Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material పద్య భాగం 2nd Poem శాంతి కాంక్ష Textbook Questions and Answers, Summary.
AP Inter 2nd Year Telugu Study Material 2nd Poem శాంతి కాంక్ష
ప్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భట్టు రాయబారానికి వచ్చిన కారణాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : కవి సార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ క్రీ.శ. 12వ శతాబ్దంలో జరిగిన ఒక చారిత్రక గాథ. ‘పల్నాటి వీరచరిత్ర’ నుంచి గ్రహించిన ప్రస్తుత పాఠ్యభాగం ‘శాంతి కాంక్ష’లో మలిదేవరాజు తరపున నలగామరాజు కొలువుకు భట్టు రాయబారిగా వెళ్ళి సంధికోసం చేసిన చివరి ప్రయత్నం వర్ణించబడ్డది.
అనుగురాజు : అనుగురాజు గురజాలను రాజధానిగా చేసుకొని పల్నాటి రాజ్యాన్ని పాలించేవాడు. అతనికి మైలమాదేవి, విద్యలదేవి, భూరమాదేవి అని ముగ్గురు భార్యలు. అనుగురాజు వల్ల మైలమాదేవికి నలగాముడు, విద్యలదేవికి పెదమలిదేవుడు, పిన మలిదేవుడు, బాల మలిదేవుడు అనే ముగ్గురు, భూరమాదేవికి కామరాజు, నరసింగరాజు, ఘట్టిరాజు, పెరుమాళ్ళరాజు అనే నలుగురు కుమారులు జన్మించారు. ఈ ఎన మండుగురిలో నలగామరాజు పెద్దవాడు. బ్రహ్మదేవుడు : అనుగురాజు మంత్రియైన దొడ్డనాయని కుమారుడే బ్రహ్మనాయుడు. అనుగురాజు పెద్దవాడైన నలగామునికి పట్టాభిషేకం చేశాడు. ఎనిమిది మంది అన్న దమ్ములూ ఐకమత్యంతో కలిసిమెలసి ఉండేటట్లు చూసే బాధ్యతను అనుగురాజు బ్రహ్మనాయనికి అప్పజెప్పాడు.
నలగామరాజు, మలిదేవరాజు : అనుగురాజు చేరదీసిన నాగమ్మ అనే స్త్రీ రాజ్య విషయాలలో జోక్యం చేసుకుంటూ నాయకురాలుగా ఎదిగింది. తనను లెక్కచేయని బ్రహ్మనాయుడిమీద ఆమె పగ పెంచుకుంది. నలగామునికి ప్రధానిగా బ్రహ్మనాయుడి వైభవాన్ని ఆమె సహించలేకపోయింది. నలగామునికి లేనిపోనివి నూరిపోసింది. నాగమ్మ చెప్పుడు మాటలు నమ్మి నలగామరాజు తమ్ములైన మలిదేవాదులను చెరలో బంధించాడు. కుటుంబ కలహాలను నివారించటానికి మధ్యవర్తిత్వం చేసి రాజ్యాన్ని రెండుగా విభజించాడు. నలగాముని భాగానికి గురజాల రాజధాని, మలిదేవుని భాగానికి మాచర్ల రాజధాని.
నాగమ్మ : నలగామునికి నాగమ్మ మంత్రి, మలిదేవునికి బ్రహ్మనాయుడు మంత్రి. బ్రహ్మనాయుడికీ నాగమ్మకూ మధ్య పుట్టిన ఈర్ష్య అసూయలే పల్నాటి మత ద్వేషానికీ, యుద్ధానికి దారితీశాయి. బ్రహ్మనాయుడి మంత్రిత్వంలో సిరిసంపదలతో తులతూగే మలిదేవుడి రాజ్యాన్ని చూసి నాగమ్మ ఓర్వలేకపోయింది. ఆమె ప్రేరణతోనే నలగామరాజు మలిదేవాదులను కోడిపందేల కోసం గురజాల పిలిపించాడు.
కోడిపందెం : బ్రహ్మనాయుడికీ, నాగమ్మకూ మధ్య జరిగిన కోడిపందెంలో బ్రహ్మనాయుడి కోడి ఓడిపోయింది. పందెంలో ఓడిపోయినవారు ఐదు సంవత్సరాలు వనవాసం చేయాలి. ఒప్పందం ప్రకారం మలిదేవాదులు వనవాసానికి వెళ్ళారు.
అలరాజు రాయబారం : ఇక రెండేళ్ళలో వనవాసం పూర్తికావస్తోంది. కనుక మలిదేవాదులు రాజ్యభాగం కోసం అలరాజును నలగామరాజు దగ్గరకు రాయబారిగా పంపారు. రాయబారిగా వెళ్ళిన అలరాజు చంపబడ్డాడు.
భట్టు రాయబారం : అల్లుడైన అలరాజు చంపబడటంతో మలిదేవాదులు అగ్రహోద గ్రులయి యుద్ధానికి సిద్ధమయ్యారు. కార్యమపూడి (కారెంపూడి) యుద్ధభూమికి సైన్యంతో చేరుకున్నారు. సంధికోసం చివరి ప్రయత్నంగా నలగామరాజు దగ్గరకు భట్టును రాయబారిగా పంపించారు.
ముగింపు : ఇట్లా మలిదేవాదుల తరపున రాయబారిగా నలగామరాజు కొలువుకు వచ్చిన భట్టు యుద్ధం ఆపటం కోసం, సంధి కోసం ఎంతో ప్రయత్నించాడు.
ప్రశ్న 2.
‘శాంతి కాంక్ష’ పాఠ్యభాగం సారాంశాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే కావ్యం నుంచి గ్రహించబడింది. ఇందులో మలిదేవరాజు తరపున నలగామరాజు కొలువుకు రాయబారిగా వెళ్ళిన భట్టు పలికిన శాంతి వచనాలను వర్ణించబడ్డాయి. కలిసి ఉంటే కలిగే మేలు, యుద్ధం వల్ల కలిగే కీడులను కవి హృద్యంగా వర్ణించాడు.
నలగామరాజుకు ప్రశంస : భట్టు గుర్రం మీద వచ్చి నలగామరాజు కొలువులో ప్రవేశించాడు. రాజు ఎదుట నిలిచి నమస్కరించాడు. రాజును ఇట్లా ప్రశంసించాడు. ఓ రాజా ! నీవు రాజులలో కెల్లా గొప్పవాడివి. ప్రకాశించే కీర్తి కలవాడివి. రాజవేశ్యలను రంజింపజేయగలవాడివి. శూరులకే శూరుడవు అనే బిరుదు కలవాడివి. ధైర్యంలో మేరు పర్వతాన్ని జయించినవాడివి. శౌర్య పరాక్రమాలలో నిండు చంద్రుడవు. సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడివి. గొప్పగుణాలకు నిలయమైన వాడివి. అభిమాన ధనుడవు. మైలమ్మదేవికి ప్రియమైన కుమారుడవు. అనుగురాజుకు పెద్ద కుమారుడవు. సుందరుడవు. రాజులలో వీరుడవు, వైభవంలో దేవేంద్రుడవు.
యుద్ధానికి సిద్ధం : రాయబారం కోసం మలిదేవరాజు మీ దగ్గరకు పంపించిన అలరాజును అల్లుడని కూడా చూడకుండా చంపివేశారు. దానితో మలిదేవరాజు ఎంతో కోపించాడు. తన తమ్ములు, బంధువులు, వీరులు అయిన నాయకులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఖరదూషణులు మొదలైన రాక్షసులు సంహరించబడిన శ్రీశైల ప్రాంతంలో గొప్పదైన పవిత్రమైన కార్యమపురిలో సైన్యంతో తన పరాక్రమాన్ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నాడు. .
రాజనీతి : ఓ రాజా ! అలరాజుతోపాటే వీరమరణం పొందాలని వీరులైన నాయకులు ఎంతో ఆవేశంతో ఉన్నప్పటికీ రాజనీతిని పాటించిన మలిదేవరాజు నన్ను మీ దగ్గరకు రాయబారిగా పంపించాడు. పగను పెంపొందించే దుష్టులేకానీ అణచివేసే నిపుణులు ఈ భూమిమీద లేరు. కనుక మీ తమ్ముడైన నరసింహరాజును మలిదేవరాజు దగ్గరకు రాయబారిగా పంపించండి. ఇరువురూ ఒక్కటై ఈ పగను నశింపజేయండి. పల్నాడు మొత్తాన్ని ఎదురులేకుండా కలిసిమెలసి ఏలండి. కనుక మలిదేవునితో సఖ్యతకోసం నరసింగరాజును పంపించు అని భట్టు రాజుకు సూచించాడు.
పోరునష్టం : భూమిమీద ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధం మంచిదికాదు. పగలు పెరిగితే దేశం నాశనమైపోతుంది. ఎంతోమంది ప్రజలు మరణిస్తారు. మిగిలినవారు భయంతో పారిపోతారు. ధనాగారం ఖాళీ అవుతుంది. సైన్యానికి కూడా యుద్ధం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. జీతగాళ్ళు ఎదురు తిరుగుతారు. తమ జీతపు బకాయిల కోసం పట్టుబడతారు. రాజు, బంటు అనే తేడాలు ఉండవు. సేవకులు చెప్పిన మాట వినరు.
అదను కనిపెట్టిన శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించజూస్తారు. శత్రువుల కదలికలు కనిపెట్టడం కష్టమౌతుంది. మీలో మీరే కొట్లాడుకుంటే చూసేవారికి చులకన అవుతారు. శత్రువులు మీ రహస్యాలను పసిగడతారు. దుషులు మీ పక్కన చేరి చెప్పుడు మాటలతో పగను ఇంతకింత పెంచి పోషిస్తారు. పగవల్ల ఐకమత్యం నశిస్తుంది. బలం, భాగ్యం రెండూ నశిస్తాయి. కీర్తి, పరాక్రమం కూడా నశిస్తాయి. రాజ్యం సర్వనాశనమౌతుంది. అన్నీ క్షీణించాక దేశం శత్రురాజుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది.
పారతంత్ర్యం : యుద్ధం వల్ల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో పరిపాలన సాగించినవారు ఇతర రాజుల చెరలో బతకవలసి వస్తుంది. శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను గురించి పరమేశ్వరుడు కూడా వర్ణించలేడు. ప్రజలు పంజరంలో బంధించిన పక్షులలాగా బతకాలి. పాములవాడు పట్టుకొని బుట్టలో పెట్టిన పాములా పడి ఉండాలి. గంగిరెద్దుల వాడు ముకుతాడు పొడిచి పొగరు అణచిన మదపుటెద్దులా జీవించాలి. బోనులో ఉంచిన పులులలాగా స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉండాలి.
బానిస బతుకు : మనసు, మాట, శరీరం – అనే మూడింటిలో మొదటిదైన మనసును బంధించటం ఎవరి తరమూ కాదు. శత్రువుల పాలనలో మాట (వాక్కు) శరీరం (కాయం) – రెండూ బంధింపబడతాయి. ఎవరూ బంధించలేని మనసులో పుట్టిన మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. అట్లా చేయలేనపుడు మానవ జన్మకు సార్థకత ఉండదు. ప్రయోజనం లేని జీవనం కన్నా మరణమే మేలు. మంచి పనులు చేయకపోతే క్రిమికీ కాలు, సశుపక్ష్యాదులు మొదలైన జీవుల కడుపులలో లెక్కలేనన్ని సార్లు పుట్టి ఎంతో పుణ్యం వల్ల లేకలేక పొందిన కష్టసాధ్యమైన మానవజన్మ నిందలపాలౌతుంది. కనుక ఓ రాజా ! ఇటువంటి బానిస బతుకు పగవారికి కూడా వద్దు.
పొందులాభం : మల్లెపూలు, తెల్లతామర, చంద్రుడు, తారలు, నురుగు, మంచు, చందనం, రాజహంస మొదలైన వాటి కాంతులను మించే గొప్పకీర్తి సైతం పగవల్ల వేగంగా నశిస్తుంది. లోకంలో అపకీర్తి పెరిగిపోతుంది. రెండు పక్షాలవారూ ఒక్కటైతే అన్ని కార్యాలు సమకూర్చుకోవచ్చు. ప్రజలంతా సుఖంగా ఉంటారు. పంటలు బాగా పండుతాయి. రెండు పక్షాల వారూ కలసిమెలసి సంపదలు పెంచుతూ ఉంటే సేవకులంతా కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటారు. బలం పెరగటం వల్ల శత్రురాజ్యాలపై దండెత్తి అమిత ధనరాశులను సాధించవచ్చు. ఆ ధనంతో ధర్మబద్ధ పాలన సాగించవచ్చు. అప్పుడు మీ కీర్తి లోకంలో శాశ్వతమై నిలుస్తుంది.
ముగింపు : ఓ రాజా ! కలహం వల్ల పూర్వం కౌరవులు నాశనమై పడిన కష్టాల గురించి విన్నాం కదా ! కనుక పగ పెరిగేటట్లు చేయటం భావ్యం కాదు. మీ రెండు పక్షాలవారూ అన్నదమ్ములే కనుక పరిష్కార మార్గం చెప్పాను. నామాట వినండి అంటూ, మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుకు సంధికోసం శాంతివచనాలు వినిపించాడు.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
శ్రీనాథుని గురించి రాయండి.
జవాబు:
15వ శతాబ్దంలో జీవించిన శ్రీనాథుడు కొండవీడును పరిపాలించిన రెడ్డిరాజుల ఆస్థానకవి, విద్యాధికారి. శ్రీనాథుని తల్లి భీమాంబిక, తండ్రి మారయ. ‘కవి సార్వభౌముడు’ గా ప్రసిద్ధుడైన శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో పురాణయుగానికీ ప్రబంధయుగానికీ వారధిగా నిలచిన మహాకవి.
శ్రీనాథుడు సకల శాస్త్రాలలో పండితుడు. కవితా సృష్టిలో బ్రహ్మవరం పొందినవాడు.. నిత్యం పరమేశ్వరుణ్ణి పూజించే పరమభక్తుడు. పిన్న వయసులోనే ‘మరుత్తరాట్చరిత్ర’ అనే కావ్యాన్ని రచించాడు. ఇంకా శ్రీనాథుడు రచించిన శాలివాహన సప్తశతి, శృంగార నైషథం, కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీరచరిత్ర అనే కావ్యాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి.
శ్రీనాథుడు విజయనగర సామ్రాజ్యంలో ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును వాదంలో ఓడించాడు. అతని కంచుఢక్కను పగులగొట్టించాడు. అక్కడి ముత్యాల శాలలో కనకాభిషేక గౌరవం పొందాడు.
ఎంతో వైభవంగా జీవించిన శ్రీనాథుడు చివరి దశలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆదరించే రాజులు లేకపోవటంతో వేరే దారి లేక వ్యవసాయం చేశాడు. కృష్ణాతీరంలోని బొడ్డుపల్లె అనే గ్రామంలో పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయాడు. శిస్తు కూడా చెల్లించలేక అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.
తెలుగుజాతి శౌర్యపరాక్రమాల చరిత్రను అజరామరంగా నిలబెట్టాలనే సంకల్పంతో శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను దేశీయమైన మంజరీ ద్విపద చంధస్సులో రచించాడు. ఈ కావ్యాన్ని మాచర్లలో కొలువై ఉన్న చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు.
ప్రశ్న 2.
భట్టు నలగామ రాజును ఏమని స్తుతించాడు ?
జవాబు:
మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజు కొలువులోకి ప్రవేశించాడు. రాజు ఎదుట వినయంగా నిలబడి నమస్కరించాడు. నలగామరాజును ఇట్లా స్తుతించాడు.
ఓ రాజా! నీవు రాజులందరిలో గొప్పవాడివి. ప్రకాశించే కీర్తి కలవాడివి. రాజ వేశ్యలను రంజింపచేయగలవాడివి. శూరులకే శూరుడవు అనే బిరుదు కలవాడివి. దానగుణంలో గొప్పవాడివి. మేరు పర్వతాన్ని తలదన్నే ధైర్యం కలవాడివి. శౌర్య పరాక్రమాలలో నిండు చంద్రుని వంటివాడివి. సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడివి. గొప్పగుణాలకు నిలయమైనవాడివి. అభిమాన ధనుడవు. మైలమ్మదేవికి ప్రియమైన కుమారుడవు. అనుగురాజుకు పెద్దకుమారుడవు. సుందరుడవు. రాజులలో వీరుడవు. వైభవంలో దేవేంద్రుడవు అంటూ భట్టు నలగామరాజును స్తుతించాడు.
ప్రశ్న 3.
స్వాతంత్ర్యహీనులు ఎలా ఉంటారని భట్టు తెలిపాడు ?
జవాబు:
మలిదేవరాజు తరపున రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో స్వాతంత్ర్యహీనుల దైన్యస్థితిని ఇట్లా వర్ణించాడు.
