Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 11th Lesson కాపుబిడ్డ Textbook Questions and Answers.
TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ
చదువండి – ఆలోచించి చెప్పండి: (TextBook Page No.108)
తొలిజల్లువచ్చింది
తొలకరించింది
పదవోయి రైతన్న
పాటుచేయంగ!
హలమే మన సౌభాగ్య
బలమనుచు చాటి
పొలము దున్నాలోయి
పొలికేక బెట్టి!
బలము నీవే జాతి
కలిమి నీవేరా !
పాతరల బంగారు
పంట నింపుమురా !
ప్రశ్నలు:
ప్రశ్న 1.
తొలివాన కురిసే కాలాన్ని ఏమంటారు ?
జవాబు.
తొలివాన కురిసే కాలాన్ని తొలకరి కాలం అంటారు.
ప్రశ్న 2.
ఈ గేయం ఎవరి గురించి చెపుతుంది ?
జవాబు.
ఈ గేయం కాపుబిడ్డ అయిన రైతు గురించి చెప్తుంది.
ప్రశ్న 3.
గేయానికి, బొమ్మకి మధ్యగల సంబంధం ఏమిటి ?
జవాబు.
గేయం పొలం దున్నమని రైతుకు పిలుపునిస్తున్నది. బొమ్మలో రైతు హలం కట్టి పొలం దున్నుతున్నాడు.
ప్రశ్న 4.
బంగారు పంటలను పండించే రైతుల గురించి మీకేం తెలుసు ?
జవాబు.
బంగారు పంటలు పండించే రైతు తాను సుఖం ఎరుగడు. అందరికీ అన్నం పెట్టే అతడికి కడుపునిండా కూడు దక్కదు. ఈ సమాజానికి రైతు వెన్నెముక లాంటివాడు.
ఆలోచించండి- చెప్పండి: (TextBook Page No.111)
ప్రశ్న 1.
రైతులవలె, ఇతర వృత్తులవారు పడే బాధలను తెల్పండి.
జవాబు.
రైతులలాగానే కమ్మరి, కుమ్మరి, సాలె, వడ్రంగి, కంసాలి, మంగలి, శిల్పి మొదలగు వృత్తులవారు చాలా బాధలు పడతారు. వారూ ఎండకూ, వానకూ, ఎండుతూ, తడుస్తూ వృత్తి ధర్మం నిర్వర్తిస్తారు. వారికీ కడుపులు నిండవు. వారి కుటుంబాలూ పేదరికంలో మగ్గుతూ ఉంటాయి. అయినా వారికి పట్టెడు అన్నం పెట్టే వృత్తిని వదలక వారు తమతమ వృత్తుల ద్వారా సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. వారికి సమాజంలో గౌరవం తక్కువ. వారికీ తగిన వ్యాపార సదుపాయాలుండవు. వారందరూ గ్రామీణ భారతానికి దేహాలు.
ప్రశ్న 2.
మూడు కాలాల్లో రైతులు చేపట్టే పనులేవి ?
జవాబు.
తొలకరి పడగానే రైతు భూమి దున్ని నేల తల్లిని పంటలకు అనువుగా సిద్ధం చేసుకుంటాడు. ఆ పిదప విత్తడం, నీరు పెట్టడం, నారు పోయడం, కలుపు తీయడం, ధాన్యం నూర్చడం, గాదెలకు తరలించడం అన్నీ శ్రమను హరించేవే. మధ్య మధ్య తెగుళ్లు సోకకుండా ఎరువులు వేయడం రక్షించుకోవడం. మంచెలపై కాపు కాసి పశుపక్ష్యాదుల నుండి కంటికి రెప్పలా పంటను కాపాడుకోవడం. అంతా అయాక పంటలకు కిట్టుబాటు ధరలు సంపాదించడం సరైన మార్కెట్ చేసుకోడం అన్నీ రైతు చేసే పనులే !
ప్రశ్న 3.
పేదరైతు కష్టాలు ఎట్లాంటివి ?
జవాబు.
పేదరైతు కష్టాలు :
- ఎండనకా వాననకా చలి అనకా మూడు కాలాలూ నిద్రాహారాలు మాని శ్రమించాలి.
- అయినా వచ్చే కొద్ది ఆదాయం కుటుంబ పోషణకు చాలక రైతు పేదవాడిగానే మిగిలిపోతాడు.
- భార్యాపిల్లలు ఆకలితో అలమటిస్తారు.
- రైతును అప్పుల బాధ ముంచెత్తుతుంది.
- సకాలంలో వర్షాలు పడవు. లేదా’ వరదలు పంటలను ముంచేస్తాయి.
- రైతుకు దళారుల బాధ చెప్పనలవి కాదు.
- అన్నీ అనుకూలంగా ఉన్నా కిట్టుబాటు ధర లభించదు. మార్కెట్ సౌకర్యాలు రైతుకు అందు ‘ బాటులో ఉండవు.
- రైతుకు దినదినగండం నూరేళ్ళ ఆయుష్లే!
ఆలోచించండి- చెప్పండి: (TextBook Page No.112)
ప్రశ్న 1.
సద్వర్తనకు దోహదం చేసే గుణాలు ఏవి ?
జవాబు.
మిత ఆహారం విహారమూ, శుచీ శుభ్రతా, అనవసరంగా వాగకుండడం, ప్రాతఃకాలాననే నిద్రలేవడం; కృత్రిమంగా ప్రవర్తించకపోవడం, ఎవరినీ హేళన చేయకుండడం, ఆడంబరం లేకపోవడం – ఇవి అన్నీ సద్వర్తనకు దోహదం చేసే గుణాలు.
ప్రశ్న 2.
రైతుకు భగవంతుడు ఇంద్ర పదవిని ఇస్తున్నాడని ఎట్లా చెప్తారు ?
జవాబు.
ప్రకృతి సిద్ధమైనవన్నీ రైతుకు భగవంతుడిచ్చాడు. జొన్న సంకటీ, చేనేత బట్టలూ, చేత ములుగర్రా, పశుసంపదా, పాడిపంటలూ ఇవి అన్నీ ఇంద్ర పదవిని రైతుకు కట్టబెడుతున్నాయి. అవే అతనికి అమృతమూ, నందనవనాలూ, వజ్రాయుధాలూ. అందుకే రైతు ఇంద్రుడే !
ప్రశ్న 3.
రైతుకు, మునికి గల పోలికలు ఏమిటి ?
జవాబు.
ప్రాతఃకాలాన లేవడం; శుచిగా స్నానం చేయడం; మేలైన ఆహారం స్వీకరించడం; మితంగా మాట్లాడడం; ‘దానధర్మాలు చేయాలనే కోరికా; నిరాడంబర జీవనం ఇవి అన్నీ రైతుకూ మునికీ సమాన గుణాలు.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
ప్రశ్న 1.
“రైతే దేశానికి వెన్నెముక” అంటారు కదా ! నేడు రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది ? చర్చించండి.
జవాబు.
దేశానికి రైతు వెన్నెముక: ఎందుకంటే మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. 70 శాతం మంది గ్రామీణ ప్రజలు నేరుగా వ్యవసాయం మీద కానీ, వ్యవసాయ ఆధారిత వృత్తులపై కానీ ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరూ తమ వృత్తులు వీడి ఉత్పత్తులు ఆపితే దేశ ప్రగతి ఆగిపోతుంది.
కానీ ప్రస్తుతం రైతులు దీన స్థితిలో ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. పండిన పంటలకు కిట్టుబాటు ధరలు లేవు. ప్రభుత్వాల ప్రోత్సాహం కరవు. గ్రామీణ పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయి.
