Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 12th Lesson మాట్లాడే నాగలి Textbook Questions and Answers.
TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి
చదువండి – ఆలోచించి చెప్పండి: (TextBook Page No.118)
ఈ విశ్వంలో, ఈ భూమండలంలో, ఈ జీవనచక్రంలో మనకెంత ప్రాధాన్యముందో…. ఓ చీమకు, ఓ దోమకు, ఓ ఈగకు, ఓ బూగకు, ఓ తేనెటీగకు, ఓ గద్దకు చివరకు ఓ నత్తకూ, ఓ పీతకూ కూడ కాస్త అటు ఇటుగా అంతే ప్రాధాన్యం ఉందని తేలిపోయింది. సమస్యేమిటంటే ఉన్నత జీవులం కావటంతో మనకు తెలివి ఎక్కువనుకుంటాం. కాని ఆ తెలివిని మనం వినాశానికి ఉపయోగిస్తున్నామనుకోం. నాటి వేటకాలం నుంచీ నేటి పారిశ్రామిక యుగం వరకూ మనం ఇతర జీవులనూ, ఈ ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని, కాపాడుకోలేకపోతున్నాం. ఫలితం – ఇప్పుడు ఈ భూమ్మీద మన అస్తిత్వమే అయోమయంలో పడింది.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పై పేరా దేన్ని గురించి తెలుపుతున్నది?
జవాబు.
పై పేరా జీవవైవిధ్యాన్ని గురించి తెలుపుతున్నది.
ప్రశ్న 2.
తెలివిమీరిన మానవులు ఏం చేస్తున్నారు ?
జవాబు.
తెలివిమీరిన మానవులు తమ తెలివిని వినాశనానికి ఉపయోగిస్తున్నారు. ఇతర జీవులను, జీవవైవిధ్యాన్ని, వనరులను పరిహసిస్తున్నారు.
ప్రశ్న 3.
వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి ?
జవాబు.
వీటి ఫలితంగా ఈ భూమిమీద మన అస్తిత్వమే అయోమయంలో పడింది.
ప్రశ్న 4.
జీవవైవిధ్యాన్ని కాపాడటానికి మనం ఏం చేయాలి ?
జవాబు.
జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి మనం ఈ భూమిపై గల సకల ప్రాణులుమీద దయ చూపాలి.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.121)
ప్రశ్న 1.
ఓసెఫ్ను ‘ఎద్దుపిచ్చోడు’ అనడం గురించి మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
ఓసెఫ్కు కన్నన్ మీద అమితమైన అనురాగం. మూగజీవులను అమితంగా ప్రేమించేవాడు. ఎల్లప్పుడు తన ఎద్దు అయిన కన్నన్తోనే గడిపేవాడు. దాని చుట్టూ తిరిగేవాడు. దానికి అవసరమైన వాటిని సమకూర్చేవాడు. దీనివల్లనే పరిసరాల్లోని వాళ్ళు “ఓసెఫ్ ఎద్దుపిచ్చోడు” అని అనే వాళ్ళు.
ప్రశ్న 2.
విచక్షణ అంటే నీకేమర్థమయింది ? కన్నని ్క విచక్షణ ఉందని మీరెట్లా చెప్పగలరు ?
జవాబు.
‘విచక్షణ’ అంటే చక్కగా ఆలోచించు అని అర్థం. కన్నన్కి విచక్షణ ఉందని చెప్పవచ్చు. మూగజీవి అయిన ఎద్దు యజమానిపై ఎనలేని అభిమానాన్ని చూపించింది. యజమాని మనస్తత్వాన్ని దూరం నుండే తెలుసుకొని, దానికి అనుగుణంగా ప్రవర్తించేది. దీనివల్ల కన్నను విచక్షణాజ్ఞానం ఉందని తెలుసుకోవచ్చు.
ప్రశ్న 3.
సాటి మనుషులతో మన ప్రేమాభిమానాల్ని ఎట్లా వ్యక్తపరచవచ్చు ?
జవాబు.
సాటి మనుషులతో మనం ప్రేమాభిమానాల్ని అనేక విధాలుగా ప్రదర్శింపవచ్చు. ఆపదలు వచ్చినప్పుడు నిష్కల్మషంగా సేవ చేయాలి. ఓదార్పు మాటలను మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడాలి. మానవతా విలువలను పెంపొందించే విధంగా ఆత్మీయతను పంచాలి. ఈ రకంగా మనం సాటి మనుషులతో ప్రేమాభిమానాల్ని వ్యక్తపరచవచ్చు.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.123)
ప్రశ్న 1.
సంగీతానికున్న శక్తి ఎట్లాంటిది ?
జవాబు.
సంగీతానికున్న ప్రాధాన్యత ఎంతో ముఖ్యమైందిగా చెప్పవచ్చు. శిశువులను, పశువులను కూడా అలరి స్తుంది. మనస్సులకు ప్రశాంతతను అందిస్తుంది. మనసుకు తరగని స్వాంతన చేకూరు తుంది. దీనివల్ల సంగీతానికున్న శక్తి తెలుస్తుంది.
ప్రశ్న 2.
“ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే” – దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
పై అభిప్రాయం యథార్థమే. ప్రేమంటే రెండు హృదయాలు ఏకం కావడమే. నిజమైన ప్రేమంటే దుఃఖంతో కూడిన మనస్సులు ఒక్కటిగా కావడం. దుఃఖం కలిగినప్పుడు ఒకరినొకరు తమ బాధలను పంచుకోవాలి. దానితో మనస్సుల మధ్య ప్రేమ పుట్టుతుంది. అదే శాశ్వతంగా ఉంటుంది.
ప్రశ్న 3.
ఓసెఫ్ ఎద్దును అమ్మినప్పుడు మీకేమనిపించింది? ఎందుకు?
జవాబు.
ఓసెఫ్ తన కూతురి పెండ్లి ఖర్చుల కోసం ఎద్దును అమ్మాడు. ఆ సమయంలో అతడు ఎంతగానో బాధపడి ఉంటాడు. కుటుంబ సభ్యులకంటే మిక్కిలిగా ఎద్దును ప్రేమించాడు. అలాంటి ఎద్దును ఒక్కసారిగా అమ్మినప్పుడు కుటుంబంలోని ఆర్థికపరిస్థితులు మానవున్ని కుంగదీస్తాయని తెలుసుకున్నాను.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.125)
ప్రశ్న 1.
ధరల ప్రభావం మనిషి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ?
జవాబు.
ధరల ప్రభావం మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కుటుంబపోషణ కష్టమవుతుంది. అప్పులను చేయాల్సి వస్తుంది. పోషక ఆహారాన్ని పొందడం ఇబ్బందిగా తయారవుతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతుంది.
ప్రశ్న 2.
‘భూతదయ’ – అంటే ఏమిటో వివరించండి.
జవాబు.
