Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 7th Lesson మంజీర Textbook Questions and Answers.
TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర
బొమ్మను చూడండి – ఆలోచించి చెప్పండి: (TextBook Page No.68)
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పై బొమ్మలో ఏమేం కన్పిస్తున్నాయి ? బొమ్మలోని బాలిక ఏం చూస్తున్నది ? ఏం ఆలోచిస్తుండవచ్చు ?
జవాబు.
పై బొమ్మలో నదీప్రవాహం, నది ఒడ్డున ఒక పవిత్ర దేవాలయం, నదిలో స్నానం చేస్తున్న భక్తులు కనిపిస్తున్నారు. బొమ్మలోని బాలిక నదీప్రవాహ అందాలను తనివితీరా చూస్తున్నది. ఆ బాలిక “ఈ నది ఎంత హృద్యంగా ఉన్నదో! ఈ నదిలో స్నానం చేస్తున్న భక్తులు ఎంతటి ధన్యులో, నేను కూడా ఈ నదిలో స్నానం చేసి పునీతురాలను అవుతాను అని ఆలోచించి ఉండవచ్చు.
ప్రశ్న 2.
ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగిన భావాలను చెప్పండి.
జవాబు.
ఏదైనా నదిని చూచినప్పుడు నాలో అలౌకికమైన భావాలు కలుగుతాయి. నదీ ప్రవాహం పరోపకారం కోసం గంభీరంగా ప్రవహిస్తుంది. నదీజలం త్రాగటానికి, పంటలు పండించుకొనడానికి, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతున్నది. ఈ నదీజలం ఎన్నటికీ కలుషితం కాకుండా ఉంటే బాగుండును’ అని అనుకుంటాను.
ప్రశ్న 3.
మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చెప్పండి..
జవాబు.
మా ప్రాంతంలో కృష్ణా, మంజీర, కిన్నెరసాని నదులు ప్రవహిస్తున్నాయి.
ప్రశ్న 4.
నదుల వల్ల ఉపయోగాలు ఏమిటి ?
జవాబు.
నదుల వల్ల సకల జీవకోటికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని –
- త్రాగునీటిని, సాగునీటిని అందిస్తాయి.
- విద్యుత్ ఉత్పత్తికి సహాయపడతాయి.
- భూమి పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుంది.
- సరిహద్దుల్లోని చెట్లు ఏపుగా పెరుగుతాయి.
- జంతువులకు చక్కని పశుగ్రాసం అందుతుంది.
- భూములు సారవంతంగా ఉండడానికి ఉపయోగపడుతాయి.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No. 70)
ప్రశ్న 1.
“పైరు పచ్చల కన్నుల పండువుగ విలసిల్లు” అనడంలో మంజీర నదికున్న సంబంధమేమిటి ?
జవాబు.
మంజీర బీడుబారిన పంటపొలాలను తన జల ధారలతో తడుపుతున్నది. ఎందుకూ పనికిరాని పొలాలను పంటలు వేయడానికి అనువుగా చేసింది. దాంతో పొలాలన్నీ పచ్చని పైర్లతో విలసిల్లుతున్నాయి. అందుకే కవి పై విధంగా అన్నాడు.
ప్రశ్న 2.
మంజీర నదిని “కవి ఎంత తీయని దానవే” అనడంలో ఆంతర్యమేమిటి ?
జవాబు.
మంజీరా నదిలోని నీరు మధురంగా ఉంటుంది. బీడుబారిన పొలాలను పచ్చని పైర్లు ఉండే విధంగా చేసింది. చేదైన నేలల్లో తీయని చెరకును పండించింది. పట్టణ, పల్లెలవాసులకు తన అమృత ధారలను అందించింది. తాగునీటిని, సాగునీటిని అందించింది. అందుకే కవి మంజీరాను “ఎంత తీయని దానవే” అని చెప్పాడు.
ప్రశ్న 3.
“గిడస బారిన పుడమి ఎడద కరిగించెదవు” అని కవి మంజీర గురించి ఎందుకన్నాడు ?
జవాబు.
బీడుబారిన భూమాత హృదయాన్ని తన అమృతపు ధారలతో తడిపింది. సస్యానికి యోగ్యంగా చేసింది. పంటలు పండటానికి అనువుగా మార్చింది. అందువల్లనే కవి ‘గిడస బారిన పుడమి విడద కరిగించెదవు’ అని చెప్పాడు.
ఆలోచించండి – చెప్పండి: (TextBook page No.71)
ప్రశ్న 1.
