Telangana SCERT 6th Class Telugu Study Material Telangana ఉపవాచకం 5th Lesson వాగ్గేయకారుడు రామదాసు Textbook Questions and Answers.
TS 6th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson వాగ్గేయకారుడు రామదాసు
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
అక్కన్న మాదన్నల గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు.
అక్కన్న మాదన్నలు అసలయిన అన్నదమ్ములు కాకపోయినా ఎంతో సన్నిహితంగా కలిసిపోయారు. వీరు గోల్కొండ రాజ్యాన్ని పాలించిన తానాషా (అబుల్ హసన్ కుతుబ్షా) కొలువులో ఉండేవారు. వీరిలో అక్కన్న మంత్రిగానూ, దండనాయకుడుగానూ ఉండేవాడు. మాదన్న ప్రధానమంత్రిగా ఉండేవాడు.
ఈ అన్నదమ్ములిద్దరూ ఔరంగజేబు దాడుల నుంచి గోల్కొండ రాజ్యాన్ని కాపాడటంలో ప్రధానపాత్ర వహించారు. మహారాష్ట్ర నాయకుడు శివాజీకి, తానాషాకు సంధి జరిపారు. అక్కన్న మాదన్నలు బతికి ఉన్నంతకాలం ఢిల్లీ సుల్తాను, గోల్కొండను ఆక్రమించుకోలేకపోయాడు. వీరి హత్య జరిగిన అనంతరమే ఔరంగజేబు తానాషాను బందీచేశాడు. అక్కన్న మాదన్నల సూచన మేరకే తానాషా కంచెర్ల గోపన్న (రామదాసు)ను భద్రాచలం తహసీలుదారుగా నియమించాడు.
ప్రశ్న 2.
కంచెర్ల గోపన్నను ‘రామదాసు’ గా పిలవడానికి కారణం ఏమిటి ? (లేదా)
గోపన్న కుమారుడు ఎలా మరణించాడు ? మళ్ళీ ఎలా బతికాడు ?
జవాబు.
అక్కన్న మాదన్నల సూచన మేరకు తానాషా గోపన్నను భద్రాచలానికి తహసీలుదారుగా నియమించాడు. ఆయన తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తూ, రామచంద్రునికి సేవలు చేస్తుండేవాడు. ఎంతో భక్తితో రామకోటి రాస్తుండేవాడు.
ఒకసారి రామకోటి పూర్తిచేసిన శుభసమయంలో అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. వంటవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో వంటవాళ్ళు తవ్విన అన్నపుగంజి గుంటలో పడి గోపన్న కుమారుడు మరణించాడు.
గోపన్న మరణించిన తన కుమారుని శ్రీరామచంద్రుని పాదాల దగ్గర పడుకోబెట్టి ఆయన మనసు కరిగేలా ప్రార్థించాడు. చనిపోయిన బిడ్డ నిద్ర నుంచి లేచినట్లు లేచాడు. గోపన్న భక్తికి మెచ్చి ప్రజలు ఆయనను నిజమైన రామభక్తుడని కొనియాడారు. ఆనాటి నుంచి గోపన్నను అందరూ రామదాసని పిలవడం ప్రారంభించారు.
ప్రశ్న 3.
రామదాసును ఖైదు చేయడం సమంజసమా ! కాదా ! ఎందుకు ?
జవాబు.
రామదాసును ఖైదు చేయడం సమంజసం కాదు. ఎందుకంటే భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వారందరికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తహసీలుదారుగా రామదాసుపై ఉంది. ఆయన రామాలయ పునరుద్ధరణకు పాటుపడ్డాడు. ఆరు లక్షల వరహాలు ఖర్చు పెట్టి దేవతా విగ్రహాలకు ఆభరణాలను చేయించాడు.
రామదాసు తన కోసమో, తన ఇంటి అవసరానికో ప్రభుత్వపు సొమ్ము ఖర్చుపెట్టలేదు. భగవంతుడి కోసమే ఖర్చుపెట్టాడు. తానాషా ఏలుబడిలోని భద్రాద్రి రామాలయాన్ని పునరుద్ధరించి ఆ ప్రభువు కీర్తిప్రతిష్ఠలను అన్ని దిక్కులకు వ్యాపింపజేయాలని రామదాసు భావించాడు. కాబట్టి రామదాసును ఖైదు చేయడం సమంజసం కాదు.