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో పరిపాలన సాగించినవారు ఇతర రాజుల చెరలో బతక వలసి వస్తుంది. శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను పరమేశ్వరుడు కూడా వర్ణించలేడు. ప్రజలు పంజరంలో బంధించబడ్డ పక్షులలాగా బతకాలి.. పాముల వాడు పట్టుకొని బుట్టలో పెట్టిన పాములా పడి ఉండాలి. గంగిరెద్దులవాడు ముకుతాడు పొడిచి పొగరు అణచిన మదపుటెద్దులా జీవించాలి. బోనులో ఉంచిన పులులలాగా
స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉండాలి అని స్వాతంత్ర్య హీనుల గురించి భట్టు తెలిపాడు.
ప్రశ్న 4.
జన్మఫలం గురించి భట్టు ఏమని చెప్పాడు ?
జవాబు:
మలిదేవరాజు పంపగా రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో జన్మఫలం గురించి ఇట్లా చెప్పాడు.
‘మనసు, మాట, శరీరం – అనే మూడింటిలో మొదటిదైన మనసును బంధించటం ఎవరి తరమూ కాదు. శత్రువుల పాలనలో మాట (వాక్కు), శరీరం (కాయం) – అనే మిగిలిన రెండూ బంధింపబడతాయి. ఎవరూ బంధించలేని మనసులో పుట్టిన మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. అట్లా చేయలేనపుడు మానవ జన్మకు సార్ధకత ఉండదు. ప్రయోజనం లేని జీవనం కన్నా మారణమే మేలు. మంచి పనులు చేయకపోతే క్రిమికీటకాలు, పశుపక్ష్యాదులు మొదలైన జీవుల కడుపులలో లెక్కలేనన్నిసార్లు పుట్టి ఎంతో పుణ్యం వల్ల లేక లేక పొందిన కష్టసాధ్యమైన మానవజన్మ నిందలపాలౌతుంది.” అని జన్మఫలం గురించి పట్టు చెప్పాడు.
ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
‘శాంతి కాంక్ష’ పాఠ్యభాగం రచయిత ఎవరు ?
జవాబు:
‘శాంతి కాంక్ష’ పాఠ్యభాగం రచయిత ‘కవి సార్వభౌమ’ శ్రీనాథుడు.
ప్రశ్న 2.
శ్రీనాథునికి కనకాభిషేకం చేసిందెవరు ?
జవాబు:
శ్రీనాథునికి కనకాభిషేకం చేసినది విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ప్రౌఢ దేవరాయలు.
ప్రశ్న 3.
నలగామరాజు తల్లి పేరేమిటి ?
జవాబు:
నలగామరాజు తల్లి పేరు మైలమ్మదేవి.
ప్రశ్న 4.
రాయబారానికి వచ్చి వధించబడింది ఎవరు ?
జవాబు:
రాయబారానికి వచ్చి వధించబడినది అలరాజు.
ప్రశ్న 5.
ఖరదూషణాదులు హతమైన చోటేది ?
జవాబు:
ఖరదూషణాదులు హతమైన చోటు కార్యమపూడి.
ప్రశ్న 6.
బ్రహ్మనాయుడు ఎవరి మంత్రి ?
జవాబు:
బ్రహ్మనాయుడు మలిదేవాదుల మంత్రి.
ప్రశ్న 7.
నాయకురాలుగా ప్రసిద్ధి పొందింది ఎవరు ?
జవాబు:
నాయకురాలుగా ప్రసిద్ధి పొందింది నాగమ్మ.
ప్రశ్న 8.
అన్ని జన్మలలో దుర్లభమైంది ఏది ?
జవాబు:
అన్ని జన్మలలో దుర్లభమైనది మానవజన్మ.
సందర్భసహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
పోరు మంచిదిగాదు భూమినెక్కడను.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం : ఈ మాటలు యుద్ధం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నలగామరాజుతో భట్టు పలికిన సందర్భంలోనివి.
భావము : ఈ భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధం మంచిది కాదు అని భావం.
వ్యాఖ్య : ఓ రాజా ! అన్నదమ్ములైన మీరిరువురూ కలిసిమెలసి ఉంటే రాజ్యానికి ఎంతో. లాభం. కనుక స్నేహం కోసం నీ తమ్ముడైన మలిదేవరాజు దగ్గరకు నీకు ఉంతో నమ్మకస్తుడైన నరసింగరాజును పంపించు. ఈ భూమి మీద ఎక్కడైనా సరే కలహం ఎప్పటికీ మంచిది కాదు అని రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో అన్నాడు.
ప్రశ్న 2.
చెప్పంగనలవియే శివునకునైన.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు పారతంత్ర్యం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ భట్టు నలగామరాజుతో పలికిన సందర్భంలోనిది.
భావము : శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాలను వివరించడం శివుడి తరం కూడా కాదు అని భావం.
వ్యాఖ్య : ఓ రాజా ! యుద్ధం వల్ల అన్నీ అనర్థాలే.. బలం, ధనం నశిస్తాయి. కీర్తి పరాక్రమాలు నాశనమౌతాయి. రాజ్యం శత్రురాజుల అధీనంలోకి వెడుతుంది. శత్రువుల పాలనలో ప్రజలు పడే కష్టాలను వర్ణించటం శివుడి తరం కూడా కాదు అంటూ కలహం వల్ల కలిగే కష్టాలను గురించి రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుకు వివరించాడు.
ప్రశ్న 3.
సకల కార్యంబుల సమకూర్చవచ్చు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు ఇరుపక్షాల వారు ఒక్కటైతే కలిగే లాభాలను వివరిస్తూ భట్టు నలగామ రాజుతో పలికిన సందర్భంలోనివి.
భావము : మీరిరువురూ ఒక్కటైతే ఏదైనా సాధించవచ్చు అని భావం. వ్యాఖ్య : ‘ఓ రాజా ! యుద్ధం వల్ల కాంతివంతమైన మీ గొప్పకీర్తి నశిస్తుంది. అపకీర్తి పెరిగిపోతుంది. మీ ఇరుపక్షాలవారూ ఒక్కటైతే కష్టసాధ్యమైన కార్యాలైన అవలీలగా సాధించవచ్చు’ అని రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో అన్నాడు.
ప్రశ్న 4.
కౌరవులెల్ల గతిచెడి పడినట్టి కష్టముల్ వినమె.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి సార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపదకావ్యం నుంచి గ్రహించిన ‘శాంతి కాంక్ష’ అనే పాఠ్యభాగంలోనిది.
సందర్భం : ఈ మాటలు కలహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ భట్టు నలగామరాజుతో పలికిన సందర్భంలోనిది.
భావము : పూర్వం యుద్ధం వల్ల కౌరవులంతా నాశనమై పడిన కష్టాలను విన్నాం కదా ! అని భావం.
వ్యాఖ్య : ఓ రాజా ! అన్నదమ్ములైన మీరు ఇరువురూ కలసిమెలసి ఉంటే ఎంతో లాభం. గొప్పకీర్తి సాధించవచ్చు. యుద్ధం వల్ల అంతా నష్టమే జరుగుతుంది. పూర్వం కౌరవులంతా యుద్ధం వల్ల నాశనమై పడిన కష్టాలను విన్నాం కదా ! అని రాయబారిగా వచ్చిన భట్టు నలగామరాజుతో అన్నాడు.
ప్రతిపదార్థ తాత్పర్యాలు
ప్రశ్న 1.
తురగంబుపైనెక్కి దుమికించికొనుచు
వచ్చికొల్వును జేరి వాటిని డిగ్గి
భూమీశునెదుటను బొందుగా నిలిచి
రాజాధిరాజ విరాజితకీర్తి
రాజవేశ్యావిట ప్రాభవప్రకట
గండరగండాంక ఘనదానచతుర
ధైర్యనిర్జిత మేరు ధరణీధరేంద్ర
శౌర్యవిక్రమకళా సంపూర్ణచంద్ర
భాస్కర సమతేజ ప్రొడగుణాఢ్య
మానదుర్యోధన మైలమ్మసుతుడ.
జవాబు:
ప్రతిపదార్థం :
తురగంబుపైన్ = గుర్రం మీద
ఎక్కి = ఎక్కి
దుమికించు కొనుచు = దూకించుకొంటూ
వచ్చి = వచ్చి
కొల్వునున్ + చేరి = సభ దగ్గరకు చేరుకొని
వాటిని డిల్లి = గుర్రం దిగి
భూమీశున్ + ఎదుటను = రాజైన నలగామరాజు ఎదుట
పొందుగా = వినయంగా
నిలిచి = నిలబడి
రాజ + అధిరాజ = రాజులకు అధిరాజువైన వాడా !
విరాజిత కీర్తి = విరజిల్లే కీర్తి కలవాడా !
రాజవేశ్యావిట = రాజవేశ్యలను రంజింపజేయడంలో
ప్రాభవప్రకట = ఉట్టిపడే రాజసం కలవాడా !
గండరగండ + అంక = శూరులకే శూరుడవను బిరుదు గలవాడా !
