Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 2nd Lesson సముద్ర ప్రయాణం Textbook Questions and Answers.
TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం
చదువండి – ఆలోచించి చెప్పండి: (TextBook Page No. 10)
పడవలో ఇంకా ఇద్దరు భారతీయ విద్యార్థులుండిరి. వారు నాతో మాట్లాడుతూ ఉండిరి. సర్కారువారు వారికి స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లండుకు బయలుదేరినాను. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండె. ధోతి, పయిజామా, షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవుని పైన భారం వేసినాను. బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను.
గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనపడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి, కృతజ్ఞతా వందనం చేసితిని.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు ?
జవాబు.
పడవలోని వాళ్ళు గ్రేట్ బ్రిటన్ క్కు ప్రయాణమైపోతున్నారు.
ప్రశ్న 2.
వాళ్ళు బ్రిటన్కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు ?
జవాబు.
వాళ్ళు బ్రిటన్కు చదువుకోవడానికి వెళ్ళి ఉండవచ్చు.
ప్రశ్న 3.
పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పటానికి గల కారణాలు ఏమై ఉంటాయి ?
జవాబు.
పడవలో ప్రయాణించిన వ్యక్తి తన దగ్గర డబ్బు లేకపోయినా గ్రేట్ బ్రిటన్లో చదువుకోవడానికి వెళ్తున్నాడు. ఎక్కడ ఆ దేశస్తులు తన దగ్గర డబ్బు లేదని తెలుసుకొని వెనక్కి పంపిస్తారని భయపడి దైవంపై భారం వేశాడు. చివరకు దైవానుగ్రహంతో బ్రిటన్ చేరాడు. అందుకోసం ఆ ప్రయాణీకుడు కృతజ్ఞతగా దేవునికి చెప్పుతుండవచ్చని అనుకుంటున్నాను.
ఆలోచించండి – చెప్పండి: (TextBook No.14)
ప్రశ్న 1.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణీకులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.
జవాబు.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కోసం సెల్ఫోన్లో పాటలు వినడం, వీడియోలోని, ఆటలను చూడటం, పత్రికలను చదవడం, రకరకాల ఆటలను ఆడడం, నవలలు, పుస్తకాలు చదవడం చేస్తున్నారు.
ప్రశ్న 2.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో ఎట్లా ఉండాలి ? ఎందుకు ?
జవాబు.
ప్రయాణాలు చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలి. స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. తగాదాలకు అవకాశం ఇవ్వకూడదు. తోటి ప్రయాణీకులతో ఘర్షణ పడితే మనకు, మనతోటి వారికి ప్రశాంతత ఉండదు.
ప్రశ్న 3.
కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులెదురవుతాయి ? అప్పుడు మీరేం చేస్తారు ?
జవాబు.
నేను ఏ ప్రాంతానికి వెళ్తానో అక్కడి భాషాపరిజ్ఞానాన్ని సంపాదిస్తాను. సామాన్యంగా వాడే పదాలను, కొన్ని వాక్యాలను నేర్చుకుంటాను. అయినా తోటివారి సహకారం తీసుకుంటాను. వీటివల్ల భాషా సమస్య లను తొలగించుకుంటాను.
ఆలోచించండి – చెప్పండి: (TextBook No.15)
ప్రశ్న 1.
విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని సరిచేసుకోవాలి. దీనికి కారణం ఏమిటి ?
జవాబు.
విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలోని సమయాన్ని తప్పకుండా సరిచేసుకోవాలి. భౌగోళికంగా దేశాల మధ్య సూర్యోదయం ఒక రకంగా ఉండదు. దాంతో దేశాల మధ్య సమయంలో వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల మనం ఏ దేశానికి వెళ్తున్నామో ఆ దేశానికి సంబంధించిన కాలాన్ని అనుసరించి గడియారంలోని సమయాన్ని సవరించుకోవాలి. ‘
ప్రశ్న 2.
విదేశాలలో మనకు తెల్సినవారు, బంధువులుంటే ఎట్లాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి.
జవాబు.
విదేశాలలో మనకు తెల్సినవారు, బంధువులు ఉంటే మనం ఎన్నో సౌకర్యాలను పొందవచ్చు. భాషాపరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చు. చారిత్రాత్మకమైన ప్రదేశాలను వాళ్ళ సహాయంతో చూడవచ్చు. ఆయా దేశాల నియమనిబంధనలను వాళ్ళతో తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకోవచ్చు.
ప్రశ్న 3.
“ఈశ్వరా నీవే దిక్కు” అని రచయిత అనుకోవటానికి కారణమేమిటి ? మీకెదురైన అట్లాంటి సందర్భాన్ని చెప్పండి.
జవాబు.
ప్రమాదాలు కలుగుతున్నప్పుడే ఎక్కువగా భగవంతుడు గుర్తుకు వస్తాడు. ఆ సమయాల్లో తప్పక భగవంతుడిని శరణు వేడుతాము. నేను ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నాను. కొండల అంచుల్లో వెళ్తున్నది. కొండల మలుపులో ఒక పెద్దరాయిని గుద్దుకుంది. బస్సు క్రింద పడిపోయే స్థితిలో ఉంది. ఆ సమయంలో నేను భగవంతుడిని ఎవరికి, ఎలాంటి ఆపద కలుగ కుండా చూడమని కోరాను. అదృష్టవశాత్తు ప్రమాదం తప్పింది. అందరం క్షేమంగా బయటపడినాము. ఇది నా జీవితంలో మరచిపోలేని సంఘటన.
ఆలోచించండి- చెప్పండి: (TextBook No.16)
ప్రశ్న 1.
రచయితకు సురేశ్ బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది ?
జవాబు.
రచయితకు సురేశ్ సహాయం లేకుండానే అనుమతి లభించింది. దానికి రచయిత అధికారితో చదువు కోవడానికి వచ్చానని చెప్పడమే. అదీగాక అతనిలో చదువుకోవాలనే సంకల్పం గాఢంగా ఉంది. ఈ కారణాల వల్ల రచయితకు సురేష్ సహాయం లేకుండానే అనుమతి లభించింది.
ప్రశ్న 2.
ఏయే సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపు కుంటారో తెల్పండి.
జవాబు.
భగవంతుడు మనకు ఎన్నో సందర్భాల్లో సహాయ పడతాడు. అలాంటి సమయాల్లో కృతజ్ఞతలు చెప్పడం మనందరి విధి. ముఖ్యంగా పరీక్షలో అత్యధిక మార్కులు వచ్చినప్పుడు, భూకంపం వంటి ప్రకృతి బీభత్సాలు రాకుండా, ప్రజలకు అసౌకర్యాన్ని కల్గించనందుకు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీరినప్పుడు కృతజ్ఞతలు తెలుపుతాము.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.
