Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material గద్య భాగం 3rd Lesson చాటువులు Textbook Questions and Answers, Summary.
AP Inter 2nd Year Telugu Study Material 3rd Lesson చాటువులు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
‘చాటువులు’ గురించి వివరించండి.
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి.నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి. నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటిలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.
చాటువులంటే కవులు సరదాగా ఎప్పటికప్పుడు చెప్పుకునే పద్యాలు. వీటిలో చమత్కారాలు, హాస్యాలు మాత్రమే కాకుండా, జీవిత వాస్తవాలు కూడా ఉంటాయి. చాటువులు సాహిత్యంలో ప్రత్యేక ప్రక్రియ కానప్పటికి కావ్యాలలో కన్నా భిన్నమైన సాహిత్య సృష్టి ఉంటుంది. ఆ చాటువులలోని ప్రత్యేకతలను నేటి యువతకు అందజేయటమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
చాటువు అంటే ప్రియమైన మాట. ఇది అచ్చమైన సంస్కృత శబ్దం. చాటువు అన్న పదాన్ని తెలుగువారు .చదరచాప అన్న ధోరణిలో వ్యవహరిస్తారు. ఒక భోగిచేత సీత్కరింపబడినపుడో, ఒక లోభిచేత సత్కరింపబడినప్పుడో, ఒక అందమైన దృశ్యం కనపడినపుడో, డెందము (మనసు) గాయపడినపుడో, హాస్యం లాస్యం చేసినపుడో ఛందోరూపంలో జుమ్మని చిమ్ముకువచ్చే కవితా రూపాలే ఈ చౌటుపద్యాలు.
తెలుగు సాహిత్యంలో ఒకవైపు గంగానది ప్రవాహంలా మహాకావ్యాలు వస్తుంటే మరోవైపు సెలయేళ్ళ లాంటి చాటుపద్యాలు గలగలా ప్రవహించాయి. నైషధం లాంటి విద్వ దౌషధాన్ని అందించిన శ్రీనాథుడంతటి మహాకవే “చిన్న చిన్న రాళ్ళు చిల్లరదేవుళ్ళు”, అని చిట్టి పొట్టి చాటువులను అల్లాడు. ఈ చాటువులను వెలుగులోకి తెచ్చినవాడు కీ.శే. వేటూరి ప్రభాకర శాస్త్రి.
కవిపేరు తెలియని పలు చాటుపద్యాలు లోకవ్యవహారంలో ఉన్నాయి. పిల్లల మొదటి వాచకంలో సాధారణంగా కనిపించే “చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ” ఆబాల గోపాలానికి తెలిసిందే. ఈ చాటుపద్యాన్ని ఎవరు వ్రాశారో తెలియదు. అలాగే సామెతల్లాగా చెప్పే పద్యాలు “వాసన లేని పువ్వు, బుధవర్గము లేని గృహంబు” మొదలగునవి వ్రాసిన వారు ఎవరో గాని ఈ చాటుపద్యాలు అక్షరాస్యుల నిత్య జీవితంలో అల్లుకుపోయాయి.
ఈ చాటువుల ద్వారా ఆయా కాలాలలో ఉండే జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలు, ఆహారవిషయాలు, వేషభాషలు, రాజుల పటాతోపాలు అన్నీ తెలుస్తున్నాయి.
ప్రశ్న 2.
చాటుపద్యాలలో ప్రజా జీవనాన్ని వివరించండి.
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి.నారాయణ రెడ్డి చే రచించబడిన డా.సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటిలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.
చాటువు అంటే ప్రియమైన మాట అని అర్థం. కవులు సరదాగా చెప్పుకునే పద్యాలు. ఒక భోగిచేత సీత్కరింపబడినపుడో, ఒక లోభిచేత సత్కరింపబడినప్పుడో, అందమైన దృశ్యం కనిపించినపుడో, మనసు గాయపడినపుడో, హాస్యం లాస్యం చేసినపుడో ఇలా పలు సందర్భాలలో మనసు నుండి ఛందోరూపంలో జుమ్మని చిమ్ముకు వచ్చే పద్యరూపం చాటువు.