ప్రశ్న 4.
రామదాసు చెర (బందిఖానా) నుండి ఎలా బయటపడ్డాడు ?
జవాబు.
రామదాసు తానాషా అనుమతి లేకుండా ప్రభుత్వ ధనాన్ని ఆరు లక్షలు ఖర్చు పెట్టాడు. దాని మూలంగా అతడు చెరసాలలో ఉండాల్సి వచ్చింది.
రామదాసు చెరసాలలో ఉండగా బందిఖానా వాళ్ళు ఎన్నో బాధలు పెట్టారు. ఆ బాధలను తట్టుకోలేక రామదాసు రామునితో మొరపెట్టుకొనేవాడు. రాముని అనుగ్రహం వల్ల ఆయనకు కొరడా దెబ్బల బాధ కూడా తెలిసేది కాదు.
12 సంవత్సరాలు గడిచాయి. రామదాసు ఇక లాభం లేదనుకొని “నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ, నను బ్రోవమని చెప్పవే” అని సీతమ్మను ప్రార్థించాడు. అప్పుడు సీతమ్మ కరుణించి, రామదాసు చెల్లించాల్సిన పైకాన్ని చెల్లించి, అతనికి చెర నుండి విముక్తి కలిగించమని రామునితో చెప్పినట్టుంది.
రాముడు, లక్ష్మణునితో కూడా మారువేషంలో గోల్కొండకు వెళ్ళాడు. రామదాసు కట్టాల్సిన పైకం తానాషాకు చెల్లించి రాజముద్ర వేసిన రసీదును తీసుకున్నాడు. రామలక్ష్మణులు చెర వద్దకు వచ్చారు. తానాషా వేషంలో రాముడు “రామదాసూ! బాకీ పైకం ముట్టింది. ఇదిగో రసీదు” అని రసీదు ఇచ్చి లక్ష్మణునితో సహా మాయమయ్యాడు. తానాషాకు ఈ విషయమంతా తెలిసి రామదాసు భక్తికి ముగ్ధుడయ్యాడు. అతనిని చెర నుండి విడిపించి ఎంతగానో గౌరవించాడు.
చదువడం – అవగాహన చేసుకోవడం.
I. కింది పేరాను చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అక్కన్న మాదన్నలనే వాళ్ళు తానాషా కొలువులో ఉండేవాళ్ళు. వాళ్ళలో అక్కన్న మంత్రిగా, దండనాయకుడిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు. మాదన్న ప్రధానమంత్రి. మాదన్న అసలు పేరు సూర్యప్రకాశరావు. ఈ అన్నదమ్ములిద్దరూ ఔరంగజేబు దాడులనుంచి గోల్కొండ రాజ్యాన్ని కాపాడటంలో ప్రధానపాత్ర వహించారు. మహారాష్ట్ర నాయకుడు శివాజీకీ తానాషాకూ సంధి జరిపారు.
అక్కన్న మాదన్నలు బతికి ఉన్నంతకాలం ఢిల్లీ సుల్తాను, గోల్కొండను ఆక్రమించుకోలేకపోయాడు. వాళ్ళు అన్నదమ్ములు కాకపోయినా ఒకరి నుంచి మరొకరిని వేరుచేయలేనంత సన్నిహితంగా కలిసిపోయారు. వీరి హత్య జరిగిన అనంతరమే ఔరంగజేబు తానాషాను
బందీ చేయగలిగాడు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
శివాజీకి, తానాషాకు సంధి జరిపింది ఎవరు ?
జవాబు.
అక్కన్న మాదన్నలనే అన్నదమ్ములు శివాజీకి, తానాషాకు సంధి జరిపారు.
ప్రశ్న 2.
అక్కన్న – మాదన్నలు ఎవరి కొలువులో ఉండేవారు ?
జవాబు.
అక్కన్న మాదన్నలు తానాషా కొలువులో ఉండేవారు.
ప్రశ్న 3.
తానాషా వద్ద ప్రధానమంత్రిగా ఉన్నదెవరు ?
జవాబు.
తానాషా వద్ద మాదన్న ప్రధానమంత్రిగా ఉన్నాడు.