ప్రశ్న 1.
ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
జీవితంలో ఏదైనా సాధించాలన్నా, ఏదైనా ఒక పని చేయాలన్నా, అందుకు తగిన సమర్థత అవసరం. అయితే సమర్థత ఉన్నంత మాత్రాన అన్ని పనులు చేయలేం, అన్నింటిని సాధించలేం. సమర్థతకు తగిన సాధన, నిరంతర శ్రమ తోడైనప్పుడు ఆశించిన గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధమయిన సమర్థత నిక్షిప్తం అయి ఉంటుంది.
ఒక వ్యక్తి బాగా పాడగలుగుతాడు, ఇంకొక వ్యక్తిలో మంచి కవిత్వం రాయగల శక్తి ఉంటుంది. మంచి వ్యక్తిత్వం ఉంటుంది. మరొక వ్యక్తిలో చిత్రలేఖనా నైపుణ్యం దాగి ఉంటుంది. వారి వారి శక్తిసామర్థ్యాలను గుర్తించి పట్టుదలతో కృషి చేస్తే ఆయా రంగాలలో పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోగలుగుతారు.
ఇలా కాక మనకు పరిచయం లేని విషయాలలో ఏదో సాధించాలని ప్రయత్నించి కొందరు నవ్వులపాలు అవుతూ ఉంటారు. కాబట్టి తమ తమ సామర్థ్యాలను, అభిరుచుల్ని ఎవరికి వారు గుర్తించి ఆ దిశలో కృషిని కొనసాగించటం మంచిది.
సామర్థ్యం అనేది వ్యక్తిలో అంతర్గతంగా ఉంటుంది. దానిని గుర్తించి సాధన చేసి అభివృద్ధిని సాధించాలి. అంతే తప్ప బయటకు కనిపించే వస్త్రధారణ వంటి ఆడంబరాల వలన కుర్చీలు, బెంచీలు పరికరాల వలన లేని సామర్థ్యం రాదు, పెరగదు. “సాధనమున పనులు సమకూరు ధరలోన” అన్న వేమన మాటలు గుర్తుపెట్టుకొని మసలుకోవాలి.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
ప్రశ్న 1.
కింది వాక్యాలు. పాఠంలోని ఏ పేరాలో ఉన్నవో గుర్తించి, పేరాకు శీర్షికను పెట్టండి.
జవాబు.
వాక్యం | పేరా సంఖ్య | శీర్షిక |
పడవలో రిసెప్షన్ రూం కూడా ఉంటుంది. | 5 | సమాచార గది |
నేను ధోవతి శేర్వానీతో ఉంటిని. | 9 | వాగ్భూషణం |
ఏవేళ ప్రాణం పోతుందో. | 1 | ప్రాణభయం |
మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది. | 19 | ఈశ్వరానుగ్రహం |
ప్రశ్న 2.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వేస్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదావరినది తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది.
ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచమిరోజు పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది.
అ) బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు ?
జవాబు.
బాసర పుణ్యక్షేత్రంలో వెలసిన దేవత శ్రీ జ్ఞాన సరస్వతీదేవి.
ఆ) సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది ?
జవాబు.
సరస్వతీదేవి ఆలయం గోదావరి నదీ తీరాన ఉన్నది.
ఇ) సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు ఎవరు ?
జవాబు.
సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు వేదవ్యాస మహర్షి.
ఈ) నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ?
జవాబు.
నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ రోజుల్లో జరుగుతాయి.
ఉ) పై పేరాకు శీర్షిక సూచించండి.
జవాబు.
పై పేరాకు ‘బాసర పుణ్యక్షేత్రం’ అనే శీర్షిక తగినది.
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) దూరప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జవాబు.
దూరప్రయాణాలకు పోయేటప్పుడు ప్రయాణీకులు కనీస జాగ్రత్తలను తీసుకోవాలి. దీనివల్ల ప్రయాణం సుఖవంతంగాను, ఆరోగ్యప్రదంగాను, ఆనందమయంగాను ఉంటుంది. వాటిల్లో కొన్ని –
- ప్రయాణపు రోజులకు అవసరమైన బట్టలను, నిత్యము ఉపయోగించే నూనె, సబ్బులు మొదలైన వాటిని దగ్గర ఉంచుకోవాలి.
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముందస్తుగా కొన్ని మందులను దగ్గర ఉంచుకోవాలి.
- శీతల ప్రాంతాలకు వెళ్ళేవారు, దానికి తగ్గట్టుగా బట్టలను సిద్ధం చేసుకోవాలి.
- రాకపోకలకు సంబంధించిన రిజర్వేషన్ ముందుగానే చేయించుకోవాలి.
- నిత్యావసరాలు తీరడానికి అనువుగా కొంత డబ్బును, బ్యాంకు కార్డులను దగ్గర ఉంచుకోవాలి.
- విలువైన బంగారు ఆభరణాలను ధరించకూడదు.
ఆ) రచయిత ఉన్నతవిద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా ! దీని ద్వారా మీరేం గ్రహించారు ?
జవాబు.
రచయిత ఉన్నతవిద్యను చదువడం కోసం పట్టుదలతో ఇంగ్లాండుకు వెళ్ళాడు. మానవునికి పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధ్యమౌతుందని గ్రహించాను. జీవితంలో చదువు చాలా గొప్పది. దానిని ప్రతి మానవుడు కష్టపడి సాధించాలి. పేదరికం చదువుకు ఆటంకం కాదని, పట్టుదల ఉంటే ఏ అవరోధం ఏమీ చేయలేదని గ్రహించాను. చదువనేది ప్రయత్నం చేసేవానికి సిద్ధిస్తుందని రచయిత అనుభవం ద్వారా తెలుసుకున్నాను.
ఇ) “ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు” వివరించండి.
జవాబు.
మానవ జీవితం చాలా దుర్లభమైంది. దాన్ని మానవుడు సార్థకం చేసుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలన్నా, ఏదైనా ఒక పని చేయాలన్నా అందుకు తగిన లక్ష్యం, దానికి మించిన పట్టుదల ఉండాలి. కేవలం లక్ష్యం ఉన్నంత మాత్రాన అన్ని పనులను చేయలేము. అన్నింటిని సాధించలేము. లక్ష్యానికి తగిన సాధన, నిరంతర పరిశ్రమ తోడైనప్పుడు ఆశించిన గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.
పట్టుదల అనేది వ్యక్తిలో అంతర్గతంగా ఉంటుంది. దానిని గుర్తించి సాధన చేయాలి. లక్ష్యసాధనలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ కారణాలవల్ల జీవితంలో ఉన్నత లక్ష్యం, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు అనే నిజాన్ని గ్రహించాలి.
