These TS 8th Class Telugu Bits with Answers 11th Lesson కాపుబిడ్డ will help students to enhance their time management skills.
TS 8th Class Telugu Bits 11th Lesson కాపుబిడ్డ
చదువండి – ఆలోచించి చెప్పండి.
తొలిజల్లు వచ్చింది
తొలకరించింది.
పదవోయి రైతన్న
పాటుచేయంగ!
బలము నీవే జాతి
కలిమి నీవేరా!
పాతరల బంగారు
పంట నింపుమురా!!
హలమే మన సౌభాగ్య
బలమనుచు చాటి
పొలము దున్నాలోయి
పొలికేక బెట్టి!
ప్రశ్న 1.
తొలివానకురిసే కాలాన్ని ఏమంటారు ?
జవాబు.
తొలివాన కురిసే కాలాన్ని తొలకరి అంటారు.
ప్రశ్న 2.
ఈ గేయం ఎవరి గురించి చెపుతుంది ?
జవాబు.
ఈ గేయం రైతును గురించి చెబుతుంది.
ప్రశ్న 3.
గేయానికి బొమ్మకి మధ్య గల సంబంధం ఏమిటి ?
జవాబు.
“గేయంలో హలమె మన సౌభాగ్య బలమనుచు చాటి పొలము దున్నాలోయి” అని ఉన్నది. బొమ్మలో హలం పట్టుకొని రైతు పొలం దున్నుతున్నాడు. గేయంలోను, బొమ్మలోనూ ఉన్నభావం ఒక్కటే.
ప్రశ్న 4.
బంగారు పంటలను పండించే రైతుల గురించి మీకేం తెలుసు ?
జవాబు.
రైతు ఎండ, వాన లెక్క చెయ్యకుండా పగలు, రాత్రి తేడా లేకుండా పొలంలో శ్రమపడతాడు. తన సుఖాన్ని త్యాగం చేసి తన చెమటతో నేలను తడిపి బంగారు పంటలను పండిస్తాడు. ప్రపంచానికి ఆకలి తీరుస్తాడు.
పాఠ్యభాగ ఉద్దేశం:
ప్రశ్న.
కాపుబిడ్డ పాఠ్యభాగ ఉద్దేశం వివరించండి.
జవాబు.
ఏ ప్రాణికైనా బతకటానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఏడాదిలోని మూడు కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతులను తీరికగా ఉండనీయవు. ఆరుగాలం కష్టించి పని చేసినా హాయిగా బతకలేరు. దిన దిన గండం, అమాయకత్వం, అహింసా తత్త్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. వర్ణనతో కూడినది కావ్యం.
ప్రస్తుత పాఠ్యాంశం గంగుల శాయిరెడ్డి రచించిన ‘కాపుబిడ్డ’ కావ్యంలోని ‘కర్షక ప్రశంస’ అనే భాగంలోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం ఎరుగని శ్రమ ఇందులో వర్ణించబడ్డాయి.
కవి పరిచయం:
ప్రశ్న .
గంగుల శాయిరెడ్డి పరిచయం రాయండి.
జవాబు.
(పరీక్షల్లో గీత గీసిన వాక్యాలు రాస్తే చాలు)
ఈ పాఠ్యాంశాన్ని రాసినకవి గంగుల శాయిరెడ్డి. పూర్వం నల్లగొండ జిల్లాలోను, ప్రస్తుతం వరంగల్లు జిల్లాలోను భాగమైన ‘జీడికల్లు’ గ్రామం వీరి జన్మస్థలం.
శాయిరెడ్డి రచనల్లో ‘కాపుబిడ్డ’ కావ్యంతోపాటు తెలుగు పలుకు; ‘వర్షయోగము; ‘మద్యపాన నిరోధము’ అనేవి ముద్రితాలు. ఇంకా గణిత రహస్యము. ఆరోగ్య రహస్యం అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి. శైలి సరళంగా, సులభంగా గ్రహించ గలిగినది. సహజకవిగా పేరు పొందిన ‘పోతన’ పట్ల ఆరాధనా భావం గల శాయిరెడ్డి ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో, ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు.
ప్రవేశిక:
ప్రశ్న.
కాపుబిడ్డ పాఠ్యభాగ ప్రవేశిక తెల్పండి.
జవాబు.
భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. గ్రామాలు పూర్వం కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి. అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధానవృత్తిగా కొనసాగుతున్నది. స్వయంగా హాలికుడే హాలికుల బాధలను ఏకరువు పెడితే ఆ ఆర్ద్రత ఎంతటి వారికైనా హృదయాన్ని కదిలిస్తుంది కదా! ‘సత్కవుల్ హాలికులైన నేమి’ అని చెప్పిన పోతన వాక్యానికి ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ శాయిరెడ్డి. ఇక ఆ రైతు కవి రచనలోకి ప్రవేశిద్దాం.
కఠిన పదాలకు అర్థాలు:
పూను = దీక్షవహించు
క్రాగుచు = ఎండలో కాలిపోతూ
హలము = నాగలి
సాధులు = సత్పురుషులు
వెత = బాధ
సైచువారు = సహించువారు
సైరికులు = రైతులు
చేయిమోడ్చి = చేతులు జోడించి, నమస్కరించి
ఈవు = నీవు
శీతంబు = చలి
చీకటి కప్పి = చీకటి వ్యాపించి
ఇడుములు = కష్టాలు
అడలుదు = బాధపడుతుంటావు
అంగలార్చు = ఎదురుచూచు
సంయమి = ముని
కుడిచి = అనుభవించి
కొంపంతా = ఇల్లంతా
మెదులుట = కదులుట, తిరుగుట
మాపటివేళ = రాత్రివేళ
వృశ్చికం = తేలు
ఆలు = భార్య
వ్యాఘ్రం = పులి
బ్రాహ్మీముహూర్తం = తెల్లవారుజాము
తానం = స్నానం
వదరుబోతు = వాగుడుకాయ
కుటిలం = మోసం
ఈగి = దానం
మితభాషి = తక్కువగా మాట్లాడు
జొన్నగటక = జొన్నసంకటి
సుధ = అమృతం
వలపలిచేయి = కుడిచేయి
వడుకు ఉడుపులు = చేతితో నేసిన నేత వస్త్రాలు
కంబళి = గొంగళి, రగ్గు
పరిజనం = పరివారం
నిక్షేపములు = నిధులు
బల్ + వలపు = బల్వలపు = మిక్కిలి ప్రేమ
కేలు = చేయి
పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు:
I. 1. సీ. మండువేసవియెండ, మంటలోఁగ్రాగుచు
బూనిన పనిసేయు మౌనులెవరు ?
వానలో నానుచు, వణకుచు హలమూని
చలియందు దున్నెడి సాధులెవరు ?
ఱాళ్ళలో నడవిలో, రాతిరింబవలును
తడబాటు లేనట్టి, తపసులెవరు ?
తలక్రింద చేయిడి, గులకశిలల పైన వెత లేక నొరిగిన వేత్తలెవరు ?
గీ. కష్ట సుఖముల నొకరీతి గడుపువారు
శత్రుమిత్రుల సమముగా సైచువారు
సైరికులుదప్ప నంతటి శాంతులెవరు ?
కాన చేమోడ్చి వారినే గౌరవింతు.
ప్రతిపదార్థం :
మండు వేసవి ఎండన్ = మండిపోయే వేసవికాలపు ఎండలో
మంటలోన్ = వేడిలో
క్రాగుచు = కాలిపోతూ
పూనిన = దీక్షవహించిన (తాను చేయాలనుకొన్న)
పని + చేయు = పనిని పూర్తి చేసే
మౌనులు = మహర్షులు
ఎవరు = ఎవ్వరు ?
వానలో నానుచు = వర్షంలో తడిసిపోతూ
వణకుచు = గజగజ వణుకుతూ
హలము + ఊని = నాగలి ధరించి
చలి + అందు = చలిలో కూడా
దున్నెడి = పొలందున్నె
సాధులు + ఎవరు = సత్పురుషులు ఎవరు
ఱాళ్ళలోన్ = రాళ్ళలోనూ
అడవిలోన్ = అడవిదారిలోనూ
రాతిరిన్ = రాత్రివేళ
పవలున్ = పగటివేళ
తడబాటు = ఏవిధమైన భయము
లేని + అట్టి = లేనటువంటి
తపసులు + ఎవరు = తాపసులు ఎవరు
తలకింద = తల కింద
చేయి + ఇడి = చేయి పెట్టుకొని
గులక శిలలపైన = గులక రాళ్ళ మీద
వెతలేకన్ = ఏ బాధాలేకుండా
ఒరిగిన = పడుకున్న
వేత్తలు + ఎవరు = పండితులెవరు
కష్ట సుఖములన్ = కష్టములోను, సుఖములోను
ఒకరీతిన్ = ఒకేవిధముగా
గడుపువారు = కాలం గడిపే వారు
శత్రుమిత్రులన్ = విరోధులను, స్నేహితులను\
సమముగా = సమానంగా
సైచువారు = ఆదరించువారు
సైరికులు + తప్ప = రైతులు తప్ప
అంతటి = అంత గొప్ప
శాంత మూర్తులు = ఓర్పుగలవారు
ఎవరు = ఇంకెవరున్నారు ?
కాన = అందుకే
చేయి + మోడ్చి = చేతులు ముడిచి
వారిని + ఏ = ఆ రైతులనే
గౌరవింతు = సన్మానిస్తాను
తాత్పర్యం :
మంటలు మండే ఎండకాలపు ఎండలలో మగ్గిపోతూ కూడా చేపట్టిన పని కొనసాగించే ఋషు లెవరు ? వానలో నానుతు చలిలో వణుకుతు నేలను దున్నే సాధువు లెవరు ? రాత్రనక, పగలనక, రాతి నేలల్లో, అడవుల్లో తడబడకుండ తిరిగే తాపసులెవరు? ఎన్ని బాధలున్నా లెక్కచేయక, గులకరాతి నేలమీదనే తలకింద చేయి పెట్టుకొని విశ్రమించే విజ్ఞులెవరు కష్టసుఖాలను ఒకే విధంగా, శత్రు, మిత్రులను ఒకే మాదిరిగా సహించే శాంత స్వభావులెవరు ? రైతులుగాక! అందుకే చేతులు జోడించి వారికి మొక్కి గౌరవిస్తాను.