ప్రశ్న 4.
తానాషాను బందీ చేసింది ఎవరు ?
జవాబు.
తానాషాను బందీ చేసింది ఔరంగజేబు.
ప్రశ్న 5.
శివాజీ ఏ రాష్ట్ర నాయకుడు ?
జవాబు.
శివాజీ మహారాష్ట్ర నాయకుడు.
II. కింది పేరాను చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రుడిని చూడటానికి జనం తండోపతండాలుగా రావటం మొదలయింది. అందువల్ల యాత్రికులకు సౌకర్యాలు కలగజేయ్యవలసిన బాధ్యత తహసీలుదారుగా తన మీద ఉన్నది. అట్లాగే రాముని ఆలయానికి ఒక గోపురం, ప్రాకారం, మండపం కట్టించి ఆలయాన్ని బాగు చెయ్యవలసిన అవసరం ఏర్పడింది.
దీనికోసం ఒకనాడు గోపన్న ఆ ఊళ్ళో రైతులను పిలిపించి “మనమంతా ఒక మంచిపని చేద్దాం. మీరు నాతో సహకరించండి” అని గోపన్న విషయం చెప్పాడు. ఊరిజనం అట్లాగే అని అంగీకరించారు. ఎవరి శక్తికొద్ది వారు సహాయం చెయ్యటానికి సిద్ధమయ్యారు. ఆలయనిర్మాణం మొదలయింది.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
యాత్రికులకు సౌకర్యాలు ఎందుకు కలుగజేయాలి ?
జవాబు.
శ్రీరామచంద్రుణ్ణి చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. అందువల్ల యాత్రికులకు సౌకర్యాలు కలుగజేయాలి.
ప్రశ్న 2.
గోపన్న ఎవరి భక్తుడు ?
జవాబు.
గోపన్న శ్రీరామచంద్రుని భక్తుడు.
ప్రశ్న 3.
గోపన్న రైతులను ఎందుకు పిలిచాడు ?
జవాబు.
ఆలయాన్ని బాగుచెయ్యాల్సిన అవసరాన్ని గురించి తెలియజేయడానికి గోపన్న రైతులను పిలిచాడు.
ప్రశ్న 4.
ఆలయ నిర్మాణం ఎక్కడ మొదలయ్యింది ?
జవాబు.
ఆలయ నిర్మాణం భద్రాచలంలో మొదలయ్యింది.
ప్రశ్న 5.
ఎవరి ఆలయం నిర్మిస్తున్నారు ?
జవాబు.
శ్రీరామచంద్రుని ఆలయం నిర్మిస్తున్నారు.
III. కింది పేరాను చదువండి. అయిదు ప్రశ్నలు తయారుచెయ్యండి.
చెరలో 12 సంవత్సరాలుగా బాధలు పడుతున్న రామదాసును విడిపించాలని రాముడు నిశ్చయించుకున్నాడు. తానాషాకు ఆరులక్షల వరహాలు చెల్లించడమే తక్షణ కర్తవ్యంగా భావించి సేవకుల వేషాలతో రామలక్ష్మణులిద్దరు తానాషా అంతఃపురంలోకి ప్రవేశించారు.
మారువేషాలతో ఉన్న రామలక్ష్మణులు తానాషా గదిని సమీపించి “తలుపు తియ్యవయ్య తానాషా! నీ కియ్యెడ పైకమునియ్య వచ్చితిమయ్య” అని తలుపు కొట్టారు. తానాషా తలుపు తీసి నివ్వెరపోయాడు. ఇంత రాత్రివేళ తన అంతఃపురంలోకి ప్రవేశించే ధైర్యం గల వ్యక్తులెవరా ? అని ఆశ్చర్యపోయాడు. జగన్మోహనాకారులైన రామలక్ష్మణులను కనిపెట్టలేకపోయాడు.
జవాబు.
ప్రశ్నలు తయారుచేయుట :
- చెరలో ఉన్న రామదాసును విడిపించాలని నిశ్చయించుకున్నదెవరు ?
- రామలక్ష్మణులు తానాషాకు ఎన్ని వరహాలు చెల్లించదలచారు ?
- మారువేషాలతో వచ్చింది ఎవరు ?
- రామదాసు చెరలో ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు ?