‘మంజీర పల్లెటూర్లను తల్లివలె లాలించింది’ అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
మంజీరా నది పల్లెటూళ్ళను తల్లిలాగా భావించింది. పల్లెప్రజలకు అవసరమైన తాగునీటిని, సాగునీటిని అందించింది. పల్లెప్రజల బ్రతుకులో కొత్త కాంతులను నింపింది. అందుకే కవి మంజీర పల్లెటూళ్ళను తల్లివలె లాలించిందని చెప్పాడు.
ప్రశ్న 2.
పట్టణాలను మంజీరానది తోబుట్టువులవలె ప్రేమిస్తుందని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
మంజీర పట్టణాలను తోబుట్టువులా ప్రేమించింది. పల్లె ప్రాంతాల్లోని పాడిపంటలను నగరప్రజలకు అందించింది. వారికి ఆహారాన్ని అందించింది. వారి జీవితాలను రక్షించింది. అందుకనే కవి మంజీరా నది తోబుట్టువులాగా పట్టణాలను ప్రేమించిందని చెప్పాడు.
ప్రశ్న 3.
“పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది” ఎట్లాగో మీ మాటల్లో చెప్పండి.
జవాబు.
మంజీర పట్టణవాసులను తన జలధారలతో పోషిస్తున్నది. హైదరాబాద్ వంటి నగరాలకు తీయని నీటిని అందిస్తున్నది. పల్లెల్లో పండిన ధాన్యాన్ని పట్టణాలకు అందిస్తున్నది. పట్టణప్రాంత వాసుల దాహాన్ని మంజీర తీరుస్తున్నది.
ఇవి చేయండి :
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.
ప్రశ్న 2.
నదుల వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చర్చించండి.
జవాబు.
- నదులు ప్రాణికోటికి జీవనాధారాలు.
- జీవనంలో అన్నింటికి అవసరమైన నీటిని మనం నదుల నుండి పొందుతాము.
- నదులకు ఆనకట్టలు కట్టి, ఆ నీటిని కాలువల ద్వారా మళ్ళించి, పంటలు పండిస్తాము.
- ప్రకృతి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, ఎంతో మేలు చేస్తాయి.
- నదుల వలన తాగునీరు, సాగునీరు అందుతుంది. కనుక నదులు పవిత్రమైనవి, పుణ్యప్రదమైనవి.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
1. కింది భావాన్నిచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి రాయండి.
అ) రైతు నాగలి ముందుకు సాగుతుంది.
జవాబు.
కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగేను
ఆ) చిన్నబోయిన నేల గుండెను సేదతీరుస్తావు.
జవాబు.
గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు
ఇ) హైదరాబాద్ ప్రజలకు తీయని నీళ్ళందిస్తావు.
జవాబు.
భాగ్యనగరములోన వసియించు పౌరులకు పంచదారను బోలు మంచి నీరొసగెదవు.
ఈ) పల్లెను తల్లి ప్రేమతో లాలిస్తావు.
జవాబు.
పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి.
2. గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన కింది గేయ పంక్తులు చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రవహింతువా దుందుభీ మాసీమ
పాల యేఱుగ దుందుభీ.
చిరుగాలి కెరటాల
పొరలెత్తు అలలతో
దరులంటు అమృతశీ
కరములౌ జలముతో
గిరులంటి, వానిని
ర్హరులంటి, పైపైని
దరులంటి జాజి క్రొ
వ్విరుల వన్నియలూని ప్రవహింతువా
ప్రశ్నలు :
అ) ఈ గేయం దేన్ని గురించి చెప్పింది ?
జవాబు.
ఈ గేయం ‘దుందుభి’ నదిని గుర్చి చెప్తున్నది.
ఆ) దుందుభి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు ?
జవాబు.
దుందుభి నది ప్రవాహాన్ని కవి పాలు ప్రవహించే నదితో పోల్చాడు.
ఇ) కవి దుందుభి నదిని పాలయేఱు అని ఎందుకన్నాడు ?
జవాబు.
‘పాలు’ ఆరోగ్యానికి మంచిది. పాలు మధురంగా ఉంటాయి. దుందుభి నదిలో నీళ్ళు కూడా పాలవలె మధురంగాను. ఆరోగ్యవంతంగాను ఉంటాయని కవి అన్నాడు.
ఈ) ‘దరులు’ – అనే పదానికి అర్థమేమిటి ?
జవాబు.
‘దరులు’ అనే పదానికి ‘ఒడ్డులు’ అనే అర్థం.
ఉ) దుందుభి జలం ఎట్లా ఉన్నదని కవి ఉద్దేశం ?
జవాబు.