దున్నేవాడికి భూమి లేదు. కౌలు రైతులు అప్పులు తీర్చలేక, పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరెంటూ, నీరూ కరువైపోయాయి. మేలిమి విత్తనాలూ – మంచి ఎరువులూ అందనంత ధరలలో ఉన్నాయి. ఇవి అన్నీ రైతులను కడగండ్ల పాలు చేస్తున్నాయి.
ప్రశ్న 2.
రైతు యొక్క జీవనవిధానం గురించి, కవికి ఉన్న అభిప్రాయం గురించి మాట్లాడండి.
జవాబు.
రైతు జీవన విధానం గురించి కవి అభిప్రాయం :
- రైతు సాధు జీవి. సాత్వికుడు. మితభాషి.
- రైతు ఆడంబరాలు లేనివాడు.
- కష్టసుఖాలను సమంగా స్వీకరిస్తాడు.
- మూడు కాలాలలోనూ అతడు శ్రమిస్తాడు.
- పూరి గుడిసెలలో జీవిస్తూ జొన్నన్నం తింటూ చేనేత వస్త్రాలు ధరించి సకల వైభవాలతో ఉండే ఇంద్రుడిలా సంతృప్తి పడతాడు.
- రైతు జీవన విధానం గౌరవప్రదమైనదని కవి అభిప్రాయం.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
ప్రశ్న 1.
కింది పద్యమును చదువండి. పద్యభావానికి చెందిన ఖాళీలను పూరించండి.
‘కష్టసుఖముల నొకరీతి గడుపువారు
శత్రుమిత్రుల సమముగా సైచువారు
సైరికులు దప్ప నంతటి శాంతులెవరు ?
కాన చేమోడ్చి వారినే గౌరవింతు.
జవాబు.
భావం : సైరికులు అనగా రైతులు. వారు శత్రువులను మిత్రులను ఒకే రీతిగా సహిస్తారు. వారి సాధు స్వభావం వల్లనే వారిని నేను చేతులు జోడించి గౌరవిస్తాను.
2. కింది పద్యాన్ని చదివి దాని కింద ఉన్న ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.
“ఎండాకాలము గుడిసెల నెగరజిమ్మ
తొలకరించిన వర్షము తొట్రుపరుప
ముసురుపెట్టగా రొంపిలో మూల్గుచున్న
కర్షకా ! నీదు పల్లెను గాంతురెవరు.
ఆ) ‘రొంపి’కి సరియైన అర్థాన్ని గుర్తించండి.
ఎ) నీరు
బి) వరద
సి) గాలి
డి) బురద
జవాబు.
డి) బురద
ఆ) ‘ఎగురజిమ్ముట’ అనగా
ఎ) కాలిపోవుట
బి) గాలికి పైకి విసురు
సి) కూలిపోవుట
డి) కిందపడుట
జవాబు.
బి) గాలికి పైకి విసురు
ఇ) ‘తొలకరించుట’ అంటే నీకు ఏమి తెలుస్తున్నది ?
ఎ) పలకరించుట
బి) పులకరించుట
సి) వర్షాకాలం మొదలు
డి) ఎండాకాలం మొదలు
జవాబు.
సి) వర్షాకాలం మొదలు
ఈ) ‘కాంతురెవరు’ అనడంలోని ఉద్దేశం
ఎ) ఎవరు చూస్తారు ?
బి) ఎవరు పట్టించుకుంటారు ?
సి) ఎవరు అంటారు ?
డి) ఎవరు వింటారు ?
జవాబు.
బి) ఎవరు పట్టించుకుంటారు ?
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) “ఇంద్ర పదవి కన్నా రైతు జన్మ గొప్పది” ఎందుకు ?
జవాబు.
రైతుకు అన్నీ ప్రకృతి సంపదలే ! ఇంద్రునికి అన్నీ కృత్రిమాలే. రైతు అందరికీ అన్నం పెడతాడు. ఇంద్రునికి ఆ భాగ్యం లేదు. ఇంద్రుడికీ అన్ని సుఖాలే ! భోగాలే ! రైతు తన కష్టాలనే ఇంద్ర భోగాలుగా భావిస్తాడు. కనుక ఈ భూమిపై రైతు వృత్తియే ఇంద్ర పదవి కంటే గొప్పది.
ఆ) “జై జవాన్ ! జై కిసాన్ !!” అంటారు కదా ! రైతుకు, సైనికునికి గల పోలికలు ఏమిటి ?
జవాబు.
జవాన్ | కిసాన్ |
1) రేయింబవళ్లు సరిహద్దులలో కాపు కాచి దేశాన్ని రక్షిస్తాడు. | 1) రేయింబవళ్లు శ్రమించి పంటలు పండిస్తాడు. |
2) దేశ ప్రజలకు భద్రత కూరుస్తాడు. | 2) ప్రజలకు ఆహారాన్ని అందించి, బతికిస్తాడు. |
3) తన కర్తవ్య నిర్వహణలో కుటుంబ విషయాలు పట్టించుకోడు. | 3) ఇతడూ తన కుటుంబ సౌఖ్యం గురించి ఆలోచించడు. |
4) పరుల రక్షణలోనే ఆనందం పొందుతాడు. | 4) పరులను జీవింపచేయడంలో తృప్తి పొందుతాడు. |
5) దేశ రక్షణలో ప్రాణాలు అర్పించే త్యాగమూర్తి. | 5) సమాజాన్ని బ్రతికిస్తూ తాను చితికిపోయే త్యాగమూర్తి. |
6) ఎండా వానా చలీ లెక్కచేయడు. | 6) ఇతడూ చలినీ వేడినీ వాననూ లెక్క చేయడు. |
ఇ) రైతులకు గల ఐదు సమస్యలను రాయండి.
జవాబు.
రైతులకు గల 5 సమస్యలు :
- అతివృష్టి, అనావృష్టి సమస్య.
- మేలిమి విత్తనాలూ, ఎరువులు అందుబాటులో ఉండకపోవడం.
- పంట రుణాల భారం.
- ఉత్పత్తులు నిలువ ఉంచుకునే మేలిమి సౌకర్యాలు లేకపోవడం.
- కిట్టుబాటు ధరలు లభించకపోవడం.
ఈ) “రైతు ప్రకృతితోని మమైకమై ఉంటాడు” దీనిని సమర్థించండి.
జవాబు.
- రైతుకు ఎండా వానా చలీ ప్రాకృతిక నేస్తాలు.
- రైతు చీకటితో సహవాసం చేస్తాడు.
- కటిక నేలపై పరుంటాడు.
- బురద నేలలో పొదరిళ్లలో నివసిస్తాడు.
- పశువులే రైతు నెచ్చెలులు.
- కర్రా, కంబళీ అతడి సిరిసంపదలు.
కనుక రైతు బ్రతుకంతా ప్రకృతితో మమైకమై ఉంటుంది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) “రైతు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది” సమర్థిస్తూ రాయండి.
జవాబు.
భారతదేశం వ్యావసాయిక దేశం. ఇప్పటికీ 70 శాతం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే రైతును దేశానికి ‘వెన్నెముక’ అన్నారు. వెన్నెముక చెదిరిపోతే ఏ పనీ సరిగా చెయ్యలేము. అలాగే రైతు స్థితిగతులు బాగుండకపోతే సమాజమూ ఒడిదుడుకులకు గురి అవుతుంది.
రైతు సంతోషంగా ఉత్సాహంగా ఉంటే మరిన్ని పంటలు పండిస్తాడు. భూమి తల్లి ఒడిని బంగారం చేస్తాడు. తద్వారా దేశంలో ఆహార సమస్య ఉండదు. గ్రామాలలోని చేతి వృత్తుల వారికీ చేతినిండా పని దొరుకుతుంది. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. అందువల్ల ధరలు అందుబాటులోకి వస్తాయి. పేదవారికీ పౌష్టిక ఆహారం లభిస్తుంది. ఎగుమతులు పెరుగుతాయి.