- జగన్మోహనాకారులైన రామలక్ష్మణులను కనిపెట్టలేకపోయింది ఎవరు ?
IV. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
భారతదేశంలో పవిత్రమైన నదుల్లో గంగా యమునల తర్వాత చెప్పుకోదగ్గది గోదావరి. గోదావరి మానవులకు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. గోదావరి దక్షిణ భారతదేశంలోని నదుల్లోకెల్లా పొడవైనది. ఇది మహారాష్ట్రలోని నాసికాత్ర్యంబకం క్షేత్రంలో పుట్టి ఎత్తైన కొండల మధ్య ఇరుకైన మార్గాలగుండా చిన్న చిన్న నదుల్ని కలుపుకుంటూ 900 మైళ్ళు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఈ గోదావరికి ఉత్తరపుటొడ్డున దట్టమైన అడవుల మధ్య భద్రాచలం ఉన్నది. అయితే ఆ అడవుల మధ్యనే 16వ శతాబ్దం తర్వాత ప్రస్తుతం ఉన్న భద్రాచలం పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది. భద్రాచలాన్నే భద్రాద్రి లేక భద్రగిరి అని కూడా అంటారు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
దక్షిణ భారతదేశంలోని నదులలోకెల్లా పొడవైనది ఏది ?
జవాబు.
గోదావరి
ప్రశ్న 2.
గోదావరి పుట్టిన చోటు ఏది ?
జవాబు.
మహారాష్ట్రలోని నాసికాత్ర్యంబకం
ప్రశ్న 3.
ఈ నది ఎన్ని మైళ్ళు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది ?
జవాబు.
900 మైళ్ళు
ప్రశ్న 4.
గోదావరి నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం ?
జవాబు.
భద్రాచలం
ప్రశ్న 5.
ఈ క్షేత్రానికి ఉన్న మారుపేర్లు?
జవాబు.
భద్రాద్రి లేక భద్రగిరి
V. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
దక్షిణ భారత రాజ్యాల్లో గోల్కొండ రాజ్యం కూడా ఒకటి. గోల్కొండను పాలించిన రాజులు ప్రజల హితం కోరినవారు. ధర్మబద్ధంగా పాలించారు. ఆ రాజుల మాతృభాష తెలుగు కాదు. అయినా వాళ్ళలో కొందరు తెలుగు నేర్చుకొని తెలుగు భాషను ప్రోత్సహించి తెలుగు కావ్యాల్ని అంకితంగా తీసుకున్నారు గూడా. తెలుగు చాటువుల్లో కనిపించే ‘మల్కిభరాముడు’ గోల్కొండ ప్రభువైన ‘ఇబ్రహీం కులీకుతుబ్షా’ అన్నది అందరికీ తెలిసిన విషయమే.
కుతుబ్షాహి వంశంలోని నాలుగో రాజు మహమ్మద్ కులీకుతుబ్షా కాలంలోనే నేటి హైదరాబాద్ నగరం నిర్మాణమయింది. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్టచివరి రాజు అబుల్ హసన్ కుతుబ్షా. ఎంతో ఉత్తముడై తన ప్రజలందర్నీ నిష్పక్షపాత బుద్ధితో పాలించి ప్రజలచేత ‘తానాషా’ అనే బిరుదును పొందాడు. ‘తానాషా’ అంటే మంచి రాజు అని అర్థం. తానాషానే సాధారణంగా తానీషా అని అంటారు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
గోల్కొండను పాలించిన రాజులు ప్రజలను ఏ విధంగా పాలించారు ?
జవాబు.
ధర్మబద్ధంగా
ప్రశ్న 2.
‘మల్కిభ రాముడు’గా పేరు పొందినదెవరు ?
జవాబు.
ఇబ్రహీం కులీకుతుబ్షా
ప్రశ్న 3.
ఎవరి కాలంలో హైదరాబాద్ నగర నిర్మాణం జరిగింది ?
జవాబు.
మహమ్మద్ కులీకుతుబ్షా
ప్రశ్న 4.
‘తానాషా’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు.
మంచి రాజు
ప్రశ్న 5.
‘తానీషా’ బిరుదు పొందిన రాజెవరు ?
జవాబు.
