Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material గద్య భాగం 1st Lesson మన ఆటలు Textbook Questions and Answers, Summary.
AP Inter 2nd Year Telugu Study Material 1st Lesson మన ఆటలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పూర్వం తెలుగువారి ఆటలను గురించి వివరించండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వముల నుండి గ్రహించబడినది. ఈ వ్యాసం ప్రాచీన కాలంలో తెలుగువారి సంస్కృతిలో భాగమైన ఆటలు, వేడుకలను గురించి చక్కగా వివరిస్తుంది. . తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేయటమే ఈ వ్యాసంలోని విషయం.
ఆంగ్లేయులకు క్రికెట్ మొదలగు ఆటలున్నట్లు తెలుగువారికి జాతీయ క్రీడలు తక్కువ. వయసు వచ్చిన యువజనులు ఆడు ఆటలు చాలా అరుదు. మన ప్రబంధాలలో బాలబాలికలు ఆడు ఆటలు వర్ణించబడ్డాయి. మనదేశంలోని బాలబాలికలు ఏడెనిమిది సంవత్సరముల వయస్సు వచ్చేవరకు కలిసిమెలిసి ఆడుకునేవారు. ఆంగ్ల విద్యావిధానం వలన ఆ ఆటలు మూలనపడ్డాయి. అందువలన ప్రబంధాలలోని ఆటలు ఎలా ఆడేవారో ఎవరికి తెలియదు. ఈ ఆటలను గురించి అయ్యలరాజు నారాయణామాత్యుడు తన ‘హంస వింశతి’ కావ్యంలో వివరించాడు.
తెలుగు నేలపై ఆడు ఆటలలో కొన్ని ఇంటిలోను కొన్ని ఇంటి వెలుపల మరికొన్ని ఇంట్లోను, బయటను ఆడుకొనే ఆటలున్నాయి. అచ్చనగళ్ళు కేవలం బాలికల క్రీడ. కోతికొమ్మచ్చి బాలుర ఆట. కుందికట్టు, కంబాలాట, పుట్టచెండు, దాగుడుమూతలు మొదలగునవి బాలబాలికలు ఇద్దరూ ఆడే ఆటలు. ఈ ఆటలతోపాటు పాటలు కూడా ఉంటాయి. ఒకే ఆట వేరువేరు తెలుగు ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలుచుకునేవారు. కోతికొమ్మచ్చిని, క్రోత క్రోతులని, కందికట్టుకు కుంది కాళ్ళని కుందెనగిరి అని, కుందెన గుడి అని వ్యవహరించేవారు.
ప్రశ్న 2.
పూర్వకాలంలో వేడుకలు, వినోదాలను గురించి రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వముల నుండి గ్రహించబడినది. తెలుగు సంస్కృతిలో భాగాలైన వివిధ రకాల ఆటలు, వేడుకలను ఈ వ్యాసం ద్వారా యువతకు పరిచయం చేయటం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.
తెలుగు దేశాన పూర్వకాలంలో వేడుకలు వినోదాలు ఎలా ఉండేవో, పండుగలు పబ్బాలతో ఎలా కాలక్షేపం చేసేవారో తెలుసుకొనుటకు ఆధారాలు అంతగా దొరకవు. కాకపోతే మన ప్రబంధముల ద్వారా కొన్ని తెలుస్తున్నాయి. వాటిలో వసంతోత్సవం, శరదుత్సవం గొప్పవేడుకలుగా వివరింపబడ్డాయి. వసంతోత్సవం వేయి సంవత్సరము లకు పూర్వం నుండి ఉన్నప్పటికి రెడ్డి రాజుల కాలq నుండి మంచి ప్రాచుర్యం వచ్చింది.
