Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 10th Lesson సింగరేణి Textbook Questions and Answers.
TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి
బొమ్మను చూడండి – ఆలోచించి చెప్పండి: (TextBook Page No.97)
ప్రశ్నలు:
ప్రశ్న 1.
చిత్రంలో కనపడుతున్నవాళ్ళు ఏం పనులు చేస్తున్నారు ?
జవాబు.
బొగ్గు గనుల్లో బొగ్గు తట్టలను మోస్తున్నారు.
ప్రశ్న 2.
చిత్రంలో ఏయే వస్తువులు కనపడుతున్నాయి ?
జవాబు.
బొగ్గు మోస్తున్న కార్మికులు, బొగ్గు తట్టలు, తలకు లైటుతో టోపి, నడుముకు బ్యాటరీ కనక్షన్ బెల్టు, చేతిలో సేఫ్టీలైట్, పొట్టి నిక్కరుతో కార్మికులు.
ప్రశ్న 3.
చిత్రం దేనికి సంబంధించిందని మీరు అనుకొంటున్నారు ?
జవాబు.
చిత్రం బొగ్గుగనుల్లో కార్మికులకు సంబంధించినది.
ప్రశ్న 4.
తెలంగాణలో బొగ్గు గనులు ఏ ఏ జిల్లాలలో ఉన్నాయి ?
జవాబు.
ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్
ప్రశ్న 5.
నేల బొగ్గువల్ల ఉపయోగాలేవి ?
జవాబు.
విద్యుత్తు, తారు, సెంట్లు, ప్లాస్టిక్ వంటివి బొగ్గు నుండి తయారవుతాయి. అనేక పరిశ్రమలు బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తూ, పారిశ్రామికాభివృద్ధిని సాధిస్తున్నాయి.
ఆలోచించండి- చెప్పండి. (TextBook Page No.99)
ప్రశ్న 1.
“శ్రమజీవే జగతికి మూలం చెమటోడ్చక ….. జరుగదు కాలం” అన్న వాక్యాన్ని ఏవిధంగా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
శ్రమించి సాధించేవే సుఖాలను అందిస్తాయి. అయితే శ్రమించేవారంతా సుఖపడరు. శ్రామికులు చెమటోడ్చి సౌకర్యాలనందించే ఉత్పత్తులను పెంచుతారు. అది మిగిలిన జగత్తుకంతా ఆనందాన్ని ఇస్తుంది. ఏ దేశానికైనా అత్యంత ముఖ్యమైనది మానవ వనరులే. ఆ తర్వాతనే ప్రకృతి వనరులు. పరిశ్రమలు నడవాలంటే యంత్రాలతో సమానంగా కార్మికులు శ్రమ పడాలి. అప్పుడే ఈ ప్రపంచం సౌకర్యవంతంగా నడుస్తుంది. అందుకే శ్రమజీవే జగతికి మూలం. చెమటోడ్చకుండా కూర్చొని సౌకర్యాలు రావాలంటే కుదరదు అని అర్థం చేసుకున్నాను.
ప్రశ్న 2.
నేల బొగ్గును “నల్ల బంగారం” అని ఎందుకంటారు?
జవాబు.
అత్యంత శక్తినిచ్చే నేల బొగ్గు ఎంతో విలువైనది. గోదావరి నదీ పరివాహక ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది. రెండు వందల మిలియన్ సంవత్సరాలకు పూర్వం అడవులు తగలబడి భూమి మీదున్న అవశేషాలు క్రమక్రమంగా భూమిలోకి కూరుకుపోయాయి. వాటిమీద మట్టి, రాళ్ళు పడి లోపలికి కుదించబడి బొగ్గు పొరలుగా ఏర్పడ్డాయి. సింగరేణి ప్రాంతంలో భూమి లోపల ఆరు పొరల్లో శ్రేష్టమైన బొగ్గు నిక్షిప్తమై ఉంది. అట్ల ఏర్పడ్డ నేలబొగ్గును మనం తవ్వి తీస్తున్నాం. దాన్నే “నల్ల బంగారం” అంటున్నాం.
ప్రశ్న 3.
‘సహజ సంపదను వినియోగించుకునే విజ్ఞానం పైననే మానవ నాగరికత నిర్మించబడుతున్నది’ చర్చించండి.
జవాబు.
సహజ సంపదలైన నీరు, బొగ్గు, ముడి పదార్థాలు పరిశ్రమలు నడవడానికి ఉపయోగపడతాయి. పారి శ్రామికాభివృద్ధి సాధించిన సమాజాలే నాగరికతను పెంపొందించాయి. అత్యంత శక్తివంతమైన నేలబొగ్గును తవ్వి తీస్తే విజ్ఞానం మనకు ఉన్నది కనుకనే నేటి పోటీ ప్రపంచంలో నవ నాగరికత కలిగి అస్థిత్వాన్ని చాటుకున్నాము.
ఆలోచించండి- చెప్పండి: (TextBook Page No.101)
ప్రశ్న 1.
“దేశంలో మరే ఇతర బొగ్గు సంస్థకు లేని ప్రత్యేకత సింగరేణి గనులకు ఉన్నది” ఎందుకో చర్చించండి.
జవాబు.
దేశంలో మరే ఇతర బొగ్గు సంస్థలకు లేని ప్రత్యేకత సింగరేణి గనులకు ఉన్నది. 1841లో ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతవాసులు అక్కడ నేలలో బొగ్గు ఉన్నట్టు చూశారు. అది తెల్సిన భారత ప్రభుత్వ భూగర్భ పరిశోధన శాఖ పరిశోధనలు చేసి ఇది శ్రేష్టమైన బొగ్గు కాదని తవ్వకాలు చేయలేదు.
1871లో డాక్టర్ కింగ్ అనే భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు పరిసర ప్రాంతాల్లో భూమి లోపల ఆరు పొరల్లో శ్రేష్టమైన బొగ్గు నిక్షిప్తమై ఉన్నట్టు చెప్పాడు. 1886 లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థవారు భూగర్భ గనిని ప్రారంభించారు. దీని రవాణా కోసం డోర్నకల్ నుండి ఖాజీపేటకు రైల్వేలైను వేసి సింగరేణి కాలరీస్ అని పేరు పెట్టారు. ఇది దీని ప్రత్యేకత.