దిగుమతులు తగ్గుతాయి. అందువల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయి, దేశ ఆర్థిక పరిస్థితి సుసంపన్నం అవుతుంది. గ్రామసీమలు పాడి పంటలతో తులతూగితే వలసలు తగ్గుతాయి. పట్టణ సమస్యలు నివారణ అవుతాయి. అందువల్ల రైతు సంతోషంగా ఉంటే సమాజం మొత్తం బాగుంటుంది.
రైతు సంతోషంగా ఉన్నాడంటే అతివృష్టి, అనావృష్టి లేవు అని అర్థం. ప్రభుత్వ సహకార విధానం మేలుగా ఉంది అని అర్థం. అందువల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.
IV. సృజనాత్మకత / ప్రశంస:
1. కింది వానిలో ఒకదానికి జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) పాఠం ఆధారంగా రైతు ఆత్మకథను రాయండి.
జవాబు.
నేనొక రైతును. భారతదేశ వ్యవస్థకు వెన్నెముకను. పిల్లలారా ! నా గురించి కొన్ని విషయాలు చెప్తాను వినండి.
మానవ జీవన పరిణామ క్రమంలో వ్యవసాయం కనుగొనడంతోనే ప్రగతి ప్రారంభమైంది. అందుకే నా పాత్ర సమాజాభివృద్ధిలో ఎంతో కీలకం. ఒకప్పుడు మన గ్రామసీమలు పాడిపంటలతో తులతూగాయి. అందరూ నన్ను గౌరవించి, ఆదరించేవారు. మమ్మల్ని ఆధారంగా చేసుకుని అనేక వృత్తులవారు మా సోదరులు ఉపాధి సంపాదించుకుని సంతోషించేవారు. గ్రామసీమలు ఆ కాలంలో సిరిసంపదలతో తులతూగేవి. ఆ కాలం గురించి పిల్లలూ ! మీకు తెలియదు. ఎక్కడో ఎప్పుడో చదివి ఉంటారు.
ఇప్పుడు మీకు నేల అంటే గిట్టదు. బురద పనికిరాదు. నేలపై నడవడం అంటే నామోషీ, అరక పట్టి దున్నడం చిన్నతనం. పశువులు కాయడం నామర్దా మరి ఇవి అన్నీ మేము చేయకుండా మీ ఒంటిపైకి దుస్తులు, మీకు తిండికి ఆహారం ఎలా వస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా ? మీరు ఆలోచించరు. అందుకే మా బ్రతుకు దుర్భరం అయింది.
మాకు సంపాదన సరిగా లేదు. వాతావరణం అనుకూలించదు. ఋణాలూ, విత్తనాలూ, ఎరువులూ సకాలానికి దొరకవు. అధవా ఎలాగోలా పండించినా సరియైన ధర రాదు. ఇంక మాకు పేదరికం కాక ఇంకేమిటి ? మీ అందరికీ అన్నం పెట్టే మాకు అన్నం దొరకదు. మా స్థితి ఆశ్చర్యం కదూ ! పిల్లలూ ! మీరు ఎదగాలి. మీరు పెద్దలై పరిస్థితులలో మార్పు తేవాలి. మా గురించి కొంచెం ఆలోచించాలి. మీపై గంపెడంత ఆశతో మేం – ప్రధానంగా రైతులం – జీవించలేక జీవిస్తున్నాం.
(లేదా)
ఆ) అందరికి అన్నం పెట్టే రైతు కృషిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి.
జవాబు.
రైతును అభినందిస్తూ అభినందన పత్రం :
రైతు దేశానికి వెన్నెముక
జై జవాన్ – జై కిసాన్ !
రైతు దేవోభవ !
శ్రమ చేసే ఓ రైతన్నా !
అందుకో మా వందనం. నీ కృషి ఫలమే ఈ సమాజ జీవనం. నీవు శ్రమిస్తేనే మా కడుపులు నిండేది. నీ కష్ట ఫలితమే దేశ సౌభాగ్యం. ఎండా వానా చలీ ఋతువు ఏదైతేనేం – అన్నీ నీ కృషీవలత్వానికి చిహ్నాలే ! మూడు కాలాల నీ శ్రమ ముక్కారు పంటలు. నీవు ఒక్క కాలం శ్రమించకుండా విశ్రమిస్తే మా ప్రగతి రథ చక్రాలు ఆగిపోతాయి- అందుకు మేమంతా నీకు ఋణపడి ఉన్నాం.
రైతన్నా ! నీవే సమాజ భాగ్య విధాతవు.
రైతన్నా ! నీవే త్యాగమూర్తివి. ఋషీశ్వరుడవు. తపోధనుడవు.
జయజయహెూ రైతన్నా !
కృషియే నీ ఆయుధం – అందుకో మా వందనం.
V. పదజాల వినియోగం:
1. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
అ) హలం : __________
జవాబు.
హలం పట్టిన రైతు బంగారం పండిస్తాడు.
ఆ) సైరికులు : __________
జవాబు.
దేశానికి సైరికులు వెన్నెముక వంటివారు.
2. కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి జతగా రాయండి.
జవాబు.
ప్రకృతి – వికృతి
1. రాత్రి – రాతిరి
2. గర్వము – గరువము
3. బ్రహ్మ – బొమ్మ
4. పశువు – పసరము, పసువు
5. శుచి – చిచ్చు
6. చంద్రుడు – చందురుడు
3. కింది వాక్యాలలోని ఒకే అర్థం గల మాటలను గుర్తించి రాయండి.
అ)మౌనంగా ఉన్నంత మాత్రాన మునికాలేదు. తాపసికి దీక్ష ఎక్కువ. (__________; __________)
జవాబు.
ముని – తాపసి
ఆ) వానరులు రాళ్ళు తీసుకొని రాగా, ఆ శిలలతో నలుడు సముద్రంపై వారధిని నిర్మించాడు. (__________; __________)
జవాబు.
రాళ్ళు – శిలలు
ఇ) మాపువేళ పక్షులు గూటికి చేరుతాయి. అట్లే సాయంకాలం ఆవులమందలు ఇళ్ళకు చేరుతాయి. (__________; __________)
జవాబు.
మాపువేళ – సాయంకాలం.
VI. భాషను గురించి తెలుసుకుందాం:
1. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) తాపసేంద్ర = __________ + __________ = __________
జవాబు.
= తాపస + ఇంద్ర – గుణసంధి
ఆ) పరమాన్నము = __________ + __________ = __________
జవాబు.
= పరమ + అన్నము – సవర్ణదీర్ఘ సంధి
ఇ) కేలెత్తి = __________ + __________ = __________
జవాబు.
కేలు + ఎత్తి – ఉత్వసంధి
ఈ) గాఢాంధకారము = __________ + __________ = __________
జవాబు.
= గాఢ + అంధకారము · సవర్ణదీర్ఘ సంధి
ఉ) కొంపంత = __________ + __________ = __________
జవాబు.
= కొంప + అంత – అత్వసంధి.
2. కింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి. దానిని గురించి వివరించండి.
అ) రైతు మునివలె తెల్లవారు జామునే లేస్తాడు.
జవాబు.
‘వలె’ అని రైతును మునితో పోల్చారు కనుక ఉపమాలంకారం. రైతు ఉపమేయం. ముని ఉపమేయం.
ఆ.) వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా ! అన్నట్లు ఉన్నది.
జవాబు.
“పట్టినట్లుందా !” అని ఊహించారు. కనుక ఇది ఉత్ప్రేక్షాలంకారం. వంగిన చెట్టు అనేది ఉపమేయమూ గొడుగు పట్టినట్లుండడం ఉపమానమూ.