ఇక వసంతోత్సవం తరువాత చెప్పదగిన వేడుక శరదుత్సవం. దీనిని మహా లక్ష్మీపండుగలని, దేవీ నవరాత్రులని పిలిచేవారు. మన పండుగలు, వేడుకలు మత సంబంధమైనవే ! గ్రామాలలోని దేవుని కళ్యాణం, గ్రామదేవతల జాతరలు దీనికి ఉదాహరణలు. మనకున్న పండుగలలో వసంతోత్సవం శరదుత్సవాలతోపాటుగా మకర సంక్రమణం (సంక్రాంతి) పండుగ కూడా ఒకటి. దీనిని ‘పెద్ద పండుగ’ అని పేరు.
సంక్రాంతి పండుగ దినాలలో జరుపుకొనే వేడుకలలో కోడిపందెములు ఒకటి. కోడిపందాలు వేయి సంవత్సరములకు పూర్వం నుండి ఉన్నట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. పూర్వపు సంస్థానాధీశులకు కోడిపందాలు ఒక వేడుకగా ఉండేవి. పల్నాటి యుద్ధమునకు కారణం ఈ కోడి పందాలేనని చరిత్ర వలన తెలుస్తుంది. పూర్వ గ్రంథాలైన క్రీడాభిరామం, భోజరాజీయం మొదలగు గ్రంథాల వలన తెలుగు నేలపై వృషభపోరు, మేషయుద్ధము, దున్నపోతుల పోరు, గజయుద్ధము, పొట్టేళ్ళ పోరు మొదలగు ప్రజావినోదపు వేడుకలున్నట్లు తెలుస్తుంది.
కుంతల దేశరాజైన సోమేశ్వర భూపతి తాను రచించిన ‘అభిలషితార్థ చింతామణి’ అను మారు పేరుతో ఉన్న ‘మానసోల్లాసం’ అనే విజ్ఞానకోశంలో ఈ వినోదవర్ణలకు ఒక ప్రకరణాన్నే వ్రాశాడు. దానిలో మల్లయుద్ధము, గజయుద్ధము, అశ్వయుద్ధాలు, ఆబోతుల దున్నపోతుల పోరాటములు, పొట్టేళ్ళ, కోళ్ళ పోరాటాలను వర్ణించాడు. పూర్వకాలంలో ‘వేట’ కూడా ఒక క్రీడవేడుక వలె ఉండేది. దీనిలో పాదివేట, విడివేట, తెరవేట, దా మెనవేట అని పలు రకములు ఉండేవి. పూర్వకాలమున ఈ వేడుకలు వినోదములు నేడు చాలా వరకు అంతరించిపోయాయి.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
గెలుపెద్దుల మాన్యమును గురించి రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వ సంపుటం నుండి గ్రహించబడింది.
తెలుగుదేశం వ్యవసాయం ప్రధానవృత్తిగా అనుసరించటం వలన ప్రజల జీవనం . పాడిపంటలపై, పశుసంపదపై ఆధారపడింది. వ్యవసాయమునకు బలిష్ఠమైన ఎద్దుల అవసరం ఉన్నది. అందుకు మేలుజాతి ఎద్దులను తయారుచేయుటకు గ్రామస్థులు ఒక మాన్యమును ఏర్పాటు చేసుకునేవారు. దీనినే గెలు పెద్దుల మాన్యం అంటారు. కనుమపండుగనాడు పశుప్రదర్శన ఎడ్ల పందెములు జరిగేవి. ఆ పందెములో ఎవరి ఎద్దు గెలుస్తుందో ఈ గెలు పెద్దుల మాన్యం ఆ ఏడాది ఆయన ఆధీనంలో ఉంటుంది. ఇది ఈనాటి ‘రోలింగ్ కప్’ వంటిది. అలా అని అన్ని గ్రామాలలోనూ గెలు పెద్దుల మాన్యాలుండవు. కనుమనాడు పశువులతో వేడుకలను జరుపుకొనుట మాత్రం ప్రతి గ్రామంలో ఉండేవి.
ప్రశ్న 2.
ధనుర్విద్య, కత్తిసాము, గుర్రపుస్వారీ మొదలైన వాటిని గురించి తెల్పండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వ సంపుటం నుండి గ్రహించబడింది.