ప్రశ్న 2.
“బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు” అని ఎందుకన్నారు ?
జవాబు.
సింగరేణి ఏర్పడిన మొదటి రోజుల్లో యాజమాన్యం కార్మికులు పనిచేసే స్థలాల్లో రక్షణ గురించి శ్రద్ధ చూపేది కాదు. జీతాలు తక్కువ. బ్రతుకుదెరువుకు వచ్చే పల్లె ప్రజలు ప్రాణాలకు తెగించి పని చేయాలి. బొగ్గు గనుల్లో యంత్రాలకంటే శ్రామికులు చేయవల్సిన పనులే ముఖ్యమైనవి. ఉత్పత్తి ఆగకుండా మూడు బదిలీల్లో గడియారం ముళ్ళలాగా రాత్రింబవళ్ళు పనిచేస్తారు కాబట్టి “బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు”.
ఆలోచించండి – చెప్పండి: (TextBook Page No.102)
ప్రశ్న 1.
‘గడియారం ముండ్లవలె పనిచేస్తున్న కార్మికులు’ అన్న వాక్యాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
రాత్రింబవళ్ళు ఉత్పత్తి ఆగకుండా మూడు షిఫ్ట్లుగా పొద్దున ఏడు గంటలకు, పగలు మూడు గంటలకు, రాత్రి పదకొండు గంటలకు షిఫ్టులు మారుతూ పని చేస్తుంటారు. ఎండ, వాన ఋతువులతో పని లేకుండా కార్మికులు శక్తికి మించి పని చేస్తారు. గాలి వెలుతురు లేకున్నా ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం కొనసాగే ఉత్పత్తి ప్రక్రియలకు సారథులవంటివారు కార్మికులు అని నాకు అర్థమయ్యింది.
ప్రశ్న 2.
ప్రమాదాల అంచున నిలబడి పని చేయటం అంటే ఏమిటి ?
జవాబు.
గనుల్లో పనిచేసేవారికి తగినంత గాలి, వెలుతురు ఉండదు. అందువల్ల అనేక రకాల అనారోగ్యాలు ఏర్పడతాయి. గని లోపల ఎప్పుడూ ఏ మూల కూలి పడుతుందో, ప్రమాదం ఎక్కడి నుండి ఏర్పడుతుందో, చెప్పలేని పరిస్థితిలో మృత్యువుతో పోరాటం చేస్తూ ధైర్య సాహసాలతో పని చేస్తున్నారని, వారి ప్రాణాలను లెక్కచేయకుండా బొగ్గు ఉత్పత్తిని చేస్తున్నారని అర్థం.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.
ప్రశ్న 1.
సింగరేణి కార్మికులు కాయకష్టం చేసి బొగ్గు తీస్తున్నారు కదా ! కార్మికుల జీవితాల గురించి మీకేం అర్థమయిందో చెప్పండి.
జవాబు.
సింగరేణి కార్మికులు రాత్రింబవళ్ళు కాయకష్టం చేస్తూ, మృత్యువుతో పోరాడుతూ భూగర్భంలోని బొగ్గును మనకు అందిస్తున్నారు. అయితే ఈ కార్మికులంతా తెలంగాణ పల్లెల నుండి వెనుకబడిన వర్గాలకు, రైతు కూలీల కుటుంబాలకు చెందినవారే. నాడు గనుల్లో పని చేయడానికి బరువులు మోయటం, గుంజీలు తీయటం. పరుగుల పోటీలు పెట్టి చదువురాని ఎంతమందినో కార్మికులుగా తీసుకునేవారు. వీరు రాత్రింబవళ్ళు గడియారం ముళ్ళవలె మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. గాలి, వెలుతురు లేని భూమి పొరల్లో బొగ్గును తీసే పని ఎంతో సాహసంతో కూడుకున్నది.
ఈ బొగ్గు తీసే ప్రక్రియను ఒక కార్మిక సమూహం గొలుసువలె సమష్టిగా నిర్వహిస్తారు. సేఫ్టీ అధికారి, అండర్ మేనేజర్, సర్వేయర్, చైన్మెన్, ఓర్మెన్, సర్దార్, షార్ట్ఫర్, కోల్కట్టర్, టింబర్మెన్, లైన్మెన్, ట్రామర్, హాలర్, కోల్ఫిల్లర్, జనరల్ మద్దూరులు అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే బొగ్గు తీయడం సాధ్యమవుతుంది.
భూమి పొరల్లో రక్తమాంసాలు రంగరించి బొగ్గు కుప్పల్లో మసిబారుతూ మనకు వెలుతురునిచ్చే విద్యుత్తు, అనేక పరిశ్రమలు నడిచేందుకు ఇంధనం, సువాసనలు వెదజల్లే సెంట్లు, నాగరికతనే మార్చిన ప్లాస్టిక్ మొదలైనవి అందిస్తున్న వీరికి ఈ దేశం ఎంతో ఋణపడి ఉన్నది అని నాకు అర్థం అయ్యింది.
II. ధారాళంగా చదువడం – అర్ధం చేసుకొని ప్రతిస్పందించడం:
1. కింది గేయాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఇష్టదేవతకు దండం పెట్టి
గనిలోనికి నువు అడుగుపెట్టి
బళ్ళున బొగ్గు కూలుత ఉంటే
ప్రాణాలకు వెనుకాడక నువ్వు
రక్తమాంసాలు చెమటగ మార్చి
టబ్బుల్లోన బొగ్గు నింపుతవ్
జాతికి వెలుగులు అందిస్తుంటవు
“నల్లసూర్యుని”వై వెలుగొందుతవు.
అ) గేయం ఎవరిని గురించి తెలుపుతుంది ?
జవాబు.
బొగ్గు గనిలో కార్మికుని గురించి తెలుపుతున్నది.
ఆ) ఇష్టదేవతకు ఎందుకు దండం పెడతారు ?
జవాబు.
గనిలో ప్రమాదం జరగకుండా కాపాడమని ఇష్టదేవతకు దండం పెడతారు.
ఇ) కార్మికుడిని ‘నల్ల సూర్యుడు’ అని ఎందుకన్నారు ?
