకంత చలించినది ఎవరు ?
జవాబు.
ఇంచుకంత చలించినది పర్వతరాజు.
ప్రశ్న 4.
పర్వతరాజు శివుని ఎట్లా భావించాడు ?
జవాబు.
పర్వతరాజు శివుని దేవదేవుడుగా భావించాడు.
ప్రశ్న 5.
మేరు నగము అంటే ఏమిటి ?
జవాబు.
మేరు నగము అంటే బంగరు పర్వతం.
28. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల
భాండ శుద్ధి లేని పాకమేల
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పాకమునకు దేని శుద్ధి అవసరం?
జవాబు.
పాకమునకు భాండశుద్ధి అవసరం.
ప్రశ్న 2.
చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయకూడదు?
జవాబు.
చిత్తశుద్ధి లేకుండా శివపూజలు (దైవపూజలు) చేయకూడదు.
ప్రశ్న 3.
ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక ‘శుద్ధి’ (నిర్మలత్వం) అని పెట్టవచ్చు.
ప్రశ్న 4.
ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు.
ఈ పద్యాన్ని రాసిన కవి వేమన.
ప్రశ్న 5.
‘ఆచారము’ ఎలా ఉండాలి ?
జవాబు.
‘ఆచారము’ ఆత్మశుద్ధి కలిగి యుండాలి.
29. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మఱవవలెఁ గీడు నెన్నఁడు
మఱవంగా రాదు మేలు మర్యాదలలోఁ
దిరుగవలె సర్వజనములఁ
దరిఁప్రేమన్ మెలగవలయుఁ దరుణి కుమారీ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
దేనిని మరచిపోవాలి ?
జవాబు.
కీడును మరచిపోవాలి.
ప్రశ్న 2.
దేనిని మరువరాదు ?
జవాబు.
మేలును మరువరాదు.
ప్రశ్న 3.
అందరి ఎడల ఎట్లా మెలగాలి ?
జవాబు.
అందరి యెడల మర్యాదలతోను, ప్రేమతోను మెలగాలి.
ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు.
ఈ పద్యం ‘కుమారీ శతకం’ లోనిది.
ప్రశ్న 5.
మర్యాద అంటే ఏమిటి ?
జవాబు.
మర్యాద అంటే కట్టుబాటు.
30. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టదా! గిట్టదా!
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఎవరి మీద దయ కలిగి ఉండాలి?
జవాబు.
తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి.
ప్రశ్న 2.
చెదలు ఎక్కడ పుట్టి గిట్టుతుంది?
జవాబు.
చెదలు పుట్టలో పుట్టి గిట్టుతుంది.
ప్రశ్న 3.
దయలేని కుమారుడిని కవి దేనితో పోల్చాడు?
జవాబు.
దయలేని కుమారుడిని కవి చెదలుతో పోల్చాడు.
ప్రశ్న 4.
ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు?
జవాబు.
ఈ పద్యాన్ని రచించిన కవి వేమన.
ప్రశ్న 5.
‘గిట్టు’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు.
“గిట్టు అంటే నశించు” అని అర్థం.
31. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఏ పాలు గరిటెడు చాలు ?
జవాబు.
గంగిగోవు పాలు గరిటెడు చాలు.
ప్రశ్న 2.
ఖరము అనగానేమి ?
జవాబు.
ఖరము అనగా గాడిద.
ప్రశ్న 3.
పట్టెడు ఎటువంటి తిండి కావాలి ?
జవాబు.
భక్తితో కూడిన తిండి పట్టెడు కావాలి.
ప్రశ్న 4.
ఈ పద్యానికి మకుటం ఏమిటి ?
జవాబు.
“విశ్వదాభిరామ వినురవేమ” అనేది ఈ పద్యానికి మకుటం.
ప్రశ్న 5.
ఇది ఏ శతకంలోని పద్యం.
జవాబు.
ఇది వేమన శతకంలోని పద్యం.
32. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
“నోచిన తల్లిదండ్రికి దనూభవుఁడొక్కడే చాలు, మేటిచే
చాచనివాడు, వేటొకఁడు చాచినలేదన కిచ్చువాడు నోఁ
రాచి నిజంబుగాని పలుకాడని వాఁడు రణంబులోనమేన్.