‘భూతదయ’ అంటే అన్ని ప్రాణులయందు దయకలిగి ఉండడం. మానవుల యందు, మూగజీవాలపైన కనికరం చూపాలి. దీనివల్ల ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది. మూగజీవాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
ప్రశ్న 3.
“బిడ్డా నన్ను గుర్తు పట్టావా ? నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా ?” దీని ద్వారా మీకేమి అర్థమయ్యింది ?
జవాబు.
ఈ మాటలవల్ల కన్నన్ మీద యజమానికి ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది. కన్నన్ కబేళాలో బక్కచిక్కి ఉంది. అలాంటి స్థితిలో ఉన్న కన్నన్ను చూడగానే యజమాని హృదయం కరిగింది. పశువులపై ప్రేమ చూపకపోవడం యజమానిని కలవర పరిచిందని తెలుస్తుంది.
ఆలోచించండి- చెప్పండి: (TextBook Page No.126)
ప్రశ్న 1.
కన్నన్ తన యజమానిపై అభిమానాన్ని, ప్రేమని ప్రదర్శించిందని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
చాలాకాలం తర్వాత తన యజమాని రాగానే కన్నన్ ఆనందపడింది. ఆప్యాయంగా అతని శరీరాన్ని నాకింది. హృదయంతో ఏడ్చింది. దీనివల్ల కన్నన్ తన యజమానిపై అభిమానాన్ని, ప్రేమని ప్రదర్శించిందని తెలుస్తుంది.
ప్రశ్న 2.
“నాన్నా ! నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు” – అనే కత్రి మాటలను ఎట్లా అర్థం చేసుకుంటావు ?
జవాబు.
కత్రి తన వివాహం కోసం తండ్రి అవసరమైనవి. పట్టణం వెళ్ళి తెస్తాడని అనుకుంది. కాని తండ్రి “ముసలిదైన కన్నన్ని తీసుకొనివచ్చాడు. దీంతో కత్రి నిరాశపడిందని అర్థమయింది.
ప్రశ్న 3.
“నాకు నువ్వెంతో కన్నన్ అంతే” – దీని ద్వారా నీకేమర్థమయ్యింది ?
జవాబు.
ఓసెఫ్కు కన్నన్ అంటే అమితమైన ఇష్టం. ఆయన తన తోటివారిపైన ఎంతటి ప్రేమాభిమానాలను చూపుతాడో అంతటి ప్రేమాభిమానాలనే కన్నన్ పై చూపుతాడు. అందుకే కబేళాలో ఉన్న తన కన్నన్ని తిరిగి తీసుకొనివచ్చాడు. కూతురు నిరాశతో మాట్లాడినా “నాకు నువ్వెంతో కన్నన్ అంతే” అని చెప్పాడు. దీనితో కన్నన్పై ఓసెఫ్కు ఎంతటి ప్రేమ ఉందో తెలుస్తుంది.
ఇవి చేయండి:
I. విని, అర్థంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
1. కింది అంశాల గురించి తెలుపండి.
అ) ఈ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.
ఓసెఫ్ ఒక రైతు. అతడు వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తాడు. అతని వద్ద గల ఎద్దులలో ఒక ఎద్దు పేరు కన్నన్. అది దున్నేటప్పుడైనా, మరెక్కడైనా ఓసెఫ్ మనసులో ఏమున్నదో పసికట్టేది. ఓసెఫ్ మాట్లాడే ప్రతిమాట కన్నన్కు అర్థమయ్యేది. పొలంలో ఓసెఫ్ తప్ప ఇంకెవరు నాగలి పట్టినా కొంటెతనం చూపేది.
ఓసెఫ్ తన కూతురు పెళ్ళికోసం పొలం తాకట్టు పెట్టాడు. ఆ వచ్చిన డబ్బు చాలకపోవడంతో ఎద్దుల్ని అమ్మేయాల్సి వచ్చింది. కన్నన్కు ఆ ఆవరణ వదలి వెళ్ళిపోవాలంటే కష్టం కలిగింది. ఇటు ఓసెఫ్ హృదయం, అటు కన్నన్ హృదయం చెప్పరానంత బాధను అనుభవించాయి.
ఓసెఫ్ తన కూతురిని అత్తవారింటికి పంపడానికి కొత్తబట్టలు కొనాల్సి వచ్చింది. ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన భార్య చీటీ కట్టి దాచిన డబ్బులు ఇచ్చింది. ఓసెఫ్ కొత్తబట్టలు కొందామని దుకాణానికి బయలుదేరాడు. ఒక మునిసిపల్ భవనం ముందు వరుసగా నిలబెట్టిన బక్కచిక్కిన ఎద్దుల్ని చూశాడు. వాటన్నింటిపైనా మున్సిపాలిటి నల్లని మృత్యుముద్ర వేసింది. ఓసెఫ్ వాటివంక చూస్తూ ఉత్తరం వైపు నడిచాడు.
అక్కడ ఎముకలు తేలిన కన్నన్ను చూడగానే అతని హృదయం కుంగిపోయింది. దాని దగ్గరకు వెళ్ళి గుండెకు హత్తుకున్నాడు. దాని తలను నిమిరాడు. దాని ముందరి కాళ్ళ మీద ఉన్న మృత్యుముద్రను చెరపడానికి ప్రయత్నించాడు. కానీ అది చెరగలేదు. కటికవాడు ఆ ఎద్దును మధ్యాహ్నంలోపు దుకాణానికి చేర్చడానికి సిద్ధపడ్డాడు. ఓ రెండు మూడు గంటల్లో కన్నన్ ఈస్టర్ విందుకు మాంసాహారాన్ని సమకూరుస్తుంది.
చీకటి పడుతున్నా ఇంకా ఓసెఫ్ రాలేదని అతని భార్య మరియా, కూతురు కత్రి ఎదురుచూస్తున్నారు. అంతలో ఓసెఫ్ ముసలి ఎద్దు కన్నన్తో కలిసి లోపలికి వచ్చాడు. కన్నన్ను వాళ్లు గుర్తించారు. ఓసెఫ్ కూతురు “బట్టలేవి ? నువ్వు దీన్ని కొనుక్కొచ్చావా ?” అని అడిగింది. కన్నన్ తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేలమీద ఒరిగింది.
తల్లీకూతుళ్ళు ఓసెఫ్ను అనేక ప్రశ్నలతో వేధించారు. గొంతెత్తి అరిచారు. అయినా ఓసెఫ్ ఏమీ మాట్లాడలేదు. అతని ఒళ్ళంతా చెమటపట్టింది. కొత్తబట్టలు తేలేదని కత్రి దుఃఖించింది. అప్పుడు ఓసెఫ్ “బిడ్డా ! నాకు నువ్వెంతో కన్నన్ అంతే. కసాయివాళ్ళు .” అంటూ దుఃఖిస్తూ తుండుతో కళ్ళమీద ఒత్తుకున్నాడు.
