TS 10th Class Telugu Question Paper April 2023

Reviewing TS 10th Class Telugu Model Papers and TS 10th Class Telugu Question Paper April 2023 can help students identify areas where they need improvement.

TS 10th Class Telugu Question Paper April 2023

పార్ట్స్ – A & B

సమయం : 3 గం.
మార్కులు: 80

సూచనలు :

  1. పార్ట్ – ఎ లో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులను జవాబు పత్రంలో రాయండి.
  2. పార్ట్ – బి లో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు జవాబులను అందులోనే రాసి పార్ట్ – ఎ జవాబు పత్రముతో జత చేయండి.

సమయం :2 గం. 30 ని.లు
మార్కులు : 60

పార్ట్స్ – A
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)

అ) కింది పేరాను చదివి, ఖాళీలను పూరించండి. (5 × 1 = 5 మా.)

సముద్రంపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయ పడదలిచాడు. తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం. ఆ ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలుగకూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు. అతని బంగారు గిరి శిఖరాల మీద హనుమంతుడు ఒకింతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. మైనాకుడు సరేనన్నాడు. ఒక్కసారిగా సముద్రం మధ్యనుంచి పైకి లేచాడు.

అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలచాడు మారుతి. తన ఎదతో నెట్టివేశాడు. మైనాకుడు అబ్బురపడ్డాడు. మానవరూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు. సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో ‘నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తిపడ్డాను.’ ఆతిథ్యం అందుకున్నట్లే భావించు. సమయం లేదు. ఆగడానికి వీలులేదు.’ అని చెప్పి చేతితో అతణ్ణి తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు.

హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది. కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్ళతో సింహికను చీల్చేశాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
హనుమంతునికి సహాయపడదలచినవాడు
జవాబు:
సాగరుడు / సముద్రుడు.

ప్రశ్న 2.
హనుమంతుడు మైనాకుణ్ణి తన ఎదతో నెట్టివేయడానికి కారణం
జవాబు:
తనకు ఆటంకమని తలచాడు.

TS 10th Class Telugu Question Paper April 2023

ప్రశ్న 3.
…………….. రూపంలో మైనాకుడు కనిపించాడు.
జవాబు:
మానవ

ప్రశ్న 4.
హనుమంతుని పరీక్షించి, ఆనందించి ఆశీర్వదించిన వారు ………..
జవాబు:
సురస అనే నాగమాత.

ప్రశ్న 5.
హనుమంతుడు సింహికను చీల్చి చంపడానికి కారణం …………
జవాబు:
‘హనుమంతుని మింగాలని చూసింది కాబట్టి.

ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యాన్ని పూరించి భావం రాయండి. (1 × 5 = 5 మా.)

ప్రశ్న 6.
ఊరూరం జనులెల్ల ………… శ్రీకాళహస్తీశ్వరా !
జవాబు:
శా॥ ఊరూరం జనులెల్ల భిక్షమిఢరో, యుండంగుహల్గల్గవో
చీరానీకము వీథులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః
పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీ వోపవో
చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా !

భావం : శ్రీకాళహస్తీశ్వరా ! తినడానికి భిక్షం అడిగితే ప్రతి గ్రామంలోనూ ప్రజలు భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. త్రాగడానికి నదుల్లో చల్లని అమృతం లాంటి తియ్యని నీరు ఉంది. తపస్సు చేసుకొనే మనుష్యులను కాపాడడానికి నీవున్నావు. ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలియడం లేదు.
విశేషం : శ్రీకాళహస్తీశ్వర శతక కర్త ధూర్జటికి కవులు, రాజులను ఆశ్రయించి జీవించడం అంటే అనిష్టం.

(లేదా)

కారే రాజులు ? రాజ్యముల్ …………. భార్గవా ?
జవాబు:
శా॥ కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ? గర్వోన్నతిం బొందరే ?
వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే ? భూమిపైఁ
బేరైనం గలదే ? శిబిప్రముఖులుం బ్రితిన్ యశఃకాములై
యీరే కోర్కులు ? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా !

భావం : శుక్రాచార్యా ! చాలామంది రాజులు ఉన్నారు. రాజ్యాలు ఉన్నాయి. వారు అహంకారంతో గర్వించారు. వాళ్ళెవరూ లేరు. వారు తమ సంపదలను మూటగట్టుకొని పోలేకపోయారు. ఈ లోకంలో వాళ్ళ పేర్లు కూడా మిగలలేదు. శిబి చక్రవర్తి వంటి దాతలు కీర్తి శరీరంతో ఉన్నారు. కోరిన వారి కోరికలను ఇష్టంతో తీర్చారు. ఈ కాలంలో కూడా ఆ
మహాదాతలను ఎవరూ మరచిపోరు.

