Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material Intermediate 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ Questions and Answers.
AP Intermediate 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ
ఇచ్చిన గద్యాన్ని బాగా చదివి, అర్థం చేసుకొని, దానిలోని సారాంశాన్ని మూడో వంతుకు కుదించి రాస్తే దాన్ని ‘సంక్షిప్తీకరణ’ అంటారు. భాషా సామర్థ్యాలను పెంచే అంశాలలో ‘సంక్షిప్తీకరణ’ కూడా ఒకటి. భావ వ్యక్తీకరణలో అనవసరమైన మాటలకు తావులేకుండా, చెప్పవలసిన అంశాన్ని సూటిగా చెప్పడానికి ఈ సంక్షిప్తీకరణ తోడ్పడు తుంది. తక్కువ సమయంలో మొత్తం అంశం యొక్క సారాంశాన్ని చెప్పే నైపుణ్యం దీనివలన వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలలో ఈ సంక్షిప్తీకరణపై ప్రశ్న ఉంటుంది. దాన్ని విద్యార్థులకు పరిచయం చేయడానికి ఈ సంక్షిప్తీకరణ అంశం చేర్చడం జరిగింది.
సంక్షిప్తీకరణ చేసేటపుడు విద్యార్థులు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి :
- సంక్షిప్తీకరణ స్పష్టంగా ఉండాలి.
- ఇచ్చిన గద్యంలో కొన్ని పదాలను తొలగించి మిగిలిన పదాలను రాయడం – సంక్షిప్తీకరణ కాదు.
- వ్యర్థ పదాలను, పునరుక్తులను తొలగించాలి.
- అలంకారిక పదాలను, కొటేషన్లను పరిహరించాలి.
- విపరీత గణాంకాలకు చోటు లేకుండా చూసుకోవాలి.
- కీలక పదాలను దృష్టిలో పెట్టుకొని, గద్యంలోని సారాంశాన్ని మాత్రమే రాయాలి.
- వాస్తవ సమాచారాన్ని మాత్రమే రాయాలి.
- విద్యార్థి తన సొంత భావాలను చొప్పించడం చేయరాదు.
- సంక్షిప్తీకరణ చేసిన దానికి సంబంధించిన ఒక మంచి శీర్షికను ముందుగా రాయాలి.
ఉదాహరణ :
గోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణగానూ ప్రసిద్ధిగాంచిన వ్యక్తి డొక్కా సీతమ్మ. ఈమె తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో క్రీ.శ. 1841లో జన్మించింది. ఈమె తండ్రి అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. ఆ రోజుల్లో స్త్రీ విద్యకు అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈమె చదువుకోలేదు. గోదావరీ పరివాహక ప్రాంతంలోని లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న పంతులు అనే ధనవంతునితో సీతమ్మకు వివాహమైంది.
జోగన్న, సీతమ్మ గార్లది అన్యోన్య దాంపత్యం. శుచి, శుభ్రతలతో పాటు ఆప్యాయతాదరణలకు వారిల్లు పెట్టింది పేరు. ఎవరు ఏ వేళలో వచ్చి భోజనమడిగినా లేదనకుండా వండి వడ్డించిన అన్నపూర్ణ ఆమె. సీతమ్మ కేవలం అన్నదానమేకాదు, ఎన్నో పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు చేయూతనందించిన వితరణశీలి. డొక్కా సీతమ్మ కీర్తి ప్రతిష్ఠలు భారతదేశంలోనే కాక ఇంగ్లాండు దేశం వరకూ వ్యాపించాయి.
దీనికి సంక్షిప్తీకరణ :
శీర్షిక : అన్నదాత డొక్కా సీతమ్మ
సీతమ్మ తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట గ్రామంలో జన్మించింది. లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న అనే ధనవంతునితో సీతమ్మకు వివాహమైంది. ” ఎవరు, ఏవేళలో వచ్చినా లేదనకుండా’ వండి వడ్డించేది. ఈమె ఇంకా ఎన్నో శుభకార్యాలకు తోడ్పడింది. నిత్యాన్నదాతగా ప్రసిద్ధిగాంచిన డొక్కా సీతమ్మ ఖ్యాతి ఇంగ్లండు వరకూ వ్యాపించింది.
అభ్యాసం
ప్రశ్న 1.
భారత జాతికి జీవగడ్డలైన
రామాయణ, మహాభారతాలలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. మెగస్తనీసు, మార్కోపోలో, పేయస్ వంటి అనేక మంది విదేశీయాత్రికులు తెలుగువారి గొప్పదనాన్ని ప్రశంసించారు. ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి తెలుగు రాజులు శాతవాహనులు. వీరి తరువాత ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహీలు, నిజాం పాలకులు వరుసగా తెలుగుదేశాన్ని పాలించారు. రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలు వంటి గొప్ప పాలకులు ; నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, వేమన లాంటి కవులు ఆంధ్రదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి మహనీయ సంగీతజ్ఞులు తెలుగువారి సొత్తు. గోదావరి, కృష్ణా వంటి గొప్ప జీవనదులతో, సారవంతమైన భూములతో పునీతమైన తెలుగు నేలలో జన్మించడం మన అదృష్టం.