ఇ) అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు ?
జవాబు.
ఈ ఉదాహరణలో “క్క” అన్న అక్షరం మరల మరల వచ్చింది. ఒకే అక్షరం అలా మళ్లీ వస్తే అది వృత్త్యనుప్రాస అలంకారం.
ఉత్పలమాల :
ఛందస్సులో గణవిభజన తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.
జవాబు.
ఉత్పలమాల లక్షణాలు : (వృత్త పద్యం)
- పద్యంలో 4 పాదాలుంటాయి.
- ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, ‘లగ’ (వ) అనే గణాలుంటాయి.
- 10వ అక్షరం యతి స్థానం.
- ప్రాస నియమం ఉంటుంది.
- పాదంలో 20 అక్షరాలుంటాయి.
ఒక ఉదాహరణ పరిశీలిద్దాం.
చంపకమాల :
ఈ క్రింది పద్య పాదాలను పరిశీలించండి.
చంపకమాల లక్షణాలు : (వృత్త పద్యం)
- ఇందులో 4 పాదాలుంటాయి.
- న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు (21 అక్షరాలు) ఉంటాయి.
- ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
- ప్రాసనియమం ఉంటుంది.
3. కింది పద్యపాదాలకు గణ విభజన చేసి ఏ పద్యపాదాలో గుర్తించి రాయండి.
అ) తనకు ఫలంబులేదని యెదం దలపోయడు కీర్తిగోరు నా
ఇది చంపకమాల వృత్త పాదం.
ప్రాసాక్షరం = న
యతిస్థానం = త – ద
ఆ) ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
ఇది ఉత్పలమాల వృత్త పాదం..
ప్రాసాక్షరం = ‘క’
యతిస్థానం = ఆ – ఆ
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:
ప్రశ్న 1.
ప్రసార మాధ్యమాల్లో (టి.వి./రేడియో) వచ్చే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను చూడండి. వాటి వివరాలను, వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి నివేదిక రాయండి.
జవాబు.
ఈ టి.వీ. : ఉదయం 6.30 గంటలకు ‘అన్నదాత’
డి.డి. యాదగిరి : ఉదయం 6.00 గంటలకు ‘రైతునేస్తం’
ఆల్ ఇండియా రేడియో – హైదరాబాద్ : సాయంత్రం 7.00 గంటలకు ‘పాడి పంటలు’ అనే కార్యక్రమాలు వస్తాయి. ఈ కార్యక్రమాలలో రైతులకు ఉపయోగపడే అనేక విషయాలను గురించి చెబుతారు.
(ఈ విధంగా విద్యార్థులు మరికొన్ని కార్యక్రమాల వివరాలు సేకరించగలరు.)
TS 8th Class Telugu 11th Lesson Important Questions కాపుబిడ్డ
II. స్వీయరచన:
అ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)
ప్రశ్న 1.
“రైతే దేశానికి వెన్నెముక” ఎందుకో వివరించండి.
జవాబు.
భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. ఏ ప్రాణికైనా బతకటానికి ఆహారం అవసరం. అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారు రైతులు. వ్యవసాయంపై ఆధారపడ్డ దేశాలకు పల్లెలే పట్టుకొమ్మలు. చక్కని పాడి పంటలతో అలరారే పల్లెలు ప్రకృతికి ప్రతిరూపాలు. రైతు విద్యావంతుడు కానప్పటికి సంస్కారవంతుడు. తానూ, తనతో పాటు అందరూ అనే భావంతో జీవిస్తాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా తోటి వారి కష్టంలో పాలు పంచుకోవడానికి ముందుంటాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు లేక పోయినా ముఖంలో దిగులు కనబడనీయడు.
‘హలం’ అంటే నాగలి. నాగలితో భూమిని సాగుచేసి, జీవనం సాగించే రైతే హాలికుడు. సాత్విక భావాలతో “బ్రతుకు బ్రతికించు” అన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు రైతు. పాడిపంటలతో నేలతల్లికి, పశువులకు, ప్రకృతికి సేవలు చేస్తూ ఆశావాద దృక్పథంతో జీవిస్తాడు.
రైతులు మనకు అన్నదాతలు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికినా ధైర్యంతో కష్టపడి రైతు పంటలు పండిస్తాడు. రాత్రింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమించే రైతు కష్టాన్ని చూసే “జై జవాన్, జై కిసాన్” అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి. ఇటువంటి రైతే లేకపోతే మన జీవితాలే ఊహించలేం. అందుకే “రైతే దేశానికి వెన్నెముక” అన్న సత్యాన్ని మరువకూడదు.
III. సృజనాత్మకత:
ప్రశ్న 1.
మీరు చూసిన విజ్ఞాన ప్రదేశాన్ని గూర్చి మీ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
నేను చూసిన విజ్ఞాన ప్రదేశం గోల్కొండ కోట
గొల్లలు తమ మందల్ని మేపుకోవటం వల్ల గోలకొండకి మొదట్లో గొల్లకొండనే పేరుండేది. బహుమనీ సుల్తానుల కొలువులోని సుల్తాన్ కులీకుతుబ్షా 1518లో గోల్కొండను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. 1687లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించాడు.
ఈ గోల్కొండ కోట హైదరాబాద్ నగర సమీపంలో నిర్మించబడింది. భారతదేశంలోని అజేయ దుర్గాలలో గోల్కొండ కోట ఒకటిగా ప్రసిద్ధి పొందింది. కోట గోడ చుట్టూ లోతైన కందకం కూడా నిర్మించబడింది. ఈ కోట సుమారు 120 మీ. ఎత్తు గల కొండపై నిర్మించబడింది. మహాభక్తుడైన రామదాసు ఈ కోటలోని చెరలో బంధించబడ్డాడు. మహాద్వారం, నుండి ఒక చిన్న గుహలో చేసిన శబ్దాలు 128 మీటర్ల దూరంలోని సభాభవనంలో వినబడేటట్లుగా నిర్మాణం చేయబడింది.
గోల్కొండ కోట ఒకప్పుడు సర్వైశ్వర్య సంపన్నమైందని చరిత్ర చెబుతున్నది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం ఇక్కడ లభింఛినదేనని చాలామంది నమ్ముతారు.
ఇలా ఎన్నో విజ్ఞానదాయకమైన విశేషాలతో కూడిన ప్రదేశం గోల్కొండ కోట, తప్పక ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రాంతం. చెరసాల ప్రాంతం చూసినపుడు రామదాసు ఎన్ని కష్టాలు పడ్డాడో కదా అని బాధ కల్గింది. ఒకచోట ఉండి శబ్దం చేస్తే మరోచోట వినబడే విధానం ద్వారా శత్రువులను పసిగట్టే రక్షణ వ్యవస్థ పటిష్టం చేసే నిర్మాణ కౌశలం తెలుస్తున్నది. కోట నిర్మాణం కూడా ఎంతో బాగుంది.
ఇట్లు,
జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు,
రంగాపురం, రంగారెడ్డి జిల్లా.
IV. భాషాంశాలు:
పదజాలం:
పర్యాయపదాలు:
ప్రశ్న 1.
సైరికుడు = _________________
జవాబు.
రైతు, కర్షకుడు, కృషీవలుడు
ప్రశ్న 2.
మంచు = _________________
జవాబు.
హిమం, తుహినం, నీహారం
ప్రశ్న 3.
శత్రువు = _________________
జవాబు.
వైరి, విరోధి, పగతుడు
ప్రశ్న 4.
అంధకారం = _________________
జవాబు.
చీకటి, తమస్సు, ధ్వాంతము
ప్రశ్న 5.