ఈ) ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెల్సుకోవడానికి మీరేం చేస్తారు ?
జవాబు.
ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల దర్శింపదలచిన ప్రాంతంలోని విశేషాలను సులభంగా తెలుసుకొనగలుగుతాము. దర్శించిన ప్రాంతంలో ఒక గైడును ఏర్పాటు చేసుకుంటాను. ప్రత్యేక వాహనాన్ని కూడా దగ్గర ఉంచుకుంటాను. గైడు సహాయంతో అక్కడి విశేషాలను, వింతలను, స్థలము యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటాను.
లేదా మనకు తెలిసిన బంధువులను, మిత్రులను ముందుగా సంప్రదించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా విశేషాలను తెలుసుకుంటాను. దర్శించిన ప్రాంతానికి చెందిన పుస్తకాలను చదివి మరికొన్ని విశేషాలను తెలుసుకుంటాను. ఈ రకంగా దర్శించిన ప్రాంతానికి చెందిన విశేషాలను తెలుసుకుంటాను.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) “అనుకున్నది సాధించటంలో కలిగే తృప్తి అనంతమైంది.” ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి.
జవాబు.
కరీంనగర్ జిల్లా మంథని గ్రామస్థుడైన ముద్దు రామకృష్ణయ్యగారు పట్టుదలకు మారుపేరుగా నిలిచాడు. ఉన్నత లక్ష్యసాధన కోసం ఎన్నో అడ్డంకులను, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. వాటిని తన ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకున్నాడు. అందరికి మార్గదర్శకుడిగా నిలిచాడు.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రామకృష్ణయ్య లండనుకు వెళ్ళి ఉన్నతవిద్యను చదువుకోవాలనుకున్నాడు. కష్టాలు ఎదురౌతాయని ముందుగానే గ్రహించాడు. తాను పేదరికంతో ఉన్నా దానిని లెక్కపెట్టలేదు. బొంబాయి (ముంబయి)లో పడవ ఎక్కాడు. పడవలోని వాతావరణం మొదట్లో ఇబ్బందిగా ఉంది. అయినా దాన్ని ధైర్యంగా అధిగమించాడు. సాధారణమైన పంచె, పయిజామా, షేర్వాణీతోనే ప్రయాణం చేశాడు. ప్రయాణీకుల్లో చాలామంది ఆంగ్లేయులు ఉన్నారు. వారి భాష రాదు, తన భావాలను వ్యక్తం చేయలేడు.
లండన్లో ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుందని, లేకపోతే తిరిగి పంపిస్తారని తెలుసుకున్నాడు. దైవాన్ని ప్రార్థించాడు. తాను అనుకున్న విధంగా లండనులో ఉన్నతవిద్య పూర్తి చేయాలి. దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. ఇదే రామకృష్ణయ్య గారి లక్ష్యం. నౌకలో ప్రయాణిస్తున్న సురేశ్బబు సహకారం లభించింది. ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. నౌక దిగగానే భగవంతుని దయవల్ల రామకృష్ణయ్యకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రామకృష్ణయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన లక్ష్యాన్ని చేరుకొని అనుకున్న దాన్ని సాధించాడు. తోటివారందరికి స్ఫూర్తిగా నిలిచాడు.
IV. సృజనాత్మకత / ప్రశంస.
1. కింది వానిలో ఒకదానికి జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) చదువును కష్టంగా భావించవద్దు. ఉన్నత లక్ష్యం పెట్టుకొని, ఇష్టంగా చదువుకుని, అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.
లేఖ
జగద్గిరినగర్,
X X X X X.
ప్రియమైన మిత్రుడు రాజేషు,
శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యంగా వ్రాయునది నీవు ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో ప్రవేశాన్ని పొందావు. నీకు అంగవైకల్యం ఉన్నా పట్టుదలతో చదివి ర్యాంకు పొందావు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే చదువు గొప్ప సాధనం. ఇది నీకు తెలియంది కాదు. చదువును కష్టంగా ఏనాడు భావించవద్దు. మీ కుటుంబం నిరుపేదది. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తున్నారు కదా ! వారి ఆశయాలను నీవు నెరవేర్చాలి. అందుకోసం నీవు చదువులో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. విలాసాలతో, కబుర్లతో కాలాన్ని వృథా చేయవద్దు. చదివే చదువును ఇష్టంగా చదువు. నీపై నాకు ఆ నమ్మకం ఉంది. నీవు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను. భగవంతుని దీవెనలు కూడా నీకు ఉంటాయి.
ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
X X X X X X X.
చిరునామా :
పి.రాజేష్, 8వ తరగతి,
ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాల,
బాసర, ఆదిలాబాద్ జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
(లేదా)
ఆ) మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
ఇటీవలె మా బావ మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్కు బదలీ అయ్యాడు. మా అక్క బావలు ఆలంపూరుకు రమ్మని బలవంతపెడుతున్నారు.
వేసవి సెలవులు. “అక్కబావల వద్దకు వెళదాం’ అని నిర్ణయించుకున్నాం. అందుకు కాచిగూడా వెళ్ళి ఉదయం షుమారు 8 గంటల ప్రాంతంలో రైలు ఎక్కాం. కాని, జనంతో కిక్కిరిసి పోయింది ఆ రైలు. మేం ఎక్కిన బోగియంతా వెదికాం. 2 సీట్లు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. అమ్మనాన్నలను బలవంతంగా వాటిపై కూర్చోండి అన్నాం. తమ్ముడికి, చెల్లికి కిటికి ప్రక్కన కూర్చోవాలని ఆశ. మాకు ఎవ్వరికి సీట్లు దొరకలేదు. నిలబడే ఉన్నాం. అప్పుడప్పుడు తమ్ముడు, చెల్లి చెరొక కిటికీ వద్దకు వెళ్ళి, కిటికీలోంచి అనేక దృశ్యాలను చూస్తున్నారు. నాకు అలాంటి కోరిక ఉన్నా, లోలోపలనే అణుచుకున్నాను, కారణం పెద్దవాడిని కదా.
రైలులో అమ్ముకొనేవాళ్ళు సమోసాలు లాంటివి ఏవేవో అమ్ముతున్నారు. “వాటిని తినకూడదు” అని పండ్లు, వేరుశెనగ కాయలు ఇప్పించారు. మేం వాటిని తింటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాం. నాన్నకి కన్నడం మాట్లాడే వాళ్ళు దొరికారు. వారితో ఆయనకు కాలక్షేపం జరుగుతోంది. అమ్మ మాత్రం ఏమి తోచక దినపత్రిక ముందేసుకొని కాలక్షేపం చేస్తుంది. అప్పుడప్పుడు క్రాసింగ్ల వల్ల ఆగుతోంది రైలు. ఎంతో సేపటికి కాని కదలదు. ఆగినప్పుడల్లా జనం గోల. చికాకు కలుగుతోంది. ఇంతలో మేం దిగే స్టేషను వచ్చింది.