ఇ) కింది పేరాను చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు 1, 2 వాక్యాలలో జవాబులు రాయండి. (5 × 2 = 10 మా.)

రాజు తాతను ఇలా ప్రశ్నించాడు. “తాతా ! నీ మనుమడు రెండు చంక కర్రలతో గాని నడువలేకుండా ఉంటే, నీ కొడుకు ఒక కర్ర ఊతతో నడుస్తున్నాడు. నువ్వు ఏ సాయం అక్కర్లేకుండానే నడువగలుగుతున్నావే ? నీ కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి. చెవుడు రాలేదు. పళ్ళు ఊడలేదు. నీకూ నీ మనుమడికీ యీ తేడా యెందుకుంది. ? చెప్పు?”

తాత ఇలా జవాబిచ్చాడు. “ప్రభూ ! ఇట్లా జరగడానికి కారణం లేకపోలేదు. ఇదివరలో మానవులు తమ శ్రమ మీదే ఆధారపడి జీవించేవాళ్ళు, ఇప్పుడో చాలామంది ఇతరుల కష్టం మీద ఆధారపడి సోమరులుగా బ్రతుకుతున్నారు. పూర్వం అంతా ప్రకృతి శాసనాలను అతిక్రమించకుండా జీవించారు. తను శ్రమపడి ఉత్పత్తి చేసిన వస్తువులతోనే గడుపుకొనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇతరుల వస్తువులకై మనస్సులో కూడా వాంఛించడం పాపంగా యెంచేవాళ్ళు. ఇప్పుడు కాలుమీద కాలేసుక్కూర్చొని అందరికంటే బాగా తినడమే గొప్ప సంగతిగా భావిస్తున్నారు. ఇదే తేడా, అప్పటికీ ఇప్పటికీ. అందువల్లనే పంటలూ క్షీణించాయి. మనుష్యుల జవసత్వాలూ ఉడుగుతున్నాయి.”

ప్రశ్నలు:

ప్రశ్న 7.
పై పేరాలో ఎవరెవరి మధ్య సంభాషణ జరిగింది ?
జవాబు:
పై పేరాలో సంభాషణ రాజు – తాతల మధ్య జరిగింది.

ప్రశ్న 8.
రెండు కర్రల సహాయంతో నడుస్తున్నది ఎవరు ?
జవాబు:
రెండు కర్రల సహాయంతో నడుస్తున్నది మనవడు.

ప్రశ్న 9.
ఒకప్పుడు మానవులు దేనిమీద ఆధారపడి జీవించేవాళ్ళు ?
జవాబు:
తమ శ్రమ మీదే ఆధారపడి జీవించేవాళ్ళు.

TS 10th Class Telugu Question Paper April 2023

ప్రశ్న 10.
ఈ కాలంలో దేన్ని గొప్ప సంగతి అనుకుంటున్నారు ?
జవాబు:
అందరి కంటే బాగా తినడమే గొప్ప సంగతి అనుకుంటున్నారు.

ప్రశ్న 11.
తాత, కొడుకు, మనవడు – ఈ ముగ్గురిలో ఎవరు ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారు ?
జవాబు:
తాత.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (40 మార్కులు)

అ) కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 12.
దాశరథి కృష్ణమాచార్యులు గురించి రాయండి.
జవాబు:
డా॥ దాశరథి కృష్ణమాచార్యగారు, వరంగల్లు జిల్లా చిన్న గూడూరులో జన్మించారు. వీరు

  1. అగ్నిధార,
  2. రుద్రవీణ,
  3. మహాంధ్రోదయం,
  4. పునర్నవం,
  5. కవితాపుష్పం,
  6. తిమిరంతో సమరం,
  7. అమృతాభిషేకం,
  8. ఆలోచనాలోచనాలు వంటి కవితా సంపుటాలను వెలువరించారు.

వీరు

  1. నవమి (నాటికలు)
  2. యాత్రాస్మృతి అనే స్వీయచరిత్రను వ్రాశారు.

వీరు సినీ గేయ కవిగా, ఆణిముత్యాల వంటి పాటలు రాశారు. గాలిబ్ గజళ్ళను 1961లో తెలుగులోనికి వీరు అనువదించారు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డునూ, 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డునూ వీరు పొందారు.

ప్రశ్న 13.
జీవనభాష్యం పాఠంలో వేటిని అలవరుచుకోవాలని కవి సూచించాడు ?
జవాబు:
ఎవరో ఏదో అంటారనే భయం వదలి ధైర్యంగా పనిచేయాలి.