ఆ) ‘మాట్లాడే నాగలి’ అనే పేరు ఈ కథకు సరైందేనా ? ఎందుకు ?
జవాబు.
పొలాల్లో రైతులకు ఒక ఆలాపన ఉంటుంది. రైతు నాగలి దున్నుతూ అందంగా ఆలాపన చేస్తాడు. ఓసెఫ్ కూడా అలాగే చేసేవాడు. ఇప్పుడు ఉన్న పొలం కూతురు పెళ్ళి కోసం తాకట్టు పెట్టాడు. ఆ డబ్బు చాలకపోతే ఎద్దులను అమ్మాడు. తాను వాడిన నాగలి నిరుపయోగంగా బూజుపట్టి ఉంది.
ఒకరోజు ఓసెఫ్ దేనికోసమో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. దగ్గర్లో ఎవరో పొలం దున్నుతూ ఆలాపన చేస్తున్నాడు. ఆ నాగలివాడి మధురస్వరం ఓసెఫ్కు వినబడుతోంది. వెంటనే అతనికి తన నాగలి, తాను పాడే పాట గుర్తుకు వచ్చాయి. ఆ పాట అతనిలో రైతు హృదయాన్ని దహించి వేస్తున్నది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈ కథకు ‘మాట్లాడే నాగలి’ అని పేరు పెట్టడం జరిగింది.
దేశం అంటే మట్టికాదు. దేశం అంటే ప్రజలు. అదే విధంగా నాగలి అంటే కొయ్యకాదు. నాగలి అంటే అది ఉపయోగించే రైతు అని అర్థం. ‘మాట్లాడే నాగలి’ అంటే రైతు మాటలుగా మనం గ్రహించాలి.. కాబట్టి ఈ పాఠానికి ‘మాట్లాడే నాగలి’ అనే పేరు సరైందే.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
ప్రశ్న 1.
కింది వాక్యాలు పాఠంలోని ఏ పేరాలో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి.
ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది.
అది తన నోటితో కాదు; హృదయంతో ఏడ్చింది.
జవాబు.
“కన్నన్” అంటూ గుండె ………… చూసింది.
89వ పేజీలోని చివరి పై పేరాలో “ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది” అనే వాక్యం ఉంది.
అది తన నోటితో కాదు; హృదయంతో ఏడ్చింది.
జవాబు.
బిడ్డా, నన్ను గుర్తుపట్టావా …………. సులభం కాదు.
89వ పేజీలోని చివరి పేరాలో “అది తన నోటితో కాదు; హృదయంతో ఏడ్చింది” అనే వాక్యం ఉంది.
2. కింది పేరా చదువండి. ఖాళీలు పూరించండి.
ఒక పండుగరోజు ఆశ్రమంలో సేవచేస్తున్న ఒక ముసలమ్మ హాలుకు ఎదురుగా ఉన్న గడపల కింద ఉన్న నేలమీద ముగ్గులు వేస్తుంది. అది రమణమహర్షి కంట పడింది. పాటీ! అని భగవాన్ పిలువగా ఎంతో సంతోషంగా భగవాన్ దగ్గరకు వచ్చిందామె. ఇదిగో అవ్వా! కష్టపడి ముగ్గులు పెడుతున్నావు గాని అది బియ్యపుపిండేనా ? అన్నారు భగవాన్. కాదు! రాతిముగ్గే అంది ఆ అవ్వ. అయ్యో! చీమలకైనా ఉపయోగం ఉండదే. ముగ్గులు పెట్టడం అంటే చీమలకు ఆహారం వేయడమన్నమాట. ఆ ధర్మం విడిచిపెట్టి అచ్చంగా రాతిముగ్గే పెడితే చీమలు ఆ పక్కకే రావు. ఒకవేళ వచ్చినా ఆ ఘాటుకు చచ్చిపోతాయి కూడా. ఎందుకది ? కొంచెమైనా బియ్యపుపిండి చేర్చుకోండి – అని సెలవిచ్చినారు భగవాన్. ఆ మాటలు విన్నవారొకరందుకొని “ధనుర్మాసంలో ముగ్గులు అధికంగా పెట్టడం చీమలకు ఆహారం వెయ్యడం కోసమేనా !” అన్నారు. ఆ! కాకపోతే మరేమి ? కొత్త ధాన్యం వచ్చిన సంబరంతో రంగవల్లులు తీర్చి చీమలకు ఆహారం వేస్తారన్నమాట. ‘పెద్దలు నిర్ణయించిన ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కూడినవే ! ఇప్పుడవి పాటించేదెవరు? అలంకారానికి ఏదో చేస్తారంతే’ అన్నారు భగవాన్.
అ) జీవకారుణ్యం అంటే __________________
జవాబు.
ప్రాణులపై దయ
ఆ) ముగ్గులు పెట్టడంలో అంతరార్థం __________________
జవాబు.
చీమలకు ఆహారం వేయడం
ఇ) పూర్వాచారాలను పాటించాలి ఎందుకంటే __________________
జవాబు.
పెద్దలు నిర్ణయించిన ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కూడినవే
ఈ) పై పేరాకు శీర్షిక __________________
జవాబు.
భూతదయ
ఉ) పై పేరాలోని ఐదు ముఖ్యమైన పదాలు __________________
జవాబు.
- ముసలమ్మ
- ముగ్గులు
- రమణ మహర్షి
- బియ్యపుపిండి
- జీవకారుణ్యం
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) ఓసెఫ్ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు ?
జవాబు.
ఓసెఫ్ స్థానంలో ఎవరున్నా ఓసెఫ్ వలనే ప్రవర్తిస్తారు. పెంపుడు జంతువుల పట్ల, పశువుల పట్ల దయతో మెలగాలి. వ్యవసాయపు ఎద్దులను లేదా పాడిపశువులను అవి బలంగా శక్తితో ఉన్నప్పుడు స్వార్థానికి ఉపయోగించుకొని అవి అనారోగ్యం పాలైనపుడు, ముసలివైనపుడు నిర్ధాక్ష్యంగా వదిలివేయకూడదు. వాటిని మన స్నేహితుల్లాగా, కుటుంబ సభ్యుల్లాగా ఆదరించాలి. మనకు సేవలందించిన జంతువులు మన పట్ల అనుబంధాన్ని పెంచుకొని ఉంటాయి. వాటిని గమనించి అనుబంధాన్ని నిలుపుకోవలసిన బాధ్యత మనది. అంతేగాని ముసలి పశవులను వీధుల్లోకి వదిలేయడం, కసాయివాళ్ళకు అమ్మడం చేయకూడదు.
ఆ) ‘పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేది’ ఎందుకని ?
జవాబు.
