Telangana SCERT 6th Class Telugu Study Material Telangana ఉపవాచకం 2nd Lesson మన జాతర – జన జాతర Textbook Questions and Answers.
TS 6th Class Telugu Guide Upavachakam 2nd Lesson మన జాతర – జన జాతర
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
జాతరల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
‘జాతర’ అనే పదం ‘యాత్ర’ అనే సంస్కృత పదానికి వికృతి రూపం. ఉత్తరాలు, సెల్ఫోన్లు, రవాణా సౌకర్యాలు లేని కాలంలో జనం ఒకచోట కలుసుకొని మాట్లాడుకునేది జాతరలోనే. పుట్టినా, చనిపోయినా, ఈ వార్తలన్నీ తెలిసిపోయేది జాతరలోనే. ఊరికి దూరంగా వాగుపక్కనో, అడవి మధ్యనో జాతరలు రెండు, మూడు రోజులు జరిగేవి. జనం బండ్లు కట్టుకొని వంట సామగ్రి తీసుకునిపోయి రెండు, మూడు రోజులు ఆత్మీయులతో కలిసి కడుపు నిండా మాట్లాడుకొని వచ్చేవారు.
కాబట్టి మనుషులు కలుసుకోవడం, ఒక ఊరిలో జరిగిన మార్పులు, వింతలు విశేషాలు మరో ఊరికి తెలియడం ఈ జాతరల వెనుక అసలు ఉద్దేశం.
ప్రశ్న 2.
సమ్మక్క- సారక్కల జాతర జరిగే ప్రాంతాన్ని గూర్చి తెలపండి.
జవాబు.
జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం దగ్గర అడవి మధ్యలో ‘చిలుకల గుట్ట’ ఉన్నది. చుట్టు దట్టమైన అడవి. ఇక్కడ రెండేండ్లకొకసారి మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి మొదలుకొని మూడు రోజులపాటు జరిగే ఈ జాతరనే సమ్మక్క – సారక్క జాతర అంటారు.
ఇది పూర్తిగా గిరిజన సంప్రదాయ రీతిలో జరిగే జాతర. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలమంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
ప్రశ్న 3.
సమ్మక్క- సారక్కలు ఎవరు ?
జవాబు.
సమ్మక్క – సారక్కలు ఇద్దరు తల్లీకూతుళ్లు. గిరిజనులచే దేవతామూర్తులుగా కొలువబడి ఆరాధింపబడేవారు. గిరిజన హక్కుల కోసం ఎదురు తిరిగి పోరాడిన వీరవనితలు. చిన్నప్పటి నుంచే సమ్మక్క చెట్లవైద్యం చేస్తూ తోటి గిరిజనులను రక్షించేది. ఆమెకు మహిమలు ఉన్నాయని, దేవతామూర్తి అనీ గిరిజనులు భావించేవారు. సమ్మక్క మేడారంను పాలించే పగిడిద్దరాజును పెళ్ళి చేసుకుంది. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కొడుకు పుట్టారు.
ప్రశ్న 4.
సమ్మక్క- సారక్కల మేడారం జాతర జరిగే విధం తెలపండి.
జవాబు.
ఈ జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు. వారు నియమనిష్ఠలతో జాతర కార్యక్రమం చేస్తారు. చిలకలగుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుట్టపైకి ఎవరూ పోరు. జాతరకు ముందర ఒక కోయ యువకుడు చిలకలగుట్ట మీదికి పోయి పసుపు, కుంకుమ ఉన్న భరిణను, వెదురుగడను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు. సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దె అని సారలమ్మ వీర మరణం పొందిన చోటును పిల్లగద్దె అని అంటారు. ఈ తతంగాన్ని ‘దేవతలను ఆహ్వానించడం’ అంటారు. తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. మూడవనాడు దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.
ప్రశ్న 5.
మేడారం జాతరలో అమ్మవారి మొక్కులు ఎలా తీర్చుకుంటారో తెలపండి.
జవాబు.