  1. భయం వదిలి లక్ష్యాన్ని సాధించగలగాలని,
  2. కష్టపడి పనిచేస్తేనే ఫలితం ఉంటుందని,
  3. అందరితో కలిసి ఉంటేనే మంచిదనే భావనలను ఈ పాఠం ద్వారా అలవరుచుకోవచ్చు.

ప్రశ్న 14.
లావణ్య పలికిన మాటలు ఏమిటి ? ఆ మాటలకు సామల సదాశివ ఎందుకు ఆనందించాడు ?
జవాబు:
సామల సదాశివ గారి రెండవ మనుమరాలు లావణ్యకు, అప్పుడు నాలుగేళ్లు. సదాశివగారి మనవరాళ్ళకు తెలుగురాదు. వారు హిందీ మాట్లాడతారు. వారు కొన్ని తెలుగు మాటలు, హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు. కాని వారికి తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారం తెలియదు.

అలా నాలుగేళ్ళు పూర్తిగా నిండని ఆయన మనుమరాలు లావణ్య, “తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని, ప్రాంతీయభాషలో మాట్లాడి సదాశివ గారికి వాటిని తెచ్చి ఇచ్చింది. లావణ్య “ఇగపటు” అనగా, ఇదిగోనండీ అని అర్థం వచ్చేలా, ఆ ప్రాంతపు తెలుగులో మాట్లాడింది. తీయని ఆ ప్రాంతపు తెలుగుభాష, తన చిన్న మనుమరాలికి పట్టువడినందుకు సదాశివ గారు అబ్బురపడి, ఆనందించాడు.

ప్రశ్న 15.
‘గోలకొండ రాజ్యం’లో కవులకు, పండితులకు ఉన్న ఆదరణ ఎటువంటిది ?
జవాబు:

  1. గోలకొండ పాలకులలో ఇబ్రహీం కుతుబ్ షా విద్యాప్రియుడు.
  2. ఇతని ఆస్థానంలో కవులు, పండితులు ఉండేవారు.
  3. విద్యాగోష్ఠి ప్రతిరోజూ ఉండేది.
  4. రాజు తెలుగు భాషపై ఆదరణ కలిగి ఉండేవాడు.
  5. అద్దంకి గంగాధర కవి రాసిన ‘తపతీ సంవరణోపాఖ్యానం’ ఇబ్రహీం కుతుబ్ షా కి అంకితమిచ్చాడు.
  6. పాదుషా సేనాని అమీర్ ఖాన్ ‘యయాతి చరిత్ర’ను అంకితం తీసుకున్నారు.
  7. యయాతి చరిత్రను రచించిన పొన్నగంటి తెలగనార్యుని రాజు ఘనంగా సన్మానించారు.

ఆ) కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో జవాబులు రాయండి. (3 × 7 = 21 మా.)

ప్రశ్న 16.
నగర జీవనంలోని అనుకూల మరియు ప్రతికూల అంశాలు ఏమిటో వివరించండి.
జవాబు:
నగర జీవనం : నగరంలో ఎప్పుడూ రణగొణధ్వని ఉంటుంది. నగరంలో ధనవంతులు మంచి భవంతుల్లో నివసిస్తారు. కాని పేదవారు ఇనుప పెట్టెల్లాంటి ఇరుకు ఇళ్ళల్లో నివసిస్తూ ఉంటారు. సామాన్యులు అపార్ట్మెంట్లలో ఉంటారు. నగరంలో మనుషులు ఒంటరిగా ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతారు.

పక్క వారిని పట్టించుకోరు. నగరంలో పిల్లలు కాన్వెంట్లకు రిక్షాల్లో, సిటీబస్సుల్లో వెళతారు. నగరంలో దారిద్ర్యం, ఐశ్వర్యం సమాంతరంగా సాగుతాయి. నగరంలో వాహనాల కింద పడి ఎక్కువమంది చనిపోతూ ఉంటారు. కొందరు కార్లమీద తిరుగుతారు. మరికొందరు రిక్షాలపై, కొందరు కాలినడకనా తిరుగుతారు.

పల్లె జీవనం : పల్లెలలో పాడి పంటలు ఉంటాయి. ప్రజలు కలసి మెలసి సుఖంగా జీవిస్తారు. వ్యవసాయం వీరికి ప్రధాన వృత్తి. అందరూ కడుపునిండా తింటారు. పూరిపాకల్లో సంతోషంగా జీవిస్తారు. పల్లెలకు రోడ్డు రవాణా సదుపాయాలు ఉండవు. విద్యావైద్య సదుపాయాలు ఉండవు. కూరగాయలు ఎవరికి వారే పండించుకుంటారు. ప్రజలు అన్నదమ్ముల్లా చేతివృత్తులు చేసుకుంటూ జీవిస్తారు. ప్రజలు ఐకమత్యంగా ఉండి, కష్టసుఖాల్లో పరస్పరము పాలుపంచుకుంటారు.