పశువుల్ని రక్షించాలి, పశువుల్ని రక్షించాలి అని ప్రతివాడూ ఉపన్యాసాలిస్తాడు. కాని వాటిని ఏ విధంగా రక్షించాలో ఎవడూ ఆలోచించడు. వాటి తిండిని గురించి ఆలోచించడు. ఏ ఊళ్ళో కూడా ప్రభుత్వం ఒక వరి పొలాన్నైనా పశువుల కోసం వదలలేదు. మరి అవి ఎలా బతుకుతాయి ? పశువుల చేత మట్టిగడ్డలు తినిపించి రక్షిస్తారా ? అంటూ ఓసెఫ్ ఆవేదన చెందాడు. అందుకే పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేది.
ఇ) క్రయపత్రం అంటే ఏమిటి ? ఏ సందర్భాల్లో దీనిని ఉపయోగిస్తారు ?
జవాబు.
క్రయపత్రం అంటే అమ్మకం, కొనుగోలు సమయంలోని ఒప్పందపత్రం. ఏదైనా ఒక స్థలంగాని, ఇల్లుగాని, పొలంగాని, పశువు మొదలైన వాటినిగాని అమ్మే సమయంలో లేదా కొనే సమయంలో రాసుకొనే పత్రమే క్రయపత్రం. క్రయం అంటే వెల ఇచ్చి కొనడం. విక్రయం అంటే అమ్మడం. ఇరువురి మధ్య ఏవిధమైన తగాదా లేకుండా ఉండటానికి ఈ పత్రాన్ని ఉపయోగిస్తారు.
ఈ) కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి “నాన్నా!” అంది. అట్లా అనడంలో ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు.
కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి తనకు కొత్తబట్టలు తెచ్చాడని ఆనందపడింది. కాని ఓసెఫ్ కొత్తబట్టలు కొనడానికి తీసుకువెళ్ళిన డబ్బుతో కసాయివాని వద్ద చంపడానికి సిద్ధంగా ఉన్న తన కన్నన్ అనే ఎద్దును కొని తీసుకువచ్చాడు. ఇంక అతని వద్ద డబ్బులు లేక కొత్తబట్టలు కొనలేదు. వట్టి చేతులతోనే తిరిగివచ్చాడు. అది చూసిన కత్రి దుఃఖంతో “నాన్నా” అంది. కొత్తబట్టలు కొని తెమ్మని పంపిస్తే పశువును కొనుక్కొచ్చావా ? ఎంత పనిచేశావు ? అని అనడమే ఆమె ఉద్దేశం.
2. కింది ప్రశ్నకు పదేసి వాక్యాల్లో జవాబు రాయండి.
అ) మూగజీవాల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలో ఈ పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు.
జీవరాసులలో ఒక్క మానవుడికే మాట్లాడే శక్తి ఉంది. ఇతర జీవరాసులకు ఆశక్తి లేదు. మాట్లాడే శక్తి లేని జీవాలనే మూగజీవాలు అంటారు.
మానవుడు తన భావాలను, కోరికలను ఇతరులకు తెలియజేయగలడు. ఇతరుల భావాలను గ్రహించగలడు. తన వసతికి, జీవనోపాధికి తగిన ఏర్పాట్లు చేసుకోగలడు. తన సుఖసంతోషాల కోసం సమాజాన్ని తనకు అనుకూలంగా మలచుకోగలడు. మూగజీవాలకు ఆశక్తి లేదు.
మూగజీవాలు తమ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడి ఉంటాయి. వాటికి మాట్లాడే శక్తి లేదు కాబట్టి తమ కోరికలను వెల్లడించలేవు. నిజ జీవితంలో ఎన్నో కష్టనష్టాలకు లోనవుతుంటాయి. అవి ఆత్మ రక్షణ కోసం పడరాని పాట్లు పడుతుంటాయి. కొన్ని మూగ జీవాలు బంధించబడటం చేత అవి స్వేచ్ఛను కోల్పోతాయి.
కనుక మూగజీవాల పట్ల మనం కరుణతో ప్రవర్తించాలి. ప్రేమను, అభిమానాన్ని చూపాలి. వాటి పట్ల క్రూరత్వాన్ని విడనాడాలి. వాటి అవసరాలను గ్రహించి వాటిని తీర్చాలి. వాటికి స్వేచ్ఛను కలిగించాలి. వాటి బాగోగులను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఉండాలి.
IV. సృజనాత్మకత / ప్రశంస:
1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి..
అ) “మూగజీవులకు నోరొస్తే……..” ఊహాత్మకంగా కథ రాయండి.
జవాబు.
అనగనగా అదొక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఆయన వద్ద ఆవులు, గేదెలు, ఎద్దులు చాలా
ఉన్నాయి. పశుసంపద అధికంగా ఉండడంచేత ఆయన సుఖంగా జీవిస్తున్నాడు. కాని అవి మూగజీవాలు కాబట్టి ఆ రైతు గడ్డివేసినపుడే తినడం, నీరు అందించినపుడే త్రాగడం చేస్తున్నాయి. వాటిని బంధించడం చేత అవి స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నాయి.
అదే మూగజీవాలకు నోరొస్తే తమ అవసరాలను తెలియజేసి వాటిని తీర్చమని కోరతాయి. సమయానికి తమకు ఆహారం పెట్టమని అడుగుతాయి. తమకు కూడా స్వేచ్ఛను ప్రసాదించమని వేడుకుంటాయి. మా ప్రాణాలు కూడా మీ ప్రాణాలవంటివే కాబట్టి మాకు ఏ విధమైన కష్టం కలుగకుండా చూడమంటాయి.
V. పదజాల వినియోగం:
1. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : వృషభం పరమేశ్వరుడి వాహనం.
వృషభం = ఎద్దు
అ) పిల్ల మనసులో ఏముంటుందో తల్లి పసికడుతుంది.
జవాబు.
పసికడుతుంది = కనిపెడుతుంది
ఆ) కన్నన్ ఠీవిగా నడుస్తూ వుంటే అందరూ మురిసిపోయేవారు.
జవాబు.
ఠీవి = దర్జాగా
ఇ) అసహనం మనిషిని ఇబ్బందులకు గురిచేస్తుంది.
జవాబు.
అసహనం = ఓర్పులేకపోవడం
ఈ) పశువులు మేతకు మాడితే ఇంటికి అరిష్టం దాపురిస్తదని రైతుల నమ్మకం.
జవాబు.
అరిష్టం = కీడు
2. కింది వాక్యాలను చదివి సమానార్థం వచ్చే పదాలను గుర్తించి, వాటి కింద గీత గీయండి.
అ)రైతు హృదయం దహించింది. కన్నన్ తన ఎదలో బాధను దాచుకున్నాడు. వీరి ఎడదను ఓదార్చేదెవరు ?
జవాబు.