అబుల్ హసన్ కుతుబ్షా
VI. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
ఖమ్మం జిల్లాలోని తాలూకా కేంద్రమైన నేలకొండపల్లి అనే గ్రామంలో క్రీ.శ. 17వ శతాబ్దంలో లింగన్న, కామమ్మ అనే దంపతులుండేవాళ్ళు. వాళ్ళ ఇంటిపేరు కంచెర్ల. ఆ దంపతులిద్దరు ఎంతో అన్యోన్యంగా అనురాగంతో కాలం గడిపేవాళ్ళు. సుమారు 1620 ప్రాంతంలో వాళ్ళకు ఒక మగబిడ్డ పుట్టాడు.
తల్లి దండ్రులు ఆ బిడ్డకు ‘గోపన్న’ అనే పేరు పెట్టారు. అయిదో ఏటనే అక్షరాభ్యాసం చేశారు. గోపన్నకు తగిన వయసు రాగానే ఉపనయనం చేశారు. శాస్త్ర పండితులయిన రఘునాథ భట్టాచార్యుల వంటి వైష్ణవ దీక్షా గురువులు గోపన్నకు బాల రామాయణాన్ని తాత్పర్య సహితంగా చెప్పటం జరిగింది.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
నేలకొండపల్లి ఏ జిల్లాలోనిది ?
జవాబు.
ఖమ్మం జిల్లా
ప్రశ్న 2.
గోపన్న తల్లిదండ్రులెవరు ?
జవాబు.
లింగన్న, కామమ్మ
ప్రశ్న 3.
గోపన్నకు బాల రామాయణాన్ని చెప్పింది ఎవరు ?
జవాబు.
రఘునాథ భట్టాచార్యులు
ప్రశ్న 4.
గోపన్నకు ఎన్నో ఏట అక్షరాభ్యాసం చేశారు ?
జవాబు.
అయిదో ఏట
ప్రశ్న 5.
గోపన్న జనన కాలం ?
జవాబు.
1620 (సుమారు)
జనరల్ ప్యాసేజ్లు:
1. చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగివస్తూ ఉండగా మంథరకం ఎదురుపడింది. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది. “ఏం కొంప మునిగి పోయిందని వచ్చావు నువ్వు ? మేం వస్తూనే ఉన్నాం గదా ?” అన్నది.
వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడువండని స్నేహితులను కాకి తొందరపెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులోకి దూరింది. జింక దాక్కున్నది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు. దాన్ని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఈ పేరాలోని స్నేహితుల పేర్లు ఏమి ?
జవాబు.
చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం, మంథరకం
ప్రశ్న 2.
ఊపిరి పీల్చుకున్నదెవరు ?
జవాబు.
మంథరకం
ప్రశ్న 3.
కోప్పడింది ఎవరు ?
జవాబు.
ఎలుక
ప్రశ్న 4.
వేటగాడు వస్తున్నాడని అన్నదెవరు ?
జవాబు.
కాకి
ప్రశ్న 5.
తాబేలును వేటగాడు ఎక్కడ కట్టుకున్నాడు ?
జవాబు.
వింటికి
2. కారు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కించే ఎండకాలం వెళ్ళిపోయింది. అజాగ్రత్తగా నడిస్తే జర్రున కాలు జారుతున్నది. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో తడువకుండా ఉండేందుకు అందరు ఛత్రీలు పట్టుకోవడంతో ప్రభువులు – పాలితులు (రాజు – పేద) అనే తేడా లేకుండా అందరూ ఛత్రపతులే అయ్యారు. వేసవికాలంలో నెర్రెలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి.
వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుకవలె కనిపిస్తున్నది. ఆబోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలి పట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇట్లా అన్ని జీవుల్లో ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
కాళ్ళకు బొబ్బలెక్కించే కాలం ఏది ?
జవాబు.
ఎండకాలం
ప్రశ్న 2.
వర్షంలో తడవకుండా ఉండేందుకు ఏమి కావాలి ?
జవాబు.
ఛత్రీలు
ప్రశ్న 3.
ఛత్రపతులెవరయ్యారు ?
జవాబు.
ప్రభువులు – పాలితులు (రాజు – పేద)
ప్రశ్న 4.