చాటుపద్యాలలో ప్రజా జీవనానిదే ప్రథమస్థానం. ప్రజా జీవనాన్ని చాటువులలో చిత్రించిన మొనగాడు శ్రీనాథుడు. ఈయన ప్రౌఢదేవరాయలను దర్శించటానికి కన్నడ దేశానికి వెళ్ళాడు. ఆ ప్రభువు దర్శనం ఆలస్యమయినందుకు కన్నడ రాజ్యలక్ష్మిని
“కుల్లా యుంచిత కోక చుట్టితి …. దయలేదా నేను శ్రీనాథుడన్” అని తల్లి దయ కోసం ఈ చాటువును చెప్పాడు. దీనిలో ఆనాటి కన్నడ దేశాన ప్రజల వేషంతో పాటు భోజన విశేషం కూడా వ్రాయబడింది. అలాగే శ్రీనాథుడు పల్నాడు సందర్శనానికి వెళ్ళినపుడు అక్కడి ప్రజల జీవనశైలిని, ఆహార అలవాట్లను వర్ణించాడు. “జొన్నకలి, జొన్నయంబలి, జొన్నన్నము, జొన్నపిసరు తప్పు సన్నన్నము సున్న” అని చెప్పాడు.
పల్నాడు ప్రజలకు వరియన్నం తెలియదని దీనివలన తెలుస్తుంది. పల్నాటికి ‘రంభ’ వెళ్ళినా ఏకులే వడుకుతుందని, మన్మథుడు వెళ్ళినా జొన్నకూడు తినక తప్పదని తెలిపాడు. అలానే సామాన్య గ్రామ పురోహితుని ఇంటి పరిస్థితిని
దోసెడు కొంపలో పసుల తొక్కిడి ……. మాసిన కుండలున్” అని వర్ణించాడు. పడమటి సీమ వ్యాపారుల వస్త్రాలను, మసి బుర్రలను, కలములను, చింతంబళులను, చెమటపట్టిన నీర్కావులను, భయంకరమైన గడ్డాల వర్ణించటమే కాకుండా “వస్తూ చూస్తిమి రోస్తిమి అంటూ ఆ భావాలకు యాసను కూడా కూర్చాడు.
శ్రీనాథుడు తాను దర్శించిన ప్రాంతాలలోని ఒక్కొక్క ప్రాంతపు వనితలను వారి సొగసును కులాసాగా వర్ణించాడు. చివరకు తమిళ స్త్రీలను వర్ణించిన చాటువులు కూడా మనకు లభిస్తున్నాయి.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వేములవాడ భీమకవిని గురించి తెల్పండి.
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి.నారాయణ రెడ్డి చే రచించబడిన డా.సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.
చాటుపద్యాలు చెప్పిన ప్రాచీనాంధ్ర కవులలో భీమకవి ఒకరు. వేములవాడ భీమకవి తెలుగు సాహిత్యంలో కేవలం చాటువుల వలననే ఇప్పటికీ బతికి ఉన్నాడు. ఇతడి పేర చలామణిలో ఉన్న చాటువులలో ఒక్కొక్కటి ఒక్కొక్క చారిత్రక వృత్తానికి ఒక గుప్త సత్యానికి నిదర్శనంగా నిలుస్తాయి.
“గడియ లోపల తాడి గడగి ….. వేములవాడ భీమకవిని అన్న పద్యంలో తిట్టుకవుల పట్టిక ఉంది. మేధావి భట్టు, కవి మల్లుడు, కవి భానుడు, బడబాగ్ని భట్టు ఈ నలుగురూ ఒకరిని మించిన వారింకొకరు. భీమకవి ఇతర చాటువులలో పేర్కొన్న సాగి పోతరాజు, మైలమ భీముడు, కళింగ గంగు లాంటి వ్యక్తులు కూడా చారిత్రక పరిశోధనాంశాలుగా మిగిల్చాడు.
ప్రశ్న 2.
ఖడ్గ తిక్కనకు సంబంధించిన చాటు వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి.నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని చాటువుల నుండి గ్రహించబడింది.