మేడారం జాతరలో భక్తులు వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరలో బెల్లాన్ని ‘బంగారం’ అంటారు. భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు. అంటే తమ బరువుకు సరిపోయిన బంగారాన్ని కొని అక్కడ పంచిపెడతారు. అంతేకాకుండ ఒడిబియ్యం, తలవెంట్రుకలు ఇయ్యడం, వెదురుతొట్టె కట్టడం, కోడెలను కట్టేయడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటారు.
చదువడం – అవగాహన చేసుకోవడం:
I. కింది పేరాను చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం దగ్గర అడవిమధ్యలో ‘చిలకలగుట్ట’ ఉన్నది. చుట్టు దట్టమైన అడవి. ఇక్కడ రెండేండ్లకొకసారి మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. మాఘ శుద్ధ పౌర్ణమి (ఫిబ్రవరి నెలలో) మొదలుకొని మూడు రోజులపాటు జరిగే ఈ జాతరనే, సమ్మక్క – సారక్క జాతర అంటారు. ఇది పూర్తిగా గిరిజన సంప్రదాయరీతిలో జరిగే జాతర. కేవలం మన రాష్ట్రం నుంచేకాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలమంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
‘చిలుకలగుట్ట’ ఎక్కడ ఉన్నది ?
జవాబు.
మేడారం గ్రామం దగ్గర అడవి మధ్యలో ‘చిలకలగుట్ట’ ఉన్నది.
ప్రశ్న 2.
ఇక్కడ ఎన్ని రోజులపాటు జాతర జరుగుతుంది ?
జవాబు.
ఇక్కడ మూడు రోజులపాటు జాతర జరుగుతుంది.
ప్రశ్న 3.
ఇక్కడ జరిగే జాతర పేరు ఏమిటి ?
జవాబు.
ఇక్కడ జరిగే జాతర పేరు ‘సమ్మక్క – సారక్క జాతర.
ప్రశ్న 4.
పూర్తిగా గిరిజన సంప్రదాయరీతిలో జరిగే జాతర ఏది ?
జవాబు.
‘సమ్మక్క – సారక్క’ జాతర పూర్తిగా గిరిజన సంప్రదాయ రీతిలో జరుగుతుంది.
ప్రశ్న 5.
‘సమ్మక్క – సారక్క’ జాతర ఎప్పుడు జరుగుతుంది ?
జవాబు.
‘సమ్మక్క – సారక్క జాతర మాఘ శుద్ధ పౌర్ణమి మొదలుకొని మూడు రోజులపాటు జరుగుతుంది.
II. కింది పేరాను చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచి ఆరాధించే సమ్మక్క – సారక్కలు ఇద్దరు తల్లీకూతుళ్లు, గిరిజన హక్కుల కోసం ఎదురుతిరిగి పోరాడిన వీరవనితలు.
12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా ‘పొలవాస’ ప్రాంతాన్ని గిరిజనదొర మేడరాజు పాలిస్తుండేవాడు. అతడికి సంతానం లేదు. ఒకనాడు వేటకు వెళ్లి అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న చిన్నపిల్లను చూశాడు. దేవుడిచ్చిన వరంగా భావించి ఆ పాపను ఇంటికి తెచ్చి సాదుకున్నాడు. సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచే సమ్మక్క చెట్లవైద్యం చేస్తూ తోటి గిరిజనులను రక్షించేది. ఆమెకు మహిమలు ఉన్నాయని, దేవతామూర్తి అనీ గిరిజనులు భావించేవారు. సమ్మక్క గిరిజన గూడానికి తలలో నాలుకయింది.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
సమ్మక్క సారక్కలు ఎవరు ?
జవాబు.
సమ్మక్క – సారక్కలు తల్లీకూతుళ్లు.
ప్రశ్న 2.
వీరు దేని కోసం పోరాడారు ?
జవాబు.
వీరు గిరిజన హక్కుల కోసం పోరాడారు.
ప్రశ్న 3.
మేడరాజు ఏ ప్రాంతాన్ని పాలిస్తుండేవాడు ?
జవాబు.
మేడరాజు కరీంనగర్ జిల్లా ‘పొలవాస’ ప్రాంతాన్ని పాలిస్తుండేవాడు.
ప్రశ్న 4.