ఆంధ్రదేశాన ధనుర్విద్య, కత్తిసాము, బాణవిద్య, గుర్రపుస్వారీ వంటి యుద్ధ విద్యలను అన్ని వర్ణముల వారు నేర్చుకొనేవారు. ముఖ్యంగా క్షత్రియులు, శూద్రులకు ఈ విద్యలు తప్పనిసరి. పాలక వంశాలకు చెందినవారు, విలు విద్య, కుంతాయుధ, కత్తిసాము, గుర్రపుస్వారీ మొదలగు వానిని నేర్చేవారు. శూద్రులతో పాటు బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, వైశ్యులు గజ అశ్వ విద్యలలో ఆరితేరినవారన్నట్లు శాసనాలు తెలుపు తున్నాయి. స్త్రీలు కూడా ఈ విద్యలను నేర్చినట్లు శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయ నగరానికి వచ్చిన ‘పేయస్’ అనే విదేశీయాత్రికుడు వ్రాశాడు. రాజమహేంద్రవరాన్ని పాలించిన వీరభద్రారెడ్డి సోదరుడు దొడ్డారెడ్డి గుర్రపుస్వారీలో ఉద్దండుడట. ఒకే వేటులో ఆరుముక్కలుగా నరకగలిగిన కత్తియుద్ధ నిపుణులున్నారని చరిత్ర చెప్తుంది.
ప్రశ్న 3.
చదరంగం గురించి రాయండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడిన ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వములు అను సంపుటం నుండి గ్రహించబడింది.
చదరంగం. భారత జాతీయ క్రీడ. ప్రపంచానికి చదరంగం ఆటను ప్రసాదించినది భారతదేశమే ! పూర్వం దీనిని అష్టాపదమని పిలిచేవారు. మనదేశం నుండి ఈ ఆట పర్షియా, అరేబియా, తూర్పు చైనా దేశాలకు వ్యాపించింది. – 10వ శతాబ్దం చివరిలో అరబ్బులు ఈ ఆటను స్పెయిన్ దేశానికి తీసుకుపోయారు. 11వ శతాబ్దంలో ఐరోపాకు పరిచయం అయింది. ఈ ఆటను పూర్వం ఉన్నత కులాలవారు మాత్రమే ఆడేవారు. విజయనగర ప్రభువు కృష్ణదేవరాయలు ఈ ఆటను అమితంగా ప్రేమించారు.
ఆయన బొడ్డుచర్ల తిమ్మనతో ప్రతిరోజూ ఆడేవారట. రాయల తరపున ఎందరు ఆడినా ఒక్కడే ఉండి తిమ్మన విజయం సాధించేవాడట. పూర్వం యుద్ధమునకు వెళ్ళే సమయాన ఈ ఆటను ఆడి ఎత్తులకు పై ఎత్తులు వేసేవారని చరిత్ర తెలియజేస్తుంది. ఈనాడు చదరంగం ప్రపంచ క్రీడలలో చేరింది. ఇప్పటికి కూడా ముందుగానే చెప్పి ఆట కట్టించగల క్రీడాకారులు. తెలుగుదేశాన ఎందరో ఉన్నారు.
ప్రశ్న 4.
గ్రామ సమూహ మాన్యమును వివరించండి.
జవాబు:
మన ఆటలు అను పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడింది. ఇది ‘తెలుగు సంస్కృతి’ విజ్ఞాన సర్వస్వము అను సంపుటం నుండి గ్రహించబడింది. ”
పూర్వము తెలుగుదేశంలో ప్రతి గ్రామములోను ‘గ్రామ సామూహి మాన్యం’ అని ఒక మాన్యం ఉండేది. అది గ్రామంలోని వారందరి సొత్తు. దానిమీద వచ్చు ఆదాయం గ్రామంలోని వారందరి ప్రయోజనాల కోసం వినియోగించేవారు. గ్రామానికి వచ్చి పోయే కళాకారులకు, భాగవత మేళాలకు, తోలుబొమ్మల వారికి వేడుకలను వినోదాలను అందించే కళాకారులకు పంచేవారు. అలా పంచటాన్ని ‘వర్తన’ అని అనేవారు. అదే చివరకు ‘వతన’గా మారింది. విద్యావంతులకు ఆటపాటలవారికి ఈ వతనను ‘గ్రామ సామూహి మాన్యము’ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచటం ఒక రివాజుగా మారింది.
ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మన ఆటలు పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
మల్లంపల్లి సోమశేఖర శర్మ.
ప్రశ్న 2.
మల్లంపల్లి ఎప్పుడు జన్మించారు ?
జవాబు:
డిసెంబరు 24, 1891న జన్మించారు.
ప్రశ్న 3.
మల్లంపల్లి వారి స్వగ్రామం ఏది ?
జవాబు:
పశ్చిమ గోదావరి జిల్లా మినుమించిలిపాడు.
ప్రశ్న 4.
మల్లంపల్లి తల్లిదండ్రులెవరు ?
జవాబు:
నాగమ్మ, భద్రయ్యలు.
ప్రశ్న 5.
మల్లంపల్లి వారి విద్యార్హతలేమిటి ?
జవాబు:
మెట్రిక్యులేషన్.
ప్రశ్న 6.
నాడు ‘దేశమాత’ పత్రిక నిర్వహిస్తున్నవారెవరు ?
జవాబు:
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు.
ప్రశ్న 7.
మల్లంపల్లి వారు ఏఏ భాషలలో రచనలు చేశారు ?
జవాబు:
ఆంధ్ర, ఆంగ్ల భాషలలో.
ప్రశ్న 8.
మల్లంపల్లి వారి ఆంగ్ల రచనలేవి ?
జవాబు:
ఫర్ గాటెన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ, హిస్టరీ ఆఫ్ ది రెడ్డి కింగ్ డమ్స్’.
ప్రశ్న 9.
మల్లంపల్లి వారు ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వములు’ కూర్పుకు ఎవరితో కలసి పని చేశారు?
జవాబు:
కొమర్రాజు లక్ష్మణరావుగారితో.
ప్రశ్న 10.
మల్లంపల్లి వారు సంపాదక వర్గ సభ్యులుగా వ్యవహరించిన సంపుటం ఏది ?
జవాబు:
తెలుగు భాషా సమితి ప్రచురించిన ‘తెలుగు సంస్కృతి’ సంపుటానికి.
ప్రశ్న 11.
హిస్టరీ ఆఫ్ రెడ్డికింగ్ డమ్స్ ఎవరు వ్రాశారు ?
జవాబు:
మల్లంపల్లి సోమశేఖర శర్మ.
ప్రశ్న 12.
విజయనగర రాజుల కాలం వరకు దక్షిణ హిందూదేశంలో ఏ క్రీడ ఉంది ?
జవాబు:
మల్లయుద్ధం.
ప్రశ్న 13.
ఆంగ్లేయుల జాతీయ క్రీడ ఏది ?
జవాబు:
క్రికెట్.
ప్రశ్న 14.
కుందికట్టు ఆటను ఏఏ పేర్లతో పిలిచేవారు ?
జవాబు:
కుందికాళ్ళు, కుందెనగిరి, కుందెనగుడి అన్న పేర్లతో పిలిచేవారు.
ప్రశ్న 15.
కోలకోతులని ఏ ఆటకు పేరు ?
జవాబు:
కోతికొమ్మచ్చి.
ప్రశ్న 16.
మల్లవిద్యలో అత్యంత ప్రావీణ్యమును సంపాదించిన వారిని ఏమని పిలిచేవారు ?
జవాబు:
జ్యైష్ఠకులని పిలిచేవారు. జెట్టిమల్లులని కూడా పిలుస్తారు.
ప్రశ్న 17.
కృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు ?
జవాబు:
పేయస్.
ప్రశ్న 18.
గుర్రపుస్వారీలో ఉద్దండుడైన వీరభద్రారెడ్డి సోదరుడు ఎవరు ?
జవాబు:
దొడ్డారెడ్డి.
ప్రశ్న 19.
తెలుగువారికి ఇప్పటికీ మిగిలిన జాతీయ క్రీడలేవి ?