సమానార్థక పదాలు : హృదయం, ఎద, ఎడద
ఆ) పక్షులు ఆకలిని తీర్చుకోవటానికి సంచరిస్తాయి. కానీ కొంగలు క్షుద్బాధ కోసం చెరువును ఆశ్రయిస్తాయి. ఇక ప్రజలు బుభుక్షను తీర్చుకోవడానికి పనిచేస్తారు.
జవాబు.
సమానార్థక పదాలు : ఆకలి, క్షుద్బాధ, బుభుక్ష
ఇ) పంటలు చేతికొచ్చినందుకు రైతులు సంబరపడ్డారు. వారి పిల్లలు సంతోషంతో గంతులు వేశారు. వారి కుటుంబమంతా ఆనందంగా గడిపింది.
జవాబు.
సమానార్థక పదాలు : సంబరం, సంతోషం, ఆనందం.
3. కింద గీత గీసిన పదాలకు గల వేర్వేరు అర్థాలు (నానార్థాలు) రాయండి.
అ) తూర్పు దిక్కు వెళ్తున్న భక్తులు మాకు దేవుడే దిక్కు అంటూ వేడుకొంటున్నారు.
జవాబు.
దిక్కు : దిశ, శరణు
ఆ) రాజేశ్ ఉత్తరం వైపున ఉన్న పోస్టాఫీసుకు వెళ్ళి ఉత్తరం తెచ్చాడు. ఎందుకు తెచ్చావని తండ్రి అడిగితే తగిన ఉత్తరమివ్వలేదు.
జవాబు.
ఉత్తరం : ఒకదిశ, లేఖ
4. కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.
జవాబు.
1) ఏ
2) ఊ
3) ఎ
4) అ
5) ఐ
6) ఒ
7) ఆ
8) ఓ
9) ఈ
10) ఉ
11) ఇ
VI. భాషను గురించి తెలుసుకుందాం.
ప్రశ్న 1.
కింది సంధులను విడదీసి, సంధిపేర్లను రాయండి.
జవాబు.
రూపము | విసంధి | సంధిపేరు |
1) ప్రేమానురాగాలు | ప్రేమ + అనురాగాలు | సవర్ణదీర్ఘ సంధి |
2) ఆనందోత్సాహాలు | ఆనంద + ఉత్సాహాలు | గుణసంధి |
3) ఇంకెవరు | ఇంక + ఎవరు | అత్వసంధి |
4) ఎక్కడయినా | ఎక్కడ + అయినా | అత్వ సంధి |
5) ఏమున్నది | ఏమి + ఉన్నది | ఇత్వ సంధి |
6) చేతులెట్లా | చేతులు + ఎట్లా | ఉత్వసంధి |
7) పైకెత్తి | పైకి + ఎత్తి | ఇత్వసంధి |
8) మరెక్కడ | మరి + ఎక్కడ | ఇత్వ సంధి |
9) సారమంతా | సారము + అంతా | ఉత్వసంధి |
10) ఆలస్యమయ్యింది | ఆలస్యము + అయింది | ఉత్వసంధి |
11) దుర్భరమైనా | దుర్భరము + అయినా | ఉత్వసంధి |
12) రామేశ్వరం | రామ + ఈశ్వరం | గుణసంధి |
ప్రశ్న 2.
కింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
జవాబు.
సమాసపదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
అ) కీళ్ళనొప్పులు | కీళ్ళ యొక్క నొప్పులు | షష్ఠీ తత్పురుష |
ఆ) తల్లీకూతుళ్ళూ | తల్లియును, కూతురును | ద్వంద్వ సమాసము |
ఇ) దయాహృదయం | దయతో కూడిన హృదయం | తృతీయా తత్పురుష |
ఈ భూమిశిస్తు | భూమి యొక్క శిస్తు | షష్ఠీ తత్పురుష |
ఉ) రాత్రింబవళ్ళూ | రాత్రియును, పగలును | ద్వంద్వ సమాసము |
ఊ) పదిసంవత్సరాలు | పది సంఖ్యగల సంవత్సరాలు | ద్విగు సమాసం |
ఎ) నలుదిక్కులు | నాలుగు సంఖ్యగల దిక్కులు | ద్విగు సమాసం |
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:
ప్రశ్న 1.
నిత్యజీవితంలో జంతువులు, పక్షులపైన ప్రేమ చూపించే సంఘటనలు మీరు చూసినవి లేదా విన్నవాటి గురించి నివేదిక రాయండి.
జవాబు.
నాకు పక్షులన్నా, జంతువులన్నా అమితమైన ప్రేమ, మూగజీవాలపై కనికరాన్ని ప్రదర్శించాలనే ధర్మాన్ని పాటించాలనే స్వభావం కలవాడిని. ఒకసారి నేను మా పొలం వెళ్ళాను. ఆ సమయంలో ఒక అందమైన పావురం చెట్టుపైన ఉంది. నా స్నేహితుడొకడు ఆకతాయిగా ఒక చిన్న రాయిని పావురంపై విసిరాడు. అది దాని రెక్కలకు తగిలింది. దాంతో ఎగరలేక నిస్సహాయంగా కిందపడింది.
వెంటనే నా మిత్రుడిని మందలించాను. దాన్ని దగ్గరకు తీసుకున్నాను. రెక్కల నుండి కారుతున్న రక్తాన్ని నీళ్ళతో కడిగి, రక్తస్రావాన్ని ఆపాను. పిమ్మట ఊళ్ళోకి వెళ్ళి వైద్యుడిని సంప్రదించాను. చికిత్స చేయమని కోరాను. దయతో ఆ వైద్యుడు చికిత్స చేశాడు. చక్కని ఆహారాన్ని అందించాను. మూడు రోజుల తర్వాత అది ఎగరడం మొదలు పెట్టింది. పిమ్మట నేను దాన్ని ఆకాశంలోకి వదలిపెట్టాను. అది ఆనందంతో ఎగురుతూ వెళ్ళిపోయింది. ఈ సంఘటన నాకు ఇప్పటికి గుర్తుంది. మానవులందరు మూగజీవాలపై కనికరం చూపాలి. ప్రాణులను కాపాడటం మనందరి కర్తవ్యం.
(లేదా)
ప్రశ్న 2.
వివిధ జంతువులు/పక్షుల పెంపకందారుల వద్దకు వెళ్ళి, ఆయా జంతువుల/పక్షుల పెంపకంలో ఎలాంటి శ్రద్ధ కనబరుస్తున్నారో తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు.
విద్యార్థి కృత్యం
TS 8th Class Telugu 12th Lesson Important Questions మాట్లాడే నాగలి
III. సృజనాత్మకత:
ప్రశ్న 1.
ఉపాధ్యాయ దినోత్సవం రోజు మీ పాఠశాలలో జరిగిన కార్యక్రమాల వివరాలను తెలిపేలా సంభాషణను రాయండి.
జవాబు.