ఘనదానచతుర = గొప్పదాన గుణము కలవాడా !
ధైర్య = ధైర్యంలో
మేరు ధరణీధరేంద్ర = మేరుపర్వతాన్ని
నిర్జిత = జయించినవాడా !
శౌర్య విక్రమ కళా = శౌర్య పరాక్రమాలలో
సంపూర్ణచంద్ర = నిండు చంద్రుని వంటివాడా !
భాస్కర సమతేజ = సూర్యునితో సమానమైన తేజస్సు
ప్రొడగుణ + ఆఢ్య = గొప్పగుణాలకు నెలవైనవాడా !
మానదుర్యోధన = . అభిమాన ధనుడా !
మైలమ్మసుతుడ = మైలమ్మదేవి పుత్రుడా !
తాత్పర్యం :
మలిదేవరాజు తరపున రాయబారిగా భట్టు నలగామరాజు దగ్గరకు బయలుదేరాడు. భట్టు గుర్రం ఎక్కి దూకిస్తూ నలగామరాజు కొలువు దగ్గరకు వచ్చాడు. గుర్రం దిగాడు. నలగామరాజు ఎదుట వినయంగా నిలబడ్డాడు. రాజును ఇట్లా కీర్తించాడు. నీవు రాజులకే రాజువు, ప్రకాశించే కీర్తి కలవాడవు, రాజవేశ్యలను రంజింపజేసేవాడవు. శూరులకే శూరుడవు అనే బిరుదు కలవాడవు, దానగుణంలో గొప్పవాడివి, ధైర్యంలో మేరుపర్వతాన్ని జయించినవాడవు, శౌర్యపరాక్రమాలలో నిండు చంద్రుని వండివాడవు. సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడవు, గొప్ప గుణాలకు నెలవైనవాడవు, అభిమానధనుడవు, మైలమ్మ సుతుడవు అని తాత్పర్యం.
ప్రశ్న 2.
అనుగుభూపతిపుత్ర అంచితగాత్ర
వీఠకామ నరేంద్ర విభవ దేవేంద్ర
రాయబారమునకు రాజు పంపించ
వచ్చిన అల్లుని వధియించినారు
మనసున క్రోధించి మలిదేవరాజు
తమ్ములుతానును దన బంధుజనులు
వీరనాయకతతి విఖ్యాతి మెరసి
ఖరదూషణాదులు గతమైనచోటు
శ్రీశైల భూమిలో శ్రేష్ఠమైనట్టి
కార్యమపురిభూమి ఘనపుణ్యరాశి
జవాబు:
ప్రతిపదార్థం :
అనుగుభూపతిపుత్ర = అనుగురాజు కుమారా !
అంచిత గాత్ర = సుందర శరీరా !
వీరకామనర + ఇంద్ర = వీరులలో శ్రేష్ఠుడా !
విభవ దేవ + ఇంద్ర = వైభవంలో ఇంద్రుడితో సమానమైనవాడా !
రాయబారమునకు = రాయబారం కోసం
రాజు పంపించ = మలిదేవరాజు పంపించగా
వచ్చిన = నీ దగ్గరకు వచ్చిన
అల్లుని = అల్లుడైన అలరాజును
వధియించినారు = చంపివేశారు
మనసున క్రోధించి = దానికి ప్రతీకారంగా
మలిదేవరాజు = మలిదేవరాజు
తమ్ములు = తముళ్ళుగా
తానును = తానూ
తన = తనయొక్క
బంధుజనులు = బంధువులూ
వీర నాయకతతి = వీరులైన నాయకుల సమూహం
విఖ్యాతి మెరసి = ప్రసిద్ది చెంది
ఖరదూషణ + ఆదులు = ఖరుడు, దూషణుడు మొదలైన రాక్షసులు
గతమైన చోటు = చంపబడ్డ చోటు
శ్రీ శైల భూమిలో = శ్రీ శైల ప్రాంతంలో
శ్రేష్ఠమైనట్టి = గొప్పదైనటువంటి
కార్యమపురిభూమి = కార్యమపూడి అనే ప్రాంతం
ఘనపుణ్యరాశి = గొప్ప పుణ్యభూమి
తాత్పర్యం :
అనుగురాజు కుమారా ! సుందరమైన శరీరం కలవాడా ! వీరులలో శ్రేష్ఠుడా ! వైభవంలో దేవేంద్రునితో సమానుడా ! రాయబారం కోసం మలిదేవరాజు పంపించగా నీ దగ్గరకు వచ్చిన అల్లుడైన అలరాజును సంహరించారు. అందుకు ప్రతీకారంగా మలిదేవరాజు తానూ, తన తమ్ములు, బంధుజనులూ, వీరుల సమూహంతో ప్రసిద్ధమైన సేనతో ఖరదూషణాది రాక్షసులు చంపబడ్డచోటు శ్రీశైల భూమిలో గొప్పదైన కార్యమపూడి అనే ప్రాంతం గొప్ప పుణ్యభూమిలో వేచి ఉన్నారు అని తాత్పర్యం.
ప్రశ్న 3.
పటుతర విక్రమ వైభవంబలర
ధాటిమైనిల్చిరి దండుతో గూడ
అలరాజుతోడనే హతమౌదుమంచు
చలమున కోపంబు సంవృద్ధినొంద
వీరనాయకులును వేగిరపడగ
మలిదేవ భూపతి మన్నించి యిటకు
నన్ను బుత్తెంచెను నరనాథ వినుము
పగవృద్ధిపొందించు భ్రష్టులెకాని
అడగించు నేర్పరు లవనిలో లేరు
నరసింగభూమీశు నమ్మికమీరు
జవాబు:
ప్రతిపదార్థం :
పటుతర = గొప్ప
విక్రమ = పరాక్రమం అనే
వైభవంబు + అలర = వైభవం ఒప్పగా
దండుతోన్ + కూడ = సైన్యంతో కూడా
ధాటిమై = యుద్ధం కోసం
నిల్చిరి = వేచి ఉన్నారు
అలరాజుతోడనే = అలరాజుతోనే
హతమౌదుము + అంచు = మేం మరణిస్తాం అంటూ
చలమున = ఆవేశంతో
కోపంబు = కోపం
సంవృద్ధిన్ + ఒంద = కట్టలు తెంచుకోగా
వీర నాయకులును = వీరులైన నాయకులంతా
వేగిరపడగ = తొందరపడుతూ ఉండగా
మలిదేవభూపతి = మలిదేవరాజు
మన్నించి = రాజనీతిని పాటించి
ఇటకు = ఇక్కడికి
నన్ను = నన్ను
బుత్తెంచెను = పంపించాడు
నరనాథ = ఓ రాజా !
వినుము = విను
పగ = పగను
వృద్దిన్ + పొందించు = పెంపొందింపజేసే
భ్రష్టులు + ఎ కాని = దుషులే కానీ
అడగించు నేర్పరులు = పగను అణచివేసే నిపుణులు
అవనిలో లేరు = ఈ భూమిమీద లేరు
నరసింగ, భూమి + ఈశున్ = నరసింహ రాజును
నమ్మిక = నమ్మకంతో
మీరు = మీరు
తాత్పర్యం :
గొప్ప పరాక్రమం అనే వైభవం ఒప్పగా మలిదేవాదులు సైన్యంతో పహా. యుద్ధం. కోసం వేచి ఉన్నారు. అలరాజుతోనే మేం మరణిస్తామని కట్టలు తెంచుకున్న కోపంతో వీరులైన నాయకులంతా యుద్ధం కోసం త్వరపడుతున్నారు. అయినప్పటికీ మలిదేవరాజు రాజనీతిని పాటించి నన్ను ఇక్కడికి రాయబారిగా పంపించాడు. ఓ రాజా ! విను. ఈ భూమి మీద పగను పెంపొందింపజేసే దుష్టులేకానీ అణచివేసే నేర్పురులు లేరు. కనుక మీరు నరసింగరాజును మలిదేవరాజు దగ్గరకు రాయబారిగా పంపించు అని తాత్పర్యం.
ప్రశ్న 4.