జవాబు:
చిడుగుడు,. ఉప్పనబట్లు.
ప్రశ్న 20.
తెలుగువారి ప్రాచీన జాతీయ క్రీడ ఏది ?
జవాబు:
చదరంగం.
ప్రశ్న 21.
చదరంగపు ఆటను పూర్వం ఏమని పిలిచేవారు ?
జవాబు:
అష్టాపదం.
ప్రశ్న 22.
కృష్ణదేవరాయలకు ఇష్టమైన ఆట ఏది ?
జవాబు:
చదరంగం.
ప్రశ్న 23.
కృష్ణదేవరాయలి ఆస్థానంలో చదరంగ ప్రావీణ్యుడెవరు ?
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన.
ప్రశ్న 24.
పూర్వకాలంలో తెలుగువారి వేడుకలేవి ?
జవాబు:
వసంతోత్సవము, శరదుత్సవము.
ప్రశ్న 25.
తెలుగువారి పెద్ద పండుగ అని దేనిని అంటారు ?
జవాబు:
సంక్రాంతి.
ప్రశ్న 26.
కోడిపందాల పోరు వలన జరిగిన యుద్ధం ఏది ?
జవాబు:
పలనాటి యుద్ధం.
ప్రశ్న 27.
అభిలషితార్థ చింతామణి గ్రంథ రచయిత ఎవరు ?
జవాబు:
కుంతలదేశాధిపతి భూలోక మల్ల సోమేశ్వర భూపతి.
ప్రశ్న 28.
‘అభిలషితార్థ చింతామణి’ అసలు పేరేమిటి ?
జవాబు:
మానసోల్లాసము.
ప్రశ్న 29.
గుర్రపుస్వారీలో ఉద్దండుడైన రెడ్డి రాజు ఎవరు ?
జవాబు:
దొడ్డారెడ్డి.
ప్రశ్న 30.
హంస వింశతి గ్రంథాన్ని ఎవరు వ్రాశారు ?
జవాబు:
అయ్యలరాజు నారాయణామాత్యులు.
ప్రశ్న 31.
శరదుత్సవమునకు గల పేర్లేమిటి ?
జవాబు:
మహాలక్ష్మి పండుగ, దేవీ నవరాత్రులు.
ప్రశ్న 32.
తెలుగు నేలపై రాజ్యపాలన చేసిన రాణులెవరు ?
జవాబు:
- కాకతి రుద్రమదేవి
- కోట గణపమదేవి.
రచయిత పరిచయం
రచయిత : శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ.
పుట్టిన తేదీ : డిసెంబరు 24, 1891.
జన్మస్థలం : పశ్చిమ గోదావరి జిల్లా మినుమించిలిపాడు.
తల్లిదండ్రులు : నాగమ్మ, భద్రయ్య.
విద్యార్హతలు : మెట్రిక్యులేషన్.
ఉద్యోగం : దేశమాత పత్రికలో ఉపసంపాదకులు, భారతి మాసపత్రిక సంపాదకులు.
పరిశోధనలు : చరిత్ర, సంస్కృతి, శాసనాలపై పలు పరిశోధనలు.
రచనలు : చారిత్రక వ్యాసాలు, అమరావతి స్తూపం, ఆంధ్రవీరులు, దేశోద్ధారకులు, . ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహం, రేడియో నాటకాలు, రోహిణీ చంద్రగుప్తం, హిందూదేశ చరిత్ర, తెలుగు రచనలు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వంలో కొంత భాగం.
ఆంగ్లంలో : ఫర్ గాటెన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ, హిస్టరీ ఆఫ్ ది రెడ్డికింగ్ డమ్స్.
మరణం : జనవరి 7, 1963.
