Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 1st Lesson కుంకుడాకు Textbook Questions and Answers, Summary.
AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 1st Lesson కుంకుడాకు
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
‘కుంకుడాకు’ కథా సారాంశాన్ని రాయండి.
జవాబు:
పారమ్మ, గవిరి ఇద్దరూ ఒకే వయసున్న పల్లెటూరి పిల్లలు. పారమ్మ అప్పలనాయుడు కూతురు. గవిరి చినదేముడు కూతురు. అప్పలనాయుడు పలుకుబడిగల మోతుబరి రైతు. చినదేవుడు కూలి పని చేసుకునేవాడు. వారి మధ్య అంతరమే వాళ్ళ పిల్లల మధ్య ఉంటుంది. పారమ్మ ఊరగాయ రుచిగా ఉందని అనగానే గవిరి రొయ్యలు తిన్నానని అబద్ధం ఆడుతుంది. మీరు రాత్రి వండుకోలేదని పారమ్మ ఎత్తిపొడుస్తుంది.
గవిరి తండ్రి కూలి చేసి ఏమైనా తెస్తేనే వారికి ఆపూట గంజి అయినా తాగి కడుపు నింపుకుంటారు ఆ కుటుంబం. తల్లిదండ్రి గవిరి కష్టపడితే గాని తిండికి కూడా గడవని ఇల్లు అది. ప్రతిరోజు కోనేటికి పోయి ఇంటికి సరిపడా నీళ్ళు మొయ్యాలి. కర్రా కంపా, ఆకు అలము ఏరి పొయ్యిలోకి వంట చెరకు తేవాలి ఇదీ గవిరి పరిస్థితి.
పారమ్మ బడికి పోతానన్నప్పుడు కూలిచేసే వాళ్ళకి చదువెందుకని గవిరి నిరాశగా అంటుంది. గవిరితోపాటు పొలాల్లోకి వెళ్ళి పారమ్మ పొలాల్లో దొరికే పెసరకాయలు చింతకాయలు ధైర్యంగా తీసుకొని తింటుంది. గవిరి కడుపు కాలుతున్నా సాహసం చేయలేదు. పేదరికం వల్ల ధైర్యం చాలదు గవిరికి. డబ్బులేని వాళ్ళు చిన్న దొంగతనం చేసినా పెద్ద నేరమౌతుంది. డబ్బున్న వాళ్ళు చేస్తే అది కప్పిపుచ్చుకోగలరు. అందుకే పారమ్మకు నిర్భయం. ఎవరైనా చూస్తే మాడు పగులుతుందని గవిరి హెచ్చరిస్తే “నేను అప్పలనాయుడు కూతుర్ని ఎవరు ఏమంటారు” ? అని తిరిగి సమాధానం ఇస్తుంది.
తట్టనిండా కుంకుడాకులు ఏరుకొని కాంభుక్త గారి కళ్ళం వైపు నడుస్తారు ఇద్దరూ. అక్కడ చింతకాయలు చూసి పారమ్మ రాయితో కొడుతుంది. మూడు కాయలు పడతాయి. తీసి పరికిణిలో దోపుకొని తింటూ ఉంటుంది. గవిరి ఒక కాయ అడిగినా ఇవ్వదు. కావాలంటే నువ్వూ రాయితో కొట్టు అని అంటుంది. గవిరి ఒక రాయి తీసి వేస్తుంది. క్రింద పడిపోతుంది. మళ్ళీ ఇంకొక రాయివేస్తే కొమ్మ విరిగి పడుతుంది.
పొయ్యిలోకి చాలా మంచి సాధనం అని చితుకులు తట్టలో వేసుకుంటుంది. ఎదురుగా కాంభుక్తగారు ఎవరది అని గద్దిస్తాడు. కోపంగా ఉన్న కాంభుక్తని చూసి గవిరి భయపడిపోతూ పొయ్యిలోకి చితుకులు అని అంటుంది. కాంభుక్త కోపంగా తట్టని ఒక తన్నుతంతాడు. ఆకులన్నీ చెల్లాచెదురైపోతాయి. వాటిని పోగు చేసుకోవాలనుకున్న గవిరి నడుంమీద చేతికర్రతో ఒక్క దెబ్బవేసాడు. అంతేకాదు ఆ తుప్పవార ఏందాచావంటూ దొంగతనం అంటగట్టాడు. తాను దొంగ కాదు కాబట్టి ధైర్యంగా నేనేమి దాచలేదు అంటూ ఎదురు తిరిగింది గవిరి.
నిజం చెప్పినా కొట్టడానికి వచ్చిన భుక్త గారిని బూతులు తిట్టింది గవిరి. అది సహించలేని భుక్తగారు పాంకోడు విసిరాడు. గవిరి కాలికి తగిలి క్రిందపడింