AP 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

These AP 10th Class Telugu Important Questions 9th Lesson మాణిక్యవీణ will help students prepare well for the exams.

AP State Syllabus 10th Class Telugu 9th Lesson Important Questions and Answers మాణిక్యవీణ

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“చిన్నవాడు మానవుడు – చిరంజీవి మానవుడు” అంటూ చాటిన “విద్వాన్ విశ్వం” గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. (June 2018)
జవాబు:
1) మాణిక్యవీణ పాఠ్యరచయిత విద్వాన్ విశ్వం కాలము 1915 – 1987.

2) రచనలు : పత్రికా సంపాదకునిగా “అవి-ఇవి, తెలుపు నలుపు, మాణిక్యవీణ” వంటి శీర్షికలతో సంపాదకీయాలు, “ప్రేమించాను” అనే నవల, “ఒకనాడు”, “పెన్నేటిపాట” అనే కావ్యాలు రాశారు.

3) బిరుదులు : కళాప్రపూర్ణ

4) రచనా విధానం : చిన్న చిన్న పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితలు రచించారు.

ప్రశ్న 2.
మాణిక్య వీణ పాఠం ఎవరు రచించారు? రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
మాణిక్య వీణ పాఠం విద్వాన్ విశ్వంగారు రచించారు. ఆయన పూర్తి పేరు మీసరగండ విశ్వరూపాచారి. ఆయన తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామయ్య. విశ్వం అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జన్మించారు. 21.10.1915 ఆయన పుట్టినరోజు. ఆయన 19.10.1987న స్వర్గస్తులయ్యారు.

ప్రశ్న 3.
విద్వాన్ విశ్వం సాహిత్యసేవ, అందుకొన్న సన్మానాలు వ్రాయండి.
జవాబు:
విద్వాన్ విశ్వం తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషలలో పండితులు. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో పనిచేశారు.

‘కాదంబరి’తో సహా అనేక సంస్కృత గ్రంథాలను తెలుగులోనికి అనువదించారు.

పత్రికలలో ‘అవి-ఇవి’, ‘తెలుపు-నలుపు’, ‘మాణిక్య వీణ’ మొదలైన శీర్షికలతో రచనలు చేశారు. భాష, సాహిత్యం , సమాజం, నైతిక విలువలు మొదలైన అంశాలపై రాసిన విశ్వం సంపాదకీయాలు విలువైనవి. ‘పెన్నేటిపాట’, ‘ఒకనాడు’ అనే కావ్యాలను, ‘ప్రేమించాను’ అనే నవలను రచించారు. కళాప్రపూర్ణ, డి.లిట్. వంటి డిగ్రీలను అందుకొన్నారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 4.
మానవ చరిత్రలోని గొప్ప మలపులేవి?
జవాబు:
మానవ చరిత్రలో క్రింద చెప్పినవన్నీ గొప్ప మలపులు. మానవుడు చక్రం కనుక్కొన్న రోజు, మానవుడు చకచకా నాలుగు గీతలతో అక్షర లిపిని కనుక్కొన్న రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, మానవుడు తప్పటడుగులు మాని తాండవం చేసిన రోజు, మానవ చరిత్రలో గొప్ప మలపులు.

అలాగే మానవుడు కిచకిచలు మాని, మంచి భాషలు నేర్చుకొన్నరోజు, చిన్న చిన్న మాటలతో జానపద గీతాలు అల్లుకొన్న రోజు, ధాన్యాన్ని పండించడం నేర్చుకున్న రోజు, లలిత కళలను పండించుకొన్న రోజు కూడా, మానవ చరిత్రలో గొప్ప మలపులు.

ఈ విధంగా మానవుడు చక్రం కనుక్కొన్న రోజు, లిపిని నేర్చిన రోజు, నిప్పును కనుక్కొన్న రోజు, కళలు, కవిత్వము నేర్చిన రోజు మానవ చరిత్రలో అసాధారణ పర్వదినాలని, గొప్ప మలపులు అని చెప్పాలి.