సర్పము = _________________
జవాబు.
పాము, భుజంగము
ప్రశ్న 6.
తాపసి = _________________
జవాబు.
తపస్వి, తపసి, యోగి
ప్రశ్న 7.
మైత్రి = _________________
జవాబు.
స్నేహం, చెలిమి, సోపతి
ప్రశ్న 8.
వాన = _________________
జవాబు.
వర్షం, వృష్టి
ప్రశ్న 9.
వేసవి = _________________
జవాబు.
వేసంగి, గ్రీష్మము, ఎండాకాలం
వ్యుత్పత్త్యర్థాలు:
ప్రశ్న 1.
సైరికుడు = _________________
జవాబు.
సీరముతో నేలను దున్నువాడు (రైతు)
ప్రశ్న 2.
వేత్త = _________________
జవాబు.
బాగా తెలిసినవాడు (జ్ఞాని)
ప్రశ్న 3.
మౌని = _________________
జవాబు.
మౌనముగా ఉండువాడు (తపసి)
ప్రశ్న 4.
మిత్రుడు = _________________
జవాబు.
అన్ని ప్రాణులయందు సమభావన కలవాడు (మిత్రుడు)
నానార్థాలు:
ప్రశ్న 1.
చీకటి = _________________
జవాబు.
అంధకారం, దుఃఖం, రాత్రి
ప్రశ్న 2.
దిక్కు = _________________
జవాబు.
దిశ వైపు, శరణం
ప్రశ్న 3.
మిత్రుడు = _________________
జవాబు.
సూర్యుడు, స్నేహితుడు
ప్రశ్న 4.
సుధ = _________________
జవాబు.
అమృతం, సున్నం, పాలు
ప్రకృతి – వికృతులు:
ప్రకృతి – వికృతి
1. రాత్రి – రాతిరి
2. పశువు – పసువు, పసరం
3. గౌరవం – గారవం
4. అడవి – అటవి
5. ఆహారం – ఓగిరం
వ్యాకరణాంశాలు:
సంధులు:
1. సవర్ణదీర్ఘ సంధి సూత్రం :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది.
ఉదా : సంయమింద్ర = సంయమి + ఇంద్ర
గాఢాంధకారం = గాఢ + అంధకారం
వ్యాఘ్రాది = వ్యాఘ్ర + ఆది
ఉత్తమాహారం = ఉత్తమ + ఆహారం
పరమాన్నము = పరమ + అన్నము
వజ్రాయుధం = వజ్ర + ఆయుధం
2. గుణసంధి సూత్రం :
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
ఉదా : కులేంద్ర = కుల + ఇంద్ర
తాపసేంద్ర = తాపస + ఇంద్ర
3. ఉత్వసంధి సూత్రం :
ఉత్తునకు అచ్చుపరమగునపుడు సంధియగు.
ఉదా : శాంతులెవరు = శాంతులు + ఎవరు
వేత్తలెవరు = వేత్తలు + ఎవరు
చేతులెత్తి = చేతులు + ఎత్తి
కన్నెత్తి = కన్ను+ ఎత్తి
పశువులగును = పశువులు + అగును
4. అత్వసంధి సూత్రం :
అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా : ఇంతైన = ఇంత + ఐన
కొండంత = కొండ + అంత
5. ఇత్వసంధి సూత్రం :
ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పింగా వస్తుంది.
ఉదా : ఎక్కడయినా = ఎక్కడ + అయినా
6. గసడదవాదేశ సంధి సూత్రం :
ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. ఉదా : నందన వనములుగాగ = నందన వనములు + కాగ
దాని జూడవు = దాని + చూడవు
సమాసాలు:
సమాస పదం |
విగ్రహవాక్యం |
సమాస నామం |
1. కష్టసుఖములు | కష్టమును, సుఖమును | ద్వంద్వ సమాసం |
2. శత్రుమిత్రులు | శత్రువును, మిత్రుడును | ద్వంద్వ సమాసం |
3. సర్పవృశ్చికములు | సర్పమును, వృశ్చికమును | ద్వంద్వ సమాసం |
4. తాపసేంద్రుడు | తాపసుల యందు శ్రేష్ఠుడు | సప్తమీ తత్పురుష సమాసం |
5. పెనుగాలి | పెనుదైన గాలి | విశేషణ పూర్వపద కర్మధారయం |
6. మండువేసవి | మండుదైన వేసవి | విశేషణ పూర్వపద కర్మధారయం |
7. మితభాషితం | మితమైన భాషితం | విశేషణ పూర్వపద కర్మధారయం |
8. దివ్యమూర్తి | దివ్యమైన మూర్తి | విశేషణ పూర్వపద కర్మధారయం |
9. ఎత్తుమేడలు | ఎత్తువైన మేడలు | విశేషణ పూర్వపద కర్మధారయం |
10. ఉత్తమాహారం | ఉత్తమైన ఆహారం | విశేషణ పూర్వపద కర్మధారయం |
11. పరమాన్నము | గొప్పదైన అన్నం | విశేషణ పూర్వపద కర్మధారయం |
12. గులకశిల | గులకదైన శిల | విశేషణ పూర్వపద కర్మధారయం |
13. కటిక చీకటి | కటికదైన చీకటి | విశేషణ పూర్వపద కర్మధారయం |
14. పట్టుబట్ట | పట్టుదైన బట్టలు | విశేషణ పూర్వపద కర్మధారయం. |
ఇది ఏ వాక్యం ?
ప్రశ్న 1.
నేలను దున్నే సాధువులెవరు ?
జవాబు.
ప్రశ్నార్థక వాక్యం.
ప్రశ్న 2.
రైతు అందరికీ అన్నం పెడతాడు.
జవాబు.
సామర్థ్యార్థక వాక్యం.
పద్యాలు – ప్రతిపదార్థాలు- భావాలు:
I.
1వ పద్యం :
సీ॥ మండువేసవియెండ, మంటలోఁగ్రాగుచు
బూనిన పనిసేయు, మౌనులెవరు?
వానలో నానుచు, వణకుచు హలమూని
చలియందు దున్నెడి సాధులెవరు?
తాళ్ళలో నడవిలో రాతిరింబవలును
తడబాటు లేనట్టి తపసులెవరు ?
తలక్రింద చేయిడి గులకశిలల పైన
వెత లేక నొరిగిన వేత్తలెవరు ?
గీ॥ కష్ట సుఖముల నొకరీతి గడుపువారు
శత్రుమిత్రుల సమముగా సైచువారు
సైరికులుదప్ప నంతటి శాంతులెవరు ?
కాన చేమోడ్చి వారి నే గౌరవింతు.
ప్రతిపదార్థం:
మండు వేసవి + ఎండన్ = నడివేసవి కాలపుటెండలో
మంటలోన్ = మాడ్చే ఎండవేడిలో
గుచున్ పూ = కాలిపోతూ కూడా
పూనిన = తలపెట్టిన
పని + చేయు = పని పూర్తిచేసే
మౌనులు + ఎవరు? = మునులు ఎవరు ?
వానలో = జడివానలో
నానుచు = తడిసి ముద్ద అవుతూ
చలియందున్ = చలిలోనూ
వణకుచు = వణుకుతున్నప్పటికీ
హలము + ఊని = హలం పట్టి
దున్నెడి = దున్నే
సాధులు + ఎవరు = సాధువులెవరు ?
తాళ్లలోన్ = రాళ్లనేలలోనూ
అడవిలోన్ = అడవిలోనూ
రాతిరిన్ + పవలును = రాత్రింబవళ్లు
తడబాటు లేనట్టి = తడబడిపోని
తపసులు + ఎవరు? = తాపసులు ఎవరు ?