కవి ఎవరో తెలియని ఉన్న ఖడ్గ తిక్కనకు సంబంధించిన వృత్తాంతం ఒకటి ఉంది. ఖడ్గ తిక్కన మనుమసిద్ధి పక్షాన నిలిచి కాటమరాజు నెదిరించిన మహావీరుడు. అతడు యుద్ధంలో భీకరంగా పోరాడి తన సేనలు చెల్లాచెదురై పారిపోగా యుద్ధాన్ని విరమించి ఇంటిముఖం పట్టాడు. అతడి భార్య నులకమంచాన్ని అడ్డుగా పెట్టి దానిమీద పసుపుముద్ద నుంచి ప్రక్కన నీళ్ళ చెంబు పెట్టిందట. ఇదేమిటని అడగ్గా
“పగరకు వెన్నిచ్చినచో
నగరేనిను మగతనంపు నాయకు లెందున్
ముగురాడు వార మైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్.
అని ఎత్తిపొడుపు మాటలు మాట్లాడింది. ఆ తరువాత ఖడ్గతిక్కన తల్లి అన్నంలో విరిగిన పాలు పోసిందట. ఇదేమిటని ప్రశ్నిస్తే
కసవున్ మేయగ బోయిన
పసులున్ విరిగినవి తిక్క ! పాలున్ విరిగెన్.
అని ఆక్షేపించింది. ఆ మాటలకు సిగ్గుపడి లేచి యుద్ధమునకు పోయి వీర స్వర్గము నలంకరించాడు. ఈ చాటు పద్యాల వలన చరిత్రను తెలుసుకునే వీలు కలిగింది.
ప్రశ్న 3.
అడిదము సూరకవి చాటుపద్యాన్ని వివరించండి.
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి.నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.
కొన్ని కొన్ని చాటుపద్యాలు వెలలేని చారిత్రక సత్యాలకు నిలువుటద్దాల్లాగా నిలిచిపోయినవి. అడిదము సూరకవి చెప్పిన ఈ క్రింది పద్యం అందుకు ఒక ఉదాహరణ.
“మెత్తనైయున్న అరటాకు మీదగాక
మంటమీదను చెల్లునే ముంటివాడి
బీదలైయున్న మా బోంట్ల మీదగాక
కలదె క్రొవ్వాడి బాదుల్ల’ ఖాను మీద”
అడిదము సూరకవి పూసపాటి విజయరామరాజు యొక్క ఆస్థానకవి. ఆ రాజు సూరకవిపై ఆగ్రహించి ఆస్థానం నుండి సూరకవిని తొలగించాడు. ఆ రాజుగారు ఒకసారి మహమ్మదీయ రాజైన బాదుల్లాఖానుతో యుద్ధము చేసి ఓడిపోయాడు. తన మనస్సులోని కోపాన్ని సూరకవి ఈ చాటుపద్యం ద్వారా విజయరామరాజుకు చురకలంటించాడు.
ఈ చారిత్రక వృత్తం ఈ చాటుపద్యం ద్వారా లోకానికి తెలిసింది. అంతకు పూర్వం విజయరామరాజు బాదుల్లాఖానును యుద్ధంలో ఓడించిన వృత్తాంతాన్ని కూడా సూరకవిని “ఢిల్లీ లోపల గోలకొండ పురినిండన్ నీ ప్రశంసల్” అను పద్యం ద్వారా కీర్తించటం కూడా జరిగింది. ఇలా చాటుపద్యాలు చారిత్రక సత్యాలను ప్రపంచానికి చాటుతున్నాయి.
ప్రశ్న 4.
శ్రీనాథుని చాటుపద్య చమత్కృతిని వివరించండి.
జవాబు:
చాటువులు అను పాఠ్యభాగం డా.సి.నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటంలోని ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.