దుందుభి జలం చిరుగాలికి కదిలి, పొర్లిపడే కెరటాలతో, అమృతంలాంటి నీటిబిందువులతో పర్వతాలను, చెట్లను తాకి, సెలయేళ్ళతో కలిసి, జాజిపూవుల కొమ్మల అందాలను అడ్డుకొని పాలయేరులా ఉందని కవి ఉద్దేశం.
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) “నది పొలానికి బలం చేకూరుస్తది” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
పొలాలు పచ్చగా ఉండాలంటే నీరు అవసరం. వర్షాలు బాగా కురిస్తేనే నదులు ప్రవహిస్తాయి. నదుల్లోని నీరే పంటపొలాలకు బలం. నదులు కేవలం నీటిని మాత్రమే కాదు సారవంతమైన మట్టిని కూడా పొలాలకు అందిస్తాయి. దాంతో పంటలు పచ్చగా పెరుగుతాయి. నదుల్లోని నీటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. దీంతోనే పంటలకు చక్కని బలం సిద్ధిస్తుంది. ఈ కారణంవల్లనే కవి – “నది పొలానికి బలం చేకూరుస్తుంది” అని చెప్పాడు.
ఆ) భాగ్యనగరానికి, మంజీర నదికి ఉన్న సంబంధం తెల్పండి.
జవాబు.
భాగ్యనగరాన్ని కులీకుతుబ్షా నిర్మించాడు. ఇలాంటి భాగ్యనగరానికి సమీపంలోనే మంజీరా నది ఉంది. ఈ కారణంగా భాగ్యనగరానికి, మంజీరానదికి విడదీయరాని సంబంధం ఉంది. మంజీర తన అమృతజలాలను భాగ్యనగర వాసులకు అందిస్తుంది. ఈ నది భాగ్యనగర ప్రజలకు తాగునీటిని, సాగునీటిని అందిస్తున్నది.
మంజీర భాగ్యనగరాన్ని తోబుట్టువులాగా లాలిస్తున్నది. గ్రామాల్లోని ధాన్యాన్ని నగర ప్రజలకు అందిస్తున్నది. ఈ విధంగా భాగ్యనగరవాసులకు, మంజీరాకు విడదీయరాని సంబంధం ఉంది.
ఇ) మనం నదులను ఎట్లా కాపాడుకోవాలి ?
జవాబు.
ఏ దేశంలోనైనా నదులు, దేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు. నదులు ప్రవహించే ప్రాంతాలు, ధాన్యాగారాలుగా మారతాయి. మనదేశంలో జీవనదులయిన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు ఉత్తర భారతాన్నీ, కృష్ణా, గోదావరులు, దక్షిణ భారతాన్నీ సస్యశ్యామలం చేస్తున్నాయి.
పాడిపంటలతో ఆ ప్రాంతాల్ని కలకలలాడిస్తున్నాయి. మనకు కావలసిన తాగునీటినీ, సాగునీటినీ మనకు అందిస్తున్నాయి. విద్యుదుత్పత్తికి తోడుపడుతున్నాయి. రవాణా సౌకర్యాలను కలుగజేస్తున్నాయి. మానవుల జీవనానికి నదులు ఎన్నో విధాలుగా సాయపడుతున్నాయి. నదీతీరాలలోని పరిశ్రమలకు నీటిని అందిస్తున్నాయి.
కాబట్టి మనం అత్యంత ప్రాముఖ్యమైన నదీజలాలను భద్రంగా కాపాడుకోవాలి. మురికినీటిని, నదులలో కలపరాదు. నదీజలాల్లో బట్టలు ఉతకరాదు. పశువులను కడగరాదు. పరిశ్రమల వ్యర్థాలను నదీజలాల్లో కలుపరాదు. నదీజలాలను పరిశుభ్రంగా ఉంచి, మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కలుషిత నదీజలాలను తాగడం వల్లే, మనలో చాలామంది రోగాలబారిన పడుతున్నాము. కాబట్టి జాగ్రత్తపడదాం. మన నదులను మనం రక్షించుకుందాం.
ఈ) నదులు ‘నాగరికతకు ఆలవాలం’ – ఎందుకు ?
జవాబు.
భారతదేశంలో గంగ, కృష్ణ, గోదావరి వంటి పుణ్యనదులు ప్రవహిస్తున్నాయి. ఎక్కువ భాగం నదులు హిమాలయ పర్వత సానువుల నుండే పుట్టాయి. మనదేశంలో గంగానదికి విశిష్టమైన స్థానం ఉంది. భారతీయులు నదులను దేవతామూర్తులుగా భావిస్తారు.