(లేదా)

కాశీ నగరంలో వ్యాసుడు భిక్షను పొందిన విధానమును తెలుపండి.
జవాబు:
వ్యాసుడు సకల విద్యలకూ గురువు. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీ నగరంలో బ్రాహ్మణవాడలలో భిక్షాటనం కోసం వెళ్ళాడు. ఏవో కారణాలు చెప్పి, ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామనీ, మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందనీ, వ్యాసుడు నిశ్చయించాడు.

ఈశ్వరుడి మాయవల్ల మరుసటిరోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్షాపాత్రను నడివీధిలో పగులకొట్టి, కాశీ వాసులకు మూడు తరాల పాటు ధనం, మోక్షం, విద్య, లేకపోవుగాక అని శపించబోయాడు.

ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమయి, వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది.

అప్పుడు వ్యాసుడు “సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులున్నారు. వారు ‘తినకుండా నేను తినను. ఈ రోజు కూడా నిన్నటి లాగే పస్తుంటాను” అన్నాడు.

అప్పుడు పార్వతీదేవి నవ్వి “నీవు శిష్యులందరినీ నీ వెంట తీసుకొని రా ! ఈశ్వరుడి దయతో ఎంతమంది వచ్చినా, కావలసిన పదార్థాలు పెడతాను” అని చెప్పింది.

వ్యాసుడు సరే అని, శిష్యులతో గంగలో స్నానం చేసి వచ్చాడు. పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి, భోజనశాలలో వారందరికి భోజనం పెట్టింది.

ప్రశ్న 17.
“అవును, ఇది కొత్త బాటనే ! ఇంతకంటె కొత్త బాట, మంచి బాట ఇంగెట్లుంటది ?” అని అక్క ఎందుకు అనుకున్నదో వివరించండి.
జవాబు:

  1. పూర్వం గ్రామాల్లో ఆడవాళ్ళు ఎడ్లబండిలో ప్రయాణం చేసేటప్పుడు అందులోని ఆడవారు ఇతరులకు ఎవ్వరికీ కనిపించకుండా, వారు ప్రయాణించే బండికి ఎఱ్ఱని పరదాలు (తెరలు) కట్టేవారు. బండిలో ప్రయాణించే ఆడవాళ్ళు తాము ఇతరులకు కనిపిస్తామేమో అని, తమ చెదిరిన తల జట్టును సవరించుకొని, చీరకొంగు నిండుగ కప్పుకొని బండిలో కూర్చుండేవారు. ఇప్పుడు ఈ ఆచారం పోయింది.
  2. రచ్చకట్ట దగ్గర గ్రామ ప్రజలంతా కింద కూర్చుండేవారు. రచ్చకట్టపై ఒక్క ముచ్చెల అనగా ఆ గ్రామపెద్ద మాత్రమే కూర్చుండేవాడు. ఇప్పుడు గ్రామంలో మనుషులంతా రచ్చకట్టపై గ్రామపెద్దతోపాటు కూర్చుంటున్నారు.
  3. పూర్వం గ్రామంలో పెద్దవారు చదువుకొనేవారు కాదు. ఇప్పుడు గ్రామంలోకి రాత్రి బడి వచ్చింది. అక్కడ వయోజనులు రాత్రి బడిలో చదువుకొంటున్నారు.
  4. పూర్వం పెళ్ళిళ్ళలో మనుషులు మోసే పల్లకీలు, మేనాలు ఉండేవి. ఇప్పుడు ఎవ్వరూ పల్లకీలను మోయడం లేదు. పల్లకీలు. మేనాలు మూలనపడ్డాయి.
  5. పనిచేసే పిల్లలను తమతో సమంగా గ్రామస్థులు ఆదరిస్తున్నారు. పూర్వం అదిలేదు.
  6. ఊరిలో ఇన్ని మార్పులు వచ్చినవి కనుక ‘ఇంతకంటే కొత్తబాట, మంచిబాట ఇంగెట్లుంటది’ అనే ఉద్దేశంతో అక్క అన్నది.