కొంచెం సేపే ఆగింది. సామానులు అన్ని భద్రంగా దించుకున్నాం. స్టేషనుకు మా బావ వచ్చాడు. మమ్మల్ని కలిసి అప్పటికే బేరం కుదుర్చుకున్న ఆటోలో ఎక్కమన్నాడు. అందరం దాంట్లో కూర్చున్నాం. ఆలంపూర్కు ఆటో బయలుదేరింది. అక్కడక్కడ రోడ్డంతా గుంటలు, మిట్టలతో నిండి వుంది. ఆటో కుదుపునకు ఒకప్రక్క నవ్వు, మరో ప్రక్క బాధ కలుగుతోంది. చివరకు ఇల్లు చేరుకున్నాం. ఆలస్యం అయినందుకు త్వరగా స్నానాలు చేసి, అన్నం తిని విశ్రాంతి తీసుకొన్నాం.
V. పదజాల వినియోగం:
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి.
అ) పై చదువుకు సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండె.
అ) శక్తి
ఆ) సామర్థ్యం
ఇ) డబ్బు
ఈ) వస్తువు
జవాబు.
ఇ) డబ్బు
ఆ) నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను.
అ) మాటతీసుకొను
ఆ) మాటయిచ్చు
ఇ) మాట మార్చు
ఈ) డబ్బు యిచ్చు
జవాబు.
ఆ) మాటయిచ్చు
2. కింది జాతీయాలను సొంతవాక్యాలలో రాయండి.
ఉదా : అందెవేసిన చేయి
సీసపద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందెవేసిన చేయి.
అ) పట్టరాని సంతోషం
జవాబు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకతో ప్రజలు పట్టరాని సంతోషం పొందారు.
ఆ) దేవునిపై భారం వేయు
జవాబు.
అంతా దేవునిపై భారం వేయుట ధీరుల లక్షణం కాదు.
ఇ) గుండె జల్లుమను
జవాబు.
భూకంప దృశ్యాలు గుండె జల్లుమనునట్లు ఉన్నాయి.
ఈ) చెమటలు పట్టు
జవాబు.
అరణ్యంలో పులిని చూడగానే నా శరీరం చెమటలు పట్టినట్లు అయింది.
VI. భాషను గురించి తెలుసుకుందాం:
1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి, వాటి పేర్లు రాయండి.
అ) ఆదిశేషునికి వేయితలలు : ______________________
జవాబు.
వేయి సంఖ్య గల తలలు – ద్విగు సమాసం
ఆ) కృష్ణార్జునులు సిద్ధమైనారు : ______________________
జవాబు.
కృష్ణుడును, అర్జునుడును – ద్వంద్వ సమాసం
ఇ) రవి, రాము అన్నదమ్ములు : ______________________
జవాబు.
అన్నయును, తమ్ముడును – ద్వంద్వ సమాసం
ఈ) వారానికి ఏడురోజులు : ______________________
జవాబు.
ఏడు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం
ఉ) నూరేండ్లు జీవించు : ______________________
జవాబు.
నూరు సంఖ్య గల ఏండ్లు – ద్విగు సమాసం
2. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) విద్యాభ్యాసం = ________ + ________ = _____________
జవాబు.
విద్య మొదలు + అభ్యాసం = సవర్ణదీర్ఘ సంధి
ఆ) మొదలయింది = ________ + ________ = _____________
జవాబు.
మొదలు + అయింది = ఉత్వసంధి
ఇ) విద్యార్థులు = ________ + ________ = _____________
జవాబు.
విద్య + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి ఇత్వసంధి
ఈ) ఏదైనా = ________ + ________ = _____________
జవాబు.
ఏది + ఐన = ఇత్వసంధి
ఉ) వారందరు = ________ + ________ = _____________
జవాబు.
వారు + అందరు = ఉత్వసంధి
అత్వ సంధి :
కింది పదాలను పరిశీలించండి.
అ) రామయ్య = రామ + అయ్య
ఆ) మేనత్త/మేనయత్త = + అత్త
ఇ) సెలయేరు = సెల + ఏరు
ఈ) ఒకానొక = ఒక + ఒక
సంధిని విడదీసినప్పుడు ఏర్పడే రెండు పదాలలో మొదటి పదాన్ని “పూర్వపదం” అని, రెండవ పదాన్ని “పరపదం” అని అంటారు.
పూర్వపదం చివర ఉన్న అచ్చు ఏది ?
పరపదం మొదట ఉన్న అచ్చు ఏది ?
పూర్వపదం చివరి అచ్చుకు పరపదం మొదటి అచ్చు కలిస్తే ఏం ఏర్పడింది ?
పై ఉదాహరణలు చూసినప్పుడు మొదటి పదం చివరన ‘అ’ అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదట అ, ఏ, ఒ మొదలైన అచ్చులు ఉన్నాయి. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అచ్చు ‘అ’ లోపించి రెండో పదం మొదటి అచ్చు. వచ్చి చేరితే కింది విధంగా ఉంటాయి.
- రామయ్య → లాంటి పదాల్లో సంధి ఎప్పుడూ అవుతుంది. (నిత్యం)
- మేనత్త, మేనయత్త లాంటి పదాల్లో సంధి జరగవచ్చు, జరుగకపోవచ్చు. (వైకల్పికం)
- సెలయేరు → లాంటి పదాలు ‘సెలేరు’ లాగా మారకుండా ‘సెలయేరు’ లాగానే ఉంటాయి. (నిషేధం)
- ఒకానొక → లాంటి పదాలు ‘ఒకొక్కలాగా మారకుండా మరోరూపంలోకి అంటే ‘ఒకానొక’లాగా మారుతాయి. (అన్యకార్యం)
(మొదటి పదం చివరి అచ్చు పూర్వస్వరం. రెండోపదం మొదటి అచ్చు పరస్వరం.)
‘అ’ కు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ ఔ) పరమైతే ఏర్పడే సంధి ‘అత్త్వసంధి’.
(అత్తు అంటే హ్రస్వమైన ‘అ’) నకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు.
3. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.
ఉదా : తగిన + అంత = తగినంత.
అ) చాలిన + అంత = ________
జవాబు.
చాలినంత
ఆ) సీత + అమ్మ = ________
జవాబు.
సీతమ్మ
ఇ) అక్కడ + ఇక్కడ = ________
జవాబు.
అక్కడిక్కడ
ఈ) అందక + ఉండెను = ________
జవాబు.
అందకుండెను
ఉ) చెప్పుట + ఎట్లు = ________
జవాబు.