2. సీ. కార్చిచ్చులోబడి వంటకమ్ముల ద్రొక్కి
వడగండ్ల దెబ్బల వడుదువీవు
పెనుగాలి చే దుమ్ము కనులందుఁబడుచుండ
నుఱుము మెఱుములలో నుందువీవు
మంచుపైఁబడుచుండ మాపుశీతంబులో
పచ్చికనేలపై పండుదీవు
కటిక చీకటి గప్పి యెటుదారిగానక
నాఁకలి డప్పిచే నడల దీవు
గీ. ఇన్నియిడుముల గుడిచి నీ విల్లుజేర
నాలుపిల్లలు కూటికై యంగలార్చ
చలనమింతైన లేని యో సంయమీంద్ర
కర్షకా! నిన్ను చేమోడ్చి గౌరవింతు.
ప్రతిపదార్థం :
కర్షకా = ఓ రైతన్నా!
కార్చిచ్చులోన్ + పడి = మంటలలో మండిపోతూ
కంటకమ్ములన్ = ముళ్ళను
త్రొక్కి = కాళ్ళకింద తొక్కుతూ
పెనుగాలిచే = పెద్దగాలులు వీచినప్పుడు
దుమ్ము = ధూళి
కనులందున్ = కళ్ళలో
పడుచుండన్ = పడిపోతూ ఉండగా
ఉఱము మెఱములలో = ఉరుములూ మెరుపుల మధ్య
ఉందువు + ఈవు = నీవుంటావు
మంచు = మంచు
పైన్ + పడుచు + ఉండ = మీద కురుస్తూ ఉంటే
మాపు = రాత్రిపూట
శీతంబులో = చలిలో
పచ్చికనేలపై = గడ్డి భూముల మీద
పండు + ఈవు = పడుకుంటావు
కటిక చీకటి + కప్పి = దట్టమైన చీకటి వ్యాపించి
ఎటుదారి + కానకన్ = ఏ దారియు కనిపించక
ఆకలి దప్పిచే = ఆకలితో, దాహంతో
అడలుదు + ఈవు = నీవు బాధపడుతుంటావు
అన్ని + ఇడుములన్ = అన్ని కష్టాలనూ
కుడిచి = అనుభవించి
నీవు = రైతువైన నీవు
ఇల్లున్ + చేరన్ = ఇంటికి చేరేసరికి
ఆలుపిల్లలు = భార్యయు, బిడ్డలును
కూటికి + ఐ = తిండికోసం
అంగలు + ఆర్చ = ఎదురు చూస్తుండగా
ఇంత + ఐన = కొంచెము కూడా వారి గురించి
చలనము లేని = కదలిక లేని
ఓ సంయమి + ఇంద్రా = ఓ మునివర్యా!
నిన్ను = నిన్ను
చేయి + మోడ్చి = రెండు చేతులు జోడించి
గౌరవింతు = గౌరవిస్తాను
తాత్పర్యం :
ఓ కర్షకుడా! మిక్కిలి వేడిమిని సహించి, ముండ్లమీద నడిచి, వడగండ్ల వాన పాలవుతావు. గాలి దుమ్ములు కమ్మినా, ఉరుములు మెరుపులతో ఉన్నా చలించవు. మంచుకురిసే రాత్రి వేళల్లో, చలిలో, పచ్చిక నేలమీదనే నిద్రపోతావు. ఎటూ దారి కానరాని కటిక చీకటి రాత్రులలో అప్పుడప్పుడు ఆకలిదప్పికలతోనే కాలం గడపవలసి వస్తుంది.
ఇన్ని కష్టాలను భరించి నీవు ఇంటికి చేరినప్పుడు భార్య, పిల్లలు ఆకలితో అన్నానికై అంగలారుస్తూ, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నీవు యతీశ్వరుని వలె ఏ మాత్రమూ చలనం లేకుండా ఉంటావు. అలాంటి నీకు చేతులు జోడించి నేను నమస్కరిస్తాను.
వివరణ :
కష్టాలను, సుఖాలను ఒకేలా చూసేవారు యతులు. యతులు కష్టాలకు బాధపడరు, సుఖాలకు ఆనందించరు. రైతు కూడా యతి లాంటివాడే. తన భార్యాబిడ్డలు తిండిలేక ఆకలితో ఉన్నా, దాని గురించి బాధపడడు. కష్టమూ, సుఖమూ ఒకేలా భావిస్తాడు.
II. 3. సీ. ఎండల వేడికి నెత్తుమేడలు లేక
చెట్టుల నీడకుఁ జేరినావు
కొలది చినుకులకే కొంపంత తడియగా
పొదరిండ్ల బురదలో మెదలినావు
గడగడ వడకుచు గడ్డివాముల దూఱి
చలికాలమెట్టులో జరిపినావు
పుట్టలొల్కుల మిట్ట బట్టిమాపటివేళ
గాఢాంధకారము గడపినావు
గీ. సర్పవృశ్చిక వ్యాఘ్రాది జంతువులకు
నునికి పట్టగుచోట్లలో మునులభంగి
తిరిగి యేప్రొద్దు నుందువో దివ్యమూర్తి
కర్షకా! చేతులెత్తి నే గౌరవింతు||
ప్రతిపదార్థం :
దివ్యమూర్తి = ఓ దేవతామూర్తీ!
కర్షకా = రైతన్నా!
ఎండల వేడికి = ఎండలవలన కలిగిన వేడికి తట్టుకోటానికి
ఎత్తు మేడలు లేక = ఎత్తైన భవనాలు లేక
చెట్టుల నీడకు = చెట్ల నీడల
చేరినావు = వచ్చియున్నావు
కొలది = కొద్దిపాటి
చినుకులకే = వానచినుకులకే
కొంప + అంత = ఇల్లంతా
తడియగా = తడిసిపోగా
పొదరు + ఇండ్ల బురదలో = పొదరిళ్ళ దగ్గరున్న బురదలో
మెదలినావు = తిరిగినావు
గడగడ వడకుచు = చలికి వణికిపోతూ
గడ్డివాముల + దూరి = గడ్డి కుప్పలలో దూరి
చలికాలము = శీతాకాలము
ఎట్టులు + ఓ = ఎలాగో అతి కష్టం మీద
జరిపినావు = గడిపేశావు
పుట్టలొల్కుల = పుట్టదగ్గర గుట్టల దగ్గర
మిట్టన్ + పట్టి = ఎత్తు ప్రదేశాలలోను తిరిగి
మాపటివేళ = రాత్రిపూట
గాఢ + అంధకారము = దట్టమైన చీకటిలో
గడిపినావు = కాలం గడిపావు
సర్ప = పాములు
వృశ్చిక = తేళ్ళు
వ్యాఘ్ర = పులులు
ఆది = మొదలైన
జంతువులకు = మృగములకు
ఉనికి పట్టు = నివాసము
అగుచోట్లలో = ఐన ప్రదేశములలో
మునులభంగి = రుషుల వలె
ఏప్రొద్దు = ఏవేళనైనా
తిరిగి = తిరుగుతూ
ఉందువు + ఒ = ఉంటావుగదా
చేతులు + ఎత్తి = రెండు చేతులు పైకెత్తి
నే = నేను
గౌరవింతు = నిన్ను గౌరవిస్తాను
తాత్పర్యం :
ఓ రైతన్నా! ఎత్తైన మేడలు లేని నీవు ఎండ వేడిమి నుండి కాపాడుకోవటానికి చెట్టు నీడకు చేరావు. కొద్దిపాటి వానకే కురిసే నీ ఇంటిని వదిలి బురదనిండిన గుబురుల్లోనే తలదాచుకుంటావు. చలిబారి నుండి తప్పించుకోవటానికి గడ్డివాములను ఆశ్రయిస్తావు. పనిమీదపడి కటికచీకటి రాత్రులందు కూడ పుట్టలు, మిట్టలపై సంచరిస్తుంటావు. పాములు, తేళ్ళు, పులుల వంటి క్రూర జంతువులకు నిలయమైన తావులలో మునులవలె ఎల్లవేళలా తిరుగాడే నీవు దివ్యమూర్తివే. అట్లాంటి నీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
4. సీ. పనియున్న లేకున్న బ్రాహ్మీముహూర్తాన
తప్పక లేచెడి తాపసేంద్ర!
తెలిసియో తెలియకో దినమున కొకసారి
తానంబు చేసెడి మౌనిచంద్ర!
ఉండియో లేకనో యుత్తమాహారంబు
చక్కగా గుడిచెడి సంయమీంద్ర
వచ్చియో రాకనో వదరు బోతువుగాక
మితభాషితము సేయు యతికులేంద్ర.
గీ. కుటిల నటనము, గర్వము, కొంటెతనము
వన్నె చిన్నెలు లేని సద్వర్తనుడవు
ఈగియందనురాగివో, యోగిచంద్ర!
కర్షకా! చేతులెత్తి నే గౌరవింతు.
ప్రతిపదార్థం :
యోగిచంద్రా = యోగీశ్వరుడా!
కర్షకా = ఓ రైతన్నా!
పని + ఉన్న = పని ఉన్నప్పుడైనా
లేక + ఉన్న = లేకపోయినా
బ్రాహ్మీ ముహూర్తము + న = తెల్లవారుజామున
తప్పక లేచెడి = తప్పనిసరిగా నిద్రలేచే
తాపస + ఇంద్ర = మునీంద్రుడా!
తెలిసి + ఓ = ఎరుక ఉండియో
తెలియక + ఓ = ఎరుకలేకయో
దినమునకు = రోజుకు
ఒకసారి = ఒక పర్యాయము
తానంబు చేసెడి = స్నానం చేసే
మౌనిచంద్రా = మునివరా!
ఉండి + ఓ = కలిగియుండినా
లేకను + ఓ = ఏమీ లేకపోయినా
ఉత్తమ + ఆహారంబు = మంచి భోజనమును
చక్కగా కుడిచెడి = చక్కగా ఆరగించే
సంయమి + ఇంద్ర = యతులలో గొప్పవాడా!
