Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material పద్య భాగం 5th Poem చేయెత్తి జైకొట్టు తెలుగోడా! Textbook Questions and Answers, Summary.
AP Inter 1st Year Telugu Study Material 5th Poem చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న పూర్వపు తెలుగోడి వైభవాన్ని వివరించండి.
జవాబు:
మహోన్నతమైన చరిత్ర గల తెలుగోడా ! నీ జాతి ఔన్నత్యానికి చేయెత్తి జైకొట్టు. సమవుజ్జీయే లేని జాతి, జయించడానికి సాధ్యం కాని కోటలు కలిగి ఓటమిని . అంగీకరించని జాతి నేడు తన పూర్వీకుల పౌరుషాన్ని, శౌర్యాన్ని మరచిపోయి నివురుగప్పిన నిప్పులాగా నిద్రాణ స్థితిలో ఉంది. అట్టి జాతిని తట్టి లేపగల ఘనచరిత్ర గలిగిన తెలుగోడా.
మన వీరుల రక్తపు ధారలు కొరత లేకుండా మాతృభూమికి అర్పించిన పలనాడు, వెలనాడు ప్రాంతాలు నీవే కదా. ఆ త్యాగస్ఫూర్తి, ఆ వీరత్వానికి నీవే కదా వారసుడివి. మహాభారత యుద్ధంలోని అభిమన్యుని గుర్తుకు తెచ్చిన పలనాటి వీరుడు బాలచంద్రుడు ఎవరివాడు ? నీవాడే. బొబ్బిలి శౌర్య ధైర్యాలకు ప్రతీక తాండ్రపాపారాయుడు నీవాడే.
” వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పేరొందిన అపర చాణక్య మేధాసంపన్నత గల నాయకురాలు నాగమ్మ. బొబ్బిలి కోట పతనమయ్యాక శత్రువుల బారినుంచి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి బొబ్బిలి పాలకుడు రాజారంగారావు ధర్మపత్ని, వీరతాండ్రపాపారాయుడి సోదరి అయిన రాణి మల్లమ్మ చేసిన అపూర్వ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
తన కవితా ప్రావీణ్యంతో రామాయణాన్ని రచించి ప్రసిద్ధి చెందిన కవయిత్రి మొల్ల యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసి కూడా తన భర్త బాలచంద్రుని ఎంతో గుండెదిటవుతో యుద్ధరంగానికి పంపి అజరామర కీర్తిని ఆర్జించిన మగువ మాంచాల వీరంతా నీ తోడపుట్టిన సోదర, సోదరీమణులే కదా. ఈ తెలుగు నేల ఎందరో వీరనారీమణులకు కన్నతల్లి. ఎందరో వీరులను కన్న మాతృమూర్తులకు జనని ఈ తెలుగుతల్లి.
గతకాలాలలోని మన ధైర్య, శౌర్య పరాక్రమాలను కథలు, కథలుగా చెప్పారు. మన పూర్వకులలోని ఆ సత్తువ ఎక్కడ దాచావు తెలుగోడా ? ఈ భారత భూమిలో మన ఉనికే లేకపోయింది. అనగా ఒక ప్రత్యేక జాతిగా మన అస్తిత్వాన్నే కోల్పోయాము. ఘనచరిత్ర గల ఆంధ్రులు నేడు బ్రతుకే ఎంతో భారంగా గడుపుతున్నాడు. వంద రకాలుగా పోరాడైనా సరే అన్ని రంగాలలో మొదటి స్థానంలో మనం నిలవాలి.
ఎన్నో చారిత్రక విషయాలు తెలియజెప్పే నాగార్జున కొండ, అమరావతీ స్థూపాలపై ఉన్నా శిల్పాలలో సజీవ చైతన్యం నింపావు. అవి శిల్పాలా సజీవ మూర్తులా అన్నట్లుగా మలచిన ఘనఖ్యాతి మనది. మేమెవరికీ తక్కువకాము. అని మన ఆంధ్ర శిల్పులు తమ ఖ్యాతిని చాటారు. ఇది కదా శిల్పకళ అని దేశదేశాలవారు మన శిల్పకళా సంపదను ప్రస్తుతించారు. లండన్ మ్యూజియానికి తరలించబడిన అమరావతీ శిల్పాలు మన ఆంధ్రుల శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి.
రాజ్యం వీరులు పౌరుష, పరాక్రమాలతో సంపాదించుకునేది అని చాటి చెప్పిన తిక్కన మహాకవి వాక్కు. సదా ఆచరణీయం. మన పూర్వీకుల పరాక్రమ గాధలను తెలుసుకుని, ఆ స్ఫూర్తితో అభివృద్ధి పథంలోకి సాగాలి.
ప్రశ్న 2.
వేములపల్లి శ్రీకృష్ణ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలన్నాడు ?
జవాబు:
విజయనగర రాజులు పాలించిన రతనాలకు నిలయమైన ఈ రాయలసీమ ప్రాంతంపై కక్షగట్టిన శత్రువులు కత్తి దూస్తున్నారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించరా సీమకు చెందినోడా, నాటి రాయల పాలనా కాలంలోని వైభవాన్ని తిరిగి సాధించడానికి అంకితమవుదాం. తన ప్రవాహంతో ఎగిసిపడే గౌతమీగోదావరితల్లి, వరదలతో ఉప్పొంగే కృష్ణవేణమ్మ, తుంగభద్రా తల్లి పొంగి ప్రవహిస్తే చాలు. ధాన్యరాసులు పండే ఈ ప్రాంతాలలో కూడు, గుడ్డకు కొరత ఉండదు.