చాటుపద్యాలను చెప్పిన ప్రాచీనాంధ్ర కవులలో వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణ, అడిదము సూరకవి ప్రముఖులు. చాుపద్యాలలో ప్రజా జీవనాన్ని మూడుమూర్తుల చిత్రించిన మొనగాడు శ్రీనాథుడు. విజయనగర సామ్రాజ్యాధినేత ప్రౌఢదేవరాయలను దర్శించటానికి వెళ్ళినపుడు శ్రీనాథునకు రాజదర్శనం ఆలస్య మైంది. అపుడు “కుల్లాయుంచితి కోక చుట్టితి ……. దయలేదా నేను శ్రీనాథుడన్” అని ఒక చాటువును చెప్పాడు. దీనిలో కన్నడ దేశ ప్రజల వేషభాషలతో పాటు భోజన విశేషాలను కూడా వ్రాశాడు.
పల్నాడు వెళ్ళినపుడు అక్కడి ప్రజల ఆహార విశేషాలను తన చాటువు ద్వారా తెలియజేశాడు. ‘జొన్నకలి, జొన్నయంబలి, జొన్నన్నము, జొన్నపిసరు తప్ప సన్నన్నము సున్న’ అని స్పష్టంగా చెప్పాడు. ఆ పలనాడు సీమకు ‘రంభ వెళ్ళినా ఏకులే వడుకుతుంది, మన్మథుడు వెళ్ళినా జొన్నకూడే తినక తప్పదని వాస్తవాలను చక్కగా తన చాటువుల ద్వారా తెలియజేశాడు. నాటి ప్రజా జీవనశైలిని, ఆచార వ్యవహారా లను, బహు చమత్కారంతో వర్ణించాడు. అంతటితో ఆగక కులానికి ఒక స్త్రీని తీసుకొని కులాసాగా వర్ణించాడు. శ్రీనాథుని చాటువులు సాహితీపరులకు విందునిచ్చాయి.
ఏకవాక్య/ పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
చాటువులు పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి.
ప్రశ్న 2.
సినారె ఎప్పుడు జన్మించారు ?
జవాబు:
జులై 29, 1931న జన్మించారు.
ప్రశ్న 3.
సినారె జన్మస్థలం ఏది ?
జవాబు:
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు దగ్గరలోని హనుమాజీ పేట.
ప్రశ్న 4.
సినారె తల్లిదండ్రులెవరు ?
జవాబు:
బుచ్చమ్మ, మల్లారెడ్డి.
ప్రశ్న 5.
సినారె ఏ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ను పొందాడు ?
జవాబు:
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి.
ప్రశ్న 6.
సినారె పరిశోధనా గ్రంథం ఏది ?
జవాబు:
ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు.
ప్రశ్న 7.
సినారె ఉపాధ్యక్షునిగా పనిచేసిన విశ్వవిద్యాలయాలేవి ?
జవాబు:
డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం.
ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసిన మన కవి ఎవరు ?
జవాబు:
సి.నా.రే.
ప్రశ్న 9.
సినారె ఎన్ని గ్రంథాలను వ్రాశారు ?
జవాబు:
70కి పైగా.
ప్రశ్న 10.
సినారెకి జ్ఞానపీఠ అవార్డును అందించిన కావ్యం ఏది ?
జవాబు:
విశ్వంభర.
ప్రశ్న 11.
సినారెకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందించిన గ్రంథమేది ?
జవాబు:
మంటలూ – మానవుడు.
ప్రశ్న 12.
సినారె రచనలు ఏ పేరుతో సంపుటాలుగా వెలువడ్డాయి ?
జవాబు:
డా.సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం పేరుతో వెలువడ్డాయి.
ప్రశ్న 13.
చాటువులను వెలుగులోకి తెచ్చిన వారెవరు ?
జవాబు:
వేటూరి ప్రభాకర శాస్త్రి.
ప్రశ్న 14.
ఖడ్గ తిక్కన ఎవరి తరపున యుద్ధం చేశాడు ?
జవాబు:
కాటమరాజును ఎదిరించి మనుమసిద్ధి పక్షాన యుద్ధం చేశాడు.
ప్రశ్న 15.
శ్రీనాథుడు ఏ విజయనగర రాజును దర్శించాడు ?
జవాబు:
ప్రౌఢ దేవరాయలును దర్శించాడు.
ప్రశ్న 16.
విద్వదౌషధంగా పేరు పొందిన గ్రంథమేది ?