జవాబు.
బొగ్గుగనుల్లో మసి పూసుకొని శ్రమిస్తాడు కనుక.
ఈ) జాతికి వెలుగు అందించడమంటే ఏమిటి ?
జవాబు.
బొగ్గుతో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది.
ఉ) తెలంగాణలో బొగ్గుగనులు ఎక్కడున్నాయి ?
జవాబు.
సింగరేణి, మణుగూరు, గోదావరి ఖని, బెల్లంపల్లి, భూపాలపల్లి, మందమర్రిలలో బొగ్గుగనులు ఉన్నాయి.
2. కింది పేరాను చదువండి. అయిదు ప్రశ్నలను తయారుచేయండి.
తెలంగాణ ‘బట్టల అద్దకం’ విషయంలో అనాదిగా ప్రాముఖ్యత వహించిన ప్రదేశం. ఒకప్పుడు ఆ పరిశ్రమ ఉన్నత దశలో ఉండేది. కాని దేశంలో వచ్చిన ఆర్థిక చిక్కులు ఈ పరిశ్రమను కష్టనష్టాలకు గురి చేశాయి. విదేశాలలో యంత్రాలపై తయారైన బట్టలకు అలవాటుపడిన ఈనాటి వారికి మన చేతి పనుల వలన తయారయ్యే సుందర వస్త్రాల గురించి నేటికైనా కనువిప్పు కలిగింది.
జవాబు.
ప్రశ్నలు :
అ) పై పేరాలో ఏ ప్రదేశాన్ని, ఏ పరిశ్రమ గురించి ప్రస్తావించారు ?
ఆ) ఒకప్పుడు తెలంగాణలో ఉన్నత దశలో ఉన్న పరిశ్రమ ఏది ?
ఇ) అద్దకం పరిశ్రమను కష్టనష్టాలపాలు చేసిన అంశాలేమిటి ?
ఈ) ఏది అతిశయోక్తి కాదు ?
ఉ) పై పేరాకు శీర్షికను పెట్టండి.
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) సహజ సంపదలను వినియోగించుకునే విజ్ఞానం పైన మానవ నాగరికత నిర్మించబడుతుందని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
ఒక దేశం తనకున్న సహజ వనరులను ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామిక ఉత్పత్తుల్లో అత్యంత శక్తినివ్వగల మహత్తు నేల బొగ్గుకు ఉన్నది. ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదని వినియోగించుకునే విజ్ఞానంపైననే మానవ నాగరికత నిర్మించబడుతున్నది అని చెప్పడానికి నేలబొగ్గును అనేక విధాలుగా వినియోగించుకొని నవ నాగరికతను సంతరించుకున్న భారతదేశమే ఉదాహరణ.
అ) “బుక్కెడు బువ్వకోసం బతుకు పోరాటానికి సిద్ధమైనారు.” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారో తెల్పండి.
జవాబు.
తెలంగాణ పల్లెల నుండి వెనుకబడిన వర్గాలు, రైతు కూలీలకు చెందిన కుటుంబాలు బొగ్గు గనుల ప్రాంతాలకు వలస వచ్చారు. బొగ్గు గనుల్లో నుండి నేల బొగ్గును తీయడం అత్యంత క్లిష్టమైన, శ్రమతో కూడిన ప్రమాదభరితమైన ప్రక్రియ. రేయనక, పగలనక భూమి పొరల్లో పనిచేస్తున్న కార్మికులది శక్తికి మించిన శ్రమ. ప్రాణాలను పణంగా పెట్టి రక్తమాంసాలు రంగరించి బొగ్గు కుప్పల్లో పని చేస్తుంటారు.
గనుల్లో గాలి, వెలుతురు లేక గని కార్మికులు అనారోగ్యానికి గురవుతారు. కేవలం ఇదంతా పొట్టకూటి కోసం చేసే పని. ప్రమాదపు అంచుల్లో మృత్యువుతో పోరాడుతూ వారు చేసే బొగ్గు తీసే పని బుక్కెడు బువ్వ కోసం చేస్తున్న బతుకు పోరాటమే.
ఇ) పగలు, రేయి తేడా లేకుండా గడియారం ముండ్లవలె పని చేయటం అంటే ఏమిటి ?
జవాబు.
కార్మికుల పనితో అన్వయించి రాయండి. బొగ్గు గనుల్లో పని రాత్రింబవళ్ళు కొనసాగుతూనే ఉంటుంది. గడియారం ముల్లు ఆగకుండా ఎలా తిరుగుతుందో బొగ్గు కార్మికులు భూమి పొరల్లో పని చేస్తూనే ఉంటారు. కోడికూతకు ముందే నిద్రలేచి పోయేవాళ్లు కొందరు, పగలు మూడు గంటలకు పోయేవాళ్ళు కొందరు. నడిరాత్రికి పోయేవాళ్ళు కొందరు. ఈ విధంగా మూడు షిఫ్టుల్లో గనుల్లో పని చేస్తారు. ఎండా, వాన, చలితో సంబంధం లేకుండా ప్రాణాలు పణంగా పెట్టి కార్మికులు చేసే పనిని గడియారం ముళ్లతో పోల్చవచ్చు.
ఈ) డాక్టర్ కింగ్ పరిశోధనల వల్ల కల్గిన మేలు ఏమిటి ?
జవాబు.
1841లో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు గ్రామస్థులు భూమిని తవ్వుతుండగా భూగర్భ బొగ్గు ఉన్నట్లు తెలిసింది. భారత ప్రభుత్వ భూగర్భ పరిశోధన శాఖ పరిశోధనలు మొదలు పెట్టింది. వాటి ఆధారంగా 1871లో డా॥ కింగ్ అనే భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు గ్రామ పరిసరాలలో శ్రేష్టమైన బొగ్గు భూమి లోపల ఆరు పొరల్లో నిక్షిప్తమై ఉన్నదని వెల్లడించాడు.
1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ సంస్థవారు ఇల్లందులో మొదటి భూగర్భ గనిని ప్రారంభించారు. ఈ బొగ్గును రవాణా చేయడానికి డోర్నకల్ నుండి ఖాజీపేట వరకు బ్రాంచి రైల్వే లైను వేసి దానికి ‘సింగరేణి కాలరీస్’ అని పేరు పెట్టారు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోవచ్చు. కానీ పరోక్ష సంబంధం ఉన్నది. ఎట్లాగో వివరించండి.