ఉపాధ్యాయ దినోత్సవం (సంభాషణ)
(తరగతి గదిలో ఉపాధ్యాయుడు, విద్యార్థులు జస్వంత్, ప్రసాదు, లలితలు)
విద్యార్థులు : నమస్కారమండీ ! (క్లాసులోకి టీచర్రాగానే విద్యార్థులు విష్ చేస్తూ)
ఉపాధ్యాయుడు : శుభోదయం. ఇవాళ అందరూ హుషారుగా ఉన్నారు. విశేషమేంటో ?
లలిత : హెడ్ మాస్టారు టీచర్స్తో ఉత్సవ నిర్వహణ మాకే అప్పజెప్పారండి.
ఉపాధ్యాయుడు : ఓహో అదా సంగతి. మరి ఎలా చెద్దామనుకుంటున్నారు ?
జస్వంత్ : తరగతి గదులన్నీ రంగుల కాగితాలతో అలంకరించి, వేదికను ఏర్పాటు చేస్తాము.
ప్రసాద్ : సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఫోటో ఏర్పాటు చేయడం.
ఉపాధ్యాయుడు : బాగుంది. తర్వాత ?
లలిత : విద్యార్థులను వరుసల్లో కూర్చోబెట్టి,’ సభను ప్రారంభిస్తాము.
జస్వంత్ : ముందుగా గురుస్తుతి చేసి, ఒక్కొక్క మాస్టారును వేదికపై ఆహ్వానిస్తాము.
ప్రసాద్ : గురువుల గొప్పదనాన్ని వివరించే మాటలు పాటలు, వినిపిస్తాము.
ఉపాధ్యాయుడు : ఆహా ! ఆ గాన కోకిలలు ఎవరో ?
లలిత : లత, కృష్ణ, బాలు, చిత్ర, జానకి పాటలు. వీరేంద్రనాథ్, కౌసల్య, శారద, వెంకట్ మాటలు.
ప్రసాద్ : గురువుగారు ! ఈ దినోత్సవాలని, జయంతులని చేయడంలో గల పరమార్థం ఏమిటి ?
ఉపాధ్యాయుడు : చక్కని ప్రశ్న. ఎన్నో కష్టాలను బాల్యం నుండి ఎదుర్కొంటూ ఓర్పుతో నేర్పుతో దాటుకుంటూ ఉన్నత శిఖరాలను ఎక్కిన మహనీయులను మనం ఎప్పుడూ మరచిపోకూడదు. వారిని తలచుకొంటూ ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని, పొందాలి. దానిలోని భాగమే ఈ వేడుకలు.
ప్రసాద్ : మీ మాటలు బాగా అర్థమయ్యాయండి. ఆ పెద్దలు దూరమైనా వారి ఆలోచనలు, ఆచరణలు మనం ఆదర్శంగా తీసుకోవాలనే కదండీ.
ఉపాధ్యాయుడు : అక్షరాల సత్యం పలికావు. బావుంది. ఇదే ఏకాగ్రతతో గురుపూజోత్సవాన్ని బాగా నిర్వహించాలి. మీకందరికీ శుభాశీస్సులు.
విద్యార్థులు : ధన్యవాదాలండీ.
IV. భాషాంశాలు:
పదజాలం :
పర్యాయపదాలు:
ప్రశ్న 1.
ఎద్దు : _____________
జవాబు.
వృషభం, ఋషభం, ఉక్షము
ప్రశ్న 2.
భూమి : _____________
జవాబు.
ధరణి, ఉర్వి, వసుధ
ప్రశ్న 3.
ఆకు : _____________
జవాబు.
పత్రం, పర్ణం, దళం
ప్రశ్న 4.
కన్ను : _____________
జవాబు.
అక్షి, నేత్రం, నయనం
ప్రశ్న 5.
కూతురు : _____________
జవాబు.
కుమార్తె, పుత్రి, సుత
ప్రశ్న 6.
తల్లి : _____________
జవాబు.
జనయిత్రి, మాత, అమ్మ
ప్రశ్న 7.
కత్తి : _____________
జవాబు.
ఖడ్గం, అసి, కరవాళం
ప్రశ్న 8.
పెండ్లి : _____________
జవాబు.
పరిణయం, వివాహం, ఉద్వాహం.
ప్రకృతి – వికృతులు:
ప్రకృతి – వికృతి
1. స్నేహితుడు – నెయ్యుడు
2. భాష – బాస
3. హృదయం – ఎద, ఎడద
4. ప్రేమ – ప్రేముడి
5. భూమి – బూమి
6. పశువు – పసువు
7. సహజము – సాజము
8. సంతోషం – సంతసం
9. ప్రాణం – పానం
10. దీపం – దివ్వె
11. పక్షి – పక్కి
12. ఆశ్చర్యం – అచ్చెరువు
సొంతవాక్యాలు:
ప్రశ్న 1.
పసిగట్టు = _____________
జవాబు.
పసిగట్టు = తెలుసుకొను
పిల్లల ఆలోచనలు పసిగట్టి సరైన దారిలో నడిపించాలి.
ప్రశ్న 2.
నిరసన = _____________
జవాబు.
నిరసన = తిరస్కారం
బ్రిటిష్ వారి అరాచకాలకు ఎదురు నిలిచి భారతీయులు నిరసనలు చేసారు.
ప్రశ్న 3.
పర్వదినం = _____________
జవాబు.
పర్వదినం = పండుగ
ఆగస్టు 15 భారతీయుల పర్వదినం
ప్రశ్న 4.
స్పందించు = _____________
జవాబు.
స్పందించు = చలించు
కష్టాలలో ఉన్నవారిని చూస్తే స్పందించే గుణం మహాత్ములకే సొంతం.
వ్యాకరణాంశాలు:
సంధులు:
1. సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది.