జవాబు:
శ్రీనాథుని శృంగార నైషధ కావ్యం.
ప్రశ్న 17.
పూసపాటి విజయరామరాజు ఆస్థాన కవి పేరేమిటి ?
జవాబు:
అడిదము సూరకవి.
ప్రశ్న 18.
చాటువు అంటే ఏమిటి ?
జవాబు:
చాటువు అంటే ప్రియమైన మాట.
ప్రశ్న 19.
చాటుపద్యాలు చెప్పిన ప్రాచీన ఆంధ్ర కవులెవరు ?
జవాబు:
వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు, అడిదము సూరకవి.
ప్రశ్న 20.
తిట్టు కవులలో దిట్టలెవరు ?
జవాబు:
మేధాలిభట్టు, కవి మల్లుడు, కవి భానుడు, బడబాగ్ని భట్టు.
ప్రశ్న 21.
చాటుపద్యాలలో ప్రజా జీవనాన్ని చిత్రించిన వాడెవరు ?
జవాబు:
శ్రీనాథుడు.
ప్రశ్న 22.
కులానికొక్క కుసుమాంగిని ఏరి చాటువులలో వర్ణించిన కవి ఎవరు ?
జవాబు:
శ్రీనాథుడు.
ప్రశ్న 23.
చిన్ని చిన్ని రాళ్ళు చిల్లర దేవుళ్ళు చాటుపద్యం ఎవరిది ?
జవాబు:
శ్రీనాథునిది.
ప్రశ్న 24.
కర్త ఎవరో తెలియని చాటుపద్యం ఏది ?
జవాబు:
చేత వెన్నముద్ద.
కవి పరిచయం
కవి పేరు : డా|| సి.నారాయణ రెడ్డి.
పుట్టిన తేదీ : జులై 29, 1931.
జన్మస్థలం : తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గరలోని హనుమాజీ పేట.
తల్లిదండ్రులు : బుచ్చమ్మ, మల్లారెడ్డి.
విద్యాభ్యాసం . : ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు.
వృత్తి : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు.
రచనలు : సుమారు 70 గ్రంథాలను వివిధ సాహిత్య ప్రక్రియలలో వ్రాశారు.
అవార్డులు : జ్ఞానపీఠ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.
పరిశోధనా వ్యాసం : ఆధునికాంధ్ర కవిత్వం – సంప్రదాయములు, ప్రయోగములు
మరణం : జూన్ 12, 2017వ తేదీన తుదిశ్వాస విడిచారు.
మానవుని తన కవిత్వానికి కేంద్ర బిందువుగా చేసుకొని ప్రతి అక్షరంలోనూ మానవత్వాన్ని పరిమళింప చేసిన కవి, రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, సినారే.
వీరి పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈయన జులై 29, 1931లో తెలంగాణా రాష్ట్రంలోని, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గరలోని హనుమాజీ పేటలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు బుచ్చమ్మ, మల్లారెడ్డి.
వీరి విద్యాభ్యాసం హనుమాజీ పేటలో ప్రారంభమయి సిరిసిల్ల కరీంనగర్, హైదరాబాద్లలో సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. సికిందరాబాద్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో, నిజాం కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పదవీ విరమణ చేశారు. డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయాలలో ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా బాధ్యతలను నిర్వహించారు.
సినారే 70కి పైగా గ్రంథాలను రచించారు. గేయ, వచన, గజళ్ళు, విమర్శనా వ్యాసాలు, పరిశోధనా గ్రంథాలున్నాయి. విశ్వంభర, కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, మంటలూ మానవుడు, మట్టి మనిషి, ఆకాశం వంటివి ప్రధాన రచనలు. వీరి ‘విశ్వంభర’ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. మంటలు – మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. వీరు వ్రాసిన చలనచిత్ర గేయాలు విశేష ప్రాచుర్యం పొందాయి.
ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు, వీరి సిద్ధాంత – వ్యాసం. ఇది ఈనాటికీ ఎందరో పరిశోధకులకు ప్రామాణిక గ్రంథంగా ఉండి పోయింది. వీరి సాహిత్యమంతా డాక్టర్ సి. నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం పేరున 18 సంపుటాలలో ప్రచురించబడ్డాయి. ప్రస్తుత పాఠ్యభాగం చాటువులు 18వ సంపుటం నుండి గ్రహించబడింది.
చాటువులంటే కవులు సరదాగా ఎప్పటికప్పుడు చెప్పే చమత్కార హాస్య పద్యాలు. ఇది ఒక సాహిత్య ప్రక్రియ కాకపోయినా దీని ప్రత్యేకత దీనికున్నది. చాటువులలోని ప్రత్యేకతలను నేటి యువతరానికి అందించటం ఈ పాఠ్యభాగం ఇవ్వటంలోని ముఖ్య ఉద్దేశం.
పాఠ్యభాగ సారాంశం
చాటువులు పాఠ్యభాగం డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డిచే రచించబడిన డా.సి. నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 18వ సంపుటం ‘చాటువులు’ నుండి గ్రహించబడింది.
చాటువులు అంటే కవులు. కవులు సరదాగా ఎప్పటికప్పుడు చెప్పుకొనే పద్యాలు. వీటిలో చమత్కారాలు, హాస్యాలు మాత్రమే కాదు, జీవిత వాస్తవాలు కూడా ఉంటాయి. చాటువులు సాహిత్యంలో ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియ కాకపోయిననూ కావ్యాలలో కంటే భిన్నరుచి ఈ చాటువులలో కనిపిస్తుంది. చాటువులలోని ప్రత్యేకతలను నేటి యువతకు తెలియపరచాలన్నదే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
చాటువు అంటే ప్రియమైన మాట. ఇది అచ్చమైన సంస్కృత శబ్దం. ఒక భోగిచేత సీత్కరింపబడినపుడో, ఒక లోభిచేత సత్కరింపబడినప్పుడో, అందమైన దృశ్యం కనపడినపుడో, మనసు గాయపడినపుడో, హాస్యం లాస్యం చేసినపుడో కవుల హృదయాల నుండి జుమ్మని చిమ్ముకు వచ్చే పదాల సంపుటులే చాటువులు. ఆంధ్ర సాహిత్యంలో గంగానది వలే పరవళ్ళు తొక్కే మహాకావ్యాలు వెలువడుతుంటే, మరోవైపు సెలయేళ్ళ లాంటి చాటువులు తెలుగు నేలను తడిపివేశాయి.
నైషధం వంటి విద్వదౌషధాన్ని అందించిన కవి సార్వభౌముడు శ్రీనాథుడు కూడా చాటువులతో చిందులువేశాడు. “చిన్ని చిన్ని రాళ్ళు చిల్లర దేవుళ్ళు”, “జొన్నకలి, జొన్నన్నము, జొన్నపిసరు, తప్ప సన్నన్నము సున్నసుమీ” అని రంభ అయినా ఏకులు వడుకుతుందని, మన్మథుడైనా జొన్న కూడే తినవలసి వస్తుందని చాటువులలో పలనాటి సీమ సామాజిక స్థితిగతులను వర్ణించాడు.
ఈ ‘చాటుపద్య సంపదను తొలిసారిగా వెలుగులోనికి తీసుకువచ్చినవారు కీ.శే. వేటూరి ప్రభాకర శాస్త్రిగారు. కొన్ని చాటుపద్యాలు జానపద గేయాలకు వలే కవుల పేర్లు తెలియకుండా ఉండిపోయాయి. పిల్లల తెలుగు వాచకంలో ఉన్న “చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ” అనే చాటువు తెలుగునేలపై అందరికీ పరిచయమైనదే ! కాని దానిని ఎవరు వ్రాశారో తెలీదు. అలాగే “వాసన లేని పువ్వు బుధవర్గము లేని గృహంబు” ఇలాంటి చాటువులు తెలుగు నేలపై కోకొల్లలు.