నీ తెలుగు ప్రాంతము బంగారపు నిధులతో ఉన్నటువంటి వెలకట్టలేని దేశం, ఇతరులకు ఆ సిరిసంపదలపై దురాశ కలిగింది. తెలుగు జాతిలో అంతర్విభేదాలు సృష్టించి, చివరకు నిన్నే మోసం చేసారు. నీ దేశంలోని సిరిసంపదలు దోచుకుపోయారయ్యా తెలుగోడా. ఆ మోసాన్ని గ్రహించి రాష్ట్రాన్ని ఇప్పటికైనా మనం కాపాడుకోవాలి.
తెలుగువారి మధ్య ప్రాంత భేదభావాలు పోయి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు గల తెలుగు ప్రాంతమంతా తెలంగాణా ప్రాంతముతో స్నేహం చేయాలి. అందరమూ కలిసిమెలిసి ముందుకు పోతే మనలను ఎవరూ జయించలేరు. అందరమూ కలిసి సంపదలు పెంచుకుని శక్తిమంతులమవ్వాలి.
మూడుకోట్లకు పైగా పరిజనం కలిగిన బలం మనది. మనందరం కలిసి ఉంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో మనకి గౌరవం, పేరుప్రతిష్ఠలు ఉంటాయి. ఓ తెలుగు బిడ్డ మనందరికీ తల్లి ఒకటే. మనం తెలుగుజాతి వారము సవతితల్లి బిడ్డల్లా మనలో మనకు ఈ కలహములు మంచిది కాదు. అభివృద్ధి నిరోధకము.
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రమనే హోరుగాలి ఉధృతంగా వచ్చింది. క్రమంగా ఆ హోరు తగ్గిపోయింది. ఉద్యమం నీరసించింది. తెలుగుజాతి అనే నావ కష్టాలు అనే సముద్రం మధ్యన దిశానిర్దేశం చేసేవారు లేక నిలుచుండిపోయింది. ఆ ఉద్యమం అనే నావ చుక్కాని బట్టి ఒడ్డుకు చేర్చరా మొనగాడా, తెలుగు వీరుడా.
ఈ విధంగా మనం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలని కవి ఆకాంక్షించాడు.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వేములపల్లి పేర్కొన్న వీరత్వాన్ని తెలుపండి.
జవాబు:
మహాభారత యుద్ధంలోని అభిమన్యుని గుర్తుకు తెచ్చిన పలనాటి వీరుడు బాలచంద్రుడు ఎవరివాడు ? నీవాడే. బొబ్బిలి శౌర్య, ధైర్యాలకు ప్రతీక తాండ్రపాపారాయుడు నీవాడే. వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పేరొందిన అపర చాణక్య మేధా సంపన్నత గల నాయకురాలు నాగమ్మ. బొబ్బిలికోట పతనమయ్యాక శత్రువుల బారినుంచి తను ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన బొబ్బిలి పాలకుడి ధర్మపత్ని వీరతాండ్రపాపారాయుడి సోదరి అయిన రాణి మల్లమ్మ చేసిన అపూర్వ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తి.
రామాయణాన్ని రచించిన కవయిత్రి మొల్ల, యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసికూడా తన భర్త బాలచంద్రుని ఎంతో గుండేదిటవుతో యుద్ధరంగానికి పంపి అజరామర కీర్తిని ఆర్జించిన మగువ మాంచాల. వీరంతా మన తోడబుట్టిన వీర సోదర, సోదరీమణులు వీరి పరాక్రమ గాధలను కథలు కథలుగా చెప్పారు.
ప్రశ్న 2.
ఐకమత్యాన్ని ఏవిధంగా సాధించాలని వేములపల్లి కోరాడు ?
జవాబు:
తెలుగు వారి మధ్య ప్రాంతీయ భేదభావాలు పోయి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు గల తెలుగు ప్రాంతమంతా తెలంగాణా ప్రాంతంతో స్నేహం చేయాలి. అందరమూ కలిసిమెలిసి ముందుకు పోతే మన తెలుగు వారిని ఎవరూ జయించలేరు. అందరమూ కలిసి సంపదలు పెంచుకుని శక్తిమంతులం కావాలి అన్నాడు. దీనిని తెలుగు ప్రాంతాల మధ్య పరస్పర ప్రేమ, అభిమానం, స్నేహ భావాలతోనే సాధించగలుగుతాము.
ప్రశ్న 3.
వేములపల్లి శ్రీకృష్ణ సాహిత్య, రాజకీయ జీవితాన్ని సంగ్రహంగా తెలపండి.
జవాబు:
వేములపల్లి శ్రీకృష్ణ గిరీశం, సాక్షి అనే కలం పేర్లతో కాగడా, నగారా పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’, జాయేంగే కయ్యూరు’, ‘చెంచుపాట’, ‘రెడ్ ఆర్మీ’, ‘రండీ దేశ సేవకు’, ‘అన్నాచెల్లెలు’, ‘రావోయి’ అనే గీతాలు శ్రీకృష్ణ రచించారు. ఇవన్నీ అరుణ గీతాలు అనే సంకలనంలో ఉన్నాయి.