ప్రశ్న 5.
మాణిక్యవీణ పాఠం ఆధారంగా సమాజ రుగ్మతలు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
సమాజ రుగ్మతలు అంటే సమాజానికి అనగా సంఘానికి పట్టిన జబ్బులు.

  1. అంటరానితనాన్ని పాటించడం
  2. కులమత భేదాలు పాటించడం
  3. మూఢనమ్మకాలు కలిగియుండడం
  4. అవినీతి దురాచారం
  5. కులసంఘాలు, మత సంఘాలు మొ||నవి.

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మానవాభివృద్ధిలో చోటు చేసుకున్న మార్పులను “మాణిక్యవీణ” పాఠ్యభాగం ఆధారంగా వివరించండి. (June 2018)
జవాబు:

  1. ప్రకృతిని చూచి పరవశించిన మానవుడు దానిని తన కనుసన్నలలో ఉంచుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మానవాభివృద్ధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
  2. గుహలలో జీవించిన ఆదిమానవుడే గుర్రాల్ని, జింకలను గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాడు. తన గానమాధుర్యంతో ఎండిన మోడుల్ని చిగురింపజేశాడు.
  3. పాటకు అనుగుణంగా కఠినరాతినేలపై కాళ్ళకు గజ్జెకట్టి గంతులేశాడు. స్వరాల సొబగులతో మనసుకు హత్తుకొనే పాటలు పాడాడు. ఇలా కళలపై అభిరుచిని పెంచుకున్నాడు.
  4. ఈ క్రమంలోనే చక్రాన్ని కనుగొనడం, నిప్పును కనుగొనడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. చక్రాన్ని కనుగొన్న రోజు ఎంత గొప్పదో చకచకా నాలుగు గీతలతో లిపిని కనుగొన్న రోజూ అంతే ముఖ్యమైనది. చక్రం చలనానికి, లిపి భావ సంచలనానికి వేదికలై సృజనాత్మక ప్రపంచం వైపు మానవుడిని నడిపించాయి.
  5. అరుపుల నుండి అర్థవంతమైన మాటలు నేర్వటం, సారవంతమైన భూమి నుండి భుక్తిని పండించుకోవడం – ఈ మార్పులన్నీ ఆదిమ దశ నుండి ఆధునిక దశ వైపు మానవుడిని అభివృద్ధి పథంలో నడిపించి శాశ్వతుణ్ణి చేశాయి.

ప్రశ్న 2.
“ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని మానవుడు కళాభిరుచిని పెంపొందించుకున్నాడనే” కవి అభిప్రాయాన్ని సమర్థించండి. (March 2018)
జవాబు:

  1. మనిషి కళ్ళు తెరవగానే చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించాడు. ప్రకృతిని తన కనుసన్నలలో ఉంచే ప్రయత్నం చేస్తూ అందలి రంగులను, ధ్వనులను అనుకరించాడు. పూర్తిగా ప్రకృతిలో లీనమైపోయాడు.
  2. గుహలలో జీవించిన ఆదిమానవుడు గుర్రాలను, జింకలను గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకొన్నాడు.
  3. ఆటవికుడుగా ఉన్నప్పుడే తన గాన మాధుర్యంతో ఎండిన మోడులను చిగురింపజేశాడు. పాటకు తగినట్లుగా కఱకు రాతినేలపై కాలికి గజ్జెకట్టి గంతులు వేశాడు. స్వరాల సుకుమారపు నొక్కులతో మనస్సుకు హత్తుకొనేలా పాటలు పాడాడు.
  4. ఊహ తెలిసిన నాటి నుండి ప్రకృతిని ఆరాధిస్తూ తనను తాను మైమరచి పాటలు పాడుతూ ఆనందడోలికల్లో తేలిపోయాడు.
  5. ఈ విధంగా అతడు కళలను తన జీవితంలో ఒక భాగం చేసుకొన్నాడు. ప్రకృతి అతడికి తొలి గురువు. ప్రకృతి ఒడి అతడికి తొలి బడి. కనుక మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని కళాభిరుచిని పెంపొందించుకున్నాడనే కవి అభిప్రాయాలు సంపూర్ణంగా సమర్థించదగినవని నేను భావిస్తున్నాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
మానవ మహాప్రస్థానంలో కవికి తోడైన వాటిని గూర్చి వివరించండి.
(లేదా)
మానవ మహాప్రస్థానంలో అతనితో పెనవేసుకొనిపోయిన అంశాలేవి? వాటిని కవి ఎలా స్మరించుకున్నాడో వివరించండి. (March 2019)
జవాబు:
మానవ మహాప్రస్థానంలో కవికి కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయి. ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని చూసి సంతోషించి, దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ద్వారా మంచి విజ్ఞానం పొందాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. పక్షుల ధ్వనులను అనుకరించాడు. ఎండిన చెట్లు చిగిరించేలా పాడడం నేర్చుకున్నాడు. కాలికి గజ్జెకట్టి నాట్యం నేర్చాడు. మంచి కవిత్వం చెప్పడం నేర్చాడు.