వర్షానికి పులకరించిన నేల ఎలా కనిపిస్తున్నది ?
జవాబు.
రామచిలుకవలె
ప్రశ్న 5.
నాగలి పట్టిందెవరు ?
జవాబు.
రైతులు
3. అంబేద్కర్ తల్లిదండ్రులు భీమాబాయి, రాంజీ సక్పాల్. వీరిది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా. రాంజీ సక్పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేశాడు. అక్కడే ‘మౌ’ అనే గ్రామంలో పద్నాలుగవ సంతానంగా అంబేద్కర్ జన్మించాడు. అంబేద్కర్ చిన్నప్పటి నుండి పఠనాభిలాషి. ఆలోచనాపరుడు. ఎవరేమన్నా ఎదురించే ధైర్యసాహసాలు గలవాడు. అనేక అవమానాలు ఎదుర్కొంటూనే 1907లో మెట్రిక్యులేషన్ పూర్తిచేశాడు.
ఆ సందర్భంగా జరిగిన సన్మాన సభకు ప్రముఖ మరాఠీ రచయిత కేలూస్కర్ హాజరై ‘గౌతమబుద్ధుని జీవిత చరిత్ర’ను బహుమతిగా ఇచ్చి అంబేద్కర్ను ఉన్నత విద్య చదివించేందుకు ప్రోత్సహించాడు. ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని బోధించిన బౌద్ధంనుండే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువైన మాటల్ని గ్రహించానని అంబేద్కర్ ప్రకటించాడు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
అంబేద్కర్ ఎక్కడ జన్మించాడు ?
జవాబు.
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ‘మౌ’ గ్రామం.
ప్రశ్న 2.
ఆయన తల్లిదండ్రులెవరు ?
జవాబు.
భీమాబాయి – రాంజీ సక్పాల్.
ప్రశ్న 3.
అంబేద్కర్ ఏ సంవత్సరంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు ?
జవాబు.
1907 సం॥లో.
ప్రశ్న 4.
కేలూస్కర్ అంబేద్కర్కు బహుమతిగా ఇచ్చిన పుస్తకం ఏది ?
జవాబు.
గౌతమబుద్ధుని జీవితచరిత్ర.
ప్రశ్న 5.
అంబేద్కర్ బౌద్ధం నుండి ఏమి గ్రహించాడు ?
జవాబు.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం.
4. మంచి బుద్ధి కలవాడా ! ఇతర స్త్రీలందరికీ సోదరునిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఆశపడవద్దు. ఇతరుల మేలుకోరుతూ ఉండాలి. ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. ఇతరులు తనపై కోప్పడ్డా తాను వారిమీద కోప్పడకుండా ఉండాలి. ఇట్టివాడు అందరి కంటే గొప్పవాడు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
స్త్రీలతో ఎలా మెలగాలి ?
జవాబు.
సోదరునిలా
ప్రశ్న 2.
దేనికై ఆశ పడకూడదు ?
జవాబు.
ఇతరుల ధనానికి
ప్రశ్న 3.
ఇతరుల పట్ల ఎలా ఉండాలి ?
జవాబు.
మేలుకోరుతూ
ప్రశ్న 4.
ఎప్పుడు పొంగిపోకూడదు ?
జవాబు.
ఇతరులు తనను పొగిడినప్పుడు
ప్రశ్న 5.
పై లక్షణాలున్న వాడిని ఏమనవచ్చు ?
జవాబు.
అందరి కంటే గొప్పవాడు
5. బతుకమ్మను పూజించడమంటే ప్రకృతిని పూజించడమే. గౌరీదేవిని కొలువడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం. బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయాలు. చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి. పాటయందు పౌరాణిక, వర్తమాన సంఘటనలుంటాయి. అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ ! బతుకమ్మ ! సంపదను ఇవ్వమ్మ ! అంటూ పూజలు చేస్తారు. ఆ పూజలవల్ల ఫలితాన్ని పొందుతారు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఎవరిని పూజిస్తే ప్రకృతిని పూజించడమౌతుంది ?
జవాబు.
బతుకమ్మను
ప్రశ్న 2.
అనుబంధాలకు ఏవి నిలయాలు ?
జవాబు.
బతుకమ్మ పాటలు
ప్రశ్న 3.