వీరు బాపట్ల (1952), మంగళగిరి (1962, 1972) నియోజక వర్గాల నుండి మూడుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. సమర్దుడైన ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు.
ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
విశాలాంధ్ర ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చిన గేయం ఏది ?
జవాబు:
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
ప్రశ్న 2.
వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న అమరకవి ఎవరు.?
జవాబు:
గురజాడ అప్పారావు
ప్రశ్న 3.
చేయెత్తి జైకొట్టు తెలుగోడా గేయం ఏ చిత్రంలో ఉంది ?
జవాబు:
1952లో విడుదలైన ‘పల్లెటూరు’ చిత్రంలో ఉంది.
సందర్భ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
ధీరమాతల జన్మభూమేరా.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం :
కవి ఆంధ్రుల వీరత్వాన్ని, శౌర్య ప్రతాపాలను గురించి వర్ణిస్తున్న సందర్భంలోనిది.
అర్థం :
వీరులను కన్న వీరమాతలకు జన్మభూమి ఈ తెలుగుతల్లి.
భావం :
వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పొందిన అపరచాణక్య మేధాసంపన్నత గల నాయకురాలు నాగమ్మ, బొబ్బిలి యుద్ధంలో ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన రాణీ మల్లమ్మ, యుద్ధానికి వెళ్లే తిరిగిరాడని తెలిసి కూడా భర్తను ధైర్యంగా పంపిన మగువ మాంచాలా ఇలా ఎందరో వీరవనితలకు, బాలచంద్రుడు, తాండ్రపాపారాయుడు ఇలా ఎందరో వీరులను కన్న తల్లులకు ఈ తల్లి పుట్టినిల్లు.
ప్రశ్న 2.
కార్యశూరులు నేడు కావాలోయ్.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం :
తెలుగువారు అభివృద్ధి పధంలోకి పయనించాలి అని చెప్పే సందర్భంలోనిది.
అర్థం :
కార్యసాధకులు నేటి కాలానికి అవసరం.
భావము :
రాజ్యం వీరులు పరాక్రమంతో సంపాదించుకునేది అని చెప్పిన మహాకవి తిక్కన వాక్కులు వీరులకు మార్గంవంటిది. మన పూర్వీకుల పరాక్రమాన్ని తెలుసుకుని ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలి. నేడు మనకి వట్టి మాటలు చెప్పేవారు కాకుండా పనిచేసి చూపే కార్యసాధకులు కావాలి అని భావం.
ప్రశ్న 3.
మోసాన్ని గుర్తెరిగి కాపాడోయ్.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం :
తెలుగు జాతికి పరులతో జరుగుతున్న అన్యాయాన్ని గురించి కవి తెలుపుతున్న సందర్భంలోనిది.
అర్థం :
మోసాన్ని గుర్తించి కాపాడవయ్యా.
భావము :
మన తెలుగు ప్రాంతం బంగారపు నిధులతో ఉన్నటువంటి వెలకట్టలేని దేశం. ఇతరులకు ఆ సిరిసంపదలపై దురాశ కలిగింది. తెలుగు జాతిలో అంతర్విభేదాలు సృష్టించి, చివరకు నిన్నే మోసం చేసారు. నీ దేశంలోని సిరిసంపదలు దోచుకుని పోయారయ్యా. ఆ మోసాన్ని గుర్తించి రాష్ట్రాన్ని ఇప్పటికైనా మనం కాపాడుకోవాలి.
ప్రశ్న 4.
సవతి బిడ్డల పోరు మనకేలా.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం :
తెలుగు ప్రాంతాల మధ్య ఐకమత్యం ఉంటే అభివృద్ధి సాధిస్తామని, మనలో మనకు గొడవలేమిటని చెప్పిన సందర్భంలోనిది.
అర్థం :
సవతి తల్లి బిడ్డలలా ఈ గొడవలు మనకెందుకు.
భావము :
మూడుకోట్లకు పైగా పరిజనం కలిగిన బలం మనది. మనందరం కలిసి ఉంటే చుట్టుపక్కల రాష్ట్రాలలో మనకు గౌరవం, పేరు, ప్రతిష్ఠలు ఉంటాయి. ఓ తెలుగోడా మనందరికీ తల్లి ఒక్కటే. మనము తెలుగుజాతి వారము. సవతి తల్లి బిడ్డల్లా మనలో మనకు ఈ కలహములు మంచిది కాదు. అభివృద్ధి నిరోధకము అని భావము.
సంధులు
1. ఉకార సంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
- గతమెంతో = గతము + ఎంతో : ఉకార సంధి.
- నోరెత్తి – నోరు . + ఎత్తి : ఉకార సంధి.
- వారసుడవీవు = వారసుడవు + ఈవు = ఉకార సంధి.
2. గసడదవాదేశ సంధి సూత్రం :
ప్రధమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు.
- అల్లి సెప్పారు : అల్లి + చెప్పారు = గసడదవాదేశ సంధి.
3. సరళాదేశ సంధి సూత్రం :
- ద్రుతము మీది పరుషములకు సరళములగు.
- ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు, సంశ్లేషలు విభాషనగు.
- తోడఁబుట్టిన = తోడన్ + పుట్టిన = సరళాదేశ సంధి.
సమాసాలు
1. ఘనకీర్తి – ఘనమైన కీర్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
2. ముక్కోటి – మూడు అనే సంఖ్య గల కోటి – ద్విగు సమాసం.
3. తుంగభద్రానది – తుంగభద్ర అనే పేరుగల నది – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం.
4. కార్యశూరులు – కార్యమునందు శూరులు – సప్తమీ తత్పురుష సమాసం.
5. పెనుగాలి – పెద్దదైన గాలి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
విశేషాంశం
ముక్కోటి : ఇటీవల కాలంలో ఈ గేయాన్ని గానం చేస్తున్నవారంతా ‘ఆరు కోట్లు’ అని ఆలపిస్తున్నారు. ఈ గేయం 1940 దశకంలో రాయబడింది. అప్పటికి ఆంధ్రుల జన సంఖ్య మూడు కోట్లుగానే పరిగణించబడేది. కవి కూడా ‘ముక్కోటి ఆంధ్రులు’ అనే ప్రయోగించారు. సినిమా కోసం పాడిన ఘంటసాల గొంతులోనూ ‘ముక్కోటి’ అనే వినగలం. ఈనాటి ఆంధ్రుల జనాభా ప్రకారం ‘ఆరు కోట్లు’ కూడా తప్పవుతుంది. కాబట్టి రచనాకాలాన్ని స్పష్టపరిచే, కవి ప్రయోగమే పాఠంలో స్వీకరించబడింది.
పద్యాలు – ప్రతి పదార్థం – భావం
పల్లవి : చేయెత్తి జైకొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి కలవాడా
ప్రతిపదార్థం :
గతము = చరిత్ర
ఘనకీర్తి = గొప్ప పేరు ప్రతిష్ఠలు
భావము :
మహోన్నతమైన చరిత్ర గల తెలుగోడా, నా జాతి ఔన్నత్యానికి చేయెత్తి జై కొట్టు.
ప్రశ్న 1.
సాటిలేనిజాతి
ఓటమెరుగని కోట
నివురుగప్పీ నేడు
నిదురపోతుండాది
జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి కలవాడా
జవాబు:
ప్రతిపదార్థం :
సాటి = సమవుజ్జీ
నివురుగప్పుట = నిప్పుకణిక మీద కమ్మే బూడిదపొర
మేల్కొలుపు = నిద్రిస్తున్న జాతిని తట్టి లేపుట
భావం :
సమవుజ్జీయే లేని జాతి, జయించడానికి సాధ్యంకాని కోటలు కలిగి, ఓటమిని అంగీకరించని జాతి నేడు తన పూర్వీకుల పౌరుషాన్ని, శౌర్యాన్ని మరచిపోయి నివురుగప్పిన నిప్పులాగా నిద్రాణ స్థితిలో ఉంది. అట్టి జాతిని తట్టి లేపు ఓ ఘనచరిత్ర గలిగిన తెలుగోడా !
ప్రశ్న 2.
వీర రక్తపు ధార
వీరపోసిన సీమ
పలనాడు నీదేరా
వెలనాడు నాదెరా
బాలచంద్రుడు చూడ ఎవరో డోయ్
తాండ్రపాపయ కూడ నీవోడోయ్
జవాబు:
ప్రతిపదార్థం :
వీరరక్తం = ఆంధ్రుల శౌర్య ప్రతాపాలు
ధార = ప్రవాహం
వార = కొరత లేకుండా
పలనాడు = మాచర్ల, గురజాల, కారంపూడి ప్రాంతాలు
వెలనాడు = కృష్ణ, గుంటూరు జిల్లాలోని తీరప్రాంతం
బాలచంద్రుడు = బ్రహ్మనాయుడి కుమారుడు
తాండ్రపాపారాయుడు = బొబ్బిలి వీరుడు
ఎవరో డోయ్ = ఎవరివాడు
తోడబుట్టిన వారు = సోదరులు
భావం :
మన వీరుల రక్తపు ధారలను శౌర్య పరాక్రమాలతో కొరత లేకుండా మాతృభూమికి అర్పించిన పలనాడు, వెలనాడు ప్రాంతాలు నీవే కదా. ఆ త్యాగస్ఫూర్తి, . ఆ వీరత్వానికి నీవే కదా వారసుడివి. మహాభారత యుద్ధంలోని అభిమన్యుని గుర్తుకు తెచ్చిన పలనాటి వీరుడు బాలచంద్రుడు ఎవరివాడు. నీవాడే, బొబ్బిలి శౌర్య ధైర్యాలకు ప్రతీక తాండ్రపాపారాయుడు కూడా నీవోడేనోయే.
ప్రశ్న 3.
నాయకీ నాగమ్మ
మల్లమాంబా మొల్ల
మగువమాంబాల నీ
తోడ బుట్టిన వాళ్లే
వీరవనితల గన్న తల్లేరా
ధీర మాతల జన్మభూమేరా
జవాబు:
ప్రతిపదార్థం :
నాయకీ నాగమ్మ = నాయకురాలు నాగమ్మ
మల్లమ్మ = బొబ్బిలి రంగారావు భార్య, తాండ్రపాపారాయుడి చెల్లెలు
మగువమాంబాల = బాలచంద్రుడి భార్య
వీరవనితలు = వీరనారీమణులు
ధీరమాతలు = వీరులను కన్న తల్లులు.