జవాబు.
సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోయిన వారు ఉత్పత్తి చేస్తున్న నేలబొగ్గు ద్వారా వెలువడే విద్యుత్తును అనేక రకాలుగా మనం ఉపయోగించుకుంటున్నాము. ఇదే బొగ్గు అనేక పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగపడుతుంది, రోడ్లు వేయడానికి ఉపయోగించే డాంబరు (తారు), ప్లాస్టిక్, సువాసన తైలాలు, బట్టల అద్దకానికి ఉపయోగించే రంగులు, పంట పొలాలకు ఉపయోగించే రసాయనిక ఎరువులు ఇవన్నీ నేలబొగ్గు నుండి తయారైనవే. అన్నింటికంటే ముఖ్యమైనది ఈ బొగ్గుతో నడుస్తున్న పవర్ హౌసులు, సిమెంటు కర్మాగారాలు, ఇనుము, ఉక్కు కర్మాగారాలు ఎంతోమందికి ఉద్యోగాలను కల్పించి ఎందరికో జీవనాధారం అవుతున్నాయి. ఈ విధంగా సింగరేణి కార్మికులకు, మనకు పరోక్ష సంబంధం ఉందని చెప్పవచ్చును.
IV. సృజనాత్మకత/ప్రశంస:
1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) సింగరేణి కార్మికులు గనిలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ ఒక పోస్టరు తయారుచేయండి.
జవాబు.
జయహోూ కార్మికా ! జాగ్రత్తలు పాటించండి ! జై తెలంగాణా !
కార్మిక సోదరులారా ! మీరు దేశానికి సేవ చేస్తున్నారు. మీరు నల్ల సూర్యులవంటివారు. మీ సేవలు జాతికి అవసరం. మీ అందరి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి. గనుల్లోకి వెళ్ళేముందు కొన్ని జాగ్రత్తలను తీసుకోండి. మీ కుటుంబాలకు అండగా ఉండండి.
కొన్ని జాగ్రత్తలు :
- అనుకూలమైన, నాణ్యమైన బూట్లను ధరించాలి.
- నెత్తిమీద లైటుతో ఉన్న టోపీని పెట్టుకోవాలి.
- ఊపిరితిత్తుల పరీక్షలను చేయించుకోవాలి. ముందు జాగ్రత్తగా ‘మందులు వాడాలి.
- కళ్ళకు అనువైన కళ్ళజోళ్ళను వాడాలి.
- ఒంటరిగా గనుల్లోకి వెళ్ళవద్దు. ప్రాణంమీదకు తెచ్చుకోవద్దు.
- నెలకు ఒకసారి వైద్య పరీక్షలను చేయించుకోవాలి.
- వ్యక్తిగత బీమా సౌకర్యాన్ని పొందాలి.
- నీరు ఊరుతున్న గనులవద్దకు తక్షణమే వెళ్ళకుండా జాగ్రత్త వహించాలి.
ఇట్లు
సింగరేణి కార్మిక సేవా సమితి
జవాబు.
(లేదా)
సింగరేణి గనులు / కార్మికుల గురించి ఒక పాట రాయండి.
జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి జై కల్పవల్లీ
జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి
జై కల్పవల్లీ జైజై కన్నతల్లీ
తెలంగాణములో గోదావరి వడి జన్మించినది మన సింగరేణి
ఖమ్మం కరీంనగర్ వరంగల్ హైదరాబాద్లో విరసిల్లినది సింగరేణి
నల్లని బంగారు సిరులను తీసి తెలుగు తల్లి ముద్దు బిడ్డ అయినది
జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి జై కల్పవల్లీ
జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి
జై కల్పవల్లీ జైజై కన్నతల్లీ
ప్రతి ప్రగతికి మూలం విద్యుత్తు, విద్యుత్తుకు మూలం బొగ్గు కదా !
అ సిరులను తీసిన సింగరేణి దక్షిణ భారత ప్రగతికి వరమే… సింగరేణి
భరతావని సేవలో తరియించి ఆఆఆ
భరతావని సేవలో తరియించి నూరేళ్లను దాటిన ఘణ చరితా, ఘన చరితా ॥ జై సింగరేణి ॥
కష్టములు నష్టములు తాను ఇష్టంగా చేయించే కదా సఖ్యతతో సమైఖ్యతతో ఓ
కుటుంబమనే భావనతో సాధించిన యజ్ఞఫలం ఇదిగా ॥ జై సింగరేణి ॥
మహెూజ్వల భవితకు స్పూర్తి ఇదే
మహెూజ్వల భవితకు స్పూర్తి ఇదే
సాగాలి రథం చైతన్యపథం సాగాలి రథం చైతన్యపథం || జై సింగరేణి ॥
జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లీ జైజై కన్నతల్లీ
రక్షణతో క్రమశిక్షణతో చేయాలి మనం ఘన ఉత్పత్తి ఆఆఆ
ఆ సంపదతో సంపాదనతో బంగారు భవితకు బాటలు వేద్దాం… సింగరేణి
చెందును శ్రమ ఫలం అందరికీ ఆఆఆ… ఆఆ… చెందును శ్రమ ఫలం అందరికీ
జయజయజయ హెూ శ్రమ విజయమూ
జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లీ
జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లీ జైజై కన్నతల్లీ
V. పదజాల వినియోగం:
1. కింది ఇచ్చిన జాతీయాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా : కోడికూత
పల్లె ప్రజలు కోడికూత కు ముందే లేచి పనులు మొదలుపెడతారు.
అ) చెమటోడ్చు
జవాబు.
చెమటోడ్చు = శ్రమపడు
శ్రామికులు రోజంతా చెమటోడ్చి సంపాదించినది కనీస అవసరాలకే సరిపోదు.
ఆ) మూలస్తంభం
జవాబు.
మూలస్తంభం = ఆధారం
ఖనిజ సంపదలు దేశాభివృద్ధికి మూలస్తంభాలు.