గీతలు గీయడం ద్వారా లిపిని నేర్చుకొని తన అభిప్రాయాన్ని ఇతరులకు తెలుపగలిగాడు. చక్కని గీతాలు చిన్న మాటలతో రాశాడు. ధాన్యం పండించి హాయిగా తింటున్నాడు. మానవుడు తన అలసటను, కళా కవితల ద్వారా పోగొట్టుకుంటున్నాడు. విజ్ఞానం పెంచుకొని చక్రాన్ని కనిపెట్టి దాని ద్వారా వాహనాలు, యంత్రాలు కనిపెట్టాడు. వైజ్ఞానికంగా ఎంతో ముందడుగు వేశాడు. నిప్పును కనిపెట్టి వంటకాలు వండుకు తిన్నాడు.

ఈ విధంగా ఆదిమ మానవుడు, కళలు, కవిత, విజ్ఞానముల ద్వారా మిన్నులు పడిన చోటు నుండి ఆకాశానికి ఎదిగాడు.

ప్రశ్న 4.
మైలు రాళ్ళ వంటి అంశాలు వేటికి గుర్తులుగా మీరు భావిస్తున్నారు?
జవాబు:
విద్వాన్ విశ్వంగారు తన ‘మాణిక్య వీణ’ అనే గేయంలో చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిన కొన్ని విషయాలను గూర్చి పేర్కొన్నాడు.

1) మానవుడు ‘చక్రం’ ను కనుక్కొన్న రోజు చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు. అలాగే చకచకా నాలుగు గీతలతో లిపిని కనుక్కొన్న రోజు కూడా విశేషమైనదన్నారు. చక్రం, మానవ చలనానికి దోహదపడింది. ‘లిపి’, భావ సంచలనానికి వేదిక అయి, సృజనాత్మకత ప్రపంచంలోకి దారితీసింది.

2) నిప్పును కనుక్కొన్న రోజు ఎంత గొప్పదో, తప్పటడుగుల చిందుల నుండి, గొప్ప నృత్యాలు చేసిన రోజు కూడా అంతే గొప్పది.

3) అరుపుల నుంచి అర్థవంతమైన మాటలు నేర్చిన రోజు, ఆ మాటలతో జానపద గీతాలు అల్లిన రోజు, సారవంతమైన భూమి నుండి ఆహారం పండించుకున్న రోజు, మనస్సుకు ఆనందం కల్గించే కళ ఆవిష్కరణ జరిగిన రోజు, మొదలయినవి అన్నీ చరిత్రలో మైలురాళ్ళుగా నిలుస్తాయి. అవన్నీ గొప్ప రోజులే.

మానవుని జీవన పరిణామచరిత్రలో అసాధారణ సంఘటనలు జరిగిన ప్రతిరోజూ శుభదినమే అని విద్వాన్ విశ్వంగారు చెప్పారు.