వచ్చి + ఓ = మాట్లాడటం వచ్చినా
రాకను + ఓ = చేతకాక పోయినా
వదరుబోతువు + కాక = వాగుడు కాయవు కాకుండా
మితభాషితము + చేయు = తక్కువగా మాట్లాడే
యతికుల + ఇంద్ర = యతిశ్రేష్టుడా
కుటిల నటనము = కుత్సితమైన నాటకాలు
గర్వము = పొగరుబోతు తనము
కొంటెతనము = మోసపు స్వభావము
వన్నె చిన్నెలు = అనవసరపు ఆడంబరాలు
లేని = లేనటువంటి
సత్ + వర్తనుండవు = మంచి ప్రవర్తన కలవాడివి
ఈగి + అందు = దానము చేయుట యందు
అనురాగివి + ఓ = ఆసక్తి కలవాడవు
నేను = నేను
చేతులు + ఎత్తి = రెండు చేతులు జోడించి
గౌరవింతు = నమస్కరిస్తాను
తాత్పర్యం :
హాలికుడా! పని ఉన్నా, లేకున్నా నియమంగా తెల్లవారు జాము లేచే నీవు గొప్ప తాపసివే. తెలిసో తెలియకనో రోజుకొక్క సారైనా స్నానమాచరించే నీవు మునిశ్రేష్ఠునివే. ఉండో, లేకనో ఎల్లప్పుడూ సాత్వికాహారమే గ్రహించే నీవు ఋషీశ్వరునివే. తెలిసీ తెలియనితనంవల్ల తక్కువగా మాట్లాడే స్వభావం గల నీవు యతిరాజువే. కుటిల ప్రవర్తన, గర్వం, కొంటె పనులు, ఆడంబరాలు లేని మంచి నడవడి నీది. నీవొక యోగివి. శ్రేష్ఠుడవు. దానగుణంపై మక్కువ గలవాడవు. అన్ని సుగుణాలున్న నీకు నా వందనాలు.
5. సీ. పచ్చజొన్న గటక, పరమాన్నమును గాగ
చల్లనీరే సుధా సారమగును
వడుకుడుపులు జరి పట్టుబట్టలు గాగ
కంబళే వజ్రంపు కవచమగును
వలపలి చే కఱ్ఱ, వజ్రాయుధముగాగ
పరిజనమే నీకు పశువులగును
అందమౌపైరులే, నందనములుగాగ
నేప్రొద్దుపంటనిక్షేపమగును.
గీ. ఇచ్చుచుండును నీశ్వరుఁడింద్ర పదవి
వచ్చుచుండును ప్రకృతి బల్వలపు చేత
దాని జూడవు కన్నెత్తి తాపసేంద్ర!
కర్షకా! నిన్నుకేలెత్తి, గౌరవింతు.
ప్రతిపదార్థం :
కర్షకా = ఓ రైతన్నా!
పచ్చజొన్న గటక = పచ్చలు జొన్నలతో చేసిన సంకటి
పరమ + అన్నము + కాగ = = పాయసాన్నం అయితే
చల్లనీరు + ఏ = చల్లని మంచినీళ్ళే
సుధాసారము + అగును = అమృతమవుతుంది
వడుకు + ఉడుపులు = చేనేత వస్త్రాలు
జరీపట్టు బట్టలు + కాగా = జరీ వస్త్రాలు, పట్టు వస్త్రాలు అయితే
కంబళి + ఏ = గొ౦గళే
వజ్రము + కవచము + అగును = వజ్రాల కవచం అవుతుంది
వలపలి చే కర్ర = కుడి చేతిలో ఉన్న కర్ర
వజ్ర + ఆయుధము + కాగా = వంటిదయితేఇంద్రుని వజ్రాయుధము వంటిదయితే
నీకు = రైతువైన నీకు
పశువులు = ఎడ్లు, ఆవులు మొదలైనవి
పరిజనము + ఏ = పరివారముగా
అగును = అవుతాయి
అందము + ఔ = అందంగా ఉన్న
పైరులు + ఏ = పొలాలే
నందనములు + కాగన్ = నందనవనాలైతే
ఏ ప్రొద్దు పంట = ఏ పూట పండించిన పంటైనా
నిక్షేపము + అగును = నిధులుగా ఔతాయి
ఈశ్వరుడు = భగవంతుడు
ఇంద్రపదవి = ఇంద్రుడి సింహాసనమును
ఇచ్చుచు + ఉండును = నీకిస్తూ ఉంటాడు
ప్రకృతి = ప్రకృతి కాంత
బల్వలపు చేత = మిక్కిలి ప్రేమతో
వచ్చుచు + ఉండును = నీ దగ్గరకు వస్తుంటుంది.=
తాపస + ఇంద్ర = తాపసులలో శ్రేష్ఠుడా
దానిని = ఆ వరాలను
కన్ను + ఎత్తి = కళ్ళు తెరిచి
చూడవు = గమనించవు
నిన్ను = అటువంటి నీకు
కేలు + ఎత్తి = చేతులెత్తి
గౌరవింతు = నమస్కరిస్తాను
తాత్పర్యం :
ఓ కృషీవలుడా! నీకు పచ్చజొన్న సంకటే పరమాన్నం. చల్లని మంచినీళ్ళే అమృతం. చేతితో వడకిన నూలు బట్టలే పట్టు వస్త్రాలు. కప్పుకునే గొంగడే నీకు చెక్కుచెదరని కవచం. కుడి చేతిలోని ముల్లుగర్ర నీకు వజ్రాయుధం. పశుసంపదే నీకు పరివారం. నీవు పెంపు చేసిన పంటచేనులే నందనవనాలు. పండించే పంటనే నిధి నిక్షేపాలు. ఓ మునిశ్రేష్ఠా! ఈ విధంగా భగవంతుడు నీకు ఇంద్ర పదవిని ఇస్తున్నాడు. ప్రకృతి కాంతయే నిన్ను వలచి వచ్చినా ఆమెను నువ్వు కన్నెత్తైనా చూడక నీ వృత్తినే మిన్నగా భావిస్తావు. అందుకే నీకు చేతులెత్తి నమస్కరిస్తాను.
ఆలోచించండి – చెప్పండి.
ప్రశ్న 1.
రైతులవలె, ఇతర వృత్తులవారు పడే బాధలను తెల్పండి. (టెక్స్ పేజి నెం. 111)
జవాబు.
కుండలు చేసే కుమ్మరి మన్ను తీసి మెత్తగా తొక్కి మృదువైన ముద్దగా చేసి ఎంతో జాగ్రత్తగా సారె మీద పెట్టి రకరకాల ఆకారాలలో కుండలు చేస్తాడు. అతడు పడే కష్టానికి మనం కుండల కిచ్చే ధర ఏపాటి ? కమ్మరి కొలిమి దగ్గర ఆ వేడిని భరిస్తూ ఇనుము కాల్చి రకరకాల పనిముట్లు తయారు చేస్తాడు. కత్తి, కొడవలి వంటివి వేడి మీదనే సాగకొడతాడు. సాలెవారు పత్తి నుంచి నూలు తీసి మగ్గం మీద రకరకాల కళాకృతులతో వస్త్రాలు నేస్తారు. ఇలాగే ఎంతో మంది. వారెంత కష్టపడినా ఆ శ్రమకు తగిన ఫలితం లభించక పేదరికంతో క్రుంగిపోతున్నారు.
ప్రశ్న 2.
మూడు కాలాల్లో రైతులు చేపట్టే పనులేవి ? (టెక్స్ పేజి నెం. 111)
జవాబు.
రైతులు వేసవి కాలం, వానాకాలం, చలికాలం అనే మూడు కాలాల్లోనూ ఎండనక, వాననక పొలాల్లో పనులు చేస్తూనే ఉంటారు. దానికోసం ప్రతిరోజూ పొలం పనులు చేయవలసి ఉంటుంది. దుక్కిదున్నటం, చదును చేయటం, విత్తనాలు చల్లటం, నీరు పెట్టటం, కలుపు తీయటం, క్రిమికీటకాల నుండి పంటను రక్షించుకోవటం, కోతలు, నూర్పిళ్ళు, ధాన్యాన్ని బస్తాలకెత్తి గమ్యం చేర్చటం – ఇలా ఏడాది పొడుగునా రైతులకు పనులుంటూనే ఉంటాయి.
ప్రశ్న 3.
పేదరైతు కష్టాలు ఎట్లాంటివి ? (టెక్స్ పేజి నెం. 111)
జవాబు.
పేదరైతు తిండికి బట్టకు కరువై ఎంతో భారంగా బ్రతుకు గడుపుతూ ఉంటాడు. పంట పండించడానికి భూస్వాముల దగ్గర ఎక్కువ వడ్డీలకు అప్పుచేసి తీర్చలేక బాధపడుతూ మరింత పేదవాడై పోతాడు. ఎండ, వాన, చలి, పగలు-రాత్రి అనే తేడాలు లేకుండా ఎంతో కష్టపడి పనిచేసి పంట పండించినా గిట్టుబాటు ధర రాదు. దళారులు ఎంతో తక్కువ ధరకు కొనేసి మరింత లాభాలకు అమ్ముకొని ధనవంతులైపోతూ పేదవారిని మరింత పేదవారుగా మారుస్తారు. ఇలా పేదరైతు అనేక కష్టాలు పడుతున్నాడు.
ప్రశ్న 4.
సద్వర్తనకు దోహదం చేసే గుణాలు ఏవి ? (టెక్స్ పేజి నెం. 112)
జవాబు.
సద్వర్తన అంటే మంచి ప్రవర్తన. సద్వర్తనకు సహాయం చేసే గుణాలు : తెల్లవారు జామున నిద్రలేవాలి. ప్రతినిత్యం స్నానం చేయాలి. ఎవరితోనూ పోట్లాడకూడదు. అతిగా మాట్లాడకూడదు. మితభాషిగా ఉండాలి. ఇతరుల మేలు కోరాలి. ప్రకృతిలోని ఎండ, వాన, చలి వంటి ధర్మాలను ఓర్చుకోగలగాలి. ధనము, పదవులు మొదలైన వాటిపై ఆశపడరాదు. ఇవన్నీ సద్వర్తనకు దోహదం చేసే గుణాలు.
ప్రశ్న 5.
రైతుకు భగవంతుడు ఇంద్రపదవిని ఇస్తున్నాడని ఎట్లా చెప్తారు ? (టెక్స్ట్ పేజి నెం. 112)
జవాబు.