వాటిని పూజిస్తారు, హారతులు ఇస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి ప్రతి నదికి పుష్కరాలను నిర్వహిస్తారు. నదులలోని నీటిలో ఔషధ గుణాలున్నాయని నమ్ముతారు. అందువల్లనే మన నదులు సనాతన ‘నాగరికతకు ఆలవాలం’ అని అంటారు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి.
జవాబు.
నదులు మనకు త్రాగునీటిని, సాగునీటిని అందిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి కూడా సహకరిస్తున్నాయి. ఈ రకంగా నదులు సకలజీవకోటికి ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం నదుల్లో కూడా నీరు కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి ప్రకృతితోపాటు మానవ తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్ని-
- సకాలంలో వర్షాలు కురవకపోవడం, వర్షపాతం చాలా తగ్గిపోవడం.
- ఎగువ రాష్ట్రాలు నదులపై అక్రమ ప్రాజెక్టులను నిర్మించడం.
- విద్యుత్ ఉత్పత్తికి పరిమితికి మించి నీటిని వృథాగా ఖర్చు చేయడం.
- అడవులను పరిరక్షించకపోవడం
- పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం
- నీటి పొదుపుపై ప్రభుత్వాలకు సరియైన అవగాహన లేకపోవడం.
IV. సృజనాత్మకత / ప్రశంస:
1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) మీ ప్రాంతంలోని లేదా మీరు చూసిన వాగు/చెరువు/నదిని వర్ణిస్తూ కవిత/గేయాన్ని రాయండి.
జవాబు.
మా ప్రాంతంలో గౌతమీ నది ప్రవహిస్తోంది.
కవితా గేయం :
“సప్తర్షి సంఘాన గౌతముడు పెద్ద
వనము పెంచెను ఋషి ఫలవృక్షములను
గోవొకటి దానిని భగ్నంబు చేసే
గౌతముడు కోపాన కనువిచ్చి చూసె
భస్మమయ్యెను గోవు మునికోపదృష్టి
ఋషిమండలంబంత నిందించె ఋషిని
గౌతముడు తాపమున తపము చేయంగ
పరమేశుడప్పుడు ప్రత్యక్షమయ్యె
గోవు స్వర్గతి చెంధ శివు డంత కరుణ
గోదావరీనదిని సృష్టించి విడిచె
నాసిక్కు క్షేత్రాన గోదావరీ మాత
V. పదజాల వినియోగం:
ప్రశ్న 1.
కింది పదాలకు సమానార్థక పదాలను పట్టికలో గుర్తించి రాయండి.
అ) రైతు
ఆ) చల్లదనం
ఇ) నేల
ఈ) స్నేహం
ఉ) పంపి
ఊ) ప్రకాశించు
జవాబు.
అ) రైతు = కర్షకుడు
ఆ) చల్లదనం = చలువ
ఇ) నేల = పుడమి
ఈ) స్నేహం = సోపతి
ఉ) పంపి = అంపి
ఊ) ప్రకాశించు = విలసిల్లు
ప్రశ్న 2.
కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి.
“రైతు ఎడద విశాలమైనది. ధాన్య రాసులతో దేశాన్ని సుసంపన్నం చేస్తాడు.
జవాబు.
హృదయం (ప్రకృతి) – ఎడద (వికృతి)
రాశులు (ప్రకృతి) – రాసులు (వికృతి)
ప్రశ్న 3.
కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
అ) కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విలసిల్లింది.
జవాబు.
ప్రకాశించింది
ఆ) కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది.
జవాబు.
స్నేహం
ఇ) ఫుడమి అనేక సంపదలకు నిలయం.
జవాబు.
భూమి.
VI. భాషను గురించి తెలుసుకుందాం:
ప్రశ్న 1.
కింది ఖాళీలను పూరించండి.
జవాబు.
సమాసపదం |
విగ్రహవాక్యం |
సమాసం పేరు |
ఉదా. సీతజడ | సీత యొక్క జడ | షష్ఠీ తత్పురుష సమాసం |
చెట్టునీడ | చెట్టు యొక్క నీడ | షష్ఠీ తత్పురుష సమాసం |
వయోవృద్ధుడు | వయస్సు చేత వృద్ధుడు | తృతీయాతత్పురుష సమాసం |
రాజశ్రేష్ఠుడు | రాజులలో శ్రేష్ఠుడు | షష్ఠీ తత్పురుష సమాసం |
అమంగళం | మంగళం కానిది | నఞ తత్పురుష సమాసం |
తిలకధారులు | తిలకమును ధరించినవాడు | ద్వితీయా తత్పురుష సమాసం |
అలంకారం:
కింది దానిని చదువండి.