తమ్ముడామలిదేవధరణీశు కడకు
పంపుడి యేకమై పగలను నణచి
పలనాడు మొదలైన బహుభూములెల్ల
ఎదురెవ్వరునులేక యేలుడి సుఖిత
శృంగారయుతు నరసింగుభూమీశు
పంపుము మలిదేవపతి గలయంగ
పోరుమంచిదిగాదు భూమి నెక్కడను
పాడౌను దేశంబు పగమించెనేని
ప్రజలెల్ల నశియించి పారిపోవుదురు
బండారమునకును పైకంబులేదు
జవాబు:
ప్రతిపదార్థం :
తమ్ముడు = తమ్ముడైన
ఆ మలిదేవ ధరణి + ఈశు కడకు = ఆ మలిదేవరాజు దగ్గరకు
పంపుడి = నరసింహరాజును రాయబారిగా పంపించు
ఏకము + ఐ = మీరిరువురూ ఒక్కటై
పగలనున్ + అణచి = పగలను అణచివేసి
పలనాడు మొదలైన = పలనాడు మొదలైన
బహుభూములు + ఎల్ల . = రాజ్యాలను అన్నింటినీ
ఎదురు + ఎవ్వరును లేక = ఎదురు ఎవరూ లేకుండా
సుఖిత = హాయిగా
ఏలుడి = పరిపాలించండి
శృంగారయుతు = సుందరుడైన
నరసింగు భూమీశు = నరసింహుడు అనే రాజును
మలిదేవపతి = మలిదేవరాజును
కలియంగ = కలుసుకోవటానికి
పంపుము = పంపించు
భూమిన్ + ఎక్కడను = భూమి మీద ఎక్కడైనా సరే
పోరు = యుద్ధం
మంచిది + కాదు = మంచిది కాదు
పగ = పగ
మించెన్ + ఏని = పెరిగిపోతే
దేశంబు = దేశం
పాడు + ఔను = నాశనమైపోతుంది
ప్రజలు + ఎల్ల = ప్రజలంతా
నశియించి = నాశనమై
పారిపోవుదురు = చెల్లాచెదరైపోతారు
బండారమునకును = ధనాగారానికి
పైకంబు లేదు = ధనం రాదు.
తాత్పర్యం :
ఓ రాజా ! నీ తమ్ముడైన మలిదేవరాజు దగ్గరకు ఆ నరసింహరాజును రాయబారిగా పంపించు. మీ రెండు పక్షాలూ ఒకటై పగలను అణచివేసి పలనాడు మొదలైన రాజ్యాలను . అన్నింటినీ ఎదురు లేకుండా హాయిగా పరిపాలించండి. కనుక సుందరుడైన నరసింహ రాజును మలిదేవపతిని కలుసుకోవడానికి రాయబారిగా పంపించు. ఈ భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధం మంచిది కాదు. పగ పెరిగిపోతే దేశం నాశనమైపోతుంది. ప్రజలంతా నశిస్తారు. మిగిలినవారు పారిపోతారు. ధనాగారం ఖాళీ అవుతుంది అని తాత్పర్యం.
ప్రశ్న 5.
రాణువ అందుచే రహి చెడియుండు
చేజీతగాండ్లెల్ల జెలిగి కోపించి
యీగల జీతంబు లిమ్మందురపుడు
పతిబంటుమేరలు పరిహృతమగును
పంపినపని చేయ పాలుమాలుదురు
తెలిసిన శాత్రవుల్ ధీరతతోడ
భూమిని గొనుటకు బుద్ధిపెట్టుదురు.
పగవారి వార్తలు పరికింపలేరు
మేకొని మీలోనమీరు పోరాడ
చూచెడువారికి జులకనయోను
జవాబు:
ప్రతిపదార్థం :
అందుచే = అందువల్ల
రాణువ = సైన్యం
రహిచెడి + ఉండు = ఆసక్తి కోల్పోతుంది
చేజీతగాండ్లు + ఎల్ల = జీతగాళ్ళంతా
చెలిగి కోపించి = మిక్కిలి కోపించి
అపుడు = అప్పటికప్పుడే
ఈగల = ఇవ్వవలసిన
జీతంబు = జీతం
ఇమ్ము + అందురు = ఇవ్వమంటారు
పతి బంటుమేరలు = రాజు, బంటు అనే తేడాలు
పరిహృతము + అగును = చెరిగిపోతాయి
పంపినపని చేయ = చెప్పిన పని చేయటంలో
పాలుమాలుదురు = అలసత్వం వహిస్తారు
తెలిసిన శాత్రవుల్ = ఇది తెలిసిన శత్రువులు
ధీరతతోడ = ధైర్యంగా
భూమిని + కొనుటకు = రాజ్యాన్ని ఆక్రమించటానికి
బుద్ధి పెట్టుదురు = ఆలోచిస్తారు
పగవారి వార్తలు = శత్రువుల కదలికలను
పరికింపలేరు = గమనించలేరు
మేకొని = కావాలని
మీలోన మీరు = మీలో మీరే
పోరాడ = పోట్లాడుకోగా
చూచెడువారికి = చూసేవారికి
చులకన + ఔను = చులకనైపోతారు
తాత్పర్యం :
దానితో సైన్యం ఆసక్తి కోల్పోతుంది. జీతగాళ్ళంతా ఎదురుతిరుగుతారు. తమకు రావలసిన జీతభత్యాలు అప్పటికప్పుడే ఇవ్వమని పట్టుబడతారు. రాజు, బంటు అనే తేడాలు చెరిగిపోతాయి. సేవకులు చెప్పిన పని చేయరు. పరిస్థితి గమనించిన శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించటానికి ఆలోచనలు చేస్తారు. పాలన అదుపుతప్పినప్పుడు శత్రువుల కదలికలను గమనించలేరు. కావాలని మీలో మీరే పోట్లాడుకుంటే చూసేవారికి చులకనైపోతారు అని తాత్పర్యం.
ప్రశ్న 6.
కోరిశాత్రవులు మీగుట్టెణుంగుదురు
పలువలు మిముజేరి పగజావనీక
చెప్పుచునుందురు చెనటివాక్యముల
ఐకమత్యముచెడు నద్దానితోడ
చెడును బలంబును చెడును భాగ్యంబు
చెడును యశంబును చెడును శౌర్యంబు
చెడును రాజ్యంబులు చెడ్డ పిమ్మటను
దేశంబు పరనృపాధీనమౌ సుమ్ము
పారతంత్ర్యంబు మీపై బడగలదు
పరతంత్ర జనముల పాలికష్టములు
చెప్పంగనలవియే శివునకునైన
జవాబు:
ప్రతిపదార్థం :
కోరి = కాంక్షతో
శాత్రవులు = శత్రువులు.
మీ = మీ రాజ్యం యొక్క
గుట్టు + ఎఱుంగుదురు = రహస్యం తెలుసుకుంటారు
పలువలు = దుష్టులు కొందరు
మిమున్ + చేరి = మీ పక్కన చేరి
పగన్ + చావనీక = పగ నశించకుండా ఉండేటట్టు
చెనటి వాక్యముల = లేనిపోని మాటలు
చెప్పుచున్ + ఉందురు = చెబుతూ ఉంటారు
ఆ + దానితోడ = అటువంటి మాటలతో
ఐకమత్యము చెడు = ఐకమత్యం నశిస్తుంది
బలంబును = బలం కూడా
చెడును = తగ్గిపోతుంది
భాగ్యంబు = సంపద
చెడును = నశిస్తుంది
యశంబును = కీర్తికూడా
చెడును = నశిస్తుంది
శౌర్యంబు = పరాక్రమం
చెడును = నశిస్తుంది
రాజ్యంబులు = రాజ్య మే
చెడును = నాశనమౌతుంది
చెడ్డ పిమ్మటను = రాజ్యం నాశనమైన తర్వాత
దేశంబు = దేశమంతా
పరనృప + అధీనము + ఔ,సుమ్ము = శత్రురాజుల, అధీనమౌతుంది సుమా!
పారతంత్ర్యంబు = శత్రువుల పాలన
మీపై = మీపాలి
పడగలదు = పడుతుంది
పరతంత్రజనముల = శత్రుపాలనలోని ప్రజలు
పాలి కష్టములు = పడేపాట్లు
శివునకున్ + ఐన = శివుడికైనా
చెప్పంగన్ + అలవియే = చెప్పటానికి సాధ్యమా !
తాత్పర్యం :
ఓ రాజా ! రాజ్యకాంక్షతో శత్రువులు మీ రాజ్య రహస్యాలను తెలుసుకుంటారు. దుష్టులు కొందరు మీ పక్కన చేరి పగనశించకుండా ఉండేటట్టు లేనిపోని మాటలు చెబుతూ ఉంటారు. అటువంటి మాటలతో ఐకమత్యం నశిస్తుంది.. బలం కూడా తగ్గిపోతుంది. సంపద నశిస్తుంది. కీర్తి కూడా నశిస్తుంది. పరాక్రమం నశిస్తుంది. చివరికి రాజ్యమే నాశనం అవుతుంది. రాజ్యం నాశనమైన తర్వాత దేశమంతా శత్రురాజుల అధీనమౌతుంది సుమా ! శత్రువుల పాలనలో మీరు బతకవలసి వస్తుంది. శత్రుపాలనలో ప్రజలు పడే పాట్లు గురించి చెప్పడం పరమేశ్వరుని తరం కూడా కాదు అని తాత్పర్యం.