ప్రశ్న 5.
చరిత్రలో మైలురాళ్ళుగా కవి వేటిని గుర్తించాడు? ఎందుకు?
జవాబు:
మానవుడు చక్రాన్ని కనుక్కొన్న రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, నాలుగు గీతలతో లిపిని కనుక్కొన్న రోజు, తప్పటడుగులు మాని తాండవ నృత్యం చేసిన రోజు, భాషలు నేర్చుకొన్న రోజు, చిన్న చిన్న మాటలతో పదాలు అల్లుకొన్నరోజు, ధాన్యం పండించుకున్న రోజు కళలను పండించుకొన్న రోజు, మానవ జీవిత చరిత్రలో మైలురాళ్ళుగా నిలుస్తాయని, విద్వాన్ విశ్వంగారు చెప్పారు. పైవన్నీ మానవుడి జీవనయాత్రలో అభ్యుదయానికీ, విజ్ఞానానికీ, ప్రతీకలు.
1) చక్రం కనుక్కొన్న రోజు :
చక్రాన్ని కనిపెట్టాకే, బళ్ళు, రిక్షాలు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, రైళ్ళు, ఫ్యాక్టరీ యంత్రాలు . వగైరా వాడుకలోకి వచ్చాయి. పారిశ్రామికాభివృద్ధి అంతా, చక్రం తిరగడం మీదే ఆధారపడి ఉంది.

2) నాలుగు గీతలతో ఆకార నిర్మాణం :
ఈ విధంగానే భాషలకు చిత్రలేఖనం, లిపులు, గ్రంథాలు, మహాకావ్యాలు, విజ్ఞాన సాధన, చదువులు వచ్చాయి.

3) నిప్పును కనుక్కోడం :
నిప్పును మానవుడు కనిపెట్టాక, పదార్థాలను ఉడికించి కమ్మగా, రుచిగా అతడు తింటున్నాడు. ఆధునిక నాగరికతకు ఇది ప్రతీక.

4) తాండవ నృత్యం చేయడం :
నృత్యం ద్వారానే, నాట్యకళ అభివృద్ధి అయ్యింది. భరతనాట్యం వంటి వివిధ నృత్యాలు, కళాభివృద్ధి జరిగింది.

5) భాషలు నేర్చుకోడం :
భాషలు నేర్చుకోడం వల్లే కవిత్వము, సాహిత్యాభివృద్ధి జరిగింది. 6) ధాన్యం పండించడం : పచ్చి మాంసం తిన్న మానవుడు నాగరికత పెంచుకొని, వ్యవసాయం నేర్చుకొని ఆహార పదార్థాలను పండించాడు.

7) కళలు పండించడం :
లలిత కళాభివృద్ధి దీనివల్లే జరిగింది. మానవుడు సౌందర్యమును ఆరాధించేవాడయ్యాడు. అందుకే చక్రం, నిప్పు మొ||వి చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 6.
మానవుడు సాధించిన ప్రగతిని కవి వర్ణించిన తీరుపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
విద్వాన్ విశ్వంగారు మాణిక్య వీణలో మానవుడు ఎంతో ప్రగతిని సాధించాడని, మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయని చెప్పారు.

ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని తన అధీనం చేసుకోడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఎంతో విజ్ఞానం సాధించాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. ఎండిన మోళ్ళు చిగురించేలా పాటలు పాడడం నేర్చాడు. నాట్యం చేయడం నేర్చాడు. కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

గీతలు గీసి దాని ద్వారా లిపిని నేర్చుకొన్నాడు. చిన్న మాటలతో జానపద గీతాలు అల్లుకున్నాడు. ధాన్యం పండించాడు. విజ్ఞానం అభివృద్ధి చేసుకొని ‘చక్రం’ కనిపెట్టి దాని ద్వారా పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలు కనిపెట్టి ముందుకు సాగాడు. నిప్పును కనిపెట్టి వంటకాలు వండుకొని తిన్నాడు.

కవి వర్ణించినట్లుగా, మానవుడు కళలు, కవిత్వం, విజ్ఞానం అనే వాటిని తోడుగా చేసుకొని, ప్రగతిని సాధించాడని నేను కూడా నమ్ముతున్నాను.