చెప్పుటెట్లు
ఊ) రాక + ఏమి = ________
జవాబు.
రాకేమి
బహుళం :
సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని “బహుళం” అంటారు.
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:
ప్రశ్న 1.
వివిధ పత్రికలలో వచ్చే యాత్రారచనలను చదివి, వాటిలో ఒక దానికి నివేదిక రాయండి.
జవాబు.
గోల్కొండ కోట
గొల్లలు తమ మందల్ని మేపుకోవటం వల్ల గోలకొండకి మొదట్లో గొల్లకొండనే పేరుండేది. దీన్ని తెలుగురాజొకరు మట్టికోటగా కట్టగా దాన్ని ఓరుగల్లు రాజు కన్నయ్య నాయకుడు 1364లో బహమనీ సుల్తానులకిచ్చి వేశాడు. బహమనీ సుల్తానుల కొలువులోని సుల్తాన్ కులీకుతుబ్షా 1518లో గోల్కొండను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. కుతుబ్షా వంశస్తులు 1687 వరకు పాలించారు. 1687లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించాడు.
గోల్కొండకోట హైదరాబాదు నగర సమీపంలో నిర్మించబడింది. భారతదేశంలోని అజేయ దుర్గాలలో గోల్కొండ దుర్గం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ దుర్గం కోట గోడలు 11 కి.మీ. పరిధి గలిగి, 5 నుండి 6 మీటర్ల ఎత్తు వరకు నిర్మించబడ్డాయి. ఇచ్చటి నిర్మాణాలన్నీ గ్రానైట్ శిలలతో నిర్మించబడ్డాయి. డెభ్బై బురుజులు అన్ని వైపుల సైనికుల పహారాకు అనుకూలంగా నిర్మించబడ్డాయి.
కోట గోడ చుట్టూ లోతైన కందకం కూడా నిర్మించబడింది. కాని కాలక్రమంలో ఈ కందకం దాదాపు పూడిపోయింది. ఔరంగజేబు దండయాత్రల నుండి ఈ దుర్గం అజేయంగా నిలిచింది. చివరకు కొంతమంది ద్రోహుల సాయంతో దీన్ని ఔరంగజేబు కైవసం చేసుకున్నాడు.
ఈ దుర్గం సుమారు 120 మీటర్లు ఎత్తు గల కొండపై నిర్మించబడింది. దీనికి ఎనిమిది పెద్ద దర్వాజాలున్నాయి. దుర్గంలోని చాలా భవనాలు శిథిలమైనా ఇంకా వాటి రూపురేఖలు స్పష్టంగానే కనపడతాయి. రాణిగారి మహలు, స్నానపు కొలను మొదలైనవి ఇప్పటికీ ఆనాటి చరిత్రను తెలిపే విధంగా దర్శనమిస్తున్నాయి. మహా భక్తుడైన రామదాసు ఈ కోటలోనే చెరలో బంధించబడ్డాడు.
ఈ చెరసాల ఇప్పటికీ కనపడుతుంది. మహాద్వారం నుండి ఒక చిన్న గుహలో చేసిన శబ్దాలు 128 మీటర్ల దూరంలోని సభాభవనంలో వినబడేటట్లుగా నిర్మాణం చేయబడింది. గోల్కొండ కోట ఒకప్పుడు సర్వైశ్వర్య సంపన్నమైందని చరిత్ర చెపుతున్నది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూరు వజ్రం ఇక్కడ లభించినదేనని చాలామంది నమ్ముతున్నారు.
TS 8th Class Telugu 2nd Lesson Important Questions సముద్ర ప్రయాణం
I. అవగాహన – ప్రతిస్పందన:
అపరిచిత గద్యాలు:
1. కింది పేరా చదువండి. ఐదు ప్రశ్నలు తయారు చేయండి.
విద్యార్థులు వారి సహజ భాషలోనే మాట్లాడాలని అనుకుంటారు. రాయాలనీ అనుకుంటారు. అలా చేయడం వల్ల వారి సహజ నైపుణ్యాలు, తెలివితేటలు వెలుగులోకి వస్తాయి. కావలసిందల్లా వారికి కొంత స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించాలి. అది వారి ఎదుగుదలకు తోడ్పడుతుందే కాని మరొక దానికి కాదు. ఇవ్వడం ఎంత ముఖ్యమో, దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొనేలా చేయడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. స్వ + ఇచ్ఛ = స్వేచ్ఛ. తన కోరిక మేరకు ఆయా పరిధులలో విద్యార్థుల ఎదుగుదల జరగాల్సి ఉంటుంది. అది వారి ఇంటి నుండి మొదలుకొని, దేశం వరకు ఉత్తమ స్థితిని కలుగజేస్తుంది.
ప్రశ్న 1.
విద్యార్థుల సహజ నైపుణ్యాలు ఎప్పుడు వెలుగులోకి వస్తాయి?
జవాబు.
విద్యార్థులు వారి సహజ భాషలోనే మాట్లాడాలని అనుకుంటారు. రాయాలనీ అనుకుంటారు. అలా చేయడం వల్ల వారి సహజ నైపుణ్యాలు, తెలివితేటలు వెలుగులోకి వస్తాయి.
ప్రశ్న 2.
వీరికి ఎటువంటి వాతావరణాన్ని కల్పించాలి ?
జవాబు.
వారికి కొంత స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించాలి.
ప్రశ్న 3.
సద్వినియోగం చేసుకోవల్సిందెవరు ?
జవాబు.
స్వేచ్ఛా వాతావరణం
ప్రశ్న 4.
‘స్వేచ్ఛ’ విడదీయండి.
జవాబు.
స్వ + ఇచ్ఛ = స్వేచ్ఛ
ప్రశ్న 5.
‘విద్యార్థులు’ పదానికి వివరణ ఏమిటి ?
జవాబు.
విద్యను అభ్యసించేవారు.
2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పోయిన యౌవనమా తిరిగి వచ్చేది కాదు. జీవితమా శాశ్వతం కాదు. ఒకనాడు ఉన్నట్లు ఇంకొకనాడు ఉండదు. మరి జనాలకింత కాఠిన్యం ఎందుకబ్బిందో తెలియదు. చేతిలోకి వచ్చిందేదనం. కష్టాల్లో తోడ్నున్నవాడే మిత్రుడు. గుణంతో కూడుకొని వున్నదే అందం. ధర్మంతో కలిసి ఉన్నదే జ్ఞానం. ఇవి ప్రపంచ ప్రఖ్యాత ప్రాచీన సాహిత్య సంకలనం ‘గాథా సప్తశతి’లోనివి. మనిషిలో ఉండాల్సిన సద్గుణాలకు సంబంధించిన ఈ సంకలన కర్త ఒకటో శతాబ్దానికి చెందిన శాతవాహన చక్రవర్తి ‘హాలుడు’.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
హాలుడు ఎవరు ?