ఇల్లు, మనిషి, పెళ్ళి మంటపం, ఫంక్షన్లు, వాహనం ఏదైనాసరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండటానికి అలంకారాలు ఉపయోగిస్తారు.
ఇది మన బడి
అక్షరాల గుడి
సరస్వతి దేవి ఒడి
మనకు నేర్పును నడవడి
పై కవితలో ‘డి’ అనే అక్షరం అనేకసార్లు రావడంవల్ల కవిత అందంగా, వినసొంపుగా ఉన్నది కదా ! ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారం. అర్థం వల్ల అందం కలిగితే అర్థాలంకారం అవుతుంది. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి తెలుసుకుందాం.
ఆలోచించండి – చెప్పండి:
ప్రశ్న 1.
ఈ కవిత చదువుతుంటే ఎట్లా అనిపించింది ?
జవాబు.
ఈ కవిత చదువుతుంటే వినసొంపుగా అనిపించింది.
ప్రశ్న 2.
ఎందుకని వినసొంపుగా ఉన్నది ?
జవాబు.
ఈ కవితలో శబ్దప్రయోగం వినసొంపుగా ఉన్నది.
ప్రశ్న 3.
దీనిలో ఎక్కువసార్లు వచ్చిన అక్షరం ఏది ?
జవాబు.
దీనిలో ఎక్కువసార్లు వచ్చిన అక్షరం ‘డి’.
వృత్త్యనుప్రాసాలంకారం :
కింది వాక్యాలు పరిశీలించండి.
అ) గడ గడ వడకుచు తడబడి జారిపడెను.
ఆ) రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది ?
పై వాక్యాల్లో వరుసగా ‘డ’, ‘త’ అనే అక్షరాలు అనేకసార్లు వచ్చాయి కదా ! ఇట్లా ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని ‘వృత్త్యనుప్రాస’ అలంకారం అంటారు.
ప్రశ్న 2.
మరికొన్ని వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన వాక్యాలను పాఠాలలో వెతికి రాయండి.
జవాబు.
- పుట్టలోట్కల మిట్ట బట్టి మాపటివేళ
- ఉక్కిరి బిక్కిరియై తిరుగుచుండు
- రప్పించి మాయర్థ మొప్పించి
- లలిత సుగుణజాల తెలుగుబాల
- నిడువడనినను నేనిట్లు విడుతునేని
- దానధర్మములేక దాచి దాచి
- విశ్వపాలన ధర్మ ! శ్రీ విశ్వకర్మ !
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:
ప్రశ్న 1.
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు, ఆ నదుల తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను తెలియజేసే పట్టికను తయారుచేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
నది పేరు | ఆనకట్ట | పుణ్యక్షేత్రం | దర్శనీయ స్థలం |
1. గోదావరి | శ్రీరాంసాగర్ నిజాంసాగర్ సింగూరు ప్రాజెక్టు | బాసర, భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరం | ప్రాజెక్టులు |
2. కృష్ణానది | నాగార్జునసాగర్ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు | అలంపురం | ప్రాజెక్టులు |
TS 8th Class Telugu 7th Lesson Important Questions మంజీర
III. సృజనాత్మకత:
ప్రశ్న 1.
మీ పాఠశాలలో జరుపుకొనే జెండా వందనానికి రమ్మని మీ గ్రామస్థులకు ఆహ్వాన పత్రాన్ని రాయండి.
జవాబు.
ఆగష్టు – 15 జెండావందన కార్యక్రమం ఆహ్వాన పత్రిక
గౌరవనీయులైన గ్రామ పెద్దలకు నమస్కారములు.
ఆగష్టు – 15న స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా మా పాఠశాలకు మన M.L.A.గారు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి మహాత్ముల త్యాగాలకు ఫలితమైన జెండావందన కార్యక్రమంలో పాల్గొని, మమ్మల్ని దీవించవల్సిందిగా కోరుతున్నాము.
ఇట్లు,
జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు,
వేములవాడ, మహబూబ్ నగర్ జిల్లా.
IV. భాషాంశాలు:
పదజాలం:
పర్యాయపదాలు:
ప్రశ్న 1.
జలము = ___________
జవాబు.
నీరు, వారి, ఉదకము
ప్రశ్న 2.
పుడమి = ___________
జవాబు.
భూమి, వసుధ, ధరణి
ప్రశ్న 3.
పొలము = ___________
జవాబు.
కేదారము, సస్యక్షేత్రం
ప్రశ్న 4.