ఈ పండుగలో ఏ దేవిని కొలుస్తారు ?
జవాబు.
గౌరీదేవిని
ప్రశ్న 4.
ఆ చప్పట్లు ………. ఉంటాయి.
జవాబు.
లయాత్మకంగా
ప్రశ్న 5.
పాటలందు ఎటువంటి సంఘటనలుంటాయి ?
జవాబు.
పౌరాణిక, వర్తమాన సంఘటనలు
6. 20వ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు డా|| వానమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవిచక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. పోతనచరిత్రము, మణిమాల, సూక్తివైజయంతి, జయధ్వజం, -వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి) మొదలైన గ్రంథాలు రచించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యావాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
వరదాచార్యుల వారి జన్మస్థలం ?
జవాబు.
వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామం
ప్రశ్న 2.
వీరి బిరుదులు ?
జవాబు.
అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవిచక్రవర్తి
ప్రశ్న 3.
ఏయే భాషల్లో వీరికి పాండిత్యం కలదు ?
జవాబు.
సంస్కృతం, తెలుగు భాషలలో
ప్రశ్న 4.
వీరు రాసిన బుర్రకథల సంపుటి ఏది ?
జవాబు.
రైతుబిడ్డ
ప్రశ్న 5.
వారణాసి వారు ఈయనను ఏ బిరుదుతో సత్కరించారు ?
జవాబు.
విద్యావాచస్పతి
7. పరస్పర సహాయసహకారాలు మనుషులకైనా, జంతువులకైనా అవసరం. అయితే సమాజంలో మూడురకాల వారుంటారు. ఒకరు అధములు. వీరు ఎవరైనా సహాయం చేయమని కోరినా చేయరు. ఇంకొకరు మధ్యములు. వీరు ఎవరైనా సహాయము చేయమని కోరితేనే సహాయం చేస్తారు. మరొకరు ఉత్తములు. వీరు ఇతరుల అవసరాలను గుర్తించి తమకు తాముగా సహాయం చేస్తారు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పరస్పర సహాయ సహకారాలు ఎవరెవరికి అవసరం ?
జవాబు.
మనుషులకు, జంతువులకు
ప్రశ్న 2.
సమాజంలో ఎన్ని రకాల వారు ఉంటారు ?
జవాబు.
మూడు రకాలు
ప్రశ్న 3.
సహాయం చేయమని కోరినా చేయనివారు ?
జవాబు.
అధములు
ప్రశ్న 4.
ఉత్తముల లక్షణం ఏమి ?
జవాబు.
ఇతరుల అవసరాలు గుర్తించి తమకు తామే సహాయం చేస్తారు
ప్రశ్న 5.
సహాయం కోరితే చేసేవారు ?
జవాబు.
మధ్యములు
8. సంస్కృతితో ముడివడ్డ జీవితం నాది. బతుకమ్మ పండుగకు నావైభోగం ఇంతంతనరానిది. అమ్మలక్కలందరూ బతుకమ్మలతో నా దగ్గరికే వస్తరు తల్లిగారింటికి వచ్చినట్లు. తంగేడు, గునుగు, గుమ్మడి పూలతోటి సింగారించిన ఈ పూలవల్ల నీటి కాలుష్యం దూరమైతది. మన సంప్రదాయాల వెనుక ఎన్నో శాస్త్రీయ రహస్యాలున్నయి. బతుకమ్మను నా నీటిలోనే వదులుతరు.
అలల ఉయ్యాలపై బతుకమ్మ సాగిపోతుంటే చూడముచ్చటగ ఉంటది. వినాయకచవితి సందర్భంగా గణపతిమూర్తులు నా ఒడికే చేరుతయి. నా మీద మీకు ఎంత ప్రేమో. నాకు ఎట్లాంటి నష్టం కలుగవద్దని మీరు కట్టమైసమ్మను ప్రతిష్ఠించి పూజిస్తారు. వానలు పడకుంటే నాకట్ట మీద విరాటపర్వం’ చెప్పిస్తరు.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
ఏ పండుగతో చెరువుకు వైభవం కలుగుతుంది ?
జవాబు.
బతుకమ్మ పండుగతో
ప్రశ్న 2.