జవాబు.
శాతవాహన చక్రవర్తి
ప్రశ్న 2.
కష్టాల్లో తోడు ఉండేవాడు ఎవరు ?
జవాబు.
మిత్రుడు
ప్రశ్న 3.
జ్ఞానం దేనితో కలిసి ఉంటుంది ?
జవాబు.
ధర్మం
ప్రశ్న 4.
‘గాథా సప్తశతి’లో ఏ అంశం రాయబడి ఉంది ?
జవాబు.
మనిషిలో ఉండాల్సిన సద్గుణాలకు సంబంధించిన అంశం.
ప్రశ్న 5.
తిరిగి రానిది. ఏమిటి ?
జవాబు.
పోయిన యవ్వనం
II. స్వీయరచన:
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 మార్కులు)
ప్రశ్న 1.
ఇతర ఊళ్ళకు వెళ్ళినపుడు మీరెలా మెలగుతారు ?
జవాబు.
ఇతర ఊళ్ళకు వెళ్ళినప్పుడు స్నేహపూర్వకంగాను, మర్యాదపూర్వకంగాను ఎదుటివారితో ప్రవర్తిస్తాను. ‘ అక్కడ .. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాను.
నా మాటలు, పనులు అక్కడివారికి బాధించేవిగా ఉండకుండ జాగ్రత్తపడతాను. వారి పనులలో నాకు చేతనయినవి చేస్తాను. “ఎందుకొచ్చార్రా బాబూ” అని కాకుండా వెళుతున్నప్పుడు “మళ్ళీ ఎప్పుడు వస్తారు!” అని పిలిపించుకొనే విధంగా మెలగుతాను.
ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య బ్రిటన్ పడవ ప్రయాణంలో పరిచయమైన ‘ఆంగ్లో ఇండియన్’ ద్వారా తెలుసుకున్న విషయాలేమిటి?
జవాబు.
ముద్దు రామకృష్ణయ్య బ్రిటన్ పడవ ప్రయాణంలో పరిచయమైన వారిలో ‘ఆంగ్లో ఇండియన్’ ఫాల్సెట్టు ఒకరు. ఇంగ్లాండుకు సెలవుపైన వెళుతున్న ఆయనతో రామకృష్ణయ్యకు పడవలో స్నేహం కలిగింది. ఆయన పాశ్చాత్యుల అలవాట్లను, బ్రిటిష్ జీవితపు కథలను రామకృష్ణయ్యకు చెప్పాడు. అంతేగాక బ్రిటన్లో చదువుకోవడం బీదవారి తరం కాదని, వేల రూపాయలు ఉంటేగాని బ్రిటన్లో జీవితం జరుగదని, బ్రిటన్లో ఉద్యోగం దొరకదు అన్న విషయాలు తెలుసుకున్నాడు.
ఆ) క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)
ప్రశ్న 1.
‘సముద్ర ప్రయాణం’ పాఠం ఆధారం కొత్త ప్రదేశానికి వెళ్ళాల్సి’ వచ్చినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి రాయండి.
జవాబు.
కొత్త ప్రదేశానికి లేదా దూరప్రయాణాలకు పోయేటప్పుడు ప్రయాణీకులు కనీస జాగ్రత్తలను తీసుకోవాలి. దీనివల్ల ప్రయాణం సుఖవంతంగాను, ఆరోగ్యప్రదంగాను, ఆనందమయంగాను ఉంటుంది. వాటిల్లో కొన్ని –
- ప్రయాణపు రోజులకు అవసరమైన బట్టలను, నిత్యము ఉపయోగించే నూనె, సబ్బులు మొదలైన వాటిని దగ్గర ఉంచుకోవాలి.
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముందస్తుగా కొన్ని మందులను దగ్గర ఉంచుకోవాలి.
- శీతల ప్రాంతాలకు వెళ్ళేవారు, దానికి తగ్గట్టుగా బట్టలను సిద్ధం చేసుకోవాలి.
- రాకపోకలకు సంబంధించిన రిజర్వేషన్ ముందుగానే చేయించుకోవాలి.
- నిత్యావసరాలు తీరడానికి అనువుగా కొంత డబ్బును, బ్యాంకు కార్డులను దగ్గర ఉంచుకోవాలి.
- విలువైన బంగారు ఆభరణాలను ధరించకూడదు.
- అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి.
- అపరిచితులు ఇచ్చిన ఆహారాన్ని
ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం విశేషాలను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
పెద్దపల్లి జిల్లా మంథని గ్రామస్థుడైన ముద్దు రామకృష్ణయ్యగారు పట్టుదలకు మారుపేరుగా నిలిచాడు. ఉన్నత లక్ష్యసాధన కోసం ఎన్నో అడ్డంకులను, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. వాటిని తన ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకున్నాడు. అందరికి మార్గదర్శకుడిగా నిలిచాడు.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రామకృష్ణయ్య లండనుకు వెళ్ళి ఉన్నతవిద్యను చదువుకోవాలనుకున్నాడు. కష్టాలు ఎదురౌతాయని ముందుగానే గ్రహించాడు. తాను పేదరికంతో ఉన్నా దానిని లెక్కపెట్టలేదు. బొంబాయిలో పడవ ఎక్కాడు. పడవలోని వాతావరణం మొదట్లో ఇబ్బందిగా ఉంది. అయినా దాన్ని ధైర్యంగా అధిగమించాడు. సాధారణమైన పంచె, పయిజామా, షేర్వాణీతోనే ప్రయాణం చేశాడు. ప్రయాణీకుల్లో చాలా మంది ఆంగ్లేయులు ఉన్నారు. వారి భాష రాదు, తన భావాలను వ్యక్తం చేయలేడు.
లండన్లో ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుందని, లేకపోతే తిరిగి పంపిస్తారని తెలుసుకున్నాడు. దైవాన్ని ప్రార్థించాడు. తాను అనుకున్న విధంగా లండనులో ఉన్నతవిద్య పూర్తి చేయాలి. దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. ఇదే రామకృష్ణయ్యగారి లక్ష్యం. నౌకలో ప్రయాణిస్తున్న సురేశ్ బాబు సహకారం లభించింది.
ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. నౌక దిగగానే భగవంతుని దయవల్ల రామకృష్ణయ్యకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రామకృష్ణయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన లక్ష్యాన్ని చేరుకొని అనుకున్నదాన్ని సాధించాడు. తోటి వారందరికి స్ఫూర్తిగా నిలిచాడు.
III. సృజనాత్మకత:
ప్రశ్న 1.