కూర్మి = ___________
జవాబు.
స్నేహం, నెయ్యం, మైత్రి
నానార్థాలు:
ప్రశ్న 1.
బలము = ___________
జవాబు.
లావు, సామర్థ్యం, శక్యం
ప్రశ్న 2.
కన్ను = ___________
జవాబు.
నేత్రం, బండిచక్రం
ప్రకృతి – వికృతులు:
ప్రకృతి – వికృతి
1. భాగ్య – బాగెము
2. రాశి – రాసి
3. పురము – ప్రోలు
4. పట్టణం – పత్తనం
5. నీరము – నీర
6. హృదయం – ఎడద
సొంతవాక్యాలు:
ప్రశ్న 1.
మూలం (ఆధారం) = ___________
జవాబు.
పాడి పంటలకు, సిరి సంపదలకు నదులే మూలం.
ప్రశ్న 2.
విలసిల్లు = ___________
జవాబు.
కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విలసిల్లింది.
ప్రశ్న 3.
సుసంపన్నం = ___________
జవాబు.
రైతు ధాన్యరాసులతో దేశాన్ని సుసంపన్నం చేస్తాడు.
వ్యాకరణాంశాలు:
సమాసాలు:
సమాసపదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1. ధాన్యరాశులు | ధాన్యము యొక్క రాశులు | షష్ఠీ తత్పురుష సమాసం |
2. కంకణ క్వణము | కంకణము యొక్క క్వణము | షష్ఠీ తత్పురుష సమాసం |
3. స్నానపానములు | స్నానమును, పానమును | ద్వంద్వ సమాసము |
4. చేతి చలువ | చేతియందలి చలువ | సప్తమీ తత్పురుష |
సంధులు:
1. సవర్ణదీర్ఘ సంధి :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది.
ఉదా : స్నానపానాదులు = స్నానపాన + ఆదులు
2. టుగాగమ సంధి :
కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరమగునపుడు టుగాగమంబగు.
ఉదా : పల్లెటూరు = పల్లె + ఊరు
గమనిక :
ఇక్కడ ఉత్వము లేదు. ‘ఏ’త్వము ఉంది. అయినా టుగాగమం వస్తుంది.
3. ఉత్వసంధి :
ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఉదా : నీరొసగెదవు = నీరు + ఒసగెదవు
చేదైన = చేదు + ఐన
4. అత్వసంధి :
అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా : కనినంత = కనిన + అంత
వినిపించినంతనే = వినిపించిన + అంతనే.
సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు :
ప్రశ్న 1.
సారవంతమైన మట్టిని తెచ్చింది. పొలాలకు అందించింది. (సంక్లిష్ట)
జవాబు.
సారవంతమైన మట్టిని తెచ్చి పొలాలకు అందించింది.
ప్రశ్న 2.
బీడుబారిన నేలను తడిపింది. పంటలు పండటానికి అనువుగా మార్చింది. (సంక్లిష్ట)
జవాబు.
బీడుబారిన నేలను తడిపి, పంటలు పండటానికి అనువుగా మార్చింది.
ప్రశ్న 3.
తాగునీటిని అందించింది. సాగునీటిని అందించింది. (సంయుక్త)
జవాబు.
తాగునీటిని, సాగునీటిని అందించింది.
ప్రశ్న 4.
గేయంలో పల్లవి ఉంటుంది. గేయంలో చరణం ఉంటుంది. (సంయుక్త)
జవాబు.
గేయంలో పల్లవి మరియు చరణం ఉంటాయి.
పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు:
I.
నీ కంకణక్వణము
నినదించి నంతనే
కర్షకుని నాగేలు
కదలి ముందుకు సాగు
నీ చేతి చలువ చిం
దిలిపాటు గనినంత
పైరు పచ్చలు కనుల
పండువుగ విలసిల్లు
ఎంత చల్లని దానవే ! నీవు మంజీర !
ఎంత తీయని దానవే !
ప్రతిపదార్థం:
నీ కంకణం = నీ గాజుల యొక్క
క్వణము = శబ్దము
వినిపించిన + అంతనే = వినిపించగానే
కర్షకుని = వ్యవసాయదారుని యొక్క
నాగేలు = నాగలి
కదలి = కదలిపోయి,
ముందుకు = ముందుకు
సాగేను = వెళ్తుంది.
నీ చేతి = నీ చేత యందలి
చలువ = చల్లదనం
చిందిలిపాటు = తొందరపాటు
కలిగినంత = కలుగగానే,
పైరు పచ్చలు = పచ్చని పైర్లు
కనుల పండువుగ = కన్నుల పండుగగా,
విలసిల్లు = ప్రకాశిస్తాయి.