జవాబు:
ఆంధ్రుల యొక్క ప్రశస్తి భారత, రామాయణ కావ్యాలలో ఉంది. మన గొప్పతనాన్ని విదేశీయులైన మెగస్తనీస్, పేయస్ వంటి వారు మెచ్చుకున్నారు. తెలుగు నేలను శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు మొదలగువారు పాలించారు. రాణి రుద్రమదేవి, కృష్ణదేవరాయలు వంటి పాలకులు నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతనలాంటి కవులు మనకున్నారు. అన్నమయ్య, త్యాగయ్య వంటి సంగీత విద్వాంసులున్నారు. జీవనదులైన కృష్ణా, గోదావరులు మన నేలను పునీతం చేస్తున్నాయి. ఈ నేలపై పుట్టటం మన అదృష్టం.
ప్రశ్న 2.
ఆదిమ కాలం నుంచి తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూ, కొండకోనల్లో, అడవుల్లో నివసిస్తూ ఆదిమ సంస్కృతిని పాటించేవారు గిరిజనులు. గోండులు, కోయలు, సవరలు, జాతాపులు, చెంచులు, తొదలు, భగతలు మొదలైన వారు మన దేశంలో నివసిస్తున్న కొన్ని గిరిజన సమూహాలు. గిరులపై జీవిస్తున్నందు వల్ల వీరిని గిరిజనులు అని పిలుస్తారు. వీరిని హిందీలో ‘ఆదివాసి’ లేదా ‘జన్ జాతి’ అనీ, ఆంగ్లంలో ‘టైబ్’ అని పిలుస్తారు. సాధారణంగా వీరు నాగరికులకు దూరంగా నివసిస్తుంటారు. లిపిలేని భాషను మాట్లాడుతారు. వీరు పోడు వ్యవసాయం చేస్తూ, అటవీ ఉత్పత్తుల్ని సేకరించి జీవనాన్ని సాగిస్తారు. ఆదివాసీల జీవితంలో మరొక ప్రధాన వృత్తి వేట. గిరిజనుల జీవన విధానంలో నమ్మకాలు, జంతుబలులు ప్రధానపాత్ర వహిస్తాయి. ఆటలు, పాటలు, సామూహిక వృత్యాలు వీరి జీవితంలో ఒక భాగం.
జవాబు:
కొండకోనల్లో, అడవుల్లో నివసిస్తూ తమ సంస్కృతిని రక్షించుకునేవారు గిరిజనులు. గోండులు, కోయలు, సవరలు మొదలగు గిరిజన సమూహాలవారు మనదేశంలో ఉన్నారు. కొండలపై నివసించటం చేత గిరిజనులన్నారు. వీరిని హిందీలో ఆదివాసి, ఆంగ్లంలో ‘ట్రైబ్స్’ అని పిలుస్తారు. నాగరికులకు దూరంగా ఉండి లిపి లేని భాషను మాట్లాడతారు. వీరి ప్రధాన వృత్తి వేట. పోడు వ్యవసాయం చేస్తుంటారు. వీరి జీవనంలో జంతుబలులు ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఆటలు ‘పాటలు’ సామూహిక నృత్యాలు వీరికి తెలుసు.
ప్రశ్న 3.
రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా, నైతికంగా అణచివేతకు గురయింది స్త్రీ. మహిళల ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని సాహిత్యం ద్వారా అక్షరీకరిస్తే దాన్ని ‘స్త్రీవాద సాహిత్యం ‘ అంటారు. తమ తల్లిదండ్రులే తమను చిన్న చూపు చూడటం, సోదరులు తమ మీద పెత్తనం చెలాయించడం, సమాజం విధించే ఆంక్షలు, అత్త వారింటికి పంపాలనే తల్లిదండ్రుల ఆరాటం, అత్తింట్లో అవమానాలు, ఇంటి చాకిరీ, పిల్లల ఆలనా పాలనా, భర్త వేధింపులు, అత్తమామల సాధింపులు, ఆడబిడ్డల ఆరళ్ళు; చివరకు తమ పిల్లలు కూడా తమను పనికి రాని వారిగా జమకట్టడం స్త్రీల జీవితాన్ని దుర్భరం చేశాయి. మన దేశంలో ఆంగ్లేయుల పాలన వల్ల వచ్చిన కొన్ని పరిణామాలు, కొంతమంది భారతీయ సంఘసంస్కర్తల కృషి వల్ల భారతీయ మహిళల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కోగల స్టైర్యం, పురుషాధిపత్య భావజాలాన్ని ధిక్కరించే ధైర్యం స్త్రీలకు కొంత అలవడింది.