చిన్నపిల్ల ఎక్కడ ఆడుకుంటున్నది ?
జవాబు.
చిన్నపిల్ల అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్నది.
ప్రశ్న 5.
సమ్మక్కను గురించి గిరిజనులు ఎలా భావించేవారు ?
జవాబు.
సమ్మక్కకు మహిమలు ఉన్నాయని, దేవతామూర్తి అనీ గిరిజనులు భావించేవారు.
III. కింది పేరాను, చదువండి. అయిదు ప్రశ్నలు తయారుచేయండి.
జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు. వారు నియమనిష్ఠలతో జాతర కార్యక్రమం చేస్తారు. చిలకలగుట్టను। గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుట్టపైకి ఎవరూ పోరు.
జాతరకు ముందర ఒక కోయ యువకుడు చిలకలగుట్ట మీదికి పోయి పసుపు కుంకుమ ఉన్న భరిణను, వెదురుగడను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు. సమ్మక్క గాయపడ్డ చోటును తల్లిగద్దె అని, సారలమ్మ వీరమరణం పొందిన చోటును పిల్లగద్దె అని అంటారు. ఈ తతంగాన్ని ‘దేవతలను ఆహ్వానించడం’ అంటారు. తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. మూడవనాడు దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
జవాబు.
ప్రశ్నలు తయారుచేయుట :
- జాతర కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తారు ?
- చిలకలగుట్టను గిరిజనులు ఎలా భావిస్తారు ?
- జాతర ఎలా మొదలవుతుంది ?
- తల్లిగద్దె, పిల్లగద్దె అని వేటిని అంటారు ?
- జాతర ఎలా ముగుస్తుంది ?
IV. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
జాతర అంటే జనం ఒక్కచోట గుమిగూడడం, కష్టం, సుఖం చెప్పుకోవడం. జాతర పదం సంస్కృత ‘యాత్ర’కు వికృతి రూపం. ఇప్పుడు ఉత్తరాలు, సెల్ఫోన్లు, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కాని ఇవేవీ లేని కాలంలో సకలజనం కలుసుకుని మాట్లాడుకొనేది జాతరలోనె. పుట్టినా, చనిపోయినా, ఈ వార్తలన్నీ తెలిసిపోయేది జాతరలోనె. ఊరికి దూరంగా వాగు పక్కనో, అడవి మధ్యనో జాతరలు రెండు, మూడు రోజులు జరిగేవి. జనం బండ్లు కట్టుకొని వంటసామాగ్రి తీసుకొని పోయి రెండు మూడు రోజులు ఆత్మీయులతో కలిసి కడుపునిండా మాట్లాడుకొని వచ్చేవారు. మనుషులు కలుసుకోవడం, ఒక ఊరిలో జరిగిన మార్పులు, వింతలు విశేషాలు మరో ఊరికి తెలియడం ఈ జాతరల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ప్రస్తుతం భారతదేశంలోనే అతి పెద్ద జాతరగా పేరు పొందినది ‘మేడారం’ గిరిజన జాతర.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
‘జాతర’ పదానికి సంస్కృత పదం (ప్రకృతి) ఏది ?
జవాబు.
యాత్ర
ప్రశ్న 2.
పూర్వం లేనివి, ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఏవి ?
జవాబు.
ఉత్తరాలు, సెల్ఫోన్, రవాణా సౌకర్యాలు
ప్రశ్న 3.
జాతరలు ఎన్ని రోజులు జరుగుతాయి ?
జవాబు.
రెండు మూడు రోజులు
ప్రశ్న 4.
జాతరలు జరగడంలోని అసలు ఉద్దేశం ?
జవాబు.
మనుషులు కలుసుకోవడం
ప్రశ్న 5.
మన దేశంలో జరిగే అతిపెద్ద జాతర ఏది ?
జవాబు.