ప్రస్తుత పాఠ్యభాగం “తెలుగు సంస్కృతి” విజ్ఞాన సర్వస్వం సంపుటి నుండి గ్రహించబడింది. తెలుగు సంస్కృతిలో భాగమైన వివిధ రకాలైన ఆటలు, వినోదాలు, వేడుకలు ఈ వ్యాసంలో తెలియజేశారు. ప్రపంచీకరణ ప్రభావంతో తెలుగువారు తమ సంస్కృతి సంప్రదాయాలను వినోదాలను తమ అస్తిత్వాన్ని ఎలా కోల్పోతున్నారో ఈ వ్యాసం ద్వారా నేటి యువతరానికి కవి అందించారు.
మన ఆటలు అన్న పాఠ్యభాగం మల్లంపల్లి సోమశేఖర శర్మచే రచించబడింది. శర్మగారు తొలితరం చారిత్రక పరిశోధకులలో ముఖ్యులు. వీరు 24-12-1891 తేదీన జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా మినుమించిలిపాడు వీరి స్వగ్రామం. వీరి తల్లిదండ్రులు నాగమ్మ, భద్రయ్యలు. మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ‘దేశమాత’ పత్రికలో సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఈ సంపాదకీయమే ఆయనకు జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అందించింది. వీరు ఆంధ్ర, ఆంగ్లభాషలలో రచనలు చేశారు.
చారిత్రక వ్యాసాలు, అమరావతీ స్థూపం, ఆంధ్రవీరులు దేశోద్ధారకులు, ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహం, రేడియో నాటకాలు, రోహిణీ చంద్రగుప్తం, హిందూ దేశచరిత్ర వీరి తెలుగు రచనలు. ఫర్గాటెన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ, హిస్టరీ ఆఫ్ ది రెడ్డికింగ్ డమ్ వీరి ఆంగ్ల రచనలు. కొమర్రాజు లక్ష్మణరావుగారితో కలిసి “ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం” వ్రాశారు. నేలటూరి వేంకట రమణయ్యగారితో కలిసి కాకతీయ చరిత్రను పూర్తి చేశారు. తెలుగు భాషా సమితి ప్రచురించిన “తెలుగు సంస్కృతి” సంపుటాన్నిసంపాదక సభ్యులుగా వ్యవహరించారు. జనవరి 7, 1963న మరణించారు.
పాఠ్యభాగ సారాంశం
మన ఆటలు అన్న పాఠ్యభాగం “తెలుగు సంస్కృతి” విజ్ఞాన సర్వస్వ సంపుటం నుండి గ్రహించబడింది. తెలుగు సంస్కృతిలోని వివిధ రకాలైన ఆటలను, వేడుకల విశిష్టతలను ఈ వ్యాసంలో రచించారు. ప్రపంచీకరణ ప్రభావం వలన మన సమాజంలో సంస్కృతీ సంప్రదాయాలకు ప్రమాదం వాటిల్లుతుంది. ఈ నేపధ్యంలో తెలుగుజాతి పోగొట్టుకుంటున్న సాంస్కృతికతను విద్యార్థులకు తెలియజేయటం ఈ పాఠ్యభాగ ముఖ్య ఉద్దేశం.
మన ఆటలు : ఆంగ్లేయులకు క్రికెట్టు మొదలైన ఆటలు ఉన్నట్లు తెలుగువారికి, ప్రసిద్ధములైన జాతీయ క్రీడలు తక్కువ. మన ప్రబంధ సాహిత్యంలో బాలబాలికలు ఆడే ఆటలు ఎన్నో వర్ణింపబడ్డాయి. మన దేశంలోని బాల బాలికలు 7, 8 సంవత్సరాలు వచ్చేవరకు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఆడుకునేవారు. ఆంగ్ల విద్య ప్రారంభమైన కాలం నుండి బాలబాలికలు వేరు వేరు పాఠశాలలకు పోయి ఆటలకు దూరమయ్యారు. ఈ విద్య వలన ఆటలు, ఆచారాలు, సంప్రదాయాల పట్ల అభిరుచి తగ్గింది.