ప్రశ్న 7.
పంజరంబుననున్న పక్షులరీతి
బంధించి బుట్టలో పాములవాడు
వదలక .పెట్టిన ఫణుల చందమున
గంగిరెద్దులవాఁడు .కావరమణచి
ముకుదాడు పొడిచిన పోతెద్దులట్లు
బోనులోనుంచిన పులుల విధంబు
స్వాతంత్ర్యహీనతఁ బడియుండవలయు
పరికింపఁగా మనోవాక్కాయములను
ప్రథమమ్ముపట్టం గారానిదిగాన
జవాబు:
ప్రతిపదార్థం :
పంజరంబునన్ + ఉన్న = పంజరంలో ఉన్న
పక్షుల రీతి = పక్షుల లాగా
పాముల వాడు = పాముల వాడు
వదలక = గట్టిగా
బంధించి = బంధించి
బుట్టలో పెట్టిన = బుట్టలో పెట్టిన
ఫణుల చందమున = పాములలాగా
గంగిరెద్దుల వాఁడు = గంగిరెద్దులవాడు
కావరము + అణచి = పొగరు అణచి
ముకుదాడు పొడిచిన = ముకుదాడు పొడిచిన
పోతు + ఎద్దులు + అట్లు పెందెపు ఎద్దులలాగా
బోనులోన్ + ఉంచిన = బోనులో ఉంచిన
పులుల విధంబు = పులుల లాగా
స్వాతంత్ర్యహీనతన్ = ‘స్వేచ్చ లేకుండా
పడి + ఉండవలయు = పడి ఉండాలి
పరికింపగాన్ = గమనించగా
మనో వాక్ + కాయములను = మనసు, వాక్కు (మాట) కాయము (శరీరము) లలో
ప్రథమమ్ము = మొదటిదైన మనస్సు
పట్టన్ + కా రానిదిగాన = అదుపుచేయలేనిది గనుక
తాత్పర్యం :
పంజరంలోని పక్షులలాగా, పాములవాడు గట్టిగా బంధించి బుట్టలో పెట్టిన పాముల లాగా, గంగిరెద్దులవాడు పొగరు అణచి ముకుతాడు పొడిచిన పందెపు ఎద్దుల లాగా, బోనులో ఉంచిన పులుల లాగా స్వేచ్చ లేకుండా పడి ఉండాలి. గమనించి చూస్తే మనస్సు, వాక్కు (మాట), కాయం (శరీరం) అనే మూడింటిలో మొదటిదైన మనసు మాత్రం అదుపుచేయలేనిది అని తాత్పర్యం.
ప్రశ్న 8.
వాక్కాయములు రెండు బంధింపఁబడును
మనసులోఁబుట్టిన మంచి తలంపు
లాచరణమునందు అలవికాకున్న
జన్మఫలంబేమి చచ్చుటే మేలు
అవ్యక్తకీట తిర్యగనేక హీన
యోనులలో నెన్నియోమార్లు పుట్టి
పడయక పడయక పడసిన యట్టి
దుర్లభ నరజన్మ దూషితంబగును
పార్థివా యిటువంటి పారతంత్ర్యంబు
కటకటా పగవారికైననువలదు
జవాబు:
ప్రతిపదార్థం :
వాక్ + కాయములు = మాట, శరీరం అనే
రెండు = రెండూ
బంధింపన్ + పడును = బంధింపబడతాయి
మనసులోస్ + పుట్టిన = మనసులో పుట్టిన
మంచి తలంపులు = మంచి ఆలోచనలు
ఆచరణము నందు = ఆచరణలో
అలవికాక + ఉన్న = పెట్టలేకపోతే
జన్మఫలంబు + ఏమి = పుట్టి ప్రయోజనం ఏముంటుంది ?
చచ్చుట + ఏ = చచ్చిపోవటమే
మేలు = మేలు
అవ్యక్త = చెప్పరాని
కీట తిర్యక్ = క్రిమికీటకాలు, పశుపక్ష్యాదులు మొదలైన
అనేక = అనేక
హీన యోనులలో = అల్పజీవుల కడుపులలో
ఎన్నియో మార్లు = ఎన్నోసార్లు
పుట్టి = పుట్టి
పడయక పడయక = లేక లేక
పడసిన + అట్టి = పొందినట్టి
దుర్లభ = కష్టసాధ్య మైన
నరజన్మ = మానవజన్మ
దూషితంబు + అగును = నిందలపాలు అవుతుంది
పార్థివా ! = ఓ రాజా !
ఇటువంటి = ఇటువంటి
పారతంత్ర్యంబు = బానిస బతుకు
కటకటా = అయ్యా !
పగవారికి + ఐనను = పగవారికి కూడా
వలదు = వద్దు
తాత్పర్యం :
ఓ రాజా ! మనసు, మాట, శరీరం – అనే మూడింటిలో మనసు తప్ప తక్కిన రెండూ బంధింపబడతాయి. కనుక మనసులో పుట్టిన మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టలేకపోతే పుట్టుకకు ప్రయోజనమే ఉండదు. చచ్చిపోవటమే మేలు చెప్పరాని క్రిమికీటకాలు, పశుపక్ష్యాదులు మొదలైన అనేక అల్పజీవుల కడుపులలో ఎన్నోసార్లు పుట్టి లేకలేక పొందినట్టి కష్ట సాధ్యమైన మానవజన్మ నిందలపాలు అవుతుంది. ఇటువంటి బానిస బతుకు అయ్యో ! పగవారికి కూడా వద్దు అని తాత్పర్యం.
ప్రశ్న 9.
కుండబృందసితాబ్ద కుముదాప్తతార
హారడిండీర నీహార పటీర
ఘన మరాళంబుల కాంతినిమించు
సల్మీర్తివేగమే సరవినశించు
అపకీర్తి జగముల నధికమైయుండు
ఉభయవాదులు మీరలొక్క లైయున్న
సకల కార్యంబుల సమకూర్పవచ్చు
ప్రజలకు సుఖమౌను పంటలు పండు
ధనము సంపాదింప దగియుందునపుడు
సంపూర్ణకాములై సకల సేవకులు
జవాబు:
ప్రతిపదార్థం :
కుంద బృంద = మల్లెపూల
సిత + అబ్ద = తెల్ల తామరల
కుముద + ఆప్త = కలువల బంధువైన చంద్రుని
తారహార = తారాసమూహాల
డిండీర = నురుగు
నీహార = మంచు
పటీర = గంధం
ఘన = మేఘం
మరాళంబుల = హంసల యొక్క
కాంతిని మించు = కాంతిని మించే
సత్ + కీర్తి = గొప్పకీర్తి
వేగము + ఏ = వెంటనే
సరవి = మొత్తం
నశించు = నశిస్తుంది
అపకీర్తి = చెడ్డపేరు
జగముల = లోకాలలో
అధికమై + ఉండు = పెరుగుతుంది
ఉభయవాదులు = ఇరుపక్షాలవారైన
మీరలు = మీరు
ఒక్కటి + ఐ + ఉన్న = ఒకటిగా ఉంటే
సకల కార్యంబుల = అన్ని పనులనూ
దే సమకూర్పవచ్చు = నెరవేర్చవచ్చు
ప్రజలకు = ప్రజలందరికీ
సుఖము + ఔను = సుఖం కలుగుతుంది
పంటలు పండు = పంటలు పండుతాయి
ధనము = ధనం
సంపాదింపన్+తగి+ఉండునపుడు = సంపాదించగలిగినపుడు
సకల సేవకులు = సేవకులు అందరూ
సంపూర్ణకాములు + ఐ = పూర్తిగా సంతృప్తిగా ఉండి
తాత్పర్యం :
ఓ రాజా ! మల్లెపూవులు, తెల్లతామరలు చంద్రుడు, తారలు, నురుగు, మంచు, గంధం, మేఘం, హంస మొదలైనవాటి కాంతినిమించే గొప్పకీర్తి వెంటనే పూర్తిగా నశిస్తుంది. లోకంలో చెడ్డపేరు పెరుగుతుంది. రెండు పక్షాలవారైన మీరు ఒకటిగా ఉంటే అన్ని పనులనూ నెరవేర్చవచ్చు. ప్రజలందరికీ సుఖం కలుగుతుంది. పంటలు పండుతాయి. ధనం సంపాదించగలిగినపుడు సేవకులు అందరూ పూర్తిగా సంతృప్తిగా ఉంటారు అని తాత్పర్యం.
ప్రశ్న 10.