ప్రశ్న 7.
మానవ చరిత్రలోని అసాధారణ పర్వదినాల ఆంతర్యం ఏమిటి?
జవాబు:
‘అసాధారణ పర్వదినాలు’ అంటే, గొప్ప విశేషమైన పండుగలు అని అర్ధము. మానవుడు పుట్టినప్పుడు అతడికి ఇల్లు కట్టుకోవడం తెలియక, గుహలలో నివసించాడు. చక్రం గూర్చి తెలియక, కాలి నడకన ప్రయాణం సాగించాడు. నిప్పు గురించి తెలియక, పచ్చిమాంసం తిన్నాడు. అక్షరం గూర్చి తెలియక, గీతలు గీశాడు. భాషలు తెలియక, కిచకిచలాడాడు.

అటువంటి ఆదిమ మానవుడు చక్రాన్ని, నిప్పును, కళలను, భాషలను, వ్యవసాయ పద్ధతులను తెలిసికొన్నాడు. దాని ద్వారా ఎన్నో వాహనాలను, యంత్రాలను నిర్మించి పరిశ్రమలను వృద్ధి చేశాడు. నిప్పు ద్వారా చక్కగా వండుకొని కమ్మగా తిన్నాడు. భాషలను నేర్చుకొని చక్కగా మాట్లాడగలిగాడు. లలిత కళలను నేర్చుకొని ఆనందాన్ని పొందాడు. జానపద గీతాలు, కవిత్వం అల్లాడు. కాబట్టి మానవుని అభ్యుదయ యాత్రలో అతడు నూతనంగా వస్తువులు కనిపెట్టిన రోజులన్నీ, కవి చెప్పినట్లు అసాధారణ పర్వదినాలనే నా అభిప్రాయము.

ప్రశ్న 8.
మానవ ప్రస్థానాన్ని కవి వర్ణించిన తీరును ఎలా సమర్థిస్తావు?
జవాబు:
మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయని కవి చెప్పిన మాట నిజం.

ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని చూచి పరవశుడయి, ప్రకృతిని తన అధీనం చేసుకోడానికి యత్నించాడు. ఆ ప్రయత్నంలో అతడు ఎంతో విజ్ఞానం సంపాదించాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. రంగులనూ, ధ్వనులను అనుకరించాడు. ఎండిన మోళ్ళు చివురించేలా పాటలు పాడడం నేర్చాడు. కాలికి గజ్జెకట్టి నాట్యం చేయడం నేర్చుకున్నాడు. చిక్కని పదాలతో కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

గీతలు గీయడం ద్వారా లిపిని నేర్చుకొని తన అభిప్రాయాన్ని ఇతరులకు తెలుపగలిగాడు. చిన్న చిన్న మాటలతో చక్కగా జానపద గీతాలు అల్లుకున్నాడు. ధాన్యం పండించుకొని దానిని ఆహారంగా తిన్నాడు. అతనికి జీవితంలో కలిగిన అలసటనూ, యాంత్రికతనూ కళా కవితల ద్వారా దూరం చేసుకున్నాడు.

విజ్ఞానం అభివృద్ధి చేసుకొని చక్రం కనిపెట్టి దాని ద్వారా పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలు కనిపెట్టి ఎంతో వైజ్ఞానికంగా ముందుకుసాగాడు. నిప్పును కనిపెట్టి, అనేక వంటకాలు వండుకొని తిన్నాడు.

ఆదిమ మానవుడు ఈ విధంగా కళలు, కవిత్వం, విజ్ఞానం నేర్చుకోవడం ద్వారా, మిన్నులు పడ్డచోటు నుండి ఎదిగి మిన్నందుకున్నాడు. అతని ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయి.

ప్రశ్న 9.
మాణిక్య వీణ కవితలో కవిగారు చెప్పిన అంశాలేవి?
జవాబు:
మంత్రాలతో చింతకాయలు ఎలా రాలవో, అలాగే పద్యాల ధాటితో చింతలు తొలగిపోవు. యంత్రాలతో రోగాలు నయం కానట్లే, తంత్రాలతో సమాజ సమస్యలు దారికిరావు.