తెలుగు సాహిత్య ప్రక్రియలైన ప్రబంధములలో ఉన్న ఆటలు ఎలా ఆడాలో ఎవరికీ తెలియదు. ఆ ఆటల పేర్లను అయ్యలరాజు నారాయణామాత్యుడు తన ‘హంస వింశతి’. కావ్యంలో ప్రస్తావించారు. అందువలన ఆయా ఆటల పేర్లు మనకు తెలుస్తున్నాయి. వీటిలో కొన్ని ఇంటిలో ఆడేవి మరికొన్ని బయట ఆడేవి ఇంకొన్ని ఇంటాబయటా ఆడేవి ఉన్నాయి. అచ్చనగండ్ల వంటి ఆటలు బాలికల ఆటలు, కోతికొమ్మచ్చి బాలుర ఆటలు. ప్రాంతాలను బట్టి ఈ ఆటలు వేరు వేరు పేర్లతో పిలవబడుతుంటాయి.
తెలుగువారికి వ్యాయామ క్రీడలకు సాముగారిడీలకు గరిడీ శాలలుండేవి. వాటిలో మల్లవిద్య, కత్తిసాము, బాణవిద్య, లోడీలు తిప్పటం, దండెములు తీయుట చేసేవారు. మల్లవిద్యలో ప్రావీణ్యం సంపాదించినవారిని జ్యైష్ఠికులని అనేవారు. జెట్టి మల్లులుగా వీరిని గౌరవించేవారు. మల్లయుద్దం దక్షిణ హిందూదేశంలో విజయనగర సామ్రాజ్యము పతనమయ్యేంతవరకు ప్రాచుర్యంలో ఉండేది. మార్కోపోలో, డ్వార్తి బార్బసా మొదలగు యూరప్ వాసులు ఈ మల్లయుద్ధాన్ని తమ రచనలలో ప్రస్తావించారు.
ధనుర్విద్య, గుర్రపుస్వారీ, బాణవిద్య, కత్తిసాము ప్రజలందరూ కులమత భేదం లేకుండా నేర్చుకునేవారు. స్త్రీలు కూడా వీటిలో నైపుణ్యాన్ని సంపాదించారని విదేశీ యాత్రికుడు ‘పేయస్’ తన రచనలలో వ్రాశాడు. కాకతి రుద్రమదేవి, కోట గణపమ ” దేవిలు రాజ్యపాలన చేశారని వ్రాసాడు. గుర్రపు స్వారీలో రెడ్డిరాజైన వీరభద్రారెడ్డి సోదరుడు దొడ్డారెడ్డి ఉద్దండుడు.
తెలుగువారి జాతీయ క్రీడలు చిడుగుడు, ఉప్పనబట్లు, జూదము, మల్లవిద్య, విలు విద్య, గజ అశ్వ శిక్షణ మొదలగు విద్యలను పూర్వము అరవై నాలుగు కళలలో చేర్చారు. చదరంగం భారతీయుల జాతీయ క్రీడ. ప్రపంచానికి చదరంగం ఆటను అందించినది మనమే ! ఈ ఆట ఆ తరువాత పర్షియా, అరేబియా వంటి దేశాలకు వ్యాపించింది. పూర్వం ఈ విద్యను ఉన్నత కులముల వారు మాత్రమే ఆడేవారు. కృష్ణ దేవరాయలకు చదరంగం అంటే మహా ఇష్టం. ఆయన నిత్యం బొడ్డుచర్ల తిమ్మనతో చదరంగం ఆడి ఓడిపోయేవారట. ఈ ఆట ఆడి యుద్ధతంత్రములను కూడా రచించేవారట.
పూర్వం తెలుగువారి వేడుకలు వినోదములు ఎలా ఉండేవో ఆధారాలు కూడా దొరకటం లేదు. ప్రబంధములలో చెప్పబడిన వసంతోత్సవాలు, శరదోత్సవాలు వేడుకలుగా కనిపిస్తున్నాయి. ప్రతిగ్రామంలో, గ్రామ సామూహిక మాన్యములుండేవి. దానిపై వచ్చే ఆదాయంతో వసంతోత్సవాలలో, శరదోత్సవాలలో పాల్గొనే కళాకారులకు వినియోగించేవారు. భాగవత మేళములు, తోలుబొమ్మలాటలు వేడుకలుగా ఉండేవి. వసంతోత్సవములు, శరదోత్సవములతోపాటు మకర సంక్రమణము కూడా ఒక పండుగే! మకర సంక్రమణమంటే సంక్రాంతి.