అవయవదానం గొప్పదనే విషయంలో ప్రజలలో చైతన్యం కలిగించవల్సిందిగా తెలుపుతూ మండలాభివృద్ధి అధికారికి లేఖ రాయండి.
జవాబు.
లేఖ
భద్రాచలం,
X X X X X.
గౌరవనీయులైన మండల అభివృద్ధి అధికారి గారికి, అయ్యా!
విషయం : అవయవదానం – ప్రజల్లో చైతన్యం.
అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. దానికంటే మనలోని అవయవాలను తోటివారికి దానం చేయడం శ్రేష్ఠం. ఈ కాలంలో అవయవదానం వల్ల ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. వీటన్నింటిని దూరం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అవయవదానం వల్ల తోటివారిని సజీవంగా ఉంచే అవకాశం దొరుకుతుంది. కళ్ళను, కిడ్నీలను, గుండెను మొదలైన వాటిని దానంచేసే గుణాన్ని చిన్నతనం నుండే అలవరచుకోవాలి. అవయవదానంపై అవగాహన కలిగించే విధంగా ప్రభుత్వం ముఖ్యాంశాలను రూపొందించాలి. మీరు కూడా ఈ విషయంలో ముందు ఉంటారు అని ఆశిస్తున్నాను.
ఇట్ల మీ విశ్వాసపాత్రుడు,
X X X X X.
చిరునామా :
K. ఫణిరామ్ గారు, M.A.,
మండల అభివృద్ధి అధికారి,
భద్రాచలం, ఖమ్మం జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
IV. భాషాంశాలు:
పదజాలం:
పర్యాయపదాలు:
ప్రశ్న 1.
స్నేహితుడు : _____________
జవాబు.
మిత్రుడు, సఖుడు, చెలికాడు
ప్రశ్న 2.
రాత్రి : _____________
జవాబు.
రేయి, నిశి
ప్రశ్న 3.
నమ్మకం : _____________
జవాబు.
విశ్వాసం, నమ్మిక, ప్రత్యయం
ప్రశ్న 4.
సముద్రం : _____________
జవాబు.
సాగరం, అంబుధి, జలధి
ప్రశ్న 5.
మార్గం : _____________
జవాబు.
దారి, పథము
ప్రశ్న 6.
భూమి : _____________
జవాబు.
ధరణి, వసుధ, అవని
ప్రశ్న 7.
సైన్యం : _____________
జవాబు.
సేన, వాహిని
ప్రశ్న 8.
యుద్ధం : _____________
జవాబు.
సమరం, పోరు, అజి
ప్రశ్న 9.
తల : _____________
జవాబు.
శీర్షము, మూర్ధము
ప్రశ్న 10.
జాబు : _____________
జవాబు.
ఉత్తరం, లేఖ
నానార్థాలు:
ప్రశ్న 1.
రాజు = _____________
జవాబు.
ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు
ప్రశ్న 2.
ఈశ్వరుడు = _____________
జవాబు.
ప్రభువు, శంకరుడు
ప్రశ్న 3.
దిక్కు = _____________
జవాబు.
దిశ, వైపు, శరణు
ప్రకృతి – వికృతులు:
ప్రకృతి – వికృతి
1. స్నేహం – నెయ్యం
2. సంతోష – సంతసం
3. సహాయం – సాయము
4. రాత్రి – రేయి
5. పట్టణ – పత్తనం
6. ప్రయాణం – పయనం
7. వైద్యుడు – వెజ్జు
8. భాష – బాస
9. ఆహారం – ఓగిర
10. ఆశ్చర్యం – అచ్చెరువు
11. రాజు – రేడు, రాట్టు
వ్యాకరణాంశాలు:
సంధులు:
1. సవర్ణదీర్ఘ సంధి :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది.
ఉదా : చారిత్రాత్మకం = చారి + ఆత్మకం – సవర్ణదీర్ఘ సంధి
కటాక్షం = కట + అక్షం – సవర్ణదీర్ఘ సంధి
విద్యాభ్యాసం = విద్య + అభ్యాసం – సవర్ణదీర్ఘ సంధి
శాకాహారం = శాక + ఆహారం – సవర్ణదీర్ఘ సంధి
సూర్యాస్తమయం = సూర్య + అస్తమయం – సవర్ణదీర్ఘ సంధి
2. పడ్వాది సంధి : పడ్వాదులు పరమగునపుడు ము వర్ణమునకు లోపపూర్ణ బిందువులు విభాషణంబగు.
ఉదా : భయపడు = భయము + పడు
3. గసడదవాదేశ సంధి : ద్వంద్వంబుపై పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.
ఉదా : తల్లిదండ్రులు = తల్లి + తండ్రి
4. ఆమ్రేడిత సంధి : అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.
ఉదా : అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు
5. అత్వసంధి : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా : తగినంత = తగిన + అంత
వంటాయన = వంట + ఆయన
సమాసాలు:
సమాసపదం-విగ్రహవాక్యం-సమాసం పేరు
1. సామాన్య రోగాలు – సామాన్యమైన రోగాలు – విశేషణ పూర్వపద కర్మధారయం
2. చిన్నపిల్లలు – చిన్నవారైన పిల్లలు – విశేషణ పూర్వపద కర్మధారయం
3. వేయి రూపాయలు – వేయి సంఖ్య గల రూపాయలు – ద్విగు సమాసం
4. తల్లిదండ్రులు – తల్లియును, తండ్రియును – ద్వంద్వ సమాసం
5. పిల్లల బాధ్యత – పిల్లల యొక్క బాధ్యత – షష్ఠీ తత్పురుష సమాసం
6. రాజకుమారుడు – రాజు యొక్క కుమారుడు – షష్ఠీ తత్పురుష సమాసం
7. పిల్లల బంధువులు – పిల్లల యొక్క బంధువులు – షష్ఠీ తత్పురుష సమాసం
8. ఈశ్వరుని కటాక్షం – ఈశ్వరుని యొక్క కటాక్షం – షష్ఠీ తత్పురుష సమాసం
9. కొన్ని దినాలు – కొన్నివైన దినాలు – విశేషణ పూర్వపద కర్మధారయం
10. విద్యాభ్యాసం – విద్యను అభ్యసించడం – ద్వితీయా తత్పురుష
11. సూర్యాస్తమయం – సూర్యుని యొక్క అస్తమయం – షష్ఠీ తత్పురుష సమాసం.
1. సంయుక్త వాక్యం :
ప్రశ్న 1.
చిన్న పిల్లలకు నర్సరీ సెక్షన్ ఉంది. చిన్న పిల్లలకు కిండర్ గార్డెన్ సెక్షన్ ఉంది.
జవాబు.
చిన్న పిల్లలకు నర్సరీ సెక్షన్, కిండర్ గార్డెన్ సెక్షన్ ఉన్నాయి.