ఇ) బతుకుపోరు
జవాబు.
బతుకుపోరు = బ్రతుకు కోసం చేసే పని
పల్లెల నుండి ఎందరో బ్రతుకుపోరు చేస్తూ వలసలు పోతున్నారు.
ఈ) మసిబారు
జవాబు.
మసిబారు = కనిపించకుండా పోవడం
చేతివృత్తుల ప్రాధాన్యత తగ్గి వారి బ్రతుకులు మసిబారుతున్నాయి.
ఉ) తలమానికం
జవాబు.
తలమానికం = ముఖ్యమైనది
భారతదేశంలో సింగరేణి తలమానికం వంటిది.
2. కింద ఇవ్వబడిన పదాలకు పట్టికలోని పదాల సహాయంతో పర్యాయపదాలు రాయండి.
అ) తనువు = ___________
జవాబు.
శరీరం, మేను, దేహం
ఆ) భూమి = ___________
జవాబు.
పుడమి, ధరణి, వసుధ
ఇ) రేయి = ___________
జవాబు.
రాత్రి, నిశీథిని, యామిని
ఈ) సువాసన = ___________
జవాబు.
సౌరభం, సుగంధం, పరిమళం
3. కింది పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి, వికృతులను రాయండి.
అ) అచ్చెరువు (వికృతి) = ___________
జవాబు.
ఆశ్చర్యం (ప్రకృతి)
ఆ) ఖని (ప్రకృతి) = ___________
జవాబు.
గని (వికృతి)
ఇ) జంత్రము (వికృతి) = ___________
జవాబు.
యంత్రము (ప్రకృతి)
ఈ) ప్రాణం (ప్రకృతి) = ___________
జవాబు.
పానం (వికృతి)
VI. భాషను గురించి తెలుసుకుందాం:
1. కింది విడదీసిన పదాలను కలిపి రాయండి. సంధి పేరు రాయండి.
అ) కావాలి + అంటే = ___________
జవాబు.
కావాలంటే – ఇత్వ సంధి
ఆ) మూల + ఆధారం = ___________
జవాబు.
మూలాధారం – సవర్ణదీర్ఘ సంధి
ఇ) ప్రాంతము + అంతా = ___________
జవాబు.
ప్రాంతమంతా – ఉత్వ సంధి
ఈ) ఎప్పుడు + ఎప్పుడు = ___________
జవాబు.
ఎప్పుడెప్పుడు – ఉత్వ సంధి
ఉ) మహా + ఉద్యమం = ___________
జవాబు.
మహోద్యమం – గుణసంధి
2. కింది విగ్రహ వాక్యాలకు సమాసపదం రాయండి. సమాసం పేరు రాయండి.
విగ్రహవాక్యం – సమాసపదం – సమాసం పేరు
అ) మానవుని యొక్క నాగరికత = మానవ నాగరికత – షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) సాధ్యం కానిది = అసాధ్యం – నఞ తత్పురుష సమాసం
ఇ) రక్తమును, మాంసమును = రక్తమాంసాలు – ద్వంద్వ సమాసం
ఈ) నేలలోని బొగ్గు = నేలబొగ్గు – షష్ఠీ తత్పురుష సమాసం
ఉ) మూడైన పూటలు = మూడు పూటలు – ద్విగు సమాసం
ఉత్పేక్ష:
కింది వాక్యం చదువండి.
“ఈ మేఘాలు గున్న ఏనుగులా ! అన్నట్టు ఉన్నాయి.”
దేన్ని దేనితో పోల్చారు ?
పై వాక్యంలో కనిపిస్తున్న పోలిక ఊహించి చెప్పబడింది. పై వాక్యంలో
ఉపమేయం : మేఘాలు
ఉపమానం : గున్న ఏనుగులు
అంటే మేఘాలను ఏనుగు పిల్లలవలె ఊహిస్తున్నామన్నమాట దీనిని బట్టి పోలికను ఊహించి చెబితే అది “ఉత్ప్రేక్ష” అలంకారం.
3. కింది వాక్యాల్లో దేనిని దేనిగా ఊహించి చెప్పారో రాయండి.
అ) మండే ఎండ నిప్పులకొలిమా ! అన్నట్లు ఉన్నది.
జవాబు.
నిప్పుల కొలిమి – ఉపమానం
మండే ఎండ – ఉపమేయం
మండే ఎండను నిప్పుల కొలిమిగా ఊహించారు. కనుక ఉత్ప్రేక్షాలంకారం
ఆ) ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా ! అన్నట్లు ఉన్నాయి.
జవాబు.
ఆకాశంలో నక్షత్రాలు – ఉపమేయం
కొలనులోని పువ్వులు – ఉపమానం
ఆకాశంలో నక్షత్రాలను కొలనులోని పువ్వుల్లా ఊహించారు. కనుక ఉత్ప్రేక్షాలంకారం
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:
ప్రశ్న 1.
మీ ప్రాంతంలోని కార్మికులను/శ్రామికులను కలిసి, పనిలో వారు పొందిన అనుభవాలను, అనుభూతులను తెలుసుకొని, ఆ వివరాలను నివేదిక రూపంలో రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
నేను ఇటీవల మా ఇంటి పరిసరాల్లో చేనేత కార్మికులను కలిశాను. తెలంగాణ ప్రాంతంలో చేనేత వస్త్ర పరిశ్రమకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అగ్గిపెట్టెలో అమరే చీరను నేసిన కళానైపుణ్యం గల ప్రాంతం ఇది.ప్రస్తుతం వారు తగిన గుర్తింపులేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి జీవన వైవిధ్యాన్ని గురించి తెలుసుకున్నాను.