తెలుగు దేశము వ్యవసాయ ప్రధానమైన దేశం అవటం చేత మేలుజాతి పశుసంపదను తయారుచేసేవారు. సంక్రాంతి, కనుమ పండుగనాడు పశుప్రదర్శన, ఎద్దుల పందాలు, కోడిపందాలు, పొట్టేళ్ళ పందాలు నిర్వహించేవారు. గ్రామాలలో గెలు పెద్దుల మాన్యములుండేవి. ఎడ్లపందాలలో ఏ ఎద్దు గెలుస్తుందో ఆ సంవత్సరమంతా ఆ భూమి ఆ ఎద్దు యజమాని ఆధీనంలో ఉంటుంది. ఇది ఈనాటి రోలింగ్ కప్ వంటిది.
సంక్రాంతినాడు జరిగే వేడుకలలో కోడిపందముల ఆట ఒకటి. కోడిపందాలు మన దేశంలో వేయి సంవత్సరాలకు పూర్వం నుండి వాడుకలో ఉన్న ఆట. ఇది దక్షిణ హిందూదేశములోనే కాక జావా, సుమిత్ర వంటి ప్రాంతాలలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కోడిపందాలు సంస్థానాధీశులకు చాలా ప్రియమైన వేడుక. పలనాటి యుద్ధము కోడిపందెముల కారణంగానే జరిగిందని చరిత్ర చెప్తుంది.
క్రీడాభిరామం, భోజరాజీయం మొదలగు గ్రంథములలో వృషభ, మేష, దున్నల, గజముల, పొట్టేళ్ళ పోరులు వర్ణించబడ్డాయి. కుంతలదేశాధిపతి అయిన భూలోక మల్ల సోమేశ్వరభూపతి తమ ‘మానసోల్లాస’ కావ్యమునందు ఒక ప్రకరణమంతా వీటిని గురించే వ్రాశాడు. వీటితోపాటుగా నాటి రాజుల ఆట వేట. ఈ వేటలో పాదివేట, లిడివేట, తెరవేట, దామెనవేట అను పలురకముల ఆటలున్నాయి. ప్రబంధములలోని అష్టాదశ వర్ణనలలో ‘వేట’ కూడా ఒకటి. ఇలా పూర్వకాలమున ఆటలు, వేడుకలు, వినోదాలు, పోటీలు, యుద్ధాలు ప్రజలకు వినోదాన్ని అందించేవని కవి పేర్కొన్నారు.
కఠిన పదాలకు అర్థాలు
సత్యదూరము కాదు = వాస్తవమే
అరుదు = తక్కువ
సన్నగిల్లినది = తగ్గిపోయింది
మూలబడినవి = మరుగున పడిపోయినవి
పురములు = పట్టణములు
ఎక్కట్లు = మల్లయోధులు (వీరులు)
చతుర్ధవర్ణము = శూద్రులు
జెట్టిమల్లులు = మల్లయుద్ధంలో ప్రావీణ్యులు
పారంగతులు = నేర్పరులు
వేకువజాము = తెల్లవారుజాము
చతుషష్టి కళలు = అరవై నాలుగు కళలు (64)
భూమీశులు = ప్రభువులు, రాజులు
అభినివేశము = ప్రవేశము
వర్తనలు / వతన = కళాకారులకిచ్చు వార్షిక బహుమానము
అన్యోన్యము = ఒకరికొకరు కలసిమెలసి
వృషభములు = ఎద్దులు
మాన్యము = వరి పండు పొలము
ఏకాంగవీరులు = బలిష్టులైన మల్లయుద్ధ వీరులు
మేషము = పొట్టేలు
భూనాథులు = రాజులు
ఆసామి = రైతు
నైపుణి = ప్రావీణ్యము
నిపుణులు = నైపుణ్యంగలవారు