ఇంద్రుడు అమృతం తాగుతాడు. స్వర్గం అతని నివాసస్థానం. పట్టువస్త్రాలు, వజ్రాల కవచం ధరిస్తాడు. అతని చుట్టూ సేవకులు ఉంటారు. రైతు తినే జొన్నకూడు పరమాన్నమై, చల్లనీరు అమృత మౌతుంది. నేత వస్త్రాలే జరీ, పట్టు వస్త్రాలై కంబళి వజ్రాల కవచమౌతుంది. అతని చేతిలోని ముల్లుకర్ర వజ్రాయుధమై చుట్టూ వున్న పశువులే సేవకులౌతారు. అందమైన పైరులు నందన వనాలౌతాయి. రైతు పండించిన పంట భూమిలోని నిధులౌతాయి. ఇలా భగవంతుడు రైతు చుట్టూ ఉన్న పరిస్థితులను స్వర్గంతో సమానంగా మార్చి రైతును దేవేంద్రుని చేశాడు అని కవి వర్ణించాడు.
ప్రశ్న 6.
రైతుకు, మునికి గల పోలికలు ఏమిటి ? (టెక్స్ట్ పేజి నెం. 112)
జవాబు.
ముని బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారు జామున లేస్తాడు. ఉత్తమమైన, స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటాడు. వదరుబోతు కాకుండా మితభాషిగా ఉంటాడు. మోసాలు చేయడం, నాటకాలాడటం, ఆడంబరాలకు పోవడం మునుల విషయంలో జరగదు. ఈ గుణాలు అన్నీ రైతులో కూడా ఉన్నాయి.
ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం.
ప్రశ్న 1.
“రైతే దేశానికి వెన్నెముక” అంటారు కదా! నేడు రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది ? చర్చించండి.
జవాబు.
శరీరాన్ని నిలబెట్టే ముఖ్య భాగం వెన్నెముక. అలాగే దేశంలోని ప్రజలకు అన్నంపెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రైతు లేనిదే రాజ్యంలేదు… అంటూ ఉంటారు. రాత్రనక పగలనక రైతులు ఆరుగాలాలు కష్టపడి పండిస్తుంటే మనం కాలి మీద కాలేసుక్కూర్చుని ఆనందంగా ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఆనందాన్నిచ్చిన రైతు పరిస్థితి ఏమిటని మనం ఆలోచించటం లేదు.
పేదరైతుకు సామాన్యుడైన వినియోగదారుకు మధ్య ఉన్న దళారులు మేడల మీద మేడలు కడుతూ కోట్లు కూడబెడుతూ ఉంటే రైతుకు గిట్టుబాటు ధరలేక రెండు పూటలా గంజి కూడ లేక పస్తులుంటున్నాడు. పంటకోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొంటున్నాడు. ఇదీ ఈనాడు రైతు పరిస్థితి. ఉత్పత్తిదారులకు తమ ఉత్పత్తులకు తగినధర తామే నిర్ణయించుకొనే అవకాశం ఇస్తే వారి బతుకు కొంచెమైనా మెరుగుపడుతుందని నా అభిప్రాయం.
ప్రశ్న 2.
రైతు యొక్క జీవనవిధానం గురించి, కవికి ఉన్న అభిప్రాయం గురించి మాట్లాడండి.
జవాబు.
రైతు యొక్క జీవన విధానాన్ని కవి ముని జీవితంతో పోల్చాడు. మునుల వలె రైతు ఎండ, వాన, చలి, లెక్కచేయడు. చీకటి, వెలుగు, పగలు, రాత్రి అనే తేడాలు లేకుండా పనిచేస్తాడు. మౌనంగా ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. రైతు దినచర్య ముని దినచర్యలాగే ఉంటుంది. మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. ఇంద్రభోగాలనైనా లెక్కచేయకుండా తిరస్కరిస్తాడు. ఈ లక్షణాలన్నీ మునుల జీవిత విధానాన్ని పోలి ఉంటాయని కవి అభిప్రాయపడ్డాడు.
ప్రశ్న 3.
“రైతులు కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తారు” – అని ఎందుకంటారు ? (అదనపు ప్రశ)
జవాబు.
ఎండల తాకిడికి తట్టుకోడానికి ఎత్తుమేడలు లేకపోతే చెట్ల నీడల్లో ఉంటాడు. ఇల్లంతా వాన చినుకులతో తడిసిపోతే పొదరిళ్ళలో కాలక్షేపం చేస్తాడు. వణికించే చలి నుండి కాపాడుకోడానికి గడ్డివాములలో దూరతాడు. రాత్రి పూట చీకటిలో ఏ పుట్టల మీదో మిట్టల మీదో కాలం గడుపుతాడు. మునుల్లాగా కారడవుల్లో పాములు, తేళ్ళు, పులులు మొదలైన వాటి మధ్య తిరుగుతూ ఉంటాడు. ఇలా కష్టాలను కూడా సుఖాలుగానే భావిస్తాడు రైతు.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
1. కింది పద్యమును చదివి ఖాళీలను పూరించండి.
‘కష్టసుఖముల నొకరీతి గడుపువారు
శత్రు మిత్రుల సమముగా సైచువారు
సైరికులు దప్ప నంతటి శాంతులెవరు ?
కాన చేమోడ్చి వారినే గౌరవింతు.
భావం : సైరికులు అనగా రైతులు వారు శత్రువులను మిత్రులను. సమానంగా సహిస్తారు. వారి శాంత స్వభావం వల్లనే వారిని నేను చేతులు జోడించి గౌరవిస్తాను.
2. కింది పద్యాన్ని చదివి దానికింద ఉన్న ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.
“ఎండకాలము గుడిసెల నెగరజిమ్మ
తొలకరించిన వర్షము తొట్రుపరుప
ముసురుపెట్టగా రొంపిలో మూల్గుచున్న
కర్షకా! నీదు పల్లెను గాంతురెవరు.”
అ. ‘రొంపి’కి సరియైన అర్థాన్ని గుర్తించండి.
ఎ) నీరు
బి) వరద
సి) గాలి
డి) బురద
జవాబు.
డి) బురద
ఆ. ‘ఎగురజిమ్ముట’ అనగా
ఎ) కాలిపోవుట
బి) గాలికి పైకి విసురు
సి) కూలిపోవుట
డి) కిందపడుట
జవాబు.
బి) గాలికి పైకి విసురు
ఇ. ‘తొలకరించుట’ అంటే నీకు ఏమి తెలుస్తున్నది ?
ఎ) పలకరించుట
బి) పులకరించుట
సి) వర్షాకాలం మొదలు
డి) ఎండాకాలం మొదలు
జవాబు.
సి) వర్షాకాలం మొదలు
ఈ. కాంతురెవరు అనడంలోని ఉద్దేశం
ఎ) ఎవరు చూస్తారు?
బి) ఎవరు పట్టించుకుంటారు?
సి) ఎవరు అంటారు?
డి) ఎవరు వింటారు?
జవాబు.
ఎ) ఎవరు చూస్తారు?
III. స్వీయరచన.
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. “ఇంద్రపదవి కన్నా రైతు జన్మ గొప్పది” ఎందుకు ? (లేదా) ఇంద్రుని కంటె రైతు గొప్పవాడని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఇంద్ర పదవిలో ఉన్నవాడు భోగభాగ్యాలు కోరతాడు. స్వర్గసుఖాలు, అప్సరసలు, అమృతపానం లేకుండా ఉండలేడు. నందనవనంలో విహారాలు వారి కెంతో ప్రీతి. ఈ విధంగా విలాసాల్లో మునిగిపోతాడు ఇంద్రుడు. కాని తనరక్షణ తను చేసుకోలేక ఇతరులపై ఆధారపడతాడు.
రైతుకు పైన చెప్పిన సుఖాలన్నీ నీచమైనవి. తన చుట్టూ ఉన్నవాటినే స్వర్గ సౌఖ్యాలుగా భావిస్తాడు. తన అవసరానికి మించి ఏమీ కోరడు. తానే అందరి ఆకలి తీరుస్తాడు. అంతేగాక తన రక్షణ తానే చూసుకోగలడు. ఎవరి మీదా ఆధారపడడు. అందుకే ఇంద్రుని కన్న రైతు జన్మ గొప్పది.
ఆ. “జై జవాన్! జై కిసాన్!!” అంటారు కదా! రైతుకు, సైనికునికి గల పోలికలు ఏమిటి ?
జవాబు.
జవాను అంటే సైనికుడు. రాత్రింబవళ్ళు ఆరుబయట సరిహద్దుల్లో కాపలా కాస్తాడు. శత్రువులను తన మాతృభూమిలోనికి అడుగుపెట్టనివ్వడు. భూమాతను సదా కాపాడుతాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలనూ ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు.
కిసాను అంటే రైతు కూడా రాత్రింబవళ్ళు ఆరుబయట తన పొలాలకు కాపలాకాస్తాడు. ఈతి బాధల నుండి పంటను రక్షించుకుంటాడు. నేల తల్లిని సదా గౌరవిస్తాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలను ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు.
ఇ. రైతులకు గల ఐదు సమస్యలను చెప్పండి.
జవాబు.
రైతు ఎండ, వాన, చలి, చీకటి అన్నీ భరిస్తూ ఏడాది పొడుగునా విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటాడు. అతనికి ఉండడానికి సౌకర్యవంతమైన ఇల్లులేదు. ఇంత కష్టపడినా భార్యాబిడ్డలకు తృప్తిగా తిండిపెట్టలేడు. తన ఆకలి దప్పికలు తీరవు. చలి వణికిస్తున్నా చల్లని నేలపై పండుకోవలసిందే. ఎర్రటి ఎండలో, రాళ్ళల్లో, ముళ్ళలో నడుస్తున్నా కాళ్ళకు చెప్పులుండవు. వడగళ్ళు రాలుతున్నా, పెనుగాలికి దుమ్ము కళ్ళలో పడుతున్నా ఉరుముల్లో మెరుపుల్లో తిరగవలసిందే. ఇవన్నీ రైతుకు గల సమస్యలే.
ఈ. “రైతు ప్రకృతితో మమైకమై ఉంటాడు” దీనిని సమర్థించండి.
జవాబు.