చేనేత వృత్తులవారు వివిధ ప్రాంతాలనుండి నాణ్యమైన నూలును సేకరిస్తారు. దానిని కండెలుగా చుట్టుతారు. కొందరు మహిళలు చరఖాపై నూలు వడుకుతారు. సహజరంగుల్లో నూలును ఉంచుతారు. మగ్గంపై కండెలను ఉంచుతారు. నిర్ణయించుకున్న డిజైన్లో వస్త్రాన్ని కళాత్మకంగా నేస్తారు. నేసిన బట్టలకు కళాత్మకమైన అద్దకం వేస్తారు. ఒక మంచి చీర తయారు కావాలంటే వారం రోజులు పడుతుంది. ఇంత కష్టపడి నేసినా వారికి సరియైన గిట్టుబాటు దొరకడం లేదు. ముడి సరుకులు లభించడం లేదు. ఆహారం దొరక్క, పనులు లేక, గిట్టుబాటు ధరలు లేక, తీసుకున్న అప్పులు తీర్చలేక కొందరు నేతగాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
నేటి చేనేత పనివారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లే ప్రజలు కూడా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి. ఈ రకంగా మనం వారిని ప్రోత్సహించినవాళ్ళం అవుతాము. అన్ని వృత్తులవారిని మనం ఆదరించాలి. అదే మన ధర్మం.
TS 8th Class Telugu 10th Lesson Important Questions సింగరేణి
I. అవగాహన – ప్రతిస్పందన:
1. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
గోదావరి నది పరివాహక ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. రెండువందల మిలియన్ సంవత్సరాలకు పూర్వం అడవులు తగలబడి భూమి మీద ఉన్న అవశేషాలు క్రమక్రమంగా భూమిలోనికి కూరుకుపోయి, వాటి మీద మన్ను, రాళ్ళు పడి లోపలికి కుదించబడి అవి బొగ్గు పొరలుగా ఏర్పడినాయని చెప్పవచ్చు. ఇట్లా ఏర్పడ్డ బొగ్గునే మనం తవ్వి తీస్తున్నాం. దీన్నే ‘నేలబొగ్గు’, ‘నల్ల బంగారం’ అంటున్నాం.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పై పేరాలో ఏ నది పరివాహక ప్రాంతం గూర్చి చెప్పబడింది.
జవాబు.
గోదావరి
ప్రశ్న 2.
ఎన్ని సంవత్సరాల పూర్వం అడవులు కాలిపోయాయని ఉంది ?
జవాబు.
200 మిలియన్ సం॥
ప్రశ్న 3.
భూమిలోనికి కూరుకుపోయినవి ఏవి ?
జవాబు.
భూమిపై ఉన్న అవశేషాలు
ప్రశ్న 4.
భూమిలో ఏవి పొరలుగా ఏర్పడ్డాయి?
జవాబు.
బొగ్గు
ప్రశ్న 5.
‘నల్ల బంగారం’ అని దేనిని అంటారు ?
జవాబు.
నేలబొగ్గు/బొగ్గు
II. స్వీయరచన:
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)
ప్రశ్న 1.
నిత్య జీవితంలో బొగ్గు మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ?
జవాబు.
ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి, ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో బొగ్గు ఒకటి. రోడ్లు వేయడానికి · ఉపయోగించే తారును, ప్లాస్టిక్ను, తలకు రాసుకునే సువాసన నూనెలను, బట్టల అద్దకాలకు వేసుకునే రంగులను ఈ బొగ్గు నుండే తయారుచేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా పంటపొలాలకు వేస్తున్న రసాయనిక ఎరువులు ఈ నేలబొగ్గు నుండి తయారవుతుంది. ఇలా బొగ్గు ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు ఉపయోగపడుతుంది.
ప్రశ్న 2.
బొగ్గును తవ్వి తీయడంలో ఎవరెవరు పనిచేస్తారు ?
జవాబు.
సేఫ్టీ అధికారి, అండర్ మేనేజర్, సర్వేయర్, చైన్మెన్, ఓర్మెన్, సర్దార్ (మొకద్దం) షార్ట్ఫర్, కోల్కట్టర్, టింబర్ మెన్, లైన్ మెన్, ట్రామర్, హాలర్, కోల్ ఫిల్లర్, జనరల్ మద్దూరులు అందరూ కలిసికట్టుగా పనిచేసి బొగ్గును తవ్వి తీస్తారు.
ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)
ప్రశ్న 1.
శ్రమ జీవనం గొప్పతనాన్ని వివరించండి.
జవాబు.
శ్రమలో ఆనందం ఉంది. శ్రమయే ఆనందానికి రాజమార్గం. ప్రతి ఒక్కరూ తమ పని చేసుకుంటే ఈ ప్రపంచం మరింత వేగంగా ముందుకు సాగుతుంది. అందుకే పెద్దలు ‘సన్యాసివలె జీవించు, ఎద్దువలె కష్టపడు’ అంటారు. కాంతి కావాలంటే, దివిటీ వెలిగించాలి కదా ! చీకటి నిండిన గర్భగుడిలో దేవుడు లేడు. నడిరోడ్డుపై రాళ్ళుకొట్టే ప్రతి శ్రమ జీవి చెంత ఆయన ఉంటాడు. ఇది గుర్తించిన ప్రతివ్యక్తి సోమరితనాన్ని వీడతాడు.
శ్రమించి సాధించేవే సుఖాలను అందిస్తాయి. అయితే శ్రమించే వారంతా సుఖపడరు. శ్రామికులు చెమటోడ్చి సౌకర్యాలనందించే ఉత్పత్తులను పెంచుతారు. అది మిగిలిన జగత్తు కంతా ఆనందాన్నిస్తుంది. పరిశ్రమలు నడవాలంటే యంత్రాలతో సమానంగా కార్మికులు శ్రమ పడాలి. అందుకే ‘శ్రమజీవే జగతికి మూలం ………………… చెమటోడ్చక జరగదు కాలం’ అన్నారు.
“శ్రమ నీ ఆయుధమైతే, విజయం నీ బానిస అవుతుంది” అన్న గాంధీ మాటల్లోని అర్థాన్ని గ్రహించి శ్రమపడటం వల్ల సంతోషాన్ని అందుకోవచ్చు. శ్రమను తగ్గించే యంత్రాలను తయారు చేయడం ద్వారా ఆధునిక మానవుడు విసుగు అనే నరకాన్ని సృష్టించుకుంటున్నాడు. నిరంతరం ప్రవహించే నది వలె మనిషి నిరంతరం శ్రమిస్తే ఫలితాలు వాటంతవే వస్తాయి. పరిశ్రమల్లో కార్మికులు, పొలాల్లో కర్షకులు కష్టించి పనిచేసి దేశ అభివృద్ధికి పాటు పడుతున్నారు.