(లేదా)

భూమిక పాఠం ఆధారంగా చార్మినార్ కథల గురించి రాయండి.
జవాబు:

  1. నెల్లూరు కేశవస్వామి రాసిన కథలలో చార్మినార్ కథలకు ప్రత్యేక స్థానముంది.
  2. ఆనాటి నవాబుల గురించి వారు దేవిడీలను గురించి వర్ణించారు.
  3. మెహిందీ, కోఠీల వర్ణన కూడా ఉంది,
  4. దివాన్లు, జనానాఖాన్లను గురించి కూడా తన కథల్లో వివరించారు.
  5. బేగం సాహెబాల గురించి, దుల్హస్పాషాల గురించి, పాన్టాన్, పరాటా కీమ, దాల్చ, నమాజుల గురించి ఉంది.
  6. పరదాల వెనుక ‘జీవితాలలోని సంస్కృతి, సంఘటనలు చార్మినార్ కథలలో కనిపిస్తాయి.

TS 10th Class Telugu Question Paper April 2023

ప్రశ్న 18.
రామాయణం ఆధారంగా అన్నదమ్ములంటే ఎట్లా ఉండాలో వివరించండి.
జవాబు:
రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల అన్నదమ్ముల అనుబంధం ప్రశంసనీయం. రామాయణంలో రాక్షసులయిన రావణ కుంభకర్ణ విభీషణులు అనే సోదరుల బంధాన్ని గూర్చి కూడా చెప్పబడింది. విభీషణుడు యుద్ధ సమయంలో అన్నను కాదని, అన్నకు శత్రువైన రాముని వద్దకు చేరాడు. విభీషణుడు చేసిన పని మంచిదే అయినా ఆ అన్నదమ్ముల బందం అటువంటిది.

రామాయణంలో వాలి సుగ్రీవులు’ అనే అన్నదమ్ముల గురించి కూడా ఉంది. వాలి, సుగ్రీవుని దూరంగా తరిమి, అతని భార్య రుసును చేపట్టి తప్పు చేశాడు. అది వాలి మరణానికి దారి తీసింది.

రామలక్ష్మణుల సోదరప్రేమ అమోఘమైనది. లక్ష్మణుడు రామునికి బహిఃప్రాణము. అన్నను విడిచి ఉండలేని లక్ష్మణుడు భార్యను, తల్లిని విడిచి, అన్న వెంట వనవాసానికి వెళ్ళాడు. వనవాసంలో అన్నావదినలను సేవించి తరించాడు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే లక్ష్మణుని వంటి తమ్ముడు తనకు దొరకడని రాముడు కన్నీరు కార్చాడు. అది రామలక్ష్మణుల అనుబంధం.

ఇక భరత శత్రుఘ్నులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు. భరతుని వెంట శత్రుఘ్నుడు భరతుని మేనమామ ఇంటికి వెళ్ళాడు. భరత శత్రుఘ్నులకు రాముడంటే ప్రాణం. రాముని, తన తల్లి అడవికి పంపిందని, భరతుడు తల్లిని నిందించాడు. శత్రుఘ్నుడు మంథరను చంపబోయాడు.

శ్రీరాముని వనవాస దీక్షను మాన్పించి తిరిగి అయోధ్యలో రాజుగా చేయాలని భరతుడు, శత్రుఘ్నునితో కలిసి రాముని దగ్గరకు వెళ్ళాడు. రాముని ఆదేశంపై రాముడు తిరిగి వచ్చేవరకూ రాముని పాదుకలకు పట్టాభిషేకం చేసి పాలించడానికి భరతుడు అంగీకరించాడు. 14 ఏండ్ల తరువాత దాముడు రాకపోతే భరతుడు అగ్నిప్రవేశం చేస్తానన్నాడు. ఆ అన్నదమ్ముల బంధము అంత గొప్పది.

వాలి, సుగ్రీవుల సోదరబంధం ఆదర్శప్రాయం కాదు. అన్న చెడ్డవాడయితే, అన్నను సైతం విడిచి మంచి మార్గాన్ని అనుసరించాలని విభీషణ వృత్తాంతం వల్ల తెలుస్తోంది. రామాయణంలో అన్నదమ్ముల అనుబంధం పై విధంగా చిత్రింపబడింది.

(లేదా)

‘మంచి వారితో స్నేహం చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది.’ అనే విషయాన్ని రామ-సుగ్రీవ, రామ-విభీషణుల స్నేహ వృత్తాంతాల ద్వారా వివరించండి.
జవాబు:

  1. మంచి వారితో స్నేహం చేస్తే మంచే జరుగుతుంది.
  2. రామ సుగ్రీవులు స్నేహితులు.
  3. సుగ్రీవుడు సోదరుడైన వాలి చేతిలో వంచితుడవుతాడు.
  4. రాముడితో స్నేహం చేయడం వల్ల వాలిని సంహరించి, సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశాడు రాముడు.
  5. రావణ సోదరుడు విభీషణుడు.
  6. రావణ గుణం, ధర్మం నచ్చక విభీషణుడు రాముని శరణు కోరాడు.
  7. ఫలితంగా రాముడు రావణుని చంపి విభీషణున్ని లంకకు రాజును చేశాడు.
  8. మంచివాడైన రామునితో స్నేహం చేయడం వల్ల విభీషణ, సుగ్రీవులకు మంచే జరిగింది.