కాపాడుదురుమిమ్ము కనిపెట్టియుండి
పరరాజులను గెల్వ పైకొనిపోయి
అమితమ్ముగాగ ధనాదులనెల్ల
కొనవచ్చు ధర్మముల్ కూర్పంగవచ్చు
సత్మీర్తి జగముల సాంద్రమైనిల్చు
కలహించి వెనుకటి కౌరవులెల్ల
గతిచెడి పడినట్టి కష్టముల్ వినమె
పగ పెరిగించుట భావ్యంబుగాదు
ఉభయవాదులు మీరలొక్కటి కనుక
నయమొప్ప జెప్పితి నా మాట వినుడి
జవాబు:
ప్రతిపదార్థం :
మిమ్ము = మిమ్మల్ని
కనిపెట్టి + ఉండి = కనిపెట్టుకొని యుండి
కాపాడుదురు = కాపాడతారు
పరరాజులను = శత్రురాజులను
గెల్వన్ = జయించటానికి
పైకొనిపోయి = దండెత్తి వెళ్ళి
అమితమ్ముగాక = అమితంగా
ధన + ఆదులన్ + ఎల్ల = సంపదలెన్నింటినో
కొనవచ్చు. = పొందవచ్చు
ధర్మముల్ = ధర్మపాలనను
కూర్పంగవచ్చు = సాగించవచ్చు
సత్కీర్తి = గొప్పకీర్తి
జగముల = లోకాలలో
సాంద్రమై నిల్చు = శాశ్వతంగా నిల్చిపోతుంది
కలహించి = యుద్ధం చేసి
వెనుకటి = పూర్వం
కౌరవులు + ఎల్ల = కౌరవులంతా
గతిచెడి = నాశనమై
పడినట్టి కష్టముల్ = పడిన కష్టాలు
వినము + లు = వినలేదా
పగ = పగను
పెరిగించుట = పెరిగేటట్లు చేయటం
భావ్యంబు + కాదు = మంచిది కాదు
ఉభయవాదులు= ఇరుపక్షాలవారైన
మీరలు = మీరు
ఒక్కటి కనుక = ఒక్కటే కాబట్టి
నయము + ఒప్పన్ = పరిష్కారంగా
చెప్పితి = చెప్పాను
నా మాట = నా మాట
వినుడి = వినండి
తాత్పర్యం :
ఓ రాజా ! ధనం సంపాదించగలిగినపుడు సేవకులు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండి కాపాడుతారు. శత్రురాజ్యాలపై దండెత్తి వెళ్ళి జయించి ఎన్నో సంపదలను పొందవచ్చు. ధర్మపాలనను సాగించవచ్చు. అప్పుడు గొప్ప కీర్తి లోకాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. పూర్వం యుద్ధం చేసి కౌరవులు నాశనమై పడిన కష్టాలు విన్నాం కదా ! పగను పెరిగేటట్లు చేయటం మంచిది కాదు. ఇరుపక్షాలవారైన మీరు ఒక్కటే కాబట్టి పరిష్కారంగా చెప్పాను. నా మాట వినండి అని తాత్పర్యం.
కవి పరిచయం
15వ శతాబ్దంలో జీవించిన శ్రీనాథుడు కొండవీడును పరిపాలించిన రెడ్డిరాజుల అస్థానకవి, విద్యాధికారి. శ్రీనాథుని తల్లి భీమాంబిక, తండ్రి మారయ. కవి సార్వ భౌముడిగా కీర్తి పొందిన శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో పురాణ యుగానికీ’ ప్రబంధ యుగానికీ వారధిగా నిలచిన మహాకవి.
శ్రీనాథుడు సకల విద్యాసనాథుడు. బ్రహ్మదత్త వరప్రసాదుడు. నిరంతర ఈశ్వరార్చన కళాశీలుడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడే ‘మరుత్తరాట్చరిత్ర’ ను రచించానని తానే చెప్పుకున్నాడు శ్రీనాథుడు. ఇంకా శ్రీనాథుడు రచించిన శాలివాహన సప్తశతి, శృంగార నైషధము, కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీరచరిత్ర అనే కావ్యాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి.
శ్రీనాథుడు విజయనగర సామ్రాజ్యంలో ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును వాదంలో ఓడించి అతని కంచుఢక్కను పగులగొట్టించాడు. అక్కడి ముత్యాల శాలలో కనకాభిషేకం పొందాడు.
ఎంతో వైభవంగా జీవించిన శ్రీనాథుడు చివరిదశలో ఎన్నో కష్టాలు పడ్డాడు. . ఆదరించే రాజులు లేకపోవటం వలన వ్యవసాయం చేశాడు. కృష్ణాతీరంలోని బొడ్డుపల్లె అనే గ్రామంలో పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. కానీ ప్రకృతి వైపరీత్యాలవల్ల పంట నష్టపోయాడు. శిస్తు కూడా చెల్లించలేక అనేక బాధలు అనుభవించినట్లు తెలుస్తుంది.
తెలుగుజాతి శౌర్యపరాక్రమాల చరిత్రను అజరామరంగా నిలబెట్టాలనే సంకల్పంతో శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను రచించాడు.
ఈ కావ్యాన్ని మాచెర్లలో కొలువై ఉన్న చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు.
‘శాంతి కాంక్ష’ అనే ప్రస్తుత పాఠ్యభాగం శ్రీనాథుడు రచించిన ‘పల్నాటి వీరచరిత్ర’ అనే ద్విపద కావ్యం నుంచి గ్రహించబడింది.
పాఠ్యభాగ సందర్భం
పల్నాటిసీమలో క్రీ.శ. 12వ శతాబ్దంలో జరిగిన చారిత్రకగాథే పల్నాటి వీరచరిత్ర. మహాభారత కథతో సామ్యం ఉండటం వల్ల పల్నాటి వీరచరిత్రను ఆంధ్రభారతం అనీ, పల్నాటి వీరభారతం అనీ అభివర్ణిస్తారు.
అనుగురాజు గురజాలను రాజధానిగా చేసుకొని పల్నాటి రాజ్యాన్ని పాలించేవాడు. ఆ రాజుకు మైలమాదేవి, విద్యలదేవి, భూరమాదేవి అని ముగ్గురు భార్యలు. అనుగు రాజు వల్ల మైలమాదేవికి నలగాముడు, విద్యలదేవికి పెదమలిదేవుడు, పినమలిదేవుడు, బాలమలిదేవుడు అనే ముగ్గురు కుమారులు, భూరమాదేవికి కామరాజు, నరసింగరాజు, ఘట్టిరాజు పెరుమాళ్ళురాజు అనే నలుగురు కుమారులు జన్మించారు. ఈ ఎనిమిది మంది కొడుకులలో నలగామరాజు పెద్దవాడు.
అనుగురాజు మంత్రియైన దొడ్డనాయని కుమారుడు బ్రహ్మనాయుడు. అనుగురాజు మరణిస్తూ పెద్దవాడైన నలగామునికి పట్టాభిషేకం చేశాడు. ఎనిమిదిమండ్ అన్న దమ్ములూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండేటట్లు చూసే బాధ్యతను రాజు బ్రహ్మ నాయునికి అప్పజెప్పాడు.
అనుగురాజు చేరదీసిన నాగమ్మ అనే స్త్రీ రాజ్య విషయాలలో జోక్యం చేసుకుంటూ ‘ నాయకురాలుగా ఎదిగింది. తనను లెక్కచేయని బ్రహ్మనాయుడిపై ఆమె పగపెంచుకుంది. నలగామునికి ప్రధానిగా బ్రహ్మనాయుని ప్రతిష్ఠను ఆమె సహించలేకపోయింది. నలగామునికి లేనిపోనివి నూరిపోసింది. నాగమ్మ చెప్పుడు మాటలు విన్న నలగామరాజు తమ్ములైన మలిదేవాదులను చెరసాలలో బంధించాడు. కుటుంబ కలహాలను నివారించటానికి మధ్యవర్తిత్వం చేసి రాజ్యాన్ని రెండుగా విభజించాడు. నలగాముని భాగానికి గురజాల రాజధాని, మలిదేవుని భాగానికి మాచర్ల రాజధాని.
నలగామునికి నాగమ్మ మంత్రి, మలిదేవునికి బ్రహ్మనాయుడు మంత్రి. బ్రహ్మ నాయుడికీ నాగమ్మకూ మధ్య పుట్టిన ఈర్ష్య, అసూయే పల్నాటి మతద్వేషానికీ, యుద్ధానికి దారితీశాయి. బ్రహ్మనాయుని మంత్రిత్వంలో సిరిసంపదలతో తులతూగే మలిదేవుని రాజ్యాన్ని చూసి నాగమ్మ ఓర్వలేకపోయింది. ఆమె ప్రేరణతోనే నలగాముడు మలి దేవాదులను కోడిపందేలకోసం గూరజాల పిలిపించాడు.