జవాబు:
సమాజంలో స్త్రీ అణచివేతకు గురి అయింది. స్త్రీల ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని సాహిత్యం ద్వారా చెస్తే దానిని స్త్రీవాద సాహిత్యమంటారు. తల్లిదండ్రుల, సోదరుల, అత్తమామల, భర్త, చివరకు తమకు పుట్టిన సంతానం కూడా వారిని పనికిరాని వారిగా చూస్తుంది. విదేశీ పాలన వల్ల, సంఘసంస్కర్తల కృషి వలన మహిళల ఆలోచనల్లో మార్పు వచ్చింది. తమ సమస్యలను తామే పరిష్కరించుకొని పురుషాధిక్యాన్ని ఎదుర్కొనే ధైర్యం నేర్చుకున్నారు.
ప్రశ్న 4.
భారతదేశం అణ్వస్త్ర దేశంగా ఎదగడానికి మూలకారకుడు డా|| ఎ.పి.జె. అబ్దుల్ కలామ్. భారతరత్నగా, భారత క్షిపణి పితామహుడుగా, దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన అబ్దుల్ కలామ్. విద్యార్థి దశలో సగటు విద్యార్థి. మంచి అలవాట్లతో, కచ్చితమైన క్రమశిక్షణను పాటించడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు. తల్లిదండ్రులనే కాక, స్త్రీలను, గురువులను ఇతర . పెద్దలను గౌరవించాడు. తాను ముస్లిం మతానికి చెందిన వాడైనా హిందూ, క్రైస్తవ, సిక్కు వంటి సర్వమతాలను ఆదరించిన లౌకికవాది. పుస్తకాలను అమితంగా ఇష్టపడే అబ్దుల్ కలామ్ ఎన్నో గ్రంథాలను రచించాడు. ప్రతి విద్యార్థి కలలు కని, వాటిని సాకారం’ చేసుకోవాలని; చిన్న చిన్న లక్ష్యాలు నేరమని విద్యార్థులకు సందేశమిచ్చాడు. వీరి జన్మదినమైన అక్టోబరు 15వ తేదీని ‘ప్రపంచ విద్యార్థుల దినోత్సవం’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
జవాబు:
డా|| ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత క్షిపణి పితామహుడు. మనదేశం ‘అణ్వస్త్ర దేశంగా ఎదగటానికి ఆయనే కారకుడు. రాష్ట్రపతిగా దేశ విలువలను’ కాపాడారు. మంచి అలవాట్లతో క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. గౌరవం ఇచ్చి. పుచ్చుకోవటం తెలిసివారు. గొప్ప లౌకికవాది. ఆయనకు పుస్తకమంటే ఇష్టం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు కలాం. వీరి జన్మదినం అక్టోబరు 15, ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
ప్రశ్న 5.
ఆధునిక ప్రపంచంలో చాలా దేశాలు ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల నిర్వహణ అత్యంత ఆవశ్యకం. ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి కావలసిన హక్కును ప్రతి ప్రజాస్వామ్య దేశం తన పౌరులకు కల్పిస్తున్నది. ఈ హక్కునే ‘ఓటు హక్కు’ అంటారు. మన దేశంలో ఓటు హక్కు పొందడానికి కావలసిన కనీస వయస్సు 18 సం.లు. మద్యము, కులము, మతము, ప్రాంతము వంటి వైయక్తిక అంశాలకూ; డబ్బు, బహుమానాలు లాంటి ఎన్నికల తాయిలాలకు లొంగిపోయి తన ఓటును అమ్ముకోకూడదు. సమర్థుడు, నీతిమంతుడు, కుల మతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉన్న అభ్యర్థిని గెలిపించడానికి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలి. ఒకవేళ అభ్యర్థు లెవరూ నచ్చకపోతే ‘నోటా’ మీటను నొక్కి రావాలి. అంతేగాని ఎన్నికల ప్రక్రియకు మన దేశ పౌరులు దూరంగా ఉండరాదు.
జవాబు:
నేడు ప్రపంచంలో చాలా దేశాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఇష్టపడుతున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్య మనుగడకు కీలకం. ప్రజాస్వామ్యంలో పాలకులను ఎన్నుకోవటానికి ఓటు హక్కును కల్పించింది. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు. వేసే హక్కు ఉంటుంది. కుల, మత, ప్రాంత, డబ్బు, బహుమతులను లెక్కచేయకుండా ఓటు వెయ్యాలి. నీతిమంతుడిని అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిని, సమర్ధుణ్ణి ఎన్నుకోవాలి. అలాంటివారు లేకపోతే ఓటు వేసేటప్పుడు ‘నోటా’ మీటను నొక్కాలేగాని ఎన్నికలను బహిష్కరించరాదు.