రైతు అహర్నిశలు ప్రకృతితో మమైకమై ఉంటాడు. వేసవి కాలపు మండు టెండలో కూడా తన పని పూర్తి చేస్తాడు. వానలో నానిపోతూ, చలిలో వణికి పోతూ కూడా నేలను దున్నుతాడు. రాత్రనక, పగలనక రాళ్ళలోను అడవిలోను తడబడకుండా తిరుగుతుంటాడు. నిద్రవస్తే తలకింద చేయి పెట్టుకొని ఏ చింతా లేకుండా గులకరాళ్ళపై నిద్రపోతాడు. ఇలా ప్రకృతిలోని ప్రతిమార్పునూ గమనించుకుంటూ ఉండేవాడు రైతు మాత్రమే అనిపిస్తుంది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ. “రైతు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది” సమర్థిస్తూ రాయండి.
జవాబు.
రైతు కష్టం : రైతు ఏడాది పొడుగునా కష్ట పడి పంటలు పండించాలి అంటే అతనికి ఎంతో శక్తికావాలి. ఆ శక్తి కావాలంటే కడుపునిండా తినాలి. కడుపునిండా తింటేనే గదా కష్టపడగలిగేది! అలాగే అతడి భార్యాబిడ్డలు సుఖంగా ఉంటే అతడు సంతోషించగలడు. వాళ్ళు సుఖంగా ఉండాలంటే రైతుపడ్డ కష్టానికి తగినంత ఫలితం చేతికందాలి. మనం రైతును సుఖపడనిస్తున్నామా? లేదే! అతను చేసిన కష్టానికి తగిన వెలకట్టకుండా కష్టాల ఊబిలో ముంచేస్తున్నాం.
మన సుఖం : రైతు శ్రమఫలాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. రైతు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న ఆహారాన్ని తింటూ, రైతును పట్టించుకోవడం లేదు. రైతును చిన్న చూపుచూస్తున్నాం.
పరిస్థితి మారాలి : సమాజంలో ఈ పరిస్థితి మారాలి. రైతుకు తన శ్రమఫలానికి గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అవకాశం కల్పించాలి. దళారులను, స్వార్థ పరులనూ పక్కన పెట్టి వినియోగదారునికీ రైతుకూ సరాసరి సంబంధాన్ని ఏర్పరిస్తే ఇద్దరూ సుఖపడతారు. ఆకాశానికి రెక్కలు కట్టుకొని ఎగిరిన ధరలు నేలకు దిగుతాయి. రైతు కూడా సమాజంలో పదిమందితో బాటు తాను కూడా ఆనందంగా జీవించగలుగుతాడు. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది.
ఆ. కర్షకా ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని కవి అన్నాడు కదా ! అలా నమస్కరించదగిన రైతులు చేస్తున్న కృషిని
వివరించండి.
జవాబు.
దేశంలోని ప్రజలకు అన్నం పెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రాత్రినక, పగలనక రైతులు ఎల్లవేళలా, ఆరుకాలాలు కష్టపడి పనిచేసి, పంట పండిస్తుంటే, అతని కష్టఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ రైతు పరిస్థితి ఏమిటని ఆలోచించము. రైతుకి, వినియోగదారుడికి మధ్యనుండే దళారులు లక్షలకొద్దీ ధనం సంపాదిస్తుంటే, రైతులకు గిట్టుబాటు ధరలేక, రెండుపూటలా తీసుకోవడానికి గంజీ కూడా లేక పస్తులుంటాడు. పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాడు.
ఎండ, వాన, చలి లెక్కచేయడు. నిరంతరం తనువేసిన పంటను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. కష్టసుఖాలు ఏవి వచ్చినా మునిలాగా ఒకే విధంగా ఉంటాడు. సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు కుంగిపోవడం ఉండదు. అందుకే కవి కర్షకా ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నాడు.
IV. సృజనాత్మకత/ప్రశంస.
1. కింది వానిలో ఒకదానికి జవాబు రాయండి.
అ. పాఠం ఆధారంగా రైతు ఆత్మకథను రాయండి.
జవాబు.
రైతు ఆత్మకథ
నేనొక రైతును. ఆరుగాలాలు శ్రమించి పంటలు పండిస్తాను. ప్రపంచానికి ఆకలి తీరుస్తాను.
మండు వేసవి ఎండలలో ఆ వేడికి కాలిపోతూ పనిచేస్తాను. వానలో నానుతూ చలికి వణుకుతూ నాగలితో పొలం దున్నుతాను. అడవులలోనైనా రాళ్ళలోనైనా రాత్రిగాని పగలుగాని ఎలా అవసరమైతే అలా వెళుతుంటాను. అలిసిపోతే గులకరాళ్ళను కూడా పట్టించుకోకుండా తలకింద చేయి పెట్టుకొని పడుకుంటాను. నాకు శత్రువులు, మిత్రులు, కష్టసుఖాలు అన్నీ సమానమే.
కార్చిచ్చును, ముళ్ళను, వడగళ్ళను, పెనుగాలి దుమ్మును, ఉరుములు మెరుపులను అన్నింటినీ భరిస్తాను. మంచు కురుస్తున్నా పచ్చిక మీద పడుకుంటాను. ఒక్కొక్కసారి కటిక చీకట్లో దారితప్పిపోతే ఆకలి దప్పికలకు బాధ పడతాను. ఇన్ని కష్టాలు పడినా నా భార్యాబిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను.
ఎండలకు వానలకు చలికి తట్టుకోడానికి నాకు మంచి ఇల్లు లేదు. చెట్ల నీడల్లోనూ పొదరిళ్ళ బురదలోనూ గడ్డివాములలోనూ తలదాచుకుంటాను. ఒక్కొక్కసారి క్రూరమృగాల మధ్య తిరగవలసి వచ్చినా ధైర్యం కూడగట్టుకొని ఉంటాను.
తెల్లవారు జామునే లేచి స్నానం చేయటం, సాత్వికమైన ఆహారం తినటం నా పద్ధతి. ఎవరితోనూ వాదాలు పెట్టుకోను. మాయమాటలు, మోసాలు, ఆడంబరాలు నాకు అక్కరలేదు. నాకున్నంతలో ఇతరులకు పంచి పెడతాను. ఈశ్వరుడిచ్చే ఇంద్రపదవిగాని, ప్రకృతి కాంత వలపులుగాని నాకవసరంలేదు. నేను తినే జొన్న సంకటే నాకు పరమాన్నం. నేను కట్టే నూలు బట్టలే చీనాంబరాలు. నా చేతికర్ర నా వజ్రాయుధం. నా కంబళి నాకు వజ్రకవచం. నా పంటపొలాలే నందనవనాలు, నిధి నిక్షేపాలు.
నాకున్నంతలో తృప్తిపడతాను. పరుల కోసం పాటుపడతాను. నేను కోరేదొక్కటే. నా శ్రమను గుర్తించండి. తగిన విలువ నివ్వండి.
(లేదా)
ఆ. అందరికి అన్నం పెట్టే రైతు కృషిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి.
జవాబు.
అభినందన పత్రం
కృషీవలా!
ఆరుగాలాలు శ్రమించి అమృతం లాంటి పంటలు పండించి ప్రజలకు పంచుతున్నావు. ఒక్కదినమైనా విశ్రాంతి ఎరుగక కృషిచేస్తావు. నీ కృషికి మా కైమోడ్పులు.
అన్నదాతా!
అన్నంలేనిదే ఏప్రాణీ బ్రతకలేదు. అటువంటి ప్రాణాధారమైన అన్నాన్ని ఉత్పత్తి చేసి మనుషులను బ్రతికిస్తున్నావు. గడ్డీగాదంతో పశువులను బ్రతికిస్తున్నావు. అటువంటి నీకు మా జోతలివే.
హాలికా!
పచ్చని పైరులతో చెట్లతో కాలుష్యాన్ని రూపు మాపి అందరికీ ప్రాణవాయువు నందిస్తున్నావు. ఏ వైద్యుడూ ప్రసాదించలేని ఆరోగ్యాన్ని నీవు ప్రసాదిస్తున్నావు. నీకివే మా కృతజ్ఞతాంజలులు.
అట్టహాసాలు, ఆర్భాటాలు లేకుండా ఉన్నంతలో సంతృప్తి పడిపోతూ సత్ప్రవర్తనతో జీవిస్తావు. తగువులు నీ దరి దాపులకు రావు. మితభాషివై అందరి మేలు కోరుతూ అందరి ప్రేమను చూరగొన్నావు. నీ ఆదర్శ జీవనానికి మా అభినందనలందుకో.
పదజాల వినియోగం:
1. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
అ) హలం :
జవాబు.
హలం = నాగలి
హలం బలరాముని ఆయుధం.
ఆ) సైరికులు :
జవాబు.
సైరికులు : రైతులు
సైరికులు అహోరాత్రాలు కష్టపడి పంటలు పండిస్తారు.
2. కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.
ప్రకృతి – వికృతి
రాత్రి – రాతిరి
బ్రహ్మ – బొమ్మ
శుచి – చిచ్చు
గర్వము – గరువము
పశువు – పసరము, పసువు
చంద్రుడు – చందురుడు
3. కింది వాక్యాలలోని ఒకే అర్థం గల మాటలను గుర్తించి రాయండి.
అ) మౌనంగా ఉన్నంత మాత్రాన మునికాలేడు. తాపసికి దీక్ష ఎక్కువ.
జవాబు.
ముని, తాపసి
ఆ) వానరులు రాళ్ళు తీసుకొనిరాగా, ఆ శిలలతో నలుడు సముద్రంపై వారధిని నిర్మించాడు.
జవాబు.
రాయి, శిల
ఇ) మాపువేళ పక్షులు గూటికి చేరుతాయి. సాయంకాలం ఆవులమందలు ఇళ్ళకు చేరుతాయి.
జవాబు.
మాపువేళ – సాయంకాలం
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.
అ) తాపసేంద్ర = తాపస + ఇంద్ర = గుణసంధి
ఆ) పరమాన్నము = పరమ + అన్నము = సవర్ణదీర్ఘ సంధి
ఇ) కేలెత్తి = కేలు + ఎత్తి = ఉత్వ సంధి
ఈ) గాఢాంధకారము = గాఢ + అంధకారము = సవర్ణదీర్ఘ సంధి
ఉ) కొంపంత = కొంప + అంత = అత్వ సంధి
2. కింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి. దానిని గురించి వివరించండి.
అ) రైతు మునివలె తెల్లవారు జామునే లేస్తాడు.
జవాబు.
ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉన్నది. ఒక విషయాన్ని మరొక విషయంతో అందంగా పోల్చి చెప్పటం ఉపమాలంకారం. వర్ణించే విషయం ఉపమేయం. పోలిక చెప్పే విషయం ఉపమానం. పోలిక తెలిపేపదం ఉపమావాచకం. ఉపమాన ఉపమేయాలకు గల పోలిక సమాన ధర్మం.
ఇక్కడ రైతును మునితో పోల్చి వర్ణించారు. రైతు-ఉపమేయం. ముని ఉపమానం. వలె ఉపమావాచకం. తెల్లవారు జామున లేవడం సమానధర్మం. కనుక ఇది ఉపమాలంకారం.
ఆ) వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా! అన్నట్లు ఉన్నది.
జవాబు.
ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉన్నది. ఉత్ప్రేక్ష అంటే ఊహించటం. పోలికను ఊహించటం ఉత్ప్రేక్షాలంకారం. ఇక్కడ చెట్టుకొమ్మను గొడుగువలె ఊహించారు. కనుక ఉత్ప్రేక్షాలంకారం.
ఇ) అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు ?
జవాబు.
ఈ వాక్యంలో వృత్త్యనుప్రాస అనే శబ్దాలంకారం ఉన్నది. ఒకే హల్లు ఒక వాక్యంలో చాలాసార్లు వస్తే దానిని వృత్త్యనుప్రాస అంటారు. ఈ వాక్యంలో ‘క్క’ అనే అక్షరం ఆవృత్తమైంది.
3. ఛందస్సులో గణవిభజన తెలుసుకున్నారు కదా! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.
నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్త పద్యం అంటారు.
పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతి అక్షరానికి అదే అక్షరంగానీ, వర్ణమైత్రి కలిగిన మరో అక్షరంగానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని ‘యతి నియమం’ అంటారు.
పద్య పాదాలలో రెండవ అక్షరానికి ‘ప్రాస’ అని పేరు. పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాస నియమం” అంటారు.
పై పాదాల్లో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలున్నాయి.
- మొదటి అక్షరానికి లై (ఎ) – రీ (ఈ) యు (ఉ) – చుం (ఉ)
- 10వ అక్షరానికి యతి చెల్లింది.
- పై పాదాలలో ప్రాసగా క్క- క్కి- అనే హల్లు వచ్చింది.
- పై పాదాల్లో 20 అక్షరాలున్నాయి.
- పై పద్య పాదాలు “ఉత్పలమాల” వృత్త పద్యానివి.
పై ఉదాహరణ ననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.
ఉత్పలమాల :
- ఇది వృత్త పద్యం.
- పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలో వరుసగా భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు వస్తాయి.
- ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థానం.
- ప్రాస నియమం వుంటుంది.
- ప్రతి పాదంలోను 20 అక్షరాలుంటాయి.
4. ఈ కింది పద్య పాదాలను పరిశీలించండి.
పై పద్యపాదాలలోని గణాలను పరిశీలిస్తే………
ప్రతి పాదంలోను న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇట్లా ప్రతి పాదంలోను పై గణాలు రావడం చంపకమాల పద్య లక్షణం. పై పద్యపాదాల్లో ‘అ’కు ‘ఆ’తో, ‘బు’ కు ‘పు’తో యతిమైత్రి చెల్లింది. ప్రాసగా న్తి – న అనే హల్లులు ఉన్నవి. పై పాదాల్లో 21 అక్షరాలున్నాయి.
చంపకమాల :-
- ఇది వృత్త పద్యం.
- పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలో వరుసగా న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు వస్తాయి.
- ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
- ప్రాస నియమం వుంటుంది.
- ప్రతి పాదంలోను 21 అక్షరాలుంటాయి.
5. కింది పద్యపాదాలకు గణ విభజన చేసి ఏ పద్యపాదాలో గుర్తించి రాయండి.
అ) తనకు ఫలంబులేదని యెదం దలపోయడు కీర్తిగోరు నా
జవాబు.
ఇది చంపకమాల పద్య పాదం. ఇందులో ప్రతి పాదంలోను నజభజజజర అనే గణాలు ఉన్నాయి. పై పాదంలో మొదటి అక్షరమైన ‘త’ కు 11వ అక్షరమైన ‘దం’తో యతిమైత్రి. పాదానికి 21 అక్షరాలుంటాయి.
ఆ) ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
జవాబు.
ఇది ఉత్పలమాల పద్యపాదము. ఇందులో ప్రతి పాదంలోను భరనభభరవ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘ఆ’ కు 10వ అక్షరమైన ‘నం’ తో యతిమైత్రి.
ఇ) బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే (అదనపు ప్రశ్న)
జవాబు.
ఇది చంపకమాల పద్య పాదము. ఇందులో ప్రతి పాదానికి నజభజజజర అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘బ’కు 11వ అక్షరమైన ‘బ’తో యతిమైత్రి.
ఈ) హర్తకుఁ గాదుగోచరమహర్నిశమున్ సుఖ పుష్టిసేయుస (అదనపు ప్రశ్న)
జవాబు.
ఇది ఉత్పలమాల పద్యపాదము. ఇందులో ప్రతి పాదంలోను భరనభభరవ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘హ’ కు 10వ అక్షరమైన ‘హ’తో యతిమైత్రి.
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:
ప్రశ్న .
శ్రీ ప్రసార మాద్యమాల్లో (టి.వి./రేడియో) వచ్చే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను చూడండి. వాటి వివరాలను వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి నివేదిక రాయండి.
జవాబు.
పరిచయం :
టీవీలో నేను చూసిన వ్యవసాయదారుల కార్యక్రమంలో డా॥ వి. ప్రవీణ్ రావుగారితో శిరీష చేసిన ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చింది.
సేకరణ :
డా॥ ప్రవీణ్ రావు గారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు సేంద్రియ వ్యవసాయం గురించిన ప్రయత్నాలకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు. మన దేశంలో సేంద్రియ వ్యవసాయ స్థితిగతులపై శిరీష అడిగిన ప్రశ్నలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. 25 ని॥ పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో సేంద్రియ వ్యవసాయ విధానం, లాభాలు, శిక్షణ, రైతు విద్య, మార్కెటింగ్, వివిధ వ్యక్తులు, సంస్థల సహకారాలు తదితర విషయాలెన్నో చోటుచేసుకున్నాయి. నాకు అర్థమైన విషయాలను నివేదికలో పొందుపరుస్తున్నాను.
నివేదిక :
ప్రపంచమంతటా వాతావరణ కాలుష్యం అధికమై మానవ జీవనం ప్రమాదంలో పడిపోయిన ఈ తరుణంలో జీవవైవిధ్య రక్షణకు, పర్యావరణ పరిరక్షణకు, మానవారోగ్యాన్ని కాపాడుకునేందుకు, తక్కువ ఖర్చుతో రైతులకు అన్ని విధాల మేలు చేకూరుస్తూ లాభాలను అందించగల వ్యవసాయ విధానం “సేంద్రియ సేద్యం”.
ప్రకృతిలో సహజంగా లభించే ఆకులు, బెరళ్ళు, పశువుల పేడ, నూనెలు, రసాలు ఉపయోగించి పంటలకు అవసరమైన ఎరువును, క్రిమిసంహాయరక మందులను తయారు చేయడం, విత్తనశుద్ధి, పంటల పెంపకం, కలుపు తీయడం వంటి వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక పదార్థాలను నియంత్రించడం సేంద్రియ సేద్యం యొక్క ప్రత్యేకతలు.
ఈ విధానంలో వ్యవసాయం చేయడంలో పశుపోషణ కూడా ఒక భాగం. పశువులను శ్రద్ధగా, పద్ధతి ప్రకారం పోషించడం వల్ల వాటి నుంచి లభించే మలమూత్రాలు సస్యరక్షణకు, పోషణకు ఎంతగానో ఉపకరిస్తాయి. మంచి వాతావరణం, కావలసిన పోషక పదార్థాలు తగినంతగా లభించడం వల్ల పశుపక్ష్యాదులు వృద్ధి పొంది, పంట నష్టాన్ని చాలా వరకు నివారిస్తాయి. దిగుబడి పెరుగుతుంది. ఉత్పత్తుల్లో నాణ్యత, స్వచ్ఛత కారణంగా మార్కెట్లో అధిక ధరలు పలికి, రైతుకు లాభం చేకూరుస్తాయి. ఈనాడు మార్కెట్లో దొరికే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులూ రసాయనాల బారిన పడి ప్రజారోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి.
సేంద్రియ సేద్యంలో అది పూర్తిగా నివారింపబడటం వల్ల అందరూ వాటిని ఇష్టపడతారు. యాపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లకు కూడా రసాయనాల బాధ తప్పని ఈ కాలంలో ఇటువంటి వ్యవసాయం ఎంతో శ్రేష్ఠమని, భారతదేశంలో పరిస్థితులు, జీవన విధానం ఈ పద్ధతికి బాగా నప్పుతుందని డా॥ వి. ప్రవీణ్ రావుగారు చెప్పడం ఎంతో ఆనందదాయకం. ఇటువంటి వ్యవసాయ పద్ధతుల్ని రైతులందరూ అనుసరించాలని, ప్రజలు బాగా ఆదరించాలని, ప్రభుత్వం సరైన తోడ్పాటును అందించాలని, వ్యవసాయాధికారులు చక్కగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.