బ్రహ్మనాయుడికీ నాగమ్మకూ మధ్య జరిగిన కోడిపందెంలో బ్రహ్మనాయుడి కోడి ఓడిపోయింది. పందెం ఓడిపోయిన వారు ఐదు సంవత్సరాలు వనవాసం చేయాలి. ఒప్పందం ప్రకారం మలిదేవాదులు ఐదు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారు. ఇక రెండేళ్ళలో వనవాసం పూర్తికావస్తోంది. కాబట్టి, మలిదేవాదులు రాజ్యభాగం కోసం అలరాజును నలగాముని దగ్గరకు రాయబారం పంపారు.
రాయబారిగా వెళ్ళిన అలరాజు చంపబడ్డాడు. ఇది తెలిసి మలిదేవాదులు యుద్ధానికి సిద్ధమయ్యారు. కార్యమపూడి (కారెంపూడి) యుద్ధభూమికి చేరుకున్నారు. చివరగా భట్టును నలగామరాజు దగ్గరకు రాయబారం పంపారు. భట్టు నలగామరాజు కొలువులో ప్రవేశించడంతో ఈ పాఠ్యభాగం ప్రారంభమౌతుంది.
పాఠ్యభాగ సారాంశం
భట్టు గుర్రం మీద వచ్చి నలగామరాజు కొలువులో ప్రవేశించాడు. రాజు ఎదుట నిలిచి నమస్కరించాడు. రాజు గొప్పదనాన్ని ఇట్లా ప్రస్తావించాడు. ఓ రాజా! నీవు రాజులలో కెల్ల గొప్పవాడివి. ప్రకాశించే కీర్తిగలవాడివి. రాజవేశ్యలను రంజింపజేసే వాడివి. శూరులకే శూరుడవను బిరుదు గలవాడివి. ‘దానగుణంలో గొప్పవాడివి. నీవు మేరుపర్వతాన్ని మించిన ధైర్యం కలవాడివి. శౌర్యపరాక్రమాలలో నిండు చంద్రుని వంటివాడవు. భాస్కరునితో సమానమైన తేజస్సు కలవాడివి. గొప్ప గుణాలకు ప్రసిద్ధుడైన వాడవు. అభిమానంలో దుర్యోధనుని అంతటి వాడివి. మైలమ్మ దేవికి ప్రియమైన కుమారుడవు. అనుగురాజుకు పెద్ద కుమారుడవు. సుందరుడవు. రాజులలో వీరుడవు. వైభవంలో దేవేంద్రుడవు.
రాయబారం కోసం మలిదేవరాజు పంపించిన .అలరాజును అల్లుడని కూడా చూడకుండా చంపివేశారు. దానితో మలిదేవరాజు ఎంతో కోపించాడు. అతడు తన తమ్ములు, బంధువులు, వీరులైన ఇతర నాయకులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఖరదూషణములు మొదలైన రాక్షసులు సంహరించబడిన, శ్రీశైల ప్రాంతంలో గొప్పదైన పవిత్రమైన కార్యమపురిలో సైన్యంతో తన పరాక్రమాన్ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నాడు.
ఓ రాజా! అలరాజుతో పాటే యుద్ధంలో వీరమరణం పొందాలని ఎంతో ఆవేశంతో వీరులైన నాయకులు ఉన్నప్పటికీ రాజనీతిని పాటించిన మలిదేవరాజు నన్ను మీ దగ్గరకు రాయబారిగా పంపించాడు. పగను పెంపొందించే భ్రష్టులే కానీ తగ్గించే నిపుణులు ఈ భూమిమీద లేరు. మీ తమ్ముడైన నరసింగరాజును మలిదేవరాజు దగ్గరకు రాయబారిగా పంపించండి. ఇరువురూ ఒకటై ఈ పగను నశింపచేయండి. పల్నాడు రాజ్యం మొత్తాన్ని ఎదురులేకుండా ఏలండి. మలిదేవునితో సఖ్యతకోసం నరసింగరాజును పంపించు.
ఈ భూమిమీద ఎక్కడైనా, ఎప్పుడైనా యుద్ధం మంచిది కాదు. పగలు పెరిగితే దేశం నాశనమైపోతుంది. ఎంతో మంది ప్రజలు చనిపోతారు. మిగిలినవారు భయంతో పారిపోతారు. ధనాగారంలో డబ్బు మిగలదు. సైన్యానికి యుద్ధం పట్ల ఆసక్తి సన్న గిల్లుతుంది. జీతగాళ్ళు ఎదురుతిరుగుతారు. తమ జీతాల కోసం పట్టుబడతారు. రాజు, బంటు అనే తేడాలు ఉండవు. సేవకులు చెప్పిన పని చేయకుండా అలసత్వం వహిస్తారు.
అదను కనిపెట్టిన శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించ చూస్తారు. శత్రువుల కదలికలు కనిపెట్టలేరు. మీలో మీరే కొట్లాడుకుంటే చూచేవారికి చులకన అవుతారు. శత్రువులు మీ రహస్యాలను పసిగడతారు. దుష్టులు మీ పక్కన చేరి చెప్పుడు మాటలతో పగను ఇంతకింత పెంచిపోషిస్తారు. పగవల్ల ఐకమత్యం నశిస్తుంది. బలం, భాగ్యం రెండూ నశిస్తాయి. అంతేగాక కీర్తి, పరాక్రమం కూడా నాశనమైపోతాయి. రాజ్యం సర్వనాశన మౌతుంది. అన్నీ క్షీణించాక దేశం శత్రురాజుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది.
స్వేచ్ఛాస్వాతంత్రాలతో పరిపాలన సాగించిన మీరు ఇతరరాజుల చెరలో బతకవలసి వస్తుంది. శత్రురాజుల పాలనలో ప్రజలు పడే కష్టాల గురించి పరమేశ్వరుడు కూడా వర్ణించలేడు. పంజరంలో బంధించిన పక్షులలాగా బతకాలి. పాములవాడు పట్టుకొని బుట్టలో పెట్టిన పాములా పడి ఉండాలి. గంగిరెద్దులవాడు ముకుతాడు పొడిచి పొగరు అణచిన మదపుటెద్దులాగా జీవించాలి. బోనులో ఉంచిన పులులలాగా స్వేచ్ఛ లేకుండా బతుకుతూ ఉండాలి.
ఆలోచిస్తే మనసు, వాక్కు శరీరం :- అనే మూడింటిలో మనసును బంధించటం ఎవరి తరమూ కాదు. శత్రు పాలనలో మాట (వాక్కు. శరీరం (కాయం) – రెండూ బంధింపబడతాయి. ఎవరూ బంధించలేని మనసులో పుట్టిన మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. అట్లా చేయలేనపుడు .మానవ జన్మకు ప్రయోజనం ఉండదు. ఫలితం లేని జీవనం కన్నా మరణమే మేలైనది. మంచిపనులు చేయకపోతే క్రిమి కీటకాలు, పశుపక్ష్యాదులు మొదలైన జీవుల కడుపులలో లెక్కలేనన్ని సార్లు పుట్టి ఎంతో పుణ్యం. వల్ల లేక లేక -పొందిన కష్టసాధ్యమైన మానవ జన్మ నిందల పాలౌతుంది. కనుక ఓ రాజా! ఇటునంటి బానిసబతుకు పగవారికి కూడా వద్దు.
మల్లెపూలు, తెల్లతామర, కలువలకు లేడు అయిన చంద్రుడు, తారల సమూహం. నీటి పై నురుగు, మంచు, గంధం, రాజు హంస మొదలైన వాటి కాంతులను మించే గొప్ప కీర్తి- సైతం పగవల్ల వేగంగా నశిస్తుంది. లోకంలో అపకీర్తి పెరిగిపోతుంది. మీ రెండు.పక్షాల వారూ ఒక్కటైతే అన్ని కార్యాలూ సమకూర్చుకోవచ్చు. ప్రజలంతా సుఖంగా ఉంటారు. పంటలు బాగా పండుతాయి. మీరు కలసిమెలసి ధనం సంపాదిస్తూ ఉంటే మీ సేవకులంతా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. శత్రురాజ్యాలపై దండెత్తి అమితధనరాశులను సాధించవచ్చు. ఆ ధనంతో ధర్మబద్ధపాలన సాగించవచ్చు. అప్పుడు మీ గొప్పకీర్తి’ లోకంలో శాశ్వతమై నిలుస్తుంది.
కలహం వల్ల పూర్వం కౌరవులు నాశనమై పడిన కష్టాల గురించి వినలేదా! కనుక పగ పెరిగేటట్లు చేయటం భావ్యం కాదు. మీ రెండు పక్షాలవారూ అన్నదమ్ములే కనుక పరిష్కార మార్గం చెప్పాను. నా మాట వినండి.