ఉదా : ప్రేమానురాగాలు = ప్రేమ + అనురాగాలు
మాంసాహారం = మాంస + ఆహారం
మధ్యాహ్నం = మధ్య + అహ్నం
సింహాసనం = సింహ + ఆసనం
2. గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
ఉదా : ఆనందోత్సాహాలు = ఆనంద + ఉత్సాహాలు
3. ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఉదా : సారమంతా = సారము + అంతా
పనులన్నీ = పనులు + అన్నీ
రోజంతా = రోజు + అంతా
ఎద్దులన్నింటికి = ఎద్దులు + అన్నింటికి
ఒళ్ళంతా = ఒళ్ళు + అంతా
జవాబిచ్చాడు. = జవాబు + ఇచ్చాడు
నువ్వెంతా = నువ్వు + ఎంత
4. ఇత్వసంధి :
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
ఉదా : చెప్పినదంతా = చెప్పినది + అంతా
మరెక్కడ = మరి + ఎక్కడ
పైకెత్తి = పైకి + ఎత్తి
5. అత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా : ఎక్కడయినా = ఎక్కడ + అయినా
సమాసాలు:
సమాస పదం | విగ్రహవాక్యం | సమాస నామం |
1. రాజదండం | రాజు యొక్క దండం | షష్ఠీ తత్పురుష |
2. మృత్యుముద్ర | మృత్యువు యొక్క ముద్ర | షష్ఠీ తత్పురుష |
3. కీళ్ళనొప్పులు | కీళ్ళ యొక్క నొప్పులు | షష్ఠీ తత్పురుష |
4. మరణశిక్ష | మరణము కొరకు శిక్ష | చతుర్థీ తత్పురుష |
5. పెళ్ళి ఖర్చు | పెళ్ళి కొరకు ఖర్చు | చతుర్థీ తత్పురుష |
6. మోక్షసాధనం | మోక్షము కొరకు సాధనం | చతుర్థీ తత్పురుష |
7. ఆనందోత్సాహాలు | ఆనందమును, ఉత్సాహమును | ద్వంద్వ సమాసం |
8. తల్లీకూతుళ్ళు | తల్లియును, కూతురును | ద్వంద్వ సమాసం |
9. రాత్రింబవళ్ళూ | రాత్రియును, పగలును | ద్వంద్వ సమాసం |
10. మధురస్వరం | మధురమైన స్వరం | విశేషణ పూర్వ పద కర్మధారయం |
11. పనసచెట్టు | పనస అనే పేరుగల చెట్టు | సంభావన పూర్వ పద కర్మధారయం |
12. అరటిచెట్లు | అరటి అనే పేరుగల చెట్లు | సంభావన పూర్వ పద కర్మధారయం |
13. ప్రేమానురాగాలు | ప్రేమయును, అనురాగమును | ద్వంద్వ సమాసం |
14. మూడుకోణాలు | మూడు సంఖ్యగల కోణాలు | ద్విగు సమాసం |
15. మధ్యాహ్నం | అహ్నాము మధ్య భాగము | ప్రథమ తత్పురుష |
కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు:
ప్రశ్న 1.
కర్తరి వాక్యం : మునిసిపాలిటీ నల్లని మృత్యుముద్ర వేసింది.
జవాబు.
కర్మణి వాక్యం : మునిసిపాలిటీచే నల్లని మృత్యుముద్ర వేయబడింది.
ప్రశ్న 2.
కర్తరి వాక్యం : ఓసెఫన్ను భార్య మందలించింది.
జవాబు.
కర్మణి వాక్యం : ఓసెఫ్ భార్యచే మందలించబడ్డాడు.
ప్రశ్న 3.
కర్తరి వాక్యం : దీపం వెలిగించారు.
జవాబు.
కర్మణి వాక్యం : దీపం వెలిగించబడింది.
ప్రశ్న 4.
కర్తరి వాక్యం : ఆమె ఒక తెల్ల ఆకారాన్ని చూసింది.
జవాబు.
కర్మణి వాక్యం : ఒక తెల్ల ఆకారం ఆమెచే చూడబడింది.
సామాన్య వాక్యాలు – సంక్లిష్ట వాక్యాలు:
ప్రశ్న 1.
సామాన్య వాక్యాలు: ఓసెఫ్ అక్కడ నిలబడ్డాడు. ఓసెఫ్ కాసేపు తేరిపార చూశాడు
జవాబు.
సంక్లిష్ట వాక్యం : ఓసెఫ్ అక్కడ నిలబడి కాసేపు తేరిపార చూశాడు.
ప్రశ్న 2.
సామాన్య వాక్యాలు : పశువును చూశాడు. ఆ వృద్ధుడి హృదయం కుంగిపోయింది.
జవాబు.
సంక్లిష్ట వాక్యం : పశువును చూసి ఆ వృద్ధుడి హృదయం కుంగిపోయింది.
ప్రశ్న 3.
సామాన్య వాక్యాలు : అతని ఒళ్ళంతా చెమటతో తడిసింది. అతని ఒళ్ళు ముద్దయింది.
జవాబు.
సంక్లిష్ట వాక్యం : అతని ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది.
ప్రశ్న 4.
సామాన్య వాక్యాలు: పశువు ఆ గొంతు విన్నది. పశువు మొద్దుబారిపోయింది.
జవాబు.
సంక్లిష్ట వాక్యం : పశువు ఆ గొంతు విని మొద్దుబారిపోయింది.
సామాన్య వాక్యాలు – సంయుక్త వాక్యాలు
ప్రశ్న 1.
సంయుక్త వాక్యం : ప్రేమకు ఎప్పుడూ మాటలూ, ప్రదర్శనలూ అవసరం లేదు.
జవాబు.
సామాన్య వాక్యాలు : ప్రేమకు ఎప్పుడూ మాటలూ అవసరం లేదు. ప్రేమకు ఎప్పుడూ ప్రదర్శనలూ అవసరం లేదు.
ప్రశ్న 2.
సంయుక్త వాక్యం : కన్నన్ అరటిచెట్లను, కొబ్బరి మొక్కలను ముట్టుకొనేది కాదు.
జవాబు.
సామాన్య వాక్యాలు : కన్నన్ అరటిచెట్లను ముట్టుకొనేది కాదు. కన్నన్ కొబ్బరి మొక్కలను ముట్టుకొనేది కాదు.
ప్రశ్న 3.
సంయుక్త వాక్యం : ఓసెఫ్ వరుణదేవతను, మేఘాలను, పర్వతాలను, వాయుదేవతను ప్రార్థించాడు.
జవాబు.
సామాన్య వాక్యాలు : ఓసెఫ్ వరుణదేవతను ప్రార్థించాడు. ఓసెఫ్ మేఘాలను ప్రార్థించాడు. ఓసెఫ్ పర్వతాలను ప్రార్థించాడు. ఓసెఫ్ వాయుదేవతను ప్రార్థించాడు.
ఇది ఏ వాక్యం ?
ప్రశ్న 1.
మూగజీవాలను రక్షించడం మనందరి బాధ్యత.
జవాబు.
విధ్యర్థక వాక్యం.
ప్రశ్న 2.
మూగజీవులకు నోరొస్తే ?
జవాబు.
ప్రశ్నార్థక వాక్యం.
పదాలు – అర్థాలు:
I.
సంగతి = విషయం
వృషభం = ఎద్దు
ఠీవి = వయ్యారం
ఉట్టిపడు = అతిశయించు, స్పష్టమగు
పసిగట్టు = తెలుసుకొను
మడి = చుట్టూ గట్లున్న భూభాగం
మొలక = అంకురం
ఘోరం = భయంకరం
మొండి = మూర్ఖుడు
క్రూరత్వం = బాధించునది
అరిష్టం = కీడు
విచక్షణ = చక్కగా ఆలోచించు
దాపురించు = ప్రాప్తించు
మోర = పశువు మొదలైన వాని దీర్ఘముఖం
దువ్వు = నిమురు, బుజ్జగించు
II.