కడుపులో కేన్సరుతో సంఘం బాధపడుతూ ఉంటే, అంతరిక్షంలోకి రాకెట్లు పంపితే మాత్రం ఏం ప్రయోజనం? మనిషి పుట్టగానే ప్రకృతిని చూచి ఆనందించాడు. దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అతడు ప్రయత్నించాడు. ప్రకృతిలోని రంగులనూ, ధ్వనులనూ అనుకరించాడు.

మానవుడు గుహలలో జీవించే ఆదిమ కాలంలోనే, గోడలపై జంతువుల బొమ్మలు గీశాడు. ఎండిన చెట్లు చిగిర్చేలా పాడాడు. గజ్జెకట్టి నాట్యం చేశాడు. చక్కని తీరుగా పదాలు పాడుకున్నాడు.

‘చక్రం’ కనుక్కొన్న రోజు, ‘లిపి’ తో రాసిన రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, చక్కగా నాట్యం చేసిన రోజు, మానవ చరిత్రలో మంచి రోజులు. మానవుడు అర్ధవంతమైన భాషలు నేర్చుకొన్న రోజు, చిన్నమాటలతో జానపద గీతాలు అల్లుకున్న రోజు, ధాన్యం పండించిన రోజు, కళలను పండించిన రోజు గొప్పరోజులు. మానవచరిత్రలో అవి అన్నీ పండుగరోజులు.

కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలసి మానవుడిని మహోన్నతంగా నడిపిస్తాయి. ఈ విధంగా నేల నుండి ఎదిగి మానవుడు ఆకాశాన్ని అందుకున్న చిన్నవాడు. మానవుడు చిరంజీవి. అతి ప్రాచీనుడు.

అనాదిగా నడుస్తున్న ఈ మానవుడి జీవనయాత్రలో కళాకవితలూ, జ్ఞాన విజ్ఞానాలూ, మానవుడి వెంటనే ఉండి, అతనితో నడుస్తూ, అతణ్ణి నడిపిస్తున్నాయి.

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ Important Questions and Answers

ప్రశ్న 1.
దిన పత్రికలు చదవమని విద్యార్థులను ప్రోత్సహిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
పత్రికా పఠనం
విద్యార్థులారా ! భావిభారత నిర్దేశకులారా !

పత్రికలు చదవండి. నిరంతరం ప్రపంచంలో జరుగుతున్న మార్పులను తెలుసుకోండి. పత్రిక పేరు ఏదైనా కావచ్చు. ప్రపంచ పరిజ్ఞానం ప్రధానం, టీ.వీ.ల మోజులో చదువుకు దూరం కాకండి.

పాఠ్య పుస్తకాలలో పరిజ్ఞానానికి, దిన పత్రికలలోని విశ్లేషణాత్మక పరిజ్ఞానం తోడైతే వ్యాఖ్యానించగల నేర్పు కలుగుతుంది. రోజూ క్రమం తప్పక పత్రికలు చదవండి. నిత్య నూతన విజ్ఞాన కాంతులతో విరాజిల్లండి.
ఇట్లు,
పాఠక బృందం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 2.
మానవుడు సాధించిన ప్రగతిని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఆదిమ మానవుడికి బట్ట కట్టుకోడం తెలియదు. అన్నం వండుకొని తినడం తెలియదు. చెట్టు బెరడులు కట్టుకొని,జంతువులను చంపి పచ్చిమాంసం తినేవాడు. ప్రకృతిలో దొరికే కాయలు, దుంపలు, పళ్ళు తినేవాడు. ఆదిమ మానవుడికి రాయడం, చదవడం, కళలు తెలియవు. ఇళ్ళు కట్టుకోడం తెలియక, గుహలలో నివసించేవాడు.