ఇ) సృజనాత్మకత (1 × 7 = 7 మా.)

ప్రశ్న 19.
‘మంచి పుస్తకాలు మంచి మిత్రుని వలె ఎల్లప్పుడు తోడుంటాయి. గ్రంథాలయాలకు వెళ్ళడం, పుస్తకాలు చదువడం ఒక అలవాటుగా మారాలి.’ ఈ విషయం గురించి ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నట్లుగా ‘సంభాషణ’ రాయండి.
జవాబు:
లీలాకృష్ణ : జస్వంత్ ! నీ పుట్టిన రోజు ఎప్పుడు ?
జస్వంత్ : అక్టోబరు, 29వ తేది నా పుట్టిన రోజు దేనికి ?
‘లీలాకృష్ణ : ఏమీలేదు, ఈసారి నీ పుట్టిన రోజుకు నీకు నచ్చిన పుస్తకాన్ని బహుమతిగా ఇద్దామనుకుంటున్నాను మిత్రమా !
జస్వంత్ : ఏం పుస్తకం అయితే బాగుంటుందో నీవే చెప్పు..
లీలాకృష్ణ : మంచి పుస్తకం మంచి మిత్రుని వలె ఎల్లప్పుడు తోడుంటుంది. కనుక మన ఉన్నతికి తోడ్పడే పుస్తకాన్ని మనమే ఎంచుకోవాలి.
జస్వంత్ : ఇలా మనం ఎన్ని పుస్తకాలను కొనగలం ? ఎలా చదవగలం ?
లీలాకృష్ణ : మనం ఒక్క పుస్తకం కూడా కొనే అవసరం లేదు. మన పాఠశాలలోనే గ్రంథాలయం ఉంది. అక్కడ మనం మనకు కావాల్సిన పుస్తకాలను తీసుకొని చక్కగా చదువుకోవచ్చు.
జస్వంత్ : సబ్జెక్టు పుస్తకాలు చదవడానికే సమయం చాలడం లేదు. నేను గేమ్స్ ఆడి నెలరోజులైంది. ఇంకా ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళాలి ? ఏం చదవాలి ?
లీలాకృష్ణ : మన పాఠ్యపుస్తకాలతోపాటు, అనుబంధ పుస్తకాలను కూడా చదవాలి కదా !
జస్వంత్ : అనుబంధ పుస్తకాలు అంటే ?
లీలాకృష్ణ : మన పాఠ్యాంశ పుస్తకాలలో క్లుప్తంగా చెప్పబడిన అంశం. వివరంగా ఉండే పుస్తకాలు అనుబంధ పుస్తకాలు. ఇంకా అంబేద్కర్, గాంధీజీ, అబ్దుల్ కలాం, వివేకానంద, రామకృష్ణ పరమహంస మొదలైన మహనీయుల చరిత్రలు కూడా చదవాలి. “చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో” అన్న గాంధీ మాటలు గుర్తుంచుకోవాలి మనం.
జస్వంత్ : ఇవన్నీ చదవగలమా ?
లీలాకృష్ణ : మన సంకల్పమే మనకు బలం. ఖాళీ ఉన్నప్పుడు గాని, లేదా ఖాళీ చేసుకొనైనా గాని గ్రంథాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అంతేకాదు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి.
జస్వంత్ : మంచి విషయాలు చెప్పావు. నేను ఇవాల్టి నుంచే గ్రంథాలయానికి వెళ్ళి, పుస్తకాలు చదువుతాను…
లీలాకృష్ణ : ఆల్ ది బెస్ట్.

(లేదా)

దేశానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టి, ఉత్తమ క్రీడాకారుడిగా అవార్డులు పొందిన ఒక క్రీడాకారుణ్ణి ఇంటర్వ్యూ చేయడానికి ‘ప్రశ్నావళి’ని తయారు చేయండి.
జవాబు:

  1. ఆర్యా! ప్రముఖ క్రికెటర్ టెండూల్కర్ గార్కి మా ఆహ్వానం.
  2. మీ తల్లిదండ్రుల పేరేమి ?
  3. మీకు క్రికెట్ పై ఆసక్తి కల్పించిన వారెవరు ?
  4. మీకు నచ్చిన నేటి క్రికెటర్ ఎవరు ?
  5. విరాట్ కోహ్లి మీ స్థానాన్ని భర్తీ చేస్తాడని మీరనుకుంటున్నారా ?
  6. పాఠశాల దశలో మీ క్రికెట్, జీవితం గూర్చి తెల్పండి.
  7. మీరు మొదటగా జాతీయ క్రికెట్ జట్టులో చేరాక ఏ దేశంలో క్రికెట్ ఆడారు ?
  8. మీకు ‘వన్డే క్రికెట్’, ‘ఇరవై ఓవర్ల క్రికెట్ టెస్టులు’ వీటిలో ఏవంటే ఇష్టం ?
  9. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా ?
  10. మీకు నచ్చిన ప్రముఖ క్రికెట్ వీరుడెవరు ?
  11. మీరు మెచ్చే ఇతర ఆటలేవి ?
  12. నేటి విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
  13. మీ భార్యకు క్రికెట్ అంటే ఇష్టమేనా ?
  14. మీకు సంతానం ఎంతమంది ? వారేం చేస్తుంటారు ?

పార్ట్ – B

సమయం : 30 ని.లు
మార్కులు : 20

సూచనలు :

  1. విద్యార్థులు జవాబులను ఈ ప్రశ్నాపత్రంలోనే నిర్దేశించిన విధంగా కేటాయించిన స్థలంలో రాయాలి.
  2. పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ ప్రశ్నా పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ జవాబు పత్రంతో జత చేయండి.

I. భాషాంశాలు

అ) పదజాలం : (10 మార్కులు)

కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి. (2 × 1 = 2 మా.)

ప్రశ్న 1.
మార్గదర్శకుడు : …………………….
జవాబు:
మార్గదర్శకుడు : గౌరి తను సాధించిన విజయాల వెనుక ఉన్నది తనకు మార్గదర్శకుడు అయిన బయాలజీ లెక్చరర్ అని చెప్తుంది.

ప్రశ్న 2.
రూపురేఖలు : ………………….
జవాబు:
రూపురేఖలు : రామ్ పై చదువులు పూర్తి చేసుకొని వచ్చేసరికి, అతని స్వగ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

TS 10th Class Telugu Question Paper April 2023

కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/ B / C / D) బ్రాకెట్లో రాయండి. (8 × 1 = 8 మా.)

ప్రశ్న 3.
‘స్వాతంత్య్ర పోరాటంలో దేశభక్తులు ఎన్నో కడగండ్లను ఎదుర్కొన్నారు.’ ఈ వాక్యంలో కడగండ్లు అనే పదానికి అర్థం
A) సన్మానాలు
B) బహుమానాలు
C) కష్టాలు
D) పొగడ్తలు
జవాబు:
C) కష్టాలు

ప్రశ్న 4.
‘మంచిమాటలను చెవివారిచ్చి వినాలి’ – ఇందులో చెవివారిచ్చి అంటే
A) శ్రద్ధగా
B) కోపంగా
C) అశ్రద్ధగా
D) బాధతో
జవాబు:
A) శ్రద్ధగా

ప్రశ్న 5.
దారి, మార్గం అనేవి కింది వాటిలో దేనికి సరైన పర్యాయపదాలు ?
A) బాట
B) వర్షము
C) సొంపు
D) హాటకం
జవాబు:
A) బాట

ప్రశ్న 6.
‘ఒకప్పుడు బంధువులను ఊరి పొలిమేర వరకు సాగనంపడం ఆచారం.’ ఇందులో ‘పొలిమేర’కు సరైన పర్యాయ పదాలు
A) యుద్ధం, సంగ్రామం
B) సరిహద్దు, ఎల్ల
C) రాష్ట్రం, దేశం
D) వార్ధి, సముద్రం
జవాబు:
B) సరిహద్దు, ఎల్ల

ప్రశ్న 7.
‘యోధులు మహావీరులు’ – ఈ వాక్యంలో యోధులు అనే పదానికి వికృతి పదం
A) సాధులు
B) నాథులు
C) వీథులు
D) జోదులు
జవాబు:
D) జోదులు

ప్రశ్న 8.
‘ఆన’ అనే పదానికి ప్రకృతి పదం
A) ఆర్య
B) ఆజ్ఞ
C) ఆప్త
D) ఆశ
జవాబు:
B) ఆజ్ఞ

ప్రశ్న 9.
‘సిరి’ అనే పదానికి నానార్థాలు
A) వస్త్రం, ఆకాశం.
B) జాతి, ఇల్లు
C) కన్నీరు, ఆవిరి
D) సంపద, లక్ష్మి
జవాబు:
D) సంపద, లక్ష్మి

ప్రశ్న 10.
‘జలములు దీనిచే ధరింపబడును’ అనే వ్యుత్పత్తి అర్థానికి సరైన పదం
A) జలధి
B) జాలరి
C) కపర్ధి
D) అవధి
జవాబు:
A) జలధి

ఆ) వ్యాకరణాంశాలు: (10 మార్కులు)
కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/B/C/D) బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10 మా.)