భావం :
వితంతువైనా స్వశక్తితో ఎదిగి పలనాటి నలగామరాజుకి మంత్రిగా పేరొందిన అపరచాణక్య మేధా సంపన్నత గల నాయకురాలు నాగమ్మ, బొబ్బిలికోట పతనమయ్యాక శత్రువుల నుంచి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి బొబ్బిలి పాలకుడు రంగారావు ధర్మపత్ని, తాండ్రపాపారాయుడి సోదరి రాణి మల్లమ్మ చేసిన అపూర్వ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
తన కవితా ప్రావణ్యంతో రామాయణాన్ని రచించి ప్రసిద్ధి చెందిన కవయిత్రి మొల్ల, యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసి కూడా తన భర్త బాలచంద్రుని ఎంతో గుండెదిటవుతో యుద్ధరంగానికి పంపి అజరామర కీర్తిని ఆర్జించిన మగువ మాంచాల వీరంతో నీతోడ పుట్టిన సోదర, సోదరమణులే కదా. వీర నారీమణులని, వీరులను కన్న తల్లుల జనని ఈ తెలుగుతల్లి.
ప్రశ్న 4.
గతములో నీ కీర్తి
కతలల్లి సెప్పారు
షసయేడ దాచావు
వుసిలేక పోయెరా
బ్రతుకే బరువై యుంటివీనాడు
శతపోరి సాధించు తొలిపేరూ
జవాబు:
ప్రతిపదార్థము :
కతలల్లి = కథలు కథలుగా
పస= సత్తువ
వుసి = ఉనికి
శతపోరి = వంద రకాలుగా పోరాడి
భావం :
గత కాలంలోని మన ధైర్య, శౌర్య, పరాక్రమాలను కథలు కథలుగా చెప్పారు. మన పూర్వీకులలోని ఆ సత్తువ ఎక్కడ దాచావు. ఈ భారత భూమిలో మన ఉనికే లేకపోయింది. ఒక ప్రత్యేక జాతిగా మన అస్తిత్వాన్నే కోల్పోయాము. ఇంతటి ఘనచరిత్ర గల ఆంధ్రులు నేడు బతుకే ఎంతో భారంగా గడుపుతున్నాడు. వంద రకాలుగా పోరాడైనా సరే మొదటి స్థానంలో మనం నిలవాలి.
ప్రశ్న 5.
నాగార్జుముని కొండ.
అమరావతీ స్థూప కలు
భావాల పుట్టలో
జీవకళ పొడిగావు
అల్పుదను కానంచు అల్పుడు
శిల్పివంటిరి దేశదేంగా
జవాబు:
ప్రతిపదార్థం :
నాగార్జునుని కొండ = నాగార్జున సాగర్ వద్ద ఉన్నా ఆచార్య నాగార్జునుని పేరుతో గల కొండ
అమరావతీ స్థూపం = ప్రఖ్యాత బౌద్ధ స్థూపం
భావాల పుట్ట = వ్యక్తమయ్యే విశేషాలకు నెలవు (శిల్పాలను గురించి)
జీవకళ = సజీవ చైతన్యం
పొదుగుట = పరివేష్టించుట / ఉంచుట
అల్పుడు = హీనుడు
భావము :
ఎన్నో విషయాలు తెలియజేసే నాగార్జునకొండ, అమరావతీ స్థూపాలపై ఉన్న శిల్పాలలో సజీవ చైతన్యం నింపావు. అవి శిల్పాలా సజీవ మూర్తులా అన్నట్లుగా మలచిన ఘనఖ్యాతి మనది. మేమెవరికీ తక్కువ కాము అని మన ఆంధ్ర శిల్పులు తమ ఖ్యాతిని చాటారు. ఇది కదా శిల్పకళ అని. దేశదేశాలవారు మన శిల్పకళను ప్రస్తుతించారు. లండన్ మ్యూజియంలో తరలించబడిన అమరావతీ శిల్పాలు మన ఆంధ్రుల శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి.
ప్రశ్న 6.
రాజ్యమంటే వీర
భోజ్యమన్నాడు మన
తిక్క నార్యుని మాట
ధీరులకు బాటరా
పూర్వ పౌరుష మెరిగి బ్రతకాలోయ్
కార్యశూరులు నేడు కావాలోయ్.
జవాబు:
ప్రతిపదార్థం :
తిక్కన = మహాకవి తిక్కన
ఆర్యుడు = శ్రేష్ఠుడు
ధీరులు = వీరులు
బాట = రహదారి
పౌరుషం = పరాక్రమం
ఎరిగి = తెలుసుకుని
కార్యశూరులు = పనిచేయగలిగిన వారు
భావం :
రాజ్యం వీరులు పరాక్రమంతో సంపాదించుకునేది అని చాటి చెప్పిన మహాకవి తిక్కన వాక్కులు వీరులకు మార్గం వంటిది. మన పూర్వీకుల పరాక్రమాన్ని తెలుసుకుని, ఆ స్ఫూర్తితో అభివృద్ధి పథంలోకి సాగాలి. నేడు మనకు వట్టి మాటలు చెప్పేవారు కాకుండా పనిచేసి చూపే కార్యసాధకులు కావాలి.