గులక శిలల పైన = గులకరాళ్లపై సైతం
తలక్రింద చేయి + ఇడి = నిశ్చలంగా తలక్రింద దిండుగా చేయి పెట్టుకొని
వెతలేకన్ = ఏ బాధా లేకుండా
ఒరిగిన = పండుకున్న
వేత్తలు + ఎవరు ? = మహా జ్ఞానులు ఎవరు ?
కష్టసుఖములన్ = కష్టసుఖాలలో
ఒక రీతిన్ = ఒకే విధంగా
గడపువారు = గడిపేవారూ
శత్రుమిత్రుల = శత్రులనూ, మిత్రులనూ
సమముగా = ఒకే రీతిగా
సైచువారు = సహించేవారూ
సైరికులు + తప్ప = రైతులు తప్ప
అంతటి = అంత గొప్ప
శాంతులు + ఎవరు = శాంతి దూతలెవరు ?
కాన = అందువల్ల
చేయి + మోడ్చి = చేతులు ముడిచి
వారిన్ = ఆ రైతులను
నేన్ = నేను
గౌరవింతున్ = నమస్కరిస్తాను.
భావం :
మండు వేసవి ఎండలో మాడుతూ పనిచేసే ముని రైతు. వానకు తడుస్తూ, చలికి వడవడ వణుకుతూ దున్నే సాధువు. ఎన్ని కష్టాలు తరిమినా చింతింపక రాతినేలపై తలక్రింద దిండుగా చేయి ఉంచుకుని నిశ్చింతగా గడిపే మహాజ్ఞాని రైతు. కష్టాలకు కుంగడు, సుఖాలకు పొంగడు. శత్రువులనూ, మిత్రులనూ సమంగా ఆదరిస్తాడు. అంతటి శాంతం రైతుకు తప్ప ఎవరికుంటుంది ? అటువంటి రైతుకు నేను నమస్కరిస్తాను.
2వ పద్యం :
సీ॥ కార్చిచ్చులోబడి కంటకమ్ముల ద్రొక్కి
వడగండ్ల దెబ్బల వడుదువీవు
పెనుగాలి చే దుమ్ము కనులందుఁబడుచుండ
నుఱుము మెఱుములలో నుందువీవు
మంచుపైఁబడుచుండ మాపుశీతంబులో
పచ్చికనేలపై పండుదీవు
కటికచీకటి గప్పి యెటుదారిగానక
నాఁకలి డప్పిచే నడలు దీవు
గీ॥ ఇన్నియిడుముల గుడిచి నీ విల్లుజేర
నాలుపిల్లలు కూటికై యంగలార్చ
చలనమింతైన లేని యో సంయమీంద్ర
కర్షకా ! నిన్ను చేమోడ్చి గౌరవింతు
ప్రతిపదార్థం:
కర్షకా ! = ఓ కర్షకుడా !
కార్చిచ్చులోన్ + పడి = వేడిమంటలలో కష్టించి
కంటకమ్ములన్ + త్రొక్కి = ముళ్లకంపలలో నడచి
వడగండ్ల దెబ్బలు = వడగళ్ల దెబ్బలు
పడుదువు + ఈవు = నీవు తింటూ ఉంటావు
పెనుగాలిచే = పెద్ద గాలికి
దుమ్ము = దుమ్ము ధూళీ
కనులందున్ = కళ్లల్లో
పడుచు + ఉండన్ = పడుతుండగా
ఉఱుము మెఱుములలో = ఉరుములూ, మెరుపులతో
ఈవు + ఉందువు = నీవు సహజీవనం చేస్తూంటావు.
మంచు = మంచు
పైన్ = పైన
పడుచుండన్ = పడుతుండగా
మాపు శీతంబుల్ = సాయంకాలపు చలిలో
పచ్చిక నేలపై = పచ్చిక బయళ్లలో
ఈవు = నీవు
పండుదు = పడుకుంటావు.
కటిక చీకటి = చిమ్మ చీకటి
కప్పి = కన్నులు మాయగా
ఎటు = ఎటువైపూ
దారి + కానకన్ = దారి కనిపించక
ఆకలి దప్పిచేన్ = ఆకలి దప్పులతో
ఈవు = నీవు
అడలుదువు = అలమటిస్తావు.
ఇన్ని + ఇడుములన్ = ఇన్ని కష్టాలూ
కుడిచి = అనుభవించి
నీవు = నీవు
ಇల్లు = ఇల్లు
చేరన్ = చేరగా
ఆలుపిల్లలు = భార్యా పిల్లల
కూటికి + ఐ = అన్నానికి
అంగలార్బన్ = అలమటిస్తుంటే
చలనము + ఇంత + ఐన లేని = ఇసుమంతైనా చలించని
ఓ సంయమి + ఇంద్ర! = ఓ ఋషి శ్రేష్ఠుడా!
చేమోడ్చి = చేయి ముడిచి
నిన్ను = నిన్ను
గౌరవింతున్ = అంజలిస్తాను.
భావం :
చలీ వానా ఎండా అన్నీ కష్టాలు నీవే ! కటిక చీకటీ నీదే ! ముళ్ల దారులూ నీవే ! నీవు ఎన్ని కష్టాలు పడి ఇల్లు చేరినా అక్కడా ఆలుబిడ్డలూ ఆకలితో అలమటిస్తూ ఉంటారు. ఈ కష్టాలు అన్నిటికీ నీవు చలించవు. నీవు ఋషి వంటివాడవయ్యా ! నీకు నమస్కరిస్తాను.
II.
3వ పద్యం :
సీ॥ ఎండల వేడికి నెత్తుమేడలు లేక
చెట్టుల నీడకుఁ జేరినావు
కొలది చినుకులకే కొంపంత తడియగా
పొదరిండ్ల బురదలో మెదలినావు
గడగడ వడకుచు గడ్డివాముల దూఱి
చలికాలమెట్టులో జరిపినావు
పుట్టలొల్కుల మిట్ట బట్టిమాపటివేళ
గాఢాంధకారము గడపినావు
గీ॥ సర్పవృశ్చిక వ్యాఘ్రాది జంతువులకు
నునికి పట్టగుచోట్లలో మునులభంగి
తిరిగి యేప్రొద్దు నుందువో దివ్యమూర్తి
కర్షకా ! చేతులెత్తి నే గౌరవింతు ॥
ప్రతిపదార్థం:
కర్షకా ! = ఓ కర్షకుడా !
ఎత్తుమేడలు = ఎత్తైన మేడలు
లేక = లేక
ఎండల వేడికిన్ = ఎండల వేడికి
చెట్టుల నీడకున్ = చెట్ల నీడలలోకి
చేరినావు = చేరావు
కొలది చినుకులకే = చిన్నపాటి వర్షానికే
కొంప + అంత = ఇల్లంతా
తడియగా = తడిసిపోతుండగా
పొదరు + ఇండ్లన్ = చిన్న పూరిపాకలలో
బురదలో = బురదలో
మెదలినావు = జీవిస్తున్నావు
గడగడ వడకుచున్ = గడగడా వణుకుతూ
గడ్డి వాములన్ = గడ్డి వాములలో
చలికాలము = చలికాలం
ఎట్టులు + ఓ = ఎలాగో
జరిపినావు = గడిపేశావు.
మాపటివేళన్ = సాయంకాలాలలో
పుట్టలొల్కుల మిట్టన్ + పట్టి = పుట్టలూ మిట్టలూ పట్టి
గాఢ + అంధకారము = దట్టమైన చీకటులలో
గడపినావు = గడిపావు
సర్ప = పాములూ
వృశ్చిక = తేళ్లూ
వ్యాఘ్ర + ఆది = పులి మొదలైన
జంతువులకున్ = జంతువులకు
ఉనికి పట్టు + అగుచోట్లలో = స్థావరమైన చోటులలో
మునుల భంగి = మునుల రీతిగా
తిరిగి = తిరిగి
ఏ ప్రొద్దున + ఉందువు = ఎక్కడో ఏ సమయాల్లోనో ఉంటావు
ఓ దివ్యమూర్తి ! = ఓ దేవతామూర్తీ !