మంజీర ! = మంజీరా నది !
నీవు = నీవు
ఎంత చల్లని దానవే ! = ఎంత చల్లని స్వభావం కల దానవు !
ఎంత = ఎంతటి
తీయని దానవే ! = మధురమైనదానవే !
భావం :
అమ్మా ! మంజీర ! నువ్వు ఎంత చల్లని దానవు. ఎంత తియ్యని దానవు. నీ నీటి ప్రవాహపు సవ్వడి, నీ చేతి గాజుల గలగల శబ్దం వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. నీ మంచితనం చూచినవెంటనే రెప్పపాటులో పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి.
గిడసబారిన పుడమి
ఎడద కరిగించెదవు
చేదైన నేలలో
చెరకు పండించెదవు
చేవగలిగిన మట్టి
జీవకణములు తెచ్చి
పొలముకు ఎరువుగా
బలము చేకూర్చెదవు
ఎంత చల్లని దానవే ! నీవు మంజీర !
ఎంత తీయని దానవే !
ప్రతిపదార్థం:
గిడసబారిన = ఎండిపోయిన,
పుడమి = భూమి యొక్క
ఎడద = హృదయాన్ని
కరిగించెదవు = కరిగిస్తావు
చేదైనా = చేదుగా ఉన్నట్టి
నేలలో = భూమిలో
చెరకు = తీయని చెరకును
పండించెదవు = పండిస్తావు.
చేవగలిగిన = సారవంతమైన
మట్టి = మట్టి యొక్క
జీవకణములు = జీవకణాలను
తెచ్చి = తీసుకొనివచ్చి
పొలముకు = పొలానికి
ఎరువుగా = ఎరువుగా
బలము = సత్తువను
చేకూర్చెదవు = చేకూరుస్తావు.
మంజీర ! = మంజీరా నది !
నీవు = నీవు
ఎంత = ఎంతటి
చల్లని దానవు = చల్లగా ఉండే దానవు
తీయని దానవే = తీయగా ఉండే స్వభావం కల దానవే.
భావం :
తల్లీ ! మంజీర! చిన్నబోయిన నేలతల్లి హృదయాన్ని కరిగిస్తావు. చేదైన నేలలో తీయగా చెరకును పండిస్తావు. సారవంతమైన మట్టిని తీసుకొనివచ్చి పొలాలకు అందించి బలాన్ని ఇస్తావు.
II.
ఆనాడు కుతుబు సు
ల్తాను నిలిపిన పురము
భాగ్యనగరములోన
వసియించు పౌరులకు
పంచదారను బోలు
మంచి నీరొసగెదవు
ఎంత చల్లని దానవే ! నీవు మంజీర !
ఎంత తీయని దానవే !
ప్రతిపదార్థం:
ఆనాడు = ఆ రోజు
కుతుబు సుల్తాను = కులీకుతుబ్షా
నిలిపిన = నిర్మించిన
పురము = నగరమైన
భాగ్యనగరములోన = హైదరాబాద్ నగరంలో
వసియించు = నివసించే
పౌరులకు = ప్రజలకు
పంచదారను + పోలు = పంచదార వంటి
మంచి = మంచిదైన
నీరున్ = నీటిని
ఒసగెదవు = ఇస్తావు ?
మంజీర = ఓ మంజీర !
నీవు = నీవు
ఎంత = ఎంతటి
చల్లని దానవు = చల్లగా ఉండునట్టి దానవు
ఎంత = ఎంతటి
తీయని దానవే ! = తీయగా ఉండే దానవే !
భావం :
అమ్మా ! మంజీర ! కులీకుతుబ్షా నిర్మించిన భాగ్యనగరవాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని, అందిస్తున్నావు. నీవు ఎంతటి చల్లనిదానవు. ఎంత మంచిదానవు.
పల్లెటూళ్ళను కూర్మి
తల్లివలె లాలించి
స్నానపానాదులను
సమకూర్చెదవు నీవు
పట్టణమ్ములను తో
బుట్టువలె ప్రేమించి
ధాన్యరాసులనంపి
తరచు పోషించెదవు
ఎంత చల్లని దానవే ! నీవు మంజీర !
ఎంత తీయని దానవే !