ఇతర అంశాలు:
పర్యాయపదాలు:
నటనము = నర్తనము, నాట్యము
పశువులు = జంతువులు, మృగములు
ఉడుపులు = వస్త్రములు, దుస్తులు
కన్ను = అక్షి, నయనం, నేత్రం
కర్షకుడు = హాలికుడు, కృషీవలుడు, సైరికుడు, రైతు
కేలు = చేయి, కరము
హలము = సీరము, నాగలి
ఆకలి = క్షత్తు, బుభుక్ష, కూడు
సంయమి = తాపసి, యోగి, ముని
చీకటి = తమస్సు, అంధకారము
ఆహారము = భోజనము, అన్నము, కూడు
బురద = అడుసు, కర్దమము
వ్యుత్పత్త్యర్థాలు:
కర్షకుడు = కృషి (వ్యవసాయము) చేయువాడు – రైతు
హాలికుడు = హలము చేత పట్టినవాడు – రైతు సీరము (నాగలి)
సైరికులు = ధరించినవారు – రైతులు
వేత్త = బాగా తెలిసినవాడు – జ్ఞాని
సంయమి = యమ నియమాదులను పాటించువాడు – ఋషి
నానార్థాలు:
కాన = కాబట్టి, అడవి
మాపు = సాయంత్రం, మాసిపోవుట
జంతువు = ప్రాణి, మృగము
ప్రొద్దు = ఉదయము, సూర్యుడు
సుధ = అమృతము, సున్నము
మిత్రుడు = స్నేహితుడు, సూర్యుడు
ప్రకృతులు – వికృతులు:
ప్రకృతి – వికృతి
గౌరవము – గారవము
సర్పము – సప్పము
బ్రధ్న – ప్రొద్దు
స్నానము – తానము
ఆహారము – ఓగిరము
వర్ణము – వన్నె
చిహ్నము – చిన్నె
కష్టము – కస్తి
వ్యథ – వెత
సంధులు:
మౌనులెవరు = మౌనులు + ఎవరు = ఉత్వసంధి
హలమూని = హలము + ఉని = ఉత్వసంధి
పడుదువీవు = పడుదువు + ఈవు = ఉత్వసంధి
పండుదీవు = పండదు + ఈవు = ఉత్వసంధి
నీవిల్లు = నీవు + ఇల్లు = ఉత్వసంధి
పొదరిండ్లు = పొదరు + ఇండ్లు = ఉత్వసంధి
ఉనికిపట్టగు = ఉనికిపట్టు + అగు = ఉత్వసంధి
చేతులెత్తి = చేతులు + ఎత్తి = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అవుతుంది.
కూటికై = కూటికి + ఐ = ఇత్వ సంధి
చేయిడి = చేయి + ఇడి = ఇత్వ సంధి
లేనట్టి = లేని + అట్టి = ఇత్వ సంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
ఇంతైన = ఇంత + ఐన = అత్వసంధి
లేకున్న = లేక + ఉన్న = అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
సంయమీంద్ర = సంయమి + ఇంద్ర = సవర్ణదీర్ఘసంధి
వ్యాఘ్రాది = వ్యాఘ్ర + ఆది = సవర్ణదీర్ఘసంధి
ఉత్తమాహారము = ఉత్తమ + ఆహారము = సవర్ణదీర్ఘసంధి
వజ్రాయుధము = వజ్ర + ఆయుధము = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
సమాసములు:
కష్టసుఖాలు = కష్టమును, సుఖమును – ద్వంద్వసమాసం
శత్రుమిత్రులు = శత్రువును, మిత్రుడును – ద్వంద్వ సమాసం
వన్నెచిన్నెలు = వన్నెయు, చిన్నెయు – ద్వంద్వ సమాసం
వడగండ్ల దెబ్బలు = వడగండ్ల చేత దెబ్బలు – తృతీయా తత్పురుష సమాసం
సమ్యమేంద్రుడు = సమ్యములలో శ్రేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
ఎండల వేడి = ఎండల యొక్క వేడి – షష్ఠీ తత్పురుష సమాసం
తాపసేంద్ర = తాపసులలో ఇంద్రుడా – షష్ఠీ తత్పురుష సమాసం
చే కర్ర = చేతి యందలి కర్ర – సప్తమీ తత్పురుష సమాసం
ఎసైన్మెంట్:
పదజాలం :
సొంతవాక్యాలు:
ప్రశ్న 1.
సైరికులు : _______________
జవాబు.
సైరికులు = రైతులు
సైరికులు పంటలను పండిస్తారు. వ్యవసాయం చేస్తారు.
ప్రశ్న 2.
చెయిమోడ్చి : _______________
జవాబు.
చెయిమోడ్చి = చేతులు జోడించి
పెద్దలు, గురువులు కనిపించినపుడు చెయిమోడ్చి నమస్కారించాలి.
ప్రశ్న 3.
ఇడుములు : _______________
జవాబు.
ఇడుములు = కష్టాలు
ఇడుములు వచ్చినపుడే మనిషి ధైర్యంగా ఉండాలి.
ప్రశ్న 4.
వడుకుడుపులు : _______________
జవాబు.
వడుకుడుపుల = చేతితో నేసిన నేతవస్త్రాలు
వడుకుడుపులు ఎంతో మెత్తగా, వెచ్చగా ఉంటాయి.
అర్థాలు:
కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.
ప్రశ్న 5.
అడవిలో క్రూర మృగాలు నివసిస్తాయి. ( )
A) తోట
B) పెరడు
C) ఇల్లు
D) అరణ్యం
జవాబు.
D) అరణ్యం
ప్రశ్న 6.
యతి వరులను గౌరవించడం మన సంప్రదాయం. ( )
A) సన్న్యాసి
B) మనిషి
C) తల్లి
D) తండ్రి
జవాబు.
A) సన్న్యాసి
ప్రశ్న 7.
పార్వతీదేవి వాహనం వ్యాఘ్రం ( )
A) కోతి
B) పాము
C) పులి
D) కప్ప
జవాబు.
C) పులి
ప్రశ్న 8.
వృశ్చికానికి తోకలో విషం ఉంటుంది. ( )
A) పాము
B) తేలు
C) మనిషి
D) దుష్టుడు
జవాబు.
B) తేలు
ప్రశ్న 9.
తుమ్మచెట్టు కంటకం గుచ్చుకుంటే చాలా నొప్పిగా ఉంటుంది. ( )
A) ముల్లు
B) ఆకు
C) కొమ్మ
D) కాయ
జవాబు.
A) ముల్లు
ప్రశ్న 10.
పేదవారి ఇడుములు అన్నీ యిన్నీ కావు. ( )
A) ఉడుములు
B) అప్పాలు
C) కష్టాలు
D) సుఖాలు
జవాబు.
C) కష్టాలు
వ్యుత్పత్త్యర్థాలు:
కింది వానికి వ్యుత్పత్త్యర్థాలు గుర్తించండి.
ప్రశ్న 11.
సీరము తో నేలనను దున్నువాడు – ( )
A) సీరడు
B) సైరికుడు
C) సేరకుడు
D) సైరడు
జవాబు.
B) సైరికుడు
ప్రశ్న 12.
కర్షకుడు – ( )
A) కృషి చేసేవాడు
B) కర్మ చేసేవాడు
C) కర్షణం చేసేవాడు
D) కష్టపడేవాడు
జవాబు.
A) కృషి చేసేవాడు
పర్యాయ పదాలు:
కింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించండి.
ప్రశ్న 13.
అంధకారంలో నడవడం చాలాకష్టం. చీకట్లో పురుగూపుట్రా తిరుగుతాయి. అందుకే తమస్సులో దీపం తీసుకొని నడవాలి. ( )
A) నడవడం, కష్టం, చాలా
B) పురుగు, పుట్ర, చీకటి
C) తమస్సు, దీపం, అందుకే
D) అంధకారం, చీకటి, తమస్సు
జవాబు.
D) అంధకారం, చీకటి, తమస్సు
ప్రశ్న 14.
నేత ఉడుపులు ధరిస్తే హాయిగా ఉంటుంది. పట్టువస్త్రాలు మెరుస్తూ హుందాగా ఉంటాయి. పేదవారికి చినిగిన బట్టలకు కూడా కరువే. ( )
A) ఉడుపులు, ఉడుములు, ఇడుములు
B) వస్త్రాలు, హుందాగా, పట్టు
C) ఉడుపులు, వస్త్రాలు, బట్టలు
D) పేద, మెరుస్తూ, హాయిగా
జవాబు.
C) ఉడుపులు, వస్త్రాలు, బట్టలు
ప్రశ్న 15.
ఆకలి గొన్న వారి బుభుక్ష తీర్చడం మనధర్మం. ( )
A) దాహం, దప్పిక
B) ఆకలి, బుభుక్ష
C) ధర్మం, న్యాయం
D) కొన్న, అమ్మిన
జవాబు.
B) ఆకలి, బుభుక్ష
ప్రశ్న 16.
తాపసి తపస్సుకు భంగం కలిగిస్తే యోగికి కోపం వస్తుంది. ( )
A) తాపసి, యోగి
B) తపస్సు, భంగం
C) యోగి, కోపం
D) తపస్సు, కోపం
జవాబు.
A) తాపసి, యోగి
ప్రశ్న 17.
ఇడుములు కలిగినప్పుడు ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవాలి. ( )
A) ఇడుములు, కష్టాలు
B) ఆపదలు, ఆనందాలు
C) కష్టం, దుఖం
D) సంతోషం, సుఖం
జవాబు.
A) ఇడుములు, కష్టాలు
నానార్థాలు:
కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.
ప్రశ్న 18.
కానలో క్రూరమృగాలుంటాయి కాన జాగ్రత్తగా ఉండాలి. ( )
A) దారి, మార్గం
B) అడవి, కాబట్టి
C) ఇల్లు, వాకిలి
D) తోట, అడవి
జవాబు.
B) అడవి, కాబట్టి
ప్రశ్న 19.
మిత్రుడు ఉదయించగానే నా మిత్రుడు వస్తాడు. ( )
A) చంద్రుడు, తండ్రి
B) ఇంద్రుడు, స్నేహితుడు
C) సూర్యుడు, స్నేహితుడు
D) సూర్యుడు, సోదరుడు
జవాబు.
C) సూర్యుడు, స్నేహితుడు
ప్రశ్న 20.
మాపువేళ ఎక్కడి నుంచి వస్తున్నావు బట్టలు మాపు కొని ? ( )
A) సాయంత్రం, మాసిపోయి
B) ఉదయం, ఎండ
C) రాత్రి, పగలు
D) ఉదయం, బట్టలు
జవాబు.
A) సాయంత్రం, మాసిపోయి
ప్రకృతి / వికృతులు:
కింది వాక్యాలలోని గీతగీసిన పదాలకు ప్రకృతి/వికృతి గుర్తించండి.
ప్రశ్న 21.
కొందరు ముసలివారు వెతలతోనే ఎలాగో కాలం గడుపుతారు. ( )
A) వ్యథ
B) వెథ
C) వేత్త
D) వయథ
జవాబు.
A) వ్యథ
ప్రశ్న 22.
నాగుల చవితికి సర్పములను పూజిస్తాము. ( )
A) సృపము
B) సప్పము
C) సరపము
D) శర్పము
జవాబు.