ప్రశ్న 2.
బ్రిటిష్ వారిని దగ్గరగా చూడటం మొదటిసారి. వారి భాష వినటం మొదటిసారి.
జవాబు.
బ్రిటిష్ వారిని దగ్గరగా చూడటం మరియు వారి భాష వినటం మొదటిసారి.
ప్రశ్న 3.
పోలీసులు పడవలోకి వచ్చారు. ప్యాసింజర్ల పాస్ పోర్టులు చెక్ చేసారు.
జవాబు.
పోలీసులు పడవలోకి వచ్చారు మరియు ప్యాసింజర్ల పాస్పోర్టులు చెక్ చేసారు.
2. ఇది ఏ వాక్యం ?
ప్రశ్న 1.
“మీరు స్టడీస్ కొరకు వచ్చినారా ?”
జవాబు.
ప్రశ్నార్థక వాక్యం.
ప్రశ్న 2.
“ఈశ్వరా నీవే దిక్కు” ?
జవాబు.
ప్రార్థనార్థక వాక్యం.
ప్రశ్న 3.
“నేను ఎక్కడ, గ్రేట్ బ్రిటన్ కు పైసా లేకుండా రావటమెక్కడ” ?
జవాబు.
ఆశ్చర్యార్థక వాక్యం.
పదాలు-అర్థాలు:
I. కాన్వాయి = రక్షణ రాడంకు పోలీసు వాహనం
బందోబస్తు = రక్షణ
దినం = రోజు
దుకాణం = అంగడి
II. విలువైన = ఖరీదైన
లైబ్రరి = గ్రంథాలయం
చివరి దినం = చివరి రోజు
పాశ్చాత్యులు = విదేశీయులు
III. స్ట్రిక్ట్ = కఠినంగా
మార్గం = దారి
ద్రవ్యం = సంపద
డేంజర్ = ప్రమాదం
IV. ఘోరము = భయంకరం
సన్నాహం = సంసిదత్ధ
చింతించు = ఆలోచించు
పర్మిట్ = అనుమతి
సూర్యాస్తమయం = సూర్యుడు అస్తమించు
కటాక్షం = అనుగ్రహం
అడుగు పెట్టు = కాలు పెట్టు
పాఠం నేపథ్యం, ఉద్దేశం:
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండనుకు వెళ్ళి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకొన్న పని. అయినప్పటికీ ఉన్నత విద్య కోసం, పెద్దపల్లి జిల్లా మంథని గ్రామవాసియైన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం నేపథ్యం.
కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృతనిశ్చయంతో, దృఢసంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.
ప్రక్రియ – యాత్రా రచన:
ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘యాత్రా రచన’ అనేది ప్రముఖమైనది. ఇది సహజంగా వచన రూపంలో ఉంటుంది. యాత్రల వల్ల కలిగే అనుభవాలను వివరిస్తూ రాసేది యాత్రా రచన. దేశ, విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాన్య స్థితిగతులను కూడా ఇవి చక్కగా వివరిస్తాయి. చారిత్రక వైశిష్ట్యాన్ని వివరిస్తాయి.
పాఠ్యభాగ వివరాలు:
‘యాత్రా చరిత్ర’ ప్రక్రియకు చెందినదీ పాఠం. యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రాచరిత్ర. దేశ, విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి.
ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన “నా ప్రథమ విదేశీ యాత్ర” పుస్తకంలోనిది.
రచయిత పరిచయం:
రచయిత పేరు : ముద్దు రామకృష్ణయ్య
పాఠ్యాంశం పేరు : సముద్ర ప్రయాణం
కాలం : 18.10.1907 – 21.10.1985
జన్మస్థలం : పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామం, తండ్రి పేరు ముద్దు రాజన్న, తల్లి పేరు ముద్దు అమ్మాయి.
రచన : సముద్ర ప్రయాణం
విశేషాంశాలు : 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం. ఇడి. పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి, అక్కడి విద్యావిధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికీ ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ‘ఈచ్ వన్ టీచ్ వన్’ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త.
ప్రవేశిక:
ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడికి పోవాలో తెలవదు. ఎవరిని కలవాలో తెలవదు. కాని, ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితమంటే అన్నీ ఉంటాయి. కండ్ల ముందు ఒకటే లక్ష్యం. లక్ష్యసాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరుకకపోదు.
అనుకున్న విధంగా ఉన్నతవిద్య పూర్తి చెయ్యాలి. దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి ? ఎట్లా చెయ్యాలి ? పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు.
ప్రయాణం కొనసాగుతున్నది!
అనంతాకాశంలాగా పరుచుకున్న సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది ? ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం.
పాఠ్యభాగ సారాంశం:
పెద్దపల్లి జిల్లా మంథని గ్రామస్థుడైన ముద్దు రామకృష్ణయ్యగారు పట్టుదలకు మారుపేరుగా నిలిచాడు. ఉన్నత లక్ష్యసాధన కోసం ఎన్నో అడ్డంకులను, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. వాటిని తన ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకున్నాడు. అందరికి మార్గదర్శకుడిగా నిలిచాడు.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రామకృష్ణయ్య లండనుకు వెళ్ళి ఉన్నతవిద్యను చదువుకోవాలనుకున్నాడు. కష్టాలు ఎదురౌతాయని ముందుగానే గ్రహించాడు. తాను పేదరికంతో ఉన్నా దానిని లెక్కపెట్టలేదు. బొంబాయిలో పడవ ఎక్కాడు. పడవలోని వాతావరణం మొదట్లో ఇబ్బందిగా ఉంది. అయినా దాన్ని ధైర్యంగా అధిగమించాడు. సాధారణమైన పంచె, పైజామా, షేర్వాణీతోనే ప్రయాణం చేశాడు. ప్రయాణీకుల్లో చాలా మంది ఆంగ్లేయులు ఉన్నారు. వారి భాష రాదు, తన భావాలను వ్యక్తం చేయలేడు.
లండన్లో ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుందని, లేకపోతే తిరిగి పంపిస్తారని తెలుసుకున్నాడు. దైవాన్ని ప్రార్థించాడు. తాను అనుకున్న విధంగా లండనులో ఉన్నతవిద్య పూర్తి చేయాలి. దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. ఇదే రామకృష్ణయ్యగారి లక్ష్యం. నౌకలో ప్రయాణిస్తున్న సురేశ్బాబు సహకారం లభించింది.
ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. నౌక దిగగానే భగవంతుని దయవల్ల రామకృష్ణయ్యకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రామకృష్ణయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన లక్ష్యాన్ని చేరుకొని అనుకున్నదాన్ని సాధించాడు. తోటి వారందరికి స్ఫూర్తిగా నిలిచాడు.
నేనివి చేయగలనా ?