మేఘగర్జన = మేఘధ్వని
కొంటెతనం = అల్లరి
ఆలాపన = గొంతెత్తి పాడేటప్పుడు తీసే రాగం
మాధుర్యం = తీపి
దుక్కి = దున్నుట
నిరసన = తిరస్కారం
ప్రకటించు = వెల్లడిచేయు
గాయకులు = పాడేవాళ్ళు
ఠికాణా = ఆధారం
గత్యంతరం = మరొకమార్గం
వరుణం = జలం
వాయు = గాలి
దుకాణం = అంగడి
III.
దినం = రోజు
దహించుట = కాల్చుట
మృత్యువు = మరణం
మందగించు = తగ్గుముఖం పట్టు
స్పర్శ = తాకిడి
పర్వదినం = పండుగ
మిన్న = శ్రేష్ఠం
భూతదయ = ప్రాణులయందు దయ
సడలు = వదలు
స్పందింంచు = చలించు
కుంగిపోవు = నీరసించిపోవు
IV, V.
కటిక = మాంసం అమ్మువాడు
ఒళ్ళు = శరీరం
అసహనం = ఓర్చుకోలేకపోవు
సంబరం = సంతోషం
నేలమీద ఒరుగు = మరణించు
వేధించు = బాధించు
దగ్గుత్తిక = గద్గద స్వరం
కసాయి = కటికవాడు
పాఠం ఉద్దేశం:
ప్రాణులకు – ముఖ్యంగా పెంపుడు జంతువులకూ సంవేదనలుంటాయనీ, మనం చూపే ప్రేమ, ఆప్యాయతలకు అవి స్పందిస్తాయనీ చెప్తూ, తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లైతే దాన్ని అనువాదం (Translation) అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని ‘అనువాద ప్రక్రియ’గా పేర్కొనటం జరుగుతున్నది.
సాహిత్య అకాడమీ వారు ముద్రించిన “భారతీయ సాహిత్యం – సమకాలీన కథానికలు” అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాదకథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పొనుక్కున్నం వర్కెయ్ రాసిన కథను తెలుగులోకి ఎన్.వేణుగోపాలరావు అనువాదం చేశాడు.
రచయిత పరిచయం:
రచయిత పేరు : పొన్కున్నం వర్కెయ్
పాఠ్యభాగం పేరు : మాట్లాడే నాగలి
కాలం : 1910 – 2004
రచనలు : 24 కథానికా సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు ఒక వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి.
ప్రవేశిక:
ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమైకమై సహజీవనం చేస్తున్న మూగజీవులను అనుకోని పరిస్థితులలో దూరం చేసుకొని, తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనస్సు ఎంతగా స్పందిస్తుందో “ఓసెఫ్ – కన్నన్” ద్వారా తెలుస్తుంది. ఇంతకూ ఓసెఫ్ ఎవరు ? కన్నన్ను ఏ విధంగా చూసుకునేవాడు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం.
పాఠ్యభాగ సారాంశం:
ఓసెఫ్ ఒక రైతు. అతడు వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తాడు. అతని వద్ద గల ఎద్దులలో ఒక ఎద్దు పేరు కన్నన్. అది దున్నేటప్పుడైనా, మరెక్కడైనా ఓసెఫ్ మనసులో ఏమున్నదో పసికట్టేది. ఓసెఫ్ మాట్లాడే ప్రతిమాట కన్నన్కు అర్థమయ్యేది. పొలంలో ఓసెఫ్ తప్ప ఇంకెవరు నాగలి పట్టినా కొంటెతనం చూపేది.
ఓసెఫ్ తన కూతురు పెళ్ళికోసం పొలం తాకట్టు పెట్టాడు. ఆ వచ్చిన డబ్బు చాలకపోవడంతో ఎద్దుల్ని అమ్మేయాల్సి వచ్చింది. కన్నన్కు ఆ ఆవరణ వదలి వెళ్ళిపోవాలంటే కష్టం కలిగింది. ఇటు ఓసెఫ్ హృదయం, అటు కన్నన్ హృదయం చెప్పరానంత బాధను అనుభవించాయి.
ఓసెఫ్ తన కూతురిని అత్తవారింటికి పంపడానికి కొత్తబట్టలు కొనాల్సి వచ్చింది. ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన భార్య చీటీ కట్టి దాచిన డబ్బులు ఇచ్చింది. ఓసెఫ్ కొత్తబట్టలు కొందామని దుకాణానికి బయలుదేరాడు. ఒక మునిసిపల్ భవనం ముందు వరుసగా నిలబెట్టిన బక్కచిక్కిన ఎద్దుల్ని చూశాడు. వాటన్నింటిపైనా మున్సిపాలిటి నల్లని మృత్యుముద్ర వేసింది. ఓసెఫ్ వాటివంక చూస్తూ ఉత్తరం వైపు నడిచాడు.
అక్కడ ఎముకలు తేలిన కన్నన్ను చూడగానే అతని హృదయం కుంగిపోయింది. దాని దగ్గరకు వెళ్ళి గుండెకు హత్తుకున్నాడు. దాని తలను నిమిరాడు. దాని ముందరి కాళ్ళ మీద ఉన్న మృత్యుముద్రను చెరపడానికి ప్రయత్నించాడు. కానీ అది చెరగలేదు. కటికవాడు ఆ ఎద్దును మధ్యాహ్నంలోపు దుకాణానికి చేర్చడానికి సిద్ధపడ్డాడు. ఓ రెండు మూడు గంటల్లో కన్నన్ ఈస్టర్ విందుకు మాంసాహారాన్ని సమకూరుస్తుంది.
చీకటి పడుతున్నా ఇంకా ఓసెఫ్ రాలేదని అతని భార్య మరియా, కూతురు కత్రి ఎదురుచూస్తున్నారు. అంతలో ఓసెఫ్ ముసలి ఎద్దు కన్నన్తో కలిసి లోపలికి వచ్చాడు. కన్నన్ను వాళ్లు గుర్తించారు. ఓసెఫ్ కూతురు “బట్టలేవి ? నువ్వు దీన్ని కొనుక్కొచ్చావా ?” అని అడిగింది. కన్నన్ తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేలమీద ఒరిగింది.
తల్లీకూతుళ్ళు ఓసెఫ్ను అనేక ప్రశ్నలతో వేధించారు. గొంతెత్తి అరిచారు. అయినా ఓసెఫ్ ఏమీ మాట్లాడలేదు. అతని ఒళ్ళంతా చెమటపట్టింది. కొత్తబట్టలు తేలేదని కత్రి దుఃఖించింది. అప్పుడు ఓసెఫ్ “బిడ్డా! నాకు నువ్వెంతో కన్నన్ అంతే. కసాయివాళ్ళు ……” అంటూ దుఃఖిస్తూ తుండుతో కళ్ళమీద ఒత్తుకున్నాడు.
నేనివి చేయగలనా ?