ప్రశ్న 7.
దేశమంటే వట్టి
మట్టి కాదన్నాడు
మనుషులన్నా మాట
మరువబోకన్నాడు.
అమరకవి గురజాడ నీవోడూ
ప్రజల కవితను బాడి చూపేడోయ్.
జవాబు:
ప్రతిపదార్థం :
అమరకవి = దేవకవి
భావం :
దేశమంటే కేవలం మట్టి కాదని దేశమంటే మనుషులని పేర్కొన్న దేవకవి గురజాడ అప్పారావు నీవోడు. ప్రజల కవిత్వాన్ని పాడి చూపాడు. అతని మాటను మరువకుండా నిరంతరం స్మరించాలి.
ప్రశ్న 8.
రాయలేలిన సీమ
రతనాల సీమరా
దాయగట్టి పరులు
ధార తీస్తుండారు
నోరెత్తి అడగరా దానోడా
వారసుడ నీవేరా తెలుగోడా !
జవాబు:
ప్రతిపదార్థం :
రాయలు = విజయనగర రాజులు
ఏలిన = పరిపాలించిన
సీమ = ప్రాంతం
దాయ = కక్ష / పగ
పరులు = శత్రువులు / ఇతరులు
ధార = కత్తి
నోరెత్తి = అన్యాయాన్ని ప్రతిఘటించి
దానోడా = దానికి చెందినోడా (సీమకు చెందినోడా))
వారసుడు = హక్కుదారుడు
భావం :
విజయనగర రాజులు పాలించిన రతనాలకు నిలయమైన ఈ రాయలసీమ ప్రాంతముపై కక్షగట్టిన శత్రువులు కత్తి దూస్తున్నారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించరా సీమకు చెందినోడా. నాటి రాయల పాలనా కాలంలోని వైభవానికి వారసుడు నువ్వేరా ఓ తెలుగోడా ! ఆ వైభవాన్ని తిరిగి సాధించడానికి అంకితమవుదాం అని భావం.
ప్రశ్న 9.
కల్లోల ‘గౌతమీ
వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి
పొంగి పారిన చాలు
ధాన్యరాసులు పండు దేశాన
కూడు గుడ్డకు కొదవ లేదోయ్
జవాబు:
ప్రతిపదార్థం :
కల్లోల = ఎగసిపడే
గౌతమీ = గోదావరి నది (గోదావరి పాయ)
వెల్లువ = వరద
కృష్ణమ్మ = కృష్ణా నదీమతల్లి
కొదవ = కొరత
భావం :
తన ప్రవాహంతో ఎగిసిపడే గౌతమీ గోదావరి తల్లి, వరదలతో ఉప్పొంగే కృష్ణవేణమ్మ, తుంగభద్రా తల్లి పొంగి ప్రవహిస్తే చాలు. ధాన్యరాసులు పండే ఈ ప్రాంతాలలో కూడు, గుడ్డకు కొరత ఉండదు.
ప్రశ్న 10.
పసిడి. పాతర నీది.
పరుల నోరూరెనోయ్
నీలో నీకే పెట్టి
నెత్తి చేయెట్టారు
దేశాన్ని దిగమింగి పోయారోయ్
మోసాన్ని గుర్తెరిగి కాపాడోయ్.
జవాబు:
ప్రతిపదార్థం :
పసిడి = బంగారం
పాతల = నిధి
పరుల = ఇతరుల
నోరూరు = ఆశపుట్టుట
దిగమింగి = దోచుకొని
నెత్తి చేయెట్టారు = మోసం చేయుట
గుర్తెరిగి = తెలుసుకొని
కాపాడోయ్ = కాపాడుకోవాలి
భావం :
నీ తెలుగు ప్రాంతము బంగారపు నిధులతో ఉన్నటువంటి వెలకట్టలేని దేశం. ఇతరులకు ఆ సిరిసంపదలపై దురాశ కలిగింది. తెలుగు జాతీలో అంతర్విభేదాలు సృష్టించి చివరకు నిన్నే మోసం చేసారు.. నీ దేశంలోని సిరిసంపదలు దోచుకొని పోయారయ్యా. ఆ మోసాన్ని గ్రహించి రాష్ట్రాన్ని ఇప్పటికైనా మనం కాపాడుకోవాలి.
ప్రశ్న 11.
ఉత్తరాదీ మొదలు
దత్తమండల మంత
తెలంగాణ ప్రాంతములో
చెలిమి గలిగించాలె
కలిసి మెలిసే నేడు పోవాలోయ్
కలిమీ బలిమి గూర్చుకోవాలోయ్
జవాబు:
ప్రతిపదార్థం :
ఉత్తరాదీ మొదలు = ఉత్తరాంధ్ర నుండి
దత్తమండలము = రాయలసీమ
అంత = వరకు
తెలంగాణ = తెలంగాణా
చెలిమి = స్నేహం
కలిగించాలె = కలిగేటట్లు
కలిమి = సంపద
బలిమి = బలము
కూర్చుకొను = సంపాదించుకొను
భావం :
ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు గల తెలుగు ప్రాంతమంతా తెలంగాణా ప్రాంతముతో స్నేహం చేయాలి. అందరమూ కలిసిమెలిసి ముందుకు పోతే మనలను ఎవరూ జయించలేరు. అందరమూ కలిసి సంపదలు పెంచుకుని శక్తిమంతులమవ్వాలి.