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ !!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
దాత అంటే ఎవరు ?
జవాబు.
వేరొకడు చేయిచాస్తే లేదనకుండా ఇచ్చేవాడు.
ప్రశ్న 2.
నిజము మాత్రమే పలికేవానిని ఏమంటారు ?
జవాబు.
సత్యవాది
ప్రశ్న 3.
రణము అంటే అర్థమేమిటి ?
జవాబు.
యుద్ధము
ప్రశ్న 4.
దాశరథి ఎవరు ?
జవాబు.
శ్రీరాముడు
ప్రశ్న 5.
శ్రీరాముని గుణములలో కవి చెప్పిన గొప్ప గుణము ఏది ?
జవాబు.
కరుణ
33. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తలఁగవు కొండలకైనను
మలఁగవు సింగములకైన, మార్కొను కడిమిం
గలఁగవు పిడుగులకైనను
నిలబల సంపన్న వృత్తి, నేనుఁగు గున్నల్
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఈ పద్యంలో ఏ అలంకారం కలదు ?
జవాబు.
అతిశయోక్తి అలంకారం కలదు
ప్రశ్న 2.
ఏనుగు గున్నలు ధైర్యమైనవని ఎలాగ చెప్పగలం ?
జవాబు.
సింహాలను కూడా ఎదుర్కొంటాయి కనుక
ప్రశ్న 3.
ధ్వనులకు భయపడవు అని ఎలాగ చెప్పగలవు ?
జవాబు.
పిడుగులకు కూడా బెదరవు కనుక
ప్రశ్న 4.
బల సంపద ఏ సమాసం ?
జవాబు.
రూపక సమాసం
ప్రశ్న 5.
పిడుగులకైనా ఏ సంధి ?
జవాబు.
ఉకార వికల్ప సంధి
34. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తెలియని మనుజుని సుఖముగఁ
దెలుపందగు సుఖతరముగ దెలుపగ వచ్చున్
దెలిసిన వానిం, దెలిసియుఁ
దెలియని నరుఁ దెల్ప బ్రహ్మ దేవుని వశమే
ప్రశ్నలు:
ప్రశ్న 1.
తెలియని వానికి తెలుపుట చేయగలమా ?
జవాబు.
చేయగలము.
ప్రశ్న 2.
ఎవరికి తెలుపలేము ?
జవాబు.
తెలిసి, తెలియనివానికి
ప్రశ్న 3.
ఈ పద్యం ఎవరి గురించి చెప్పబడింది ?
జవాబు.
మూర్ఖుని గురించి
ప్రశ్న 4.
బ్రహ్మకు కూడా సాధ్యం కానిదేది ?
జవాబు.
మూర్ఖునికి బుద్ధి చెప్పడం
ప్రశ్న 5.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
మూర్ఖత్వం
35. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
మానవుని రక్షించేది ఏది ?
జవాబు.
శాంతం
ప్రశ్న 2.
మానవునకు శత్రువు ఏది ?
జవాబు.
కోపం
ప్రశ్న 3.
స్వర్గనరకాలు ఎవరి చేతిలో ఉన్నాయి ?
జవాబు.
మనచేతిలోనే ఉన్నాయి.
ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు.
సుమతీ శతకం లోనిది
ప్రశ్న 5.
ఈ పద్యాన్ని బట్టి మానవులు ఎలా ఉండాలి ?
జవాబు.
సంతోషంతో, శాంతంగా ఉండాలి.
36. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
కాచియతుకవచ్చు క్రమము గాను
మనసు విరిగెనేని మరియంట వచ్చు నా
విశ్వదాభిరామ వినుర వేమ !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
దేనిని అతకవచ్చు ?
జవాబు.
ఇనుము
ప్రశ్న 2.
దేనిని అతకలేము ?
జవాబు.
మనసు
ప్రశ్న 3.
మనసు ఎప్పుడు విరుగుతుంది ?
జవాబు.
ఎవరైన బాధ పెట్టినప్పుడు
ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు.
వేమన శతకం లోనిది
ప్రశ్న 5.
“ముమ్మారు” అనగా అర్థమేమిటి ?
జవాబు.
మళ్ళీ మళ్ళీ.