మనంతట మనం పని చెయ్యం, పనిచేసే వారిని చేయనివ్వం, వారిని విమర్శించి, తప్పులెంచి అవహేళన చేస్తాం. మనజాతి పతనానికిదే ముఖ్య కారణం.
III. సృజనాత్మకత:
ప్రశ్న 1.
ఆగస్టు 6వ తేది, ప్రొ॥ జయశంకర్ జయంతి. ఆ రోజు మీ పాఠశాలలో జయంతి వేడుకలను నిర్వహించాలి. గ్రామ పెద్దలను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రం రాయండి.
జవాబు.
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుక ఆహ్వాన పత్రిక
గౌరవనీయులైన రంగాపురం గ్రామ పెద్దలకు నమస్కారము. ఆగస్టు 6న మన ప్రియతమ తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన,, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను మా పాఠశాల నందు నిర్వహిస్తున్నాము. కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6, 1934న వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం, పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు.
ఆర్థిక శాస్త్రంలో Ph.D. పట్టా పొంది, ప్రిన్సిపల్గా, రిజిస్టార్గా కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా వివిధ ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలో, నాన్ ముల్కీ ఉద్యమంలో సాంబార్, ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె. చంద్రశేఖర్రావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ జూన్ 21, 2011న మరణించారు.
ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ గారి స్మృత్యకంగా ఏర్పాటు చేయబడిన జయంతి వేడుకలలో మీరంతా పాల్గొనవలసినదిగా కోరుచున్నాము.
ఇట్లు,
జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు,
రంగాపురం, రంగారెడ్డి జిల్లా.
IV. భాషాంశాలు:
పదజాలం:
పర్యాయపదాలు:
ప్రశ్న 1.
కష్టం – ___________
జవాబు.
ఇక్కట్లు, శ్రమ
ప్రశ్న 2.
పరిమళం – ___________
జవాబు.
తావి, సువాసన, సుగంధం
ప్రశ్న 3.
నిశీథిని – ___________
జవాబు.
రాత్రీ, నిశి, యామిని
ప్రశ్న 4.
భూమి – ___________
జవాబు.
వసుధ, ధరణి, అవని
ప్రశ్న 5.
తనువు – ___________
జవాబు.
శరీరం, దేహం, కామం
నానార్ధాలు:
ప్రశ్న 1.
శక్తి – ___________
జవాబు.
సామర్థ్యము, బలం, పార్వతి
ప్రశ్న 2.
మూలం – ___________
జవాబు.
వేము, మొదలు, కారణం
ప్రశ్న 3.
కాలం – ___________
జవాబు.
సమయం, మరణం, నల్లని
ప్రశ్న 4.
వ్యవసాయం – ___________
జవాబు.
పరిశ్రమ, కృషి, ప్రయత్నం
ప్రకృతి – వికృతులు:
ప్రకృతి – వికృతి
1. రాత్రి – రాతిరి
2. అద్భుతం – అబ్బురం
3. ఖని – గని
4. భృంగారం – బంగారం
5. సహాయం – సాయం
6. సంతోషం – సంతసం
7. సుఖం – సుకం
8. ఆశ్చర్యం – అచ్చెరువు
9. స్థిర – తిర
10. గర్భం – కడుపు
11. దూరం – దవ్వు
12. గర్వం – గరువము
13. అడవి – అటవి
14. శ్రీ – సిరి
వ్యాకరణాంశాలు:
సంధులు:
1. సవర్ణదీర్ఘ సంధి :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశం అగును.
ఉదా : మూలాధారం = మూల + ఆధారం
దశాబ్దం = దశ + అబ్దం
కర్మాగారం = కర్మ + ఆగారం
దేశాభివృద్ధి = దేశ + అభివృద్ధి
2. యణాదేశ సంధి :
ఇ, ఉ, ఋలకు అసవర్ణములైన అచ్చులు పరమైనపుడు క్రమముగా య,ర,ల,వలు ఆదేశముగా వస్తాయి.
ఉదా : ప్రత్యేకత = ప్రతి + ఏకత
అత్యంత = అతి + అంత
ప్రత్యర్థి = ప్రతి + అర్థి
3. ఇత్వసంధి :
ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
ఉదా : కావాలంటే = కావాలి + అంటే
శక్తినివ్వగల = శక్తిని + ఇవ్వగల
4. ఉత్వసంధి :
ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఉదా : అనూహ్యమైన = అనూహ్యము + ఐన
కీలకమైన= కీలకము + ఐన
సమాసాలు:
సమాసపదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1. గోదావరి నది | గోదావరి అనే పేరుగల నది | సంభావన పూర్వపద కర్మధారయం |
2. ప్రతిక్షణం | క్షణము క్షణము | అవ్యయీభావ సమాసం |
3. మృత్యుపోరాటం | మృత్యువుతో పారాటం | తృతీయా తత్పురుష సమాసం |
4. నడిరాత్రి | రాత్రి మధ్య భాగము | అవ్యయీభావ సమాసం |
5. సహజవనరులు | సహజమైన వనరులు | విశేషణ పూర్వపద కర్మధారయం |
6. అనేక విషయాలు | అనేకమైన విషయాలు | విశేషణ పూర్వపద కర్మధారయం |
7. ముడిపదార్థాలు | ముడివైన పదార్థాలు | విశేషణ పూర్వపద కర్మధారయం |
8. సహజసంపద | సహజమైన సంపద | విశేషణ పూర్వపద కర్మధారయం |
9. పెద్ద సంఖ్య | పెద్దదైన సంఖ్య | విశేషణ పూర్వపద కర్మధారయం |
10. నూతన సంవత్సరం | నూతనమైన సంవత్సరం | విశేషణ పూర్వపద కర్మధారయం |
11. ఆసక్తికర విషయం | ఆసక్తికరమైన విషయం | విశేషణ పూర్వపద కర్మధారయం |
12. భూగర్భం | భూమి యొక్క గర్భం | షష్ఠీ తత్పురుష సమాసం |
13. తెలంగాణ సాధన | తెలంగాణ యొక్క సాధన | షష్ఠీ తత్పురుష సమాసం |
14. బొగ్గునిక్షేపాలు | బొగ్గు యొక్క నిక్షేపాలు | షష్ఠీ తత్పురుష సమాసం |
15. ఆరుపొరలు | ఆరు సంఖ్యగల పొరలు | ద్విగు సమాసం |
16. రక్తమాంసాలు | రక్తమును, మాంసమును | ద్వంద్వ సమాసం |
17. ఏడు రంగులు | ఏడు సంఖ్యగల రంగులు | ద్విగు సమాసం |
1. వాక్యాలు
ప్రశ్న 1.