ప్రశ్న 12.
ముక్కోటి బలగమోయ్
ఒక్కటై మనముంటె
యిరుగు పొరుగులోన
వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా
సవతి బిడ్డల పోరు మనకేలా
జవాబు:
ప్రతిపదార్థం :
ముక్కోటి = మూడుకోట్ల
బలగం = పరిజనం (జనాభా)
యిరుగు పొరుగు = చుట్టు పక్కలవారు
ఊరు = ప్రాంతం
పోరు = కలహం
మనకేలా = మనకెందుకు
భావం :
మూడుకోట్లకు పైగా పరిజనం కలిగిన బలం మనది. మనందరం కలిసి ఉంటే చుట్టుపక్కల ఉన్నా రాష్ట్రాలలో మనకి గౌరవం, పేరు ప్రతిష్ఠలు ఉంటాయి. ఓ తెలుగు బిడ్డ మనందరికీ తల్లి ఒకటే, మనము తెలుగుజాతి వారము. సవతితల్లి బిడ్డల్లా మనలో మనకు ఈ కలహములు మంచిది కాదు. అభివృద్ధి నిరోధకము.
ప్రశ్న 13.
పెనుగాలి వీచింది.
అణగారి పోయింది.
నట్టనడి సంద్రాన
నావ నిలుచుండాది
చుక్కాని బట్టరా తెలుగోడా
నావ దరి జేర్చరా మొనగాడా
జవాబు:
ప్రతిపదార్థం :
పెనుగాలి = హోరుగాలి
అణగారు = తగ్గు
సంద్రము = సముద్రము
చుక్కని = నావ ముందుకు పోవుటకు వాడునది
దరి = ఒడ్డు
మొనగాడు = ముందుండే వీరుడు
భావం :
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రమనే హోరుగాలి ఉధృతంగా ‘వచ్చింది. క్రమంగా ఆ హోరు తగ్గిపోయింది. ఉద్యమం నీరసించింది. తెలుగుజాతి అనే నావ కష్టాలు అనే సముద్రం మధ్యన దిశానిర్దేశం చేసేవారు లేక నిలుచుండిపోయింది. ఆ ఉద్యమం అనే నావ చుక్కాని బట్టి ఒడ్డుకు చేర్చరా మొనగాడా, తెలుగు వీరుడా.
కవి పరిచయం
అతి తక్కువ గీతాలు రాసి అఖండ ఖ్యాతినార్జించిన తెలుగు కవుల్లో ‘వేములపల్లి శ్రీకృష్ణ’ ఒకరు. గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర బేతపూడి గ్రామంలో 1-07-1917న జన్మించారు. మాణిక్యము, వెంకట్రామయ్యలు వీరి తల్లిదండ్రులు. రేపల్లె, గుంటూరులలో విద్యాభ్యాసం చేసిన శ్రీకృష్ణ విద్యార్థి దశలోనే విద్యార్ధి ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. గిరీశం, సాక్షి అనే కలం పేర్లతో కాగడా, నగారా అనే పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు.
చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ అనే పాటతో పాటు జాయేంగే కయ్యూరు’, ‘చెంచుపాట’, ‘రెడ్ ఆర్మీ’, ‘రండీ దేశ సేవకు’, ‘అన్నాచెల్లెలు’, ‘రావోయి’ అనే గీతాలను శ్రీకృష్ణ రచించారు. ఇవన్నీ ‘అరుణ గీతాలు’ అనే సంకలనంలో చోటు చేసుకున్నాయి.
వేములపల్లి శ్రీకృష్ణ కేవలం రచయితగానే కాక, కొన్ని ఇతర రంగాలలోను, క్రియాశీలక పాత్ర వహించారు. బాపట్ల, మంగళగిరి నియోజకవర్గాల నుండి మూడుసార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సమర్ధుడైన ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. విశాలాంధ్ర దినపత్రిక ప్రధాన సంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. మూడు దశాబ్దాలుగా రాష్ట్రస్థాయిలో ‘శాంతి-స్నేహం’ సంఘాల బాధ్యతలను నిర్వహించారు. అంతేకాక ‘శాంతి-స్నేహం’ అనే మాసపత్రికకు కూడా సంపాదకత్వం వహించారు.
‘చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్’ కార్యదర్శిగా జీవితాంతం సేవలు అందించారు. ఆ సంస్థకు చెందిన వృద్ధాశ్రమం వేములపల్లి నిర్వహణలో గొప్ప ప్రాచుర్యం పొందింది. సోవియట్ యూనియన్, తూర్పు జర్మనీ వంటి దేశాలను సందర్శించారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ కోణాలలో వారి విదేశీ పర్యటన అనుభవాలను వ్యాసాల రూపంలో తెలుగు పాఠకులకు అందించారు.