మానవుడు క్రమంగా లలిత కళలు నేర్చుకున్నాడు. రాయడం, కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. చక్రాన్ని, నిప్పును కనిపెట్టాడు. అర్థవంతమైన భాషలు నేర్చాడు. లిపులు నేర్చాడు. బట్టలు నేయడం, ధరించడం నేర్చాడు. కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

విజ్ఞానం నేర్చుకొని సైన్సు ద్వారా ఎన్నో కొత్త యంత్రాలు కనిపెట్టాడు. వంటలు వండడంలో మెలకువలు గ్రహించాడు. సమాచార రంగంలో విప్లవం సాధించాడు. రేడియో, టి.వి, ఇంటర్నెట్ వంటివి కనిపెట్టాడు. కంప్యూటర్ రంగంలో విప్లవం సాధించాడు. ఫోటోలు తీయడం నేర్చాడు. కొత్త కొత్త శాస్త్ర విద్యలు నేర్చాడు.

కొత్త ప్రయాణ సాధనాలు కనిపెట్టాడు. ఫ్రిజులు, ఎ.సి.లు వగైరా కనిపెట్టాడు. రాకెట్లు కనిపెట్టాడు. ఇతర గ్రహాల పైకి వెళ్ళి వస్తున్నాడు. విమానాలపై ప్రయాణం సాగిస్తున్నాడు.

మానవుడు ఈ విధంగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాడు.

ప్రశ్న 3.
‘ప్రగతికి మూలం నిరంతర కృషి’ అని తెలియజేసే నినాదాలు రాయండి.
జవాబు:
మానవుడి అభ్యుదయం – మనిషి చేతిలోనే ఉంది.
నిరంతర పరిశోధనయే – నిజ కల్యాణానికి పట్టాభిషేకం
శాస్త్ర ప్రయోగశాలలే – మానవుడి విజయసోపాన మందిరాలు
గోళ్ళు కొరుకుతూ కూర్చోకు – నీ అభివృద్ధికి నిరంతరం పాటుపడు
బద్ధకం, మాంద్యం – మనిషి అభివృద్ధికి వైరుధ్యం
ఈనాటి నీ కృషియే – రేపటి నీ విజయానికి సోపానం
కృషితో నాస్తి దుర్భిక్షం – కృషియే నీ భావి సౌభాగ్యం
బద్దకుడు, సోమరి – దేశ ప్రగతికి విరోధి
కృషి చేస్తే మనుషులు – ఋషులు అవుతారు.
కష్టపడి పనిచేస్తే – కడుపునిండా కూడు లభిస్తుంది.
ఆనాటి మానవుని కృషే – నేటి నీ వైజ్ఞానిక సౌఖ్యం
ఒళ్ళు వంచి పనిచేద్దాం – హాయిగా కులుకుతూ బ్రతికేద్దాం

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 1 Mark Bits

1. సమాజంలోని రుగ్మతలు తొలగినపుడే దేశం బాగుపడుతుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (June 2017)
A) నీతి, ధర్మం
B) కల్మషం, విరోధం
C) జబ్బు, రోగం
D) ఆదాయం, లాభం
జవాబు:
C) జబ్బు, రోగం

2. శ్లేషాలంకారానికి ఉదాహరణ గుర్తించండి. (June 2018)
A) మా అన్న చేతివంట నలభీమపాకం.
B) ఆమె పలుకులు తేనె పలుకులు.
C) రాజు కువలయానందకరుడు.
D) సంసార సాగరమును ఈదుట కష్టము.
జవాబు:
C) రాజు కువలయానందకరుడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

3. సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దగలవు. (వ్యతిరేక వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) సినిమాలు జీవితాన్ని తీర్చబోవు.
B) సినిమాలు జీవితాన్ని తీర్చవు.
C) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దలేవు.
D) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దుతాయి.
జవాబు:
C) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దలేవు.

4. ఈ సంవత్సరం వర్షాలు కురుస్తాయో, కురవవో – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2018)
A) సందేహార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) నిశ్చయార్థకం
D) నిషేధార్థకం
జవాబు:
C) నిశ్చయార్థకం

5. మంత్రాలకు చింతకాయలు రాలడం : “కష్టపడకుండా ఫలితం రాదు” అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. (March 2017)

Leave a Comment