చేతులు + ఎత్తి = చేతులు జోడించి
నేన్ = నేను
గౌరవింతున్ = నీకు నమస్కరిస్తాను.
భావం :
ఓ కర్షకా ! నీకు ఎత్తైన మేడలు లేవు. ఎండల బాధలో నీవు చెట్ల కింద గడుపుతావు. కొద్దిపాటి వర్షానికే నీ యిల్లు తడిసిపోయి, బురదమయం అవుతుంది. చలికాలం అతి చలి బాధ తట్టుకుంటూ చీకటులలో పుట్టమిట్టలు పట్టి తిరుగుతావు. సర్పాలూ, తేళ్ళూ, పులులూ తిరిగే భయంకర ప్రదేశాలలో మునిలాగా తిరుగుతూంటావు. ఎప్పుడు ఎక్కడ ఉంటావో కదా ! ఓ దైవ స్వరూపమా ! నీకు నమస్సులు.
4వ పద్యం :
సీ॥ పనియున్న లేకున్న బ్రాహ్మీముహూర్తాన
తప్పక లేచెడి తాపసేంద్ర!
తెలిసియో తెలియకో దినమున కొకసారి
తానంబు చేసెడి మౌనిచంద్ర !
ఉండియో లేకనో యుత్తమాహారంబు
చక్కగా గుడిచెడి సంయమీంద్ర
వచ్చియో రాకనో వదరు బోతువుగాక
మితభాషితము సేయు యతికులేంద్ర.
గీ॥ కుటిలనటనము గర్వము కొంటెతనము
వన్నెచిన్నెలు లేని సద్వర్తనుడవు
ఈగియందనురాగివో యోగిచంద్ర !
కర్షకా ! చేతులెత్తి నే, గౌరవింతు.
ప్రతిపదార్థం:
కర్షకా ! = ఓ కర్షకుడా !
పని + ఉన్నన్ = పని ఉన్నా
లేక + ఉన్నన్ = లేకపోయినా
బ్రాహ్మీముహూర్తాన = తెల్లవారుజామునే
తప్పక = తప్పకుండా
లేచెడి = లేచెడి
తాపస + ఇంద్ర ! = మునీంద్రుడా !
తెలిసి + ఓ = తెలిసినా
తెలియక + ఓ = తెలియకున్నా
దినమునకు = రోజుకు
ఒకసారి = ఒక మారు
తానంబు = స్నానం
చేసెడి = చేసే
మౌనిచంద్ర ! = ముని శ్రేష్ఠుడా !
ఉండి + ఓ = ఉన్నా
లేక + ఓ = లేకున్నా
ఉత్తమ + ఆహారంబు = మేలైన ఆహారం
చక్కగా = చక్కగా
కుడిచెడి = తీసుకుంటున్న
సంయమి + ఇంద్ర != తాపస శ్రేష్ఠుడా !
వచ్చి + ఓ = భాష వచ్చినా
రాక + ఓ = రాకున్నా
వదరు బోతువు + కాక = ఊరకే వాగకుండా
మిత భాషితము + చేయు = అవసరమైనంతవరకే మాటలాడే
యతికుల + ఇంద్ర = సాధు శ్రేష్ఠుడా !
కుటిల నటనము = మాయగా నటించడం
గర్వము = అహంకారం
కొంటెతనము = వేళాకోళం
వన్నెచిన్నెలు = తళుకు బెళుకుల హంగామా
లేని = లేని
సత్ + వర్తనుడవు = మేలైన నడవడి కలవాడవు
ఈగి + అందు = దాన ధర్మాలలో
అనురాగివి = ఇష్టం కలవాడవు
ఓ యోగిచంద్ర = ఓ యోగి శ్రేష్ఠుడా !
చేతులు + ఎత్తి = చేతులెత్తి
నేన్ = నేను
గౌరవింతున్ = గౌరవిస్తాను
భావం :
ఓ కర్షకుడా ! నీకు పని ఉన్నా లేకున్నా సూర్యోదయానికి ముందే లేస్తావు. శుచీ శుభ్రతా పాటిస్తావు. ఉన్నా లేకున్నా మేలైన ఆహారం స్వీకరిస్తావు. అతిగా మాటలాడక మితంగా మాట్లాడుతావు. కుళ్ళూ, అహంకారం, వెక్కిరింపూ ఆడంబరాలూ ఏవీ నిన్ను చేరవు. నీవు సజ్జనుడవు. యోగి వంటివాడవు. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను.
5వ పద్యం :
సీ॥ పచ్చజొన్నగటక పరమాన్నమును గాగ
చల్లనీరే సుధాసారమగును
వడుకుడుపులు జరి పట్టుబట్టలు గాగ
కంబళే వజ్రంపు కవచమగును
వలపలి చేకఱ్ఱ వజ్రాయుధముగాగ
పరిజనమే నీకు పశువులగును
అందమౌపైరులే నందనములుగాగ
నేప్రొద్దుపంటనిక్షేపమగును.
గీ॥ ఇచ్చుచుండును నీశ్వరుఁడింద్ర పదవి
వచ్చుచుండును ప్రకృతి బల్వలపు చేత
దాని జూడవు కన్నెత్తి తాపసేంద్ర!
కర్షకా ! నిన్నుకేలెత్తి గౌరవింతు.
ప్రతిపదార్థం:
కర్షకా ! = ఓ రైతన్నా !
పచ్చజొన్న గటక = జొన్న సంకటియే
పరమ + అన్నమును + కాగ = నీకు పరమాన్నం
చల్లనీరు + ఏ = చల్లని మంచినీరే
సుధాసారము + అగును = అమృతం అవుతుంది
వడుకు + ఉడుపులు = చేతితో నేసిన వస్త్రాలే
జరి పట్టుబట్టలు + కాగ = నీకు జరీపట్టు వస్త్రాలు
కంబళి + ఏ = కంబళియే
వజ్రము + కవచము + అగును = వజ్రాల తొడుగు వంటిది
వలపలి చేయి + కఱ్ఱ = కుడిచేతిలోని కర్రయే
వజ్ర + ఆయుధము + కాగ = నీకు వజ్రాయుధం
నీకు = నీకు
పరిజనము + ఏ = నీ మిత్రులే
పశువులు + అగును = పశువులు
అందము + ఔ = అందమైన
పైరులు + ఏ = పంటలే
నందనములు + కాగన్ = స్వర్గంలోని వనాలు
ఏ ప్రొద్దు = ఎల్లప్పుడూ
పంట = నీ పైరు పంటలే
నిక్షేపము + అగును = నీకు పెన్నిధులు
ఈశ్వరుడు = ఆ దైవం
ఇంద్రపదవిన్ = నీకు ఇంద్ర పదవిని
ఇచ్చుచు + ఉండును = ఇస్తాడు.
ప్రకృతి = ప్రకృతి కాంత
బల్ + వలపు చేత = నీపై ప్రేమతో
వచ్చుచు + ఉండును = నీ దగ్గరకు వస్తుంది. కానీ
తాపస + ఇంద్ర = ముని శ్రేష్ఠుడా !