B) సప్పము
ప్రశ్న 23.
ప్రొద్దు పొడవక ముందే నిద్ర లేవాలి. ( )
A) పద్దు
B) ప్రద్దు
C) బ్రధ్న
D) వొద్దు
జవాబు.
C) బ్రధ్న
ప్రశ్న 24.
పుష్కరాలలో గోదావరిలో స్నానాలు చేసొద్దామా ? ( )
A) సానాలు
B) పానాలు
C) సన్నాలు
D) తానాలు
జవాబు.
D) తానాలు
ప్రశ్న 25.
కులము మతము అనే భేదాలు పాటించకూడదు. ( )
A) కూలము
B) కోలము
C) కొలము
D) కుళము
జవాబు.
C) కొలము
భాషాంశాలు :
సంధులు:
కింది సంధులను గుర్తించండి.
ప్రశ్న 26.
వజ్రాయుధము ………………… విడదీయండి. ( )
A) వజ్ర + యుధము
B) వజ్ర + ఆయుధము
C) వజ్రా + ఆయుధము
D) వజ్రా + యుధము
జవాబు.
B) వజ్ర + ఆయుధము
ప్రశ్న 27.
సంయమీంద్ర – ఏ సంధి ? ( )
A) ఇత్వసంధి
B) గుణసంధి
C) సవర్ణదీర్ఘసంధి
D) అత్వసంధి
జవాబు.
C) సవర్ణదీర్ఘసంధి
ప్రశ్న 28.
కింది పదాలలో ఇత్వసంధి ఉదాహరణ ఏది ? ( )
A) నీవిల్లు
B) చేతులెత్తి
C) కూటికై
D) లేకున్న
జవాబు.
C) కూటికై
ప్రశ్న 29.
వీటిలో సవర్ణదీర్ఘసంధి ఉదాహరణ ఏది ? ( )
A) హలమూని
B) వ్యాఘ్రాది
C) పండుదీవు
D) చేయిడి
జవాబు.
B) వ్యాఘ్రాది
ప్రశ్న 30.
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాచ్చులు పరమైతే ఆదేశంగా వచ్చేది ……………….. ( )
A) దీర్ఘాలు
B) గుణాలు
C) యణ్ణులు
D) వృద్ధులు
జవాబు.
A) దీర్ఘాలు
సమాసాలు:
కింది సమాసాలను గుర్తించండి.
ప్రశ్న 31.
తాపసేంద్ర – ఏ సమాసము ? ( )
A) ద్వితీయాతత్పురుష సమాసం
B) చతుర్థీ తత్పురుష సమాసం
C) పంచమీ తత్పురుష సమాసం
D) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు.
D) షష్ఠీ తత్పురుష సమాసం
ప్రశ్న 32.
వన్నెలును చిన్నెలును – సమాసపదం ? ( )
A) వన్నె చిన్నెలును
B) వన్నెలును చిన్నెలు
C) వన్నెచిన్నెలు
D) వన్నెచిన్నె
జవాబు.
C) వన్నెచిన్నెలు
ప్రశ్న 33.
వడగండ్ల దెబ్బలు విగ్రహవాక్యం ? ( )
A) వడగండ్ల చేత దెబ్బలు
B) వడగండ్ల కొరకు దెబ్బలు
C) వడగండ్లు మరియు దెబ్బలు
D) వడగండ్ల యందు దెబ్బలు
జవాబు.
A) వడగండ్ల చేత దెబ్బలు
ప్రశ్న 34.
కష్టసుఖములు – ఏ సమాసం ? ( )
A) ద్విగు సమాసం
B) ద్వంద్వ సమాసం
C) తృతీయాతత్పురుష సమాసం
D) రూపక సమాసం
జవాబు.
B) ద్వంద్వ సమాసం
ప్రశ్న 35.
శత్రుమిత్రులు – విగ్రహవాక్యం ? ( )
A) శత్రును మిత్రును
B) శత్రువులును మిత్రులును
C) శత్రువులైన మిత్రులు
D) మిత్రులైన శత్రువులు
జవాబు.
B) శత్రువులును మిత్రులును
వాక్యాలు – రకాలు:
కింది వాక్యాలు ఎటువంటి వాక్యాల్లో గుర్తించండి.
ప్రశ్న 36.
ఆహా ! రైతు ఎంత మంచి పని చేస్తున్నాడో ! ( )
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) హేత్వర్థకం
జవాబు.
A) ఆశ్చర్యార్థకం
ప్రశ్న 37.
ఎండనక వాననక చేపట్టిన పని కొనసాగించే ఋషులు ఎవరు ? ( )
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) సామర్ధ్యార్థకం
జవాబు.
C) ప్రశ్నార్థకం
ప్రశ్న 38.
రైతు మాత్రమే ఆ పని చేయగలడు. ( )
A) హేత్వార్థకం
B) సామర్థ్యార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు.
B) సామర్థ్యార్థకం
ప్రశ్న 39.
దయచేసి రైతు కష్టాన్ని గుర్తించండి. ( )
A) ప్రశ్నార్థకం
B) అనుమత్యర్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ప్రార్థనార్థకం
జవాబు.
D) ప్రార్థనార్థకం
క్రియను గుర్తించుట:
గీతగీసిన పదం ఏ క్రియాపదమో గుర్తించండి.
ప్రశ్న 40.
వేడి సహించి, ముండ్ల మీద నడిచి పంట వేస్తాడు. ( )
A) చేదర్థకం
B) శత్రర్థకం
C) క్త్వార్థం
D) అప్యర్థకం
జవాబు.
C) క్త్వార్థం
ప్రశ్న 41.
రైతు కష్టించి పంట పండించినా ఫలితం దక్కడం లేదు. ( )
A) అప్యర్థకం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) క్త్వార్థం
జవాబు.
A) అప్యర్థకం
ప్రశ్న 42.
రైతు పంట పండిస్తే మనకి ధాన్యం కొరత ఉండదు. ( )
A) క్త్వార్థం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అప్యర్థకం
జవాబు.
B) చేదర్థకం
సామాన్య – సంక్లిష్ట – సంయుక్త వాక్యాలు:
ప్రశ్న 43.
రైతు కష్టపడతాడు. రైతు పంట పండిస్తాడు. – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) రైతు కష్టపడి పంట పండిస్తాడు.
C) రైతు కష్టపడాలని పంట పండిస్తాడు.
B) రైతు కష్టపడుతూ పంట పండిస్తాడు.
D) రైతు కష్టపడటం కోసం పంట పండిస్తాడు.
జవాబు.
A) రైతు కష్టపడి పంట పండిస్తాడు.
ప్రశ్న 44.
రైతు ఋషి శ్రేష్ఠుడు. ముని శ్రేష్ఠుడు – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) రైతు ఋషి శ్రేష్ఠుడైన ముని శ్రేష్ఠుడు
B) రైతు ముని శ్రేష్ఠుడైన ఋషి శ్రేష్ఠుడు
C) రైతు ఋషి శ్రేష్ఠుడు మరియు ముని శ్రేష్ఠుడు
D) రైతు శ్రేష్ఠుడైన మునీ, ఋషీ
జవాబు.
C) రైతు ఋషి శ్రేష్ఠుడు మరియు ముని శ్రేష్ఠుడు
ప్రశ్న 45.
నీకు పశుసంపద పరివారం. నీకు పంటచేను నందనవనం. – సంయుక్త వాక్యం గుర్తించండి. ( )
A) నీకు పరివారం నందనవనం, పరివారం పంటచేనే
B) నీకు పశుసంపద పరివారం మరియు పంటచేను నందనవనం.
C) నీకు పంటచేను నందనవనం. అంతేకాక నీ పరివారం నీ పశుసంపదే.
D) నీకు పశుసంపద పరివారం కాగా పంటచేను నందనవనమౌతుంది.
జవాబు.
B) నీకు పశుసంపద పరివారం మరియు పంటచేను నందనవనం.
ప్రశ్న 46.
నీకు చేతులు జోడిస్తాను. నీకు నమస్కరిస్తాను – సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ( )
A) నీకు చేతులు జోడిస్తూ నమస్కరిస్తాను.
B) నీకు చేతులు జోడించాలని నమస్కరిస్తాను
C) నీకు నమస్కరించడానికి చేతులు జోడిస్తాను
D) నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను
జవాబు.
D) నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను
ఛందస్సు:
కింద ఇచ్చినవి ఏ పద్యపాదాలో గుర్తించండి.
ప్రశ్న 47.
హర్తకుఁ గాదు గోచరమహర్నిశమున్ సుఖపుష్టి సేయు ( )
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు.
A) ఉత్పలమాల
ప్రశ్న 48.
చదువది ఎంతగల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా. ( )
A) ఉత్పలమాల
B) శార్దూలం
C) చంపకమాల
D) మత్తేభం
జవాబు.
C) చంపకమాల
ప్రశ్న 49.
మత్తేభం పద్యపాదంలోని గణాలు ఏవి ? ( )
A) భరనభభరవ
B) నజభజజజర
C) సభరనమయవ
D) మసజసతతగ
జవాబు.
C) సభరనమయవ
ప్రశ్న 50.
మసజసతతగ గణాలు ఏ పద్యపాదంలో ఉంటాయి ? ( )
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలం
D) మత్తేభం
జవాబు.
C) శార్దూలం
అలంకారాలు:
కింది అలంకారములను గుర్తించండి.
ప్రశ్న 51.
ఆకాశం నుండి రాలుతున్న వానచినుకులు, భూమాతకు పట్టిన ముత్యాల గొడుగేమో అన్నట్లుంటాయి. ( )
A) ఉత్ప్రేక్ష
B) ఉపమ
C) రూపక
D) స్వభావోక్తి
జవాబు.
B) ఉపమ
ప్రశ్న 52.
గంగానది నీరు కొబ్బరి నీరువలె తియ్యగా ఉన్నది. ( )
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) అతిశయోక్తి
జవాబు.
A) ఉపమ
ప్రశ్న 53.
రత్తమ్మ, అత్తగారి కొత్త చీర కట్టుకొని, దుత్త నెత్తిన పెట్టుకొని వయ్యారంగా నడిచింది. ( )
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) వృత్త్యనుప్రాస
జవాబు.
D) వృత్త్యనుప్రాస