ప్రశ్న 11.
‘కింది వాటిలో త్రికసంధికి సరైన ఉదాహరణ
A) అదేమిటి
B) ఇచ్చోట
C) పేదరాలు
D) దేవాలయం
జవాబు:
B) ఇచ్చోట

ప్రశ్న 12.
‘వృద్ధిసంధి’ ప్రకారం ‘ఐ, ఔ’ లు …………………
A) సవర్ణాలు
B) గుణములు
C) వృద్ధులు
D) హల్లులు
జవాబు:
C) వృద్ధులు

ప్రశ్న 13.
‘శూలపాణి’ అనేది కిందివాటిలో దేనికి ఉదాహరణ ?
A) షష్ఠీ తత్పురుష సమాసం
B) బహువ్రీహి సమాసం
C) చతుర్థీ తత్పురుష సమాసం
D) ద్విగు సమాసం
జవాబు:
B) బహువ్రీహి సమాసం

ప్రశ్న 14.
‘బలి హరిచరణమును నీటితో కడిగాడు.’ ఈ వాక్యంలో ‘హరిచరణము’ అనే పదానికి సరైన విగ్రహవాక్యం[
A) హరి యొక్క చరణము
B) హరి వలన చరణము
C) హరి యందు చరణము
D) హరితో చరణము
జవాబు:
A) హరి యొక్క చరణము

ప్రశ్న 15.
‘UUU’ అనేది ఏ గణం ?
A) వ గణం
B) య గణం
C) ర గణం
D) మ గణం
జవాబు:
D) మ గణం

ప్రశ్న 16.
1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు వచ్చే పద్యం
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) ఆటవెలది
D) మత్తేభం
జవాబు:
C) ఆటవెలది

TS 10th Class Telugu Question Paper April 2023

ప్రశ్న 17.
కింది ఉదాహరణల్లో ఛేకాను ప్రాసాలంకారానికి సరైన ఉదాహరణ
A) కొమ్మల్లో తుమ్మెదలు ఝుమ్మని నాదాలు చేస్తున్నాయి.
B) బాణము తగిలిన వాలి వాలిపోయాడు.
C) మానవ జీవనం సుకుమారమైనది.
D) గురువు విద్యాధనమనే గొప్ప ధనాన్ని అందిస్తాడు.
జవాబు:
B) బాణము తగిలిన వాలి వాలిపోయాడు.

ప్రశ్న 18.
‘రవి కొండలను పిండి చేయగలడు’ – ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) అతిశయోక్త్యలంకారం
B) రూపకాలంకారం
C) ఉపమాలంకారం
D) శ్లేషాలంకారం
జవాబు:
A) అతిశయోక్త్యలంకారం

ప్రశ్న 19.
కింది వాటిలో ప్రత్యక్ష కథనానికి ఉదాహరణ
A) సీతను రామునికి అప్పగించుమని విభీషణుడు రావణునితో అన్నాడు.
B) రామలక్ష్మణులను తనవెంట పంపుతున్నాడు విశ్వామిత్రుడు.
C) ‘నేనూ మీ వెంట వస్తాను’ అని సీత రామునితో అన్నది.
D) రాముని పాదుకలనిమ్మన్నాడు భరతుడు.
జవాబు:
C) ‘నేనూ మీ వెంట వస్తాను’ అని సీత రామునితో అన్నది.

ప్రశ్న 20.
సమాజం ఇప్పుడు ప్రశాంతతను కోరుతున్నది. సమాజం ఇప్పుడు పచ్చని బతుకును కోరుతున్నది. ఈ వాక్యాలను ఒకే వాక్యంగా మారిస్తే …………..
A) సమాజం ఇప్పుడు కోరడం లేదు ప్రశాంతతను పచ్చని బతుకును కోరుతుంది.
B) సమాజం ఒకప్పుడు పచ్చని బతుకును, ప్రశాంతతను కోరింది.
C) సమాజం ఒకప్పుడు కోరింది పచ్చని బతుకును, ప్రశాంతతను.
D) సమాజం ఇప్పుడు ప్రశాంతతను, పచ్చని బతుకును కోరుతున్నది.
జవాబు:
D) సమాజం ఇప్పుడు ప్రశాంతతను, పచ్చని బతుకును కోరుతున్నది.

Leave a Comment