చాటుపద్య రచన చేసిన ప్రాచీనాంధ్రులలో వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు, అడిదము సూరకవి లాంటివారు అగ్రగణ్యులు. విచిత్రమే మంటే, ఈ చాటువుల వలననే భీమకవి తెలుగు నేలపై ఇంకా బ్రతికే ఉన్నాడు. భీమకవి పేర చలామణిలో ఉన్న చాటువుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క చారిత్రక వృత్తాంతానికి ఉదాహరణం. భీమకవి వ్రాసిన ఈ క్రింది పద్యంలో తిట్టుకవుల పట్టిక ఉంది.
“గడియ లోపల తాడిగడిగి …….. బిరుదు వేములవాడ భీమకవిని.
ఈ పద్యంలో మేధావిభట్టు, కవి మల్లుడు, కవి భానుడు, బడబాగ్ని భట్టులున్నారు. వీరు ఒకరిని మించి ఒకరు తిట్టు కవులు.
కవి ఎవరో తెలియరాని చాటుపద్యాలకు ఖడ్గతిక్కన కథ ఒక మచ్చుతునక. ఖడ్గతిక్కన మనుమసిద్ధి పక్షాన నిలచి కాటమరాజును ఎదిరించి యుద్ధము చేయుట, అందులో ఓడిపోయి ఇంటికి వచ్చుట జరిగింది. ఇంట్లోని తల్లి, భార్యలు యుద్ధంలో ఓడిపారిపోయి వచ్చినందుకు అతడిని అవమానించిన తీరు నాటి వీరుల, వీరవనితల భావనలకు ఒక ఉదాహరణ.
“పగరకు వెన్నిచ్చినచో
నగరేనిను మగతనంపు నాయకు లెందున్
ముగురాడ వారమైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్.
ఇలాంటి అధిక్షేపణలకు తెలుగు చాటుపద్యాలలో కొదువే లేదు.
పూసపాటి విజయరామరాజు ఆస్థానకవి అడిదము సూరకవి. రాజుగారు ఒక పర్యాయం మహమ్మదీయ ప్రభువైన బాదుల్లాఖానుతో యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి వచ్చాడు. ఆస్థానకవియైన అడిదము సూరకవిని తన ఆస్థానం నుండి తొలగించటం చేత ఆయన ఈ పద్యం చాటువుగా చెప్పి
“మెత్తనైయున్న అరిటాకు మీదగాక
మంటమీదను చెల్లునే ముంటి వాడి
బీదలైయున్న మా బోంట్ల మీదగాక
కలదె క్రొవ్వాడి బాదుల్లా ఖానుమీద”.
తన కసిని తీర్చుకున్నాడు. ఒకనాడు బాదుల్లా ఖానుపై గెలిచినపుడు “ఢిల్లీ లోపల గోలకొండ పురి నిండన్ నీ ప్రశంసల్” అని అదే కవి అదే రాజును పొగిడిన విషయం కూడా చాటువులలో చోటుచేసుకున్నది. చాటువులు ప్రాచీన తెలుగు సామాజిక, సాంస్కృతిక, ఆచార వ్యవహారాలు, సంస్కృతిని తెలియజేస్తున్నాయి.
కఠిన పదాలకు అర్ధాలు
చాటువు = ప్రియమైన మాట
వాస్తవాలు = నిజాలు
భోగి = ధనవంతుడు
లోభి = పిసినారి
డెందము = మనస్సు
హాస్యము = నవ్వు
లాస్యం = నటన
మందాకిని = గంగానది
సదృశము = సమానమైన
గణనీయులు = లెక్కింపదగినవారు
చలామణి = వ్యాప్తి
అకర్తృకము = కర్త ఎవరో తెలియని (రాసిన వాడెవరో తెలియని)
అధిక్షేపించు = తిట్టు
పొడుపు మాటలు = ఎత్తిపొడుపు మాటలు
లజ్జితుడు = సిగ్గుపడిన వాడు
కదనరంగము = యుద్ధరంగము
కుసుమాస్తుడు = మన్మథుడు
రోస్తిమి = అసహ్యించుకొను
అవసాన దశ = చివరి దశ
తులలేని = వెలలేని
ఆగ్రహం = కోపం
పరాజితుడు = ఓడిపోయినవాడు
ఈసడించు = అసహ్యించుకొను