నేల బొగ్గుతో తారు తయారవుతుంది. ఎరువులు తయారవుతాయి. (సంయుక్త)
జవాబు.
నేల బొగ్గుతో తారు, ఎరువులు తయారవుతాయి.
ప్రశ్న 2.
ఎంతో కష్టించి పని చేస్తారు. నల్ల బంగారాన్ని సృష్టిస్తున్నారు. (సంక్లిష్ట)
జవాబు.
ఎంతో కష్టించి పని చేసి, నల్ల బంగారాన్ని సృష్టిస్తున్నారు.
2. క్రియలు:
ప్రశ్న 1.
ప్రాణాలు పణంగా పెట్టి కార్మికులు పని చేస్తారు.
జవాబు.
అసమాపక క్రియ.
ప్రశ్న 2.
పరిశోధనలు చేసి ఇది శ్రేష్టమైన బొగ్గు కాదన్నారు ?
జవాబు.
అసమాపక క్రియ.
పదాలు – అర్థాలు:
I. అర్ధాలు:
పరీవాహక ప్రాంతం = ప్రవహించే ప్రాంతం
అవశేషాలు = మిగిలియున్నవి
అత్యంత = మిక్కిలి
మహత్తు = గొప్పదనం
తనువు = శరీరం
విరివిగా = ఎక్కువగా
సింగారం = అలంకారం
సిరి = సంపద
ఖ్యాతి = కీర్తి
II.
బతుకుపోరాటం = జీవనపోరాటం
శ్రద్ధ = ఆసక్తి
ముప్పు = ఆపద
నిక్షేపాలు = నిధులు
ఇతర = తక్కిన
III.
నడిరాత్రి = అర్థరాత్రి
చర్య = పని
కలిసికట్టుగా = ఒక్కటిగా
పాట్లు = కష్టాలు
ముప్పు = ఆపద
మృత్యువు = మరణం
ఉత్పత్తి = పుట్టుక
కర్మాగారం = పరిశ్రమ
తలమానికం = శిరోధార్యం
సిరులు = సంపదలు.
పాఠం ఉద్దేశం:
ఏ దేశం తన సహజసంపదను సమర్థంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంది. మనదేశం సకల సంపదలకు నిలయం. ఇక్కడి నేలల్లో అపారమైన ఖనిజ సంపద దాగి ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గుగనులు దేశంలోనే ప్రసిద్ధిపొందాయి. దేశ ప్రగతికి దోహదపడే ‘సింగరేణి గనుల’ గురించి తెలియజేయటమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.
వ్యాస ప్రక్రియ:
వ్యాసం పూర్తిగా వచన ప్రక్రియ. చెప్పే అంశాలను బట్టి వ్యాసాలు కొన్ని రకాలు. పౌరాణిక వ్యాసాలు, సాంఘిక వ్యాసాలు, వైజ్ఞానిక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు మొదలైనవి వ్యాసాల్లో రకాలు. వ్యాసం మూడు భాగాలుగా ఉంటుంది. ఉపోద్ఘాతం, విషయ వివరణ, ముగింపు.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. సింగరేణి బొగ్గు గనులు, బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం.
ప్రవేశిక:
ఒకదేశ పారిశ్రామిక పురోగమనానికి, ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో బొగ్గు ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ ప్రధాన భూమికను పోషిస్తున్నది.
“శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలే”దని శ్రీశ్రీ అన్నాడు. ఆధునిక ప్రపంచంలో కార్మికుల పాత్ర అమోఘమైనది. బొగ్గు ఉత్పత్తిలో కార్మికులశ్రమ వెలకట్టలేనిది. ప్రతిరోజూ పొంచి ఉన్న ప్రమాదాలను కూడా లెక్కచేయకుండా… గనుల్లో పనిచేస్తూ…. తమ స్వేదాన్ని శక్తిగా మార్చి నేల బొగ్గును వెలికి తీస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలను ఆవిష్కరించే విషయాన్ని ఈ పాఠంలో చదువుదాం.
పాఠ్యభాగ సారాంశం:
మన తెలంగాణ ప్రాంతంలోని బొగ్గుగనులు దేశంలోనే ప్రసిద్ధి చెందాయి. ఈ గనులు దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధికి నేలబొగ్గే ప్రధాన సాధనం. ఈ బొగ్గుతోనే ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నది. నేలబొగ్గుతో తారు, ఎరువులు తయారవుతున్నాయి. అట్లే ప్లాస్టిక్, సుగంధ ద్రవ్యాల్లోను దీనిని వాడుతారు. ప్రకృతి ప్రసాదించిన సహజసంపదను వినియోగించుకొనే విజ్ఞానం పైనే మానవనాగరికత నిర్మించబడుతున్నది.
1871 ప్రాంతంలో డాక్టర్ కింగ్ అనే పరిశోధకుని ప్రయత్నంవల్ల బొగ్గు గనులు ఎక్కువగా వచ్చాయి. సింగరేణి ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో గనులు ఉన్నాయి. కార్మికులు వివిధ రక్షణ చర్యలను చేపట్టి కార్మికులు గనుల్లోకి వెళ్తారు. షిఫ్ట్ ప్రకారం పనులు చేస్తారు. ఎంతో కష్టించి పని చేస్తారు. నల్ల బంగారాన్ని సృష్టిస్తున్నారు.
సింగరేణి కార్మికుల సేవలు చిరస్మరణీయమైనవిగా పేర్కొనవచ్చు. వారు తీసిన బొగ్గుతో ధర్మల్ విద్యుత్తు తయారవుతున్నది. తెలంగాణ కార్మికులు తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు.
నేనివి చేయగలనా ?