బతుకమ్మను ఏ పూలతో సింగారిస్తారు ?
జవాబు.
తంగేడు, గునుగు, గుమ్మడి పూలు
ప్రశ్న 3.
మన సంప్రదాయాల వెనుక ఏమి దాగి ఉన్నాయి ?
జవాబు.
శాస్త్రీయ రహస్యాలు
ప్రశ్న 4.
చెరువుకు నష్టం కలుగకుండా ఎవరిని ప్రతిష్ఠించారు ?
జవాబు.
కట్టమైసమ్మను
ప్రశ్న 5.
ఎప్పుడు విరాటపర్వం చెప్పిస్తారు ?
జవాబు.
వానలు పడకుంటే
సారాంశం:
భక్త రామదాసు అసలు పేరు కంచెర్ల గోపన్న. ఆయన సుమారు 1620 ప్రాంతంలో పుట్టాడు. ఆయన తల్లి కామమ్మ, తండ్రి లింగన్న. వారిది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి. గోపన్న భార్య పేరు కమలమ్మ. చిన్నప్పటి నుంచి గోపన్న రామభక్తుడు. ఆయన తమకు పుట్టిన బిడ్డకు రఘురాముడు అని పేరు పెట్టాడు. ఒకనాటి రాత్రి కలలో గోపన్నకు రాముడు కన్పించి “త్వరలో నీవు భద్రాచలానికి తహసీలుదారుగా వస్తావు” అన్నాడు.
గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్టచివరి రాజు అబుల్ హసన్ కుతుబ్షా. ఆయనను అందరూ ‘తానాషా’ అని పిలిచేవారు. ‘తానాషా’ అంటే మంచిరాజు అని అర్థం. తానాషానే అందరూ తానీషా అంటుంటారు. తానాషా దగ్గర అక్కన్న-మాదన్నలనే అన్నదమ్ములిద్దరు కొలువులో ఉండేవారు. అక్కన్న మంత్రిగాను, దండనాయకుడుగాను ఉండేవాడు. మాదన్న ప్రధానమంత్రి. కంచెర్ల గోపన్నకు అక్కన్న-మాదన్నలు మేనమామలు, వారి సూచన మేరకు తానాషా గోపన్నను భద్రాచలం తుకిడీకి (తాలూకా) తహసీలుదారుగా నియమించాడు.
గోపన్న తన బాధ్యతలను చక్కగా నిర్వహించేవాడు. అలాగే భద్రాచల రామచంద్రునకు సేవలు కూడా చేస్తూ ఉండేవాడు. ఆయన నిరంతరం రామకోటి రాస్తూ ఉండేవాడు. ఒకసారి రామకోటి పూర్తిచేసిన శుభసమయంలో ‘అన్న సమారాధన’ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. అక్కడి వేడి గంజి గుంటలో గోపన్న కుమారుడు పడి చనిపోయాడు. ఆ బిడ్డను గోపన్న తీసుకువెళ్ళి రాముని పాదాల దగ్గర పడుకోబెట్టాడు. శ్రీరామచంద్రుని మనసు కరిగేలా ప్రార్థించాడు. చనిపోయిన బిడ్డ నిద్ర నుంచి లేచినట్లు లేచాడు. ఆనాటి నుంచి గోపన్నను అందరూ రామదాసని పిలవడం ప్రారంభించారు.
ఒకసారి రామదాసు ప్రభుత్వ అనుమతి లేకుండా ఆరు లక్షల వరహాలు ఖర్చుపెట్టి దేవతా విగ్రహాలకు ఆభరణాలను చేయించాడు. ఆ విషయం తెలుసుకున్న తానాషా రామదాసును బంధించి చెరసాలలో వేయించాడు. అలా 12 సంవత్సరాలు చెరలో బాధపడుతున్న రామదాసును ఎలాగైనా విడిపించాలని రాముడు భావించాడు. రామలక్ష్మణులు ఇరువురు మారువేషాలలో తానాషా వద్దకు వెళ్ళి రామదాసు చెల్లించవలసిన డబ్బు చెల్లించి రామదాసుకు చెర నుండి విముక్తి కలిగించారు. రామదాసు భద్రాద్రిలో ఉంటూ హరినామ స్మరణతో కాలం వెళ్ళబుచ్చాడు.