ప్రతిపదార్థం:
పల్లెటూళ్ళను = పల్లె గ్రామాలను
కూర్మి = ప్రేమతో
తల్లి వలె = తల్లిలాగా
లాలించి = ఆదరించి
స్నానపానాదులను = స్నానానికి, తాగటానికి అవసరమైన నీటిని
నీవు = నీవు
సమకూర్చెదవు = సమకూరుస్తావు
పట్టణమ్ములను = నగరాలను
తోబుట్టువలె = తోబుట్టువులాగా
ప్రేమించి = ప్రేమించి
ధాన్యరాసులను = ధాన్యరాసుల్ని
పంపి = పంపించి
తరచు = తరచుగా
పోషించెదవు = పోషిస్తావు
మంజీర ! = ఓ మంజీర !
ఎంత = ఎంతటి
చల్లనిదానవే = చల్లగా ఉండేదానవే
తీయనిదానవే = తీయగా ఉండేదానవే
భావం :
తల్లీ ! మంజీర ! పల్లెలకు అమ్మలాగ, ప్రేమగా లాలించి స్నానం, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు. నగరాలను ‘తోడబుట్టిన వాళ్ళుగా ప్రేమించి పల్లెలో పండిన ధాన్యాన్ని పంచి ఎల్లప్పుడు పోషిస్తావు. అమ్మా! మంజీర ! ఎంత చల్లని దానవు. నీవు ఎంత తీయని దానవు.
పాఠం ఉద్దేశం:
పాడి పంటలకు, సిరిసంపదలకు నదులే మూలం. తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్, `సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి.
ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.
ప్రక్రియ – గేయకవిత:
ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలలో గేయప్రక్రియ ఒకటి. ఇది చక్కగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గేయం మాత్రా ఛందస్సులో ఉంటుంది. లయాత్మకంగా ఉంటుంది. గేయంలో పల్లవి, చరణం అనే రెండు అంశాలు ఉంటాయి. ‘మంజీర’ అనే పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందినది.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం / పాట పాడుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డా॥ వేముగంటి నరసింహాచార్యులు రాసిన “మంజీర నాదాలు” అనే గేయకావ్యంలోనిది.
కవి పరిచయం:
పాఠ్యభాగం పేరు : మంజీర
కవి పేరు : డా॥ వేముగంటి నరసింహాచార్యులు
జననం : 30-06-1930
మరణం : 29-10-2005
జన్మస్థలం : సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట
తల్లిదండ్రులు : తండ్రి రంగాచార్యులు, తల్లి రామక్క
రచనలు : తిక్కన, రామదాసు, మంజీర నాదాలు, వివేక విజయం మొదలైన 40కిపైగా రచనలు.
బిరుదులు : కవి కోకిల, కావ్యకళానిధి, విద్వత్కవి.
సత్కారాలు : తెలుగు విశ్వవిద్యాలయం వీరిని డాక్టరేట్తో సత్కరించింది.
విశేషాంశాలు : వీరు ‘సాహితీ వికాస మండలి’ అనే సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘం అనే వాటిని స్థాపించి, సాహిత్య వికాసానికి కృషి చేశారు.
శైలి : వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు, సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి.
ప్రవేశిక:
జలధారలు ప్రాణికోటి జీవనాధారాలు. అందుకే మానవ జీవనమంతా నదీ పరీవాహాల్లో విస్తరించింది. ముఖ్య పట్టణాలు, తీర్థస్థలాలు అన్నీ నదుల నానుకొని వ్యాపించాయి. చినుకులు కాలువలై, కాలువలు నదులై తాగునీరుగా, సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది. పుణ్యప్రదమైనది. మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో ‘మంజీర’ ఒకటి. ఆ నదీమతల్లి ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదిద్దాం.
పాఠ్యభాగ సారాంశం:
అమ్మా ! మంజీర ! ఎంత చల్లని దానవు నువ్వు. ఎంత తీయని దానవు నువ్వు. నీ నీటి ప్రవాహపు సవ్వడి, (నీ చేతి గాజుల గలగలల శబ్దం) వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చనిపైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి.
తల్లీ ! మంజీర ! చిన్నబోయిన నేలతల్లి హృదయాన్ని కరిగిస్తావు. చేదైన నేలలో తీయని చెరకును పండిస్తావు. సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి బలాన్నిస్తావు.
అమ్మా ! మంజీర ! కులీకుతుబ్షా నిర్మించిన భాగ్యనగర (హైదరాబాద్) వాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తావు.
తల్లీ ! మంజీర ! పల్లెలను అమ్మలాగ, ప్రేమగా లాలించి స్నానం, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు. నగరాలను తోడబుట్టిన వాళ్ళుగ ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడు పోషిస్తావు. అమ్మా! మంజీర ! ఎంత చల్లని దానవు నువ్వు. ఎంత తీయని దానవు.
నేనివి చేయగలనా ?