‘మేడారం’ గిరిజన జాతర
V. కింది పేరాను చదివి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
సమ్మక్కకు పెండ్లి వయసు వ వచ్చింది. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు. ఇతడు కాకతీయులకు సామంతరాజుగా ఉండి మేడారంను పాలిస్తుండేవాడు. పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్ళి చేశారు. సమ్మక్క మేడారం రాజ్యంలోకి అడుగు పెట్టింది. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే ఇద్దరు బిడ్డలు, జంపన్న అనే కొడుకు పుట్టారు. సమ్మక్క ప్రజల పక్షం వహించి పరిపాలనలో మార్పులు చేసింది. గిరిజనుల కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. ప్రజల బాగోగులు స్వయంగా తెలుసుకున్నది. మహారాణులంటే మేడల్లోనే ఉంటారు. ప్రజలకు కనిపించరు. కాని మేడారం మహారాణి సమ్మక్క మాత్రం ఎప్పుడు ప్రజలమధ్యనే ఉండేది.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
మేడారంను పాలించిన సామంతరాజు ?
జవాబు.
పగిడిద్ద రాజు
ప్రశ్న 2.
మేడారంలో అడుగు పెట్టినదెవరు ?
జవాబు.
సమ్మక్క
ప్రశ్న 3.
సమ్మక్క, పగిడిద్దరాజుల సంతానం ?
జవాబు.
నాగులమ్మ, సారలమ్మ, జంపన్న
ప్రశ్న 4.
సమ్మక్క ఎవరి పక్షం వహించింది ?
జవాబు.
ప్రజల పక్షం
ప్రశ్న 5.
మేడల్లో ఉండేదెవరు ?
జవాబు.
మహారాణులు
సారాంశం:
సమ్మక్క – సారక్కల మేడారం జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది. మాఘశుద్ధ పౌర్ణమి మొదలుకొని మూడు రోజులు ఈ జాతర జరుగుతుంది.
సమ్మక్క – సారక్క (సారమ్మ)లు తల్లీకూతుళ్లు. గిరిజన హక్కుల కోసం కాకతీయ ప్రతాపరుద్రునికి ఎదురు తిరిగి పోరాడిన వీరవనితలు. ఆ పోరులో తమ పక్షం వారంతా మరణించగా చివరికి ఒక సమ్మక్క మాత్రమే మిగిలింది. ఆమె కత్తి పట్టి వీరోచితంగా పోరాడుతూ శత్రుసైన్యాలను ఎదుర్కొన్నది. ఒక సైనికుడు దొంగచాటుగా వెనుక నుంచి వెళ్ళి బల్లెంతో ఆమె వీపులో పొడిచాడు. గాయపడిన సమ్మక్క గుర్రం మీద ఈశాన్య దిక్కున ఉన్న చిలకల గట్టు మీదికి పోయింది. ఎంత వెతికినా మళ్ళీ ఎవరికీ కనిపించలేదు.
సమ్మక్క కోసం వెదుకుతున్న గిరిజనులకు ఓ నెమలి, నారచెట్టు, దాని కింద ఓ పుట్ట, ఆ పుట్ట మీద ఓ కుంకుమ భరిణ కనిపించింది. ఆ భరిణలో పసుపు, కుంకుమ, చెట్ల మూలికలు కనిపించాయి. సమ్మక్క తల్లి దేవతారూపం పొందిందని గిరిజనుల నమ్మకం.
ప్రతాపరుద్రుని కలలో కులదైవం ‘ఏకవీరాదేవి’ కనిపించి సమ్మక్క మానవరూపంలో వచ్చిన దేవత అని ఆమెకు జాతర జరిపించాలని చెప్పిందట. అప్పటి నుండి అక్కడ జాతర జరుగుతోంది.
సమ్మక్క గాయపడ్డ చోటును ‘తల్లిగద్దె’ అని, సారలమ్మ వీరమరణం పొందిన చోటును ‘పిల్లగద్దె’ అని అంటారు. ఈ తతంగాన్ని ‘దేవతలను ఆహ్వానించడం’ అంటారు. తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. మూడవనాడు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ జాతరలో భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని (తమ బరువుకు సరిపోయిన బెల్లాన్ని) కొని అమ్మవారికి చెల్లించుకుంటారు. అది భక్తులకు పంచిపెడతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ పండుగకు మరింత ప్రాచుర్యం ఏర్పడింది.