సుదీర్ఘకాలం తెలుగుజాతి సామాజిక, రాజకీయ పురోగతి కోసం అవిశ్రాంత కృషి సల్పిన శ్రీకృష్ణ 8-4-2000న కన్నుమూసారు. శ్రీకృష్ణ ఆకాంక్ష మేరకు ఆయన మరణాంతరం వారి కుటుంబ సభ్యులు వేములపల్లి కళ్ళను హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసారు. ఈ పాఠ్యాంశం ‘తెలుగుతల్లి’ కవితా సంకలనం నుండి స్వీకరించడమైనది.
పాఠ్యభాగ నేపధ్య౦
విశాలాంధ్ర ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చిన గేయం ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా”. తెలుగు మాట్లాడే వారందరికీ ఒక రాష్ట్రం కావాలన్న ఆలోచన 1940 దశకంలో ఉద్యమరూపం దాల్చింది. ఆ సందర్భంలో తెలుగు వారందరికీ జాతీయగీతం ఒకటి కావాలని ఉద్యమకారులు భావించారు. ఉత్తమ గీతానికి బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. ఆ పోటీతో సంబంధం లేకుండా వేములపల్లి శ్రీకృష్ణ అప్పటికే విశాలాంధ్ర ఉద్యమ నేపధ్యంలో ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ రచించారు.
ఇతర గేయాలు ఎన్ని ఉన్నా తెలుగుజాతి అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఆకాశమెత్తున రెపరెపలాడించిన గీతం ఇది. సుప్రసిద్ధ ప్రజానాట్యమండలి కళాకారులు నాజర్ బొడ్డు గోపాళం వంటి వారి గళంలో ఈ గేయం ఆబాలగోపాలం చేయెత్తి జైకొట్టింది. 1952లో విడుదలైన పల్లెటూరు చిత్రంలోనూ ఘంటసాల బాణి, వాణి మూలంగా పల్లెటూళ్ళ నుంచి పట్టణాలదాకా మారుమోగింది. ఈ గేయం విశాలాంధ్ర ఉద్యమ నేపథ్యంలో పుట్టినా ఈనాటికీ వివిధ సందర్భాలలో తెలుగుజాతి కీర్తి పతాకాలను ఎగురవేస్తూనే ఉంది. ఈ గీతం అవసరం తెలుగు జాతికి నానాటికీ పెరుగుతూనే ఉంది.
పాఠ్యభాగ సారాంశం
చేయెత్తి జైకొట్టు తెలుగోడా ఘనమైన చరిత్ర కలవాడా, సాటిలేని జాతి, నేడు తన పౌరుషాన్ని మరచి నిదురిస్తోంది. ఆ నిదురిస్తున్న పౌరుషాన్ని మేల్కొలపాలి. వీరులు తమ రక్తాన్ని కొరత లేకుండా ధారపోసిన పలనాడు, వెలనాడు నీదేరా తెలుగోడా.
బాలచంద్రుడు, తాండ్రపాపారాయుడు నాయకురాలు నాగమ్మ, మల్లమ్మ కవయిత్రి మొల్ల, మగువ మాంచాల నీ తోడబుట్టిన వాళ్ళు వారి స్ఫూర్తి నీలో నింపు. ఎందరో ధీరమాతలు, ధీరవనిత కన్నతల్లి ఈ నేల. మన పౌరుషాగ్నిని కథలు కథలుగా చెప్పారు. నేడు ఉనికే లేకపోయింది. మనం కోల్పోయిన అప్రతిష్ఠను తిరిగి సాధించుకోవాలి. నాగార్జునకొండ, అమరావతీ స్తూపాల శిల్పాలలో జీవకళలను పొదిగి దేశదేశాల వారి ప్రశంసలు పొందాము.
మన పూర్వుల పౌరుష స్ఫూర్తితో నేడు మనం కార్యదీక్ష పరులవ్వాలి. అమరకవి గురజాడ ప్రజలకవితను చెప్పాడు. రాయలు ఏలిన సీమను పగబట్టిన శత్రువులు తీస్తున్నారు. కృష్ణా, గోదావరి, తుంగభద్రలు కరుణిస్తే ధాన్యరాసులకు, కూడుగుడ్డలకు కొదువుండదు. బంగారపు గనిలాంటి మన భూమిని చూసి శత్రువులకు కన్నుకుట్టి మనలో మనకు కలహాలు పుట్టించారు. ఉత్తరాంధ్ర,
రాయలసీమ తెలంగాణ ప్రాంతాలలోని తెలుగువారందరూ కలసి ఒక్కటై బలాన్ని పొందాలి. అప్పుడే మనకు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో పేరుంటుంది. మనందరి తల్లి ఒకటే సవతి బిడ్డలలా కలహించుకోకూడదు. నట్టనడి సముద్రంలో నిలుచున్నా అభివృద్ధి అనే నావను మనమే ఒడ్డున చేర్చుకోవాలి.
పాఠ్యభాగ ఉద్దేశం
తెలుగుజాతి ఐకమత్య ఆవశ్యకతను చాటి చెబుతూ ప్రస్తుతమున్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులలో తెలుగు వారి ఐక్యతా స్ఫూర్తిని చాటి చెబుతూ విద్యార్ధి లోకానికి ప్రేరణ అందించుట ఈ పాఠ్యభాగ ఉద్దేశం.