దానిన్ = ఆ ప్రకృతి కాంతను
కన్ను + ఎత్తి చూడవు = నీవు కన్నెత్తి చూడవు
కేలు + ఎత్తి = చేతులు జోడించి
నిన్ను = నీకు
గౌరవింతున్ = నమస్కరిస్తాను
భావం :
ఓ రైతన్నా ! జొన్న సంకటి నీకు పరమాన్నం చల్లటి నీరు అమృతం. చేనేత బట్టలు పట్టుబట్టలు. కంబళియే వజ్రాల కవచం. నీ చేతికర్రయే నీకు వజ్రాయుధం. పశువులే నీ స్నేహితులు. పైరుపంటలే నందనవనాలూ సిరి సంపదలూ. దైవం నీకు ఇంద్ర పదవి ఇచ్చినా, భూకాంత నిన్ను వలచివచ్చినా నీవు చలించవు. అందుకే నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
పాఠం ఉద్దేశం:
ఏ ప్రాణికైనా బతకటానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం. చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఏడాదిలోని మూడు కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి, రైతులను తీరికగా ఉండనీయవు. ఆరుగాలం కష్టించి పనిచేసినా హాయిగా బతకలేరు. దిన దిన గండం, అమాయకత్వం, అహింసాతత్త్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
ప్రక్రియ కావ్యం:
కవి వర్ణనాత్మకంగా చేసే కవిత్వం కావ్యం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. వర్ణనతో కూడినది కావ్యం. ప్రస్తుత పాఠ్యాంశం గంగుల శాయిరెడ్డి రచించిన ‘కాపుబిడ్డ’ కావ్యంలోని ‘కర్షక ప్రశంస’ అనే భాగంలోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం ఎరుగని శ్రమ ఇందులో వర్ణించబడ్డాయి.
కవి పరిచయం:
రచయిత : గంగుల శాయిరెడ్డి
జననం : 08-06-1890
మరణం : 04-09-1975
జన్మస్థలం : జనగామ జిల్లాలోని ‘జీడికల్లు’ గ్రామం.
రచనలు : ‘కాపుబిడ్డ’ కావ్యంతో పాటు ‘తెలుగుపలుకు’, ‘వర్షయోగము’, ‘మద్యపాన నిరోధము’. ఇంకా గణితరహస్యము, ఆరోగ్యరహస్యం అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి.
ప్రత్యేకతలు : శైలి సరళంగా, సులభంగా గ్రహించ గలిగినది. సహజకవిగా పేరు పొందిన ‘పోతన’ పట్ల ఆరాధనాభావం గల శాయిరెడ్డి, ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో, ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు.
ప్రవేశిక:
భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. గ్రామాలు పూర్వం కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి. అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నది. స్వయంగా హాలికుడే హాలికుల బాధలను ఏకరువు పెడితే ఆ ఆర్ద్రత ఎంతటి వారికైనా హృదయాన్ని కదిలిస్తుంది కదా ! ‘సత్కవుల్ హాలికులైన నేమి’ అని చెప్పిన పోతన వాక్యానికి ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ శాయిరెడ్డి. ఇక ఆ రైతుకవి రచనలోనికి ప్రవేశిద్దాం.
పాఠ్యభాగ సారాంశం:
మంటలు మండే ఎండకాలపు ఎండలలో మగ్గిపోతూ కూడా చేపట్టిన పని కొనసాగించే ఋషులెవరు ? వానలో నానుతు, చలిలో వణుకుతు నేలను దున్నే సాధువు లెవరు ? రాత్రనక, పగలనక, రాతి నేలల్లో, అడవుల్లో తడబడకుండ తిరిగే తాపసులెవరు ? ఎన్ని బాధలున్నా లెక్కచేయక, గులకరాతి నేలమీదనే తలకింద చేయి పెట్టుకొని విశ్రమించే విజ్ఞులెవరు ? కష్టసుఖాలను ఒకే విధంగా, శత్రు, మిత్రులను ఒకే మాదిరిగా సహించే శాంత స్వభావులెవరు ? రైతులుగాక ! అందుకే చేతులు జోడించి వారికి మొక్కి గౌరవిస్తాను.
ఓ కర్షకుడా ! మిక్కిలి వేడిమిని సహించి, ముండ్లమీద నడిచి, వడగండ్ల వాన పాలవుతావు. గాలి దుమ్ములు కమ్మినా, ఉరుములు మెరుపులతో ఉన్నా చలించవు. మంచుకురిసే రాత్రి వేళల్లో, చలిలో, పచ్చిక నేలమీదనే నిద్రపోతావు. ఎటూ దారి కానరాని కటిక చీకటి రాత్రులలో అప్పుడప్పుడు ఆకలిదప్పికలతోనే కాలం గడపవలసి వస్తుంది. ఇన్ని కష్టాలను భరించి నీవు ఇంటికి చేరినప్పుడు భార్య, పిల్లలు ఆకలితో అన్నానికై అంగలార్చగా యతీశ్వరుని వలె ఏ మాత్రమూ చలనం లేకుండా ఉండే నీకు చేతులు జోడించి నేను నమస్కరిస్తాను.
ఓరైతన్నా ! ఎత్తైన మేడలు లేని నీవు ఎండ వేడిమి నుండి కాపాడుకోవటానికి చెట్టు నీడకు చేరావు. కొద్దిపాటి వానకే కురిసే నీ ఇంటిని వదిలి బురదనిండిన గుబురుల్లోనే తలదాచుకుంటావు. చలిబారి నుండి తప్పించుకోవటానికి గడ్డివాములను ఆశ్రయిస్తావు. పనిమీదపడి కటికచీకటి రాత్రులందు కూడ పుట్టలు, మిట్టలపై సంచరిస్తుంటావు. పాములు, తేళ్ళు, పులుల వంటి క్రూర జంతువులకు నిలయమైన తావులలో మునులవలె ఎల్లవేళలా తిరుగాడే నీవు దివ్యమూర్తివే. అట్లాంటి నీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
హాలికూడా ! పని ఉన్నా, లేకున్నా నియమంగా తెల్లవారు జాము లేచే నీవు గొప్ప తాపసివే. తెలిసో తెలియకనో రోజుకొక్క సారైనా స్నానమాచరించే నీవు మునిశ్రేష్ఠునివే. ఉండో, లేకనో ఎల్లప్పుడూ సాత్వికాహారమే గ్రహించే నీవు ఋషీశ్వరునివే. తెలిసీ తెలియనితనంవల్ల తక్కువగా మాట్లాడే స్వభావం గల నీవు యతిరాజువే. కుటిల ప్రవర్తన, గర్వం, కొంటెపనులు, ఆడంబరాలు లేని మంచి నడవడి నీది.
నీవొక యోగివి. శ్రేష్ఠుడవు. దాన గుణంపై మక్కువ గలవాడవు. ఇన్ని సుగుణాలున్న నీకు నా వందనాలు. ఓ కృషీవలుడా ! నీకు పచ్చజొన్న గట్కేపరమాన్నం. పలుచనిచల్లనే అమృతం. చేతితో వడకిన నూలు బట్టలే పట్టు వస్త్రాలు. కప్పుకునే గొంగడే నీకు చెక్కుచెదరని కవచం. కుడి చేతిలోని ముల్లుగర్ర నీకు వజ్రాయుధం.
పశుసంపదే నీకు పరివారం. నీవు పెంపు చేసిన పంటచేనులే నందనవనాలు. పండించే పంటనే నిధి నిక్షేపాలు. ఓ మునిశ్రేష్ఠా ! ఈ విధంగా భగవంతుడు నీకు ఇంద్ర పదవిని ఇస్తున్నాడు. ప్రకృతి కాంతయే నిన్ను వలచి వచ్చినా ఆమెను నువ్వు కన్నెతైనా చూడక నీ వృత్తినే మిన్నగా భావిస్తావు. అందుకే నీకు చేతులెత్తి నమస్కరిస్తాను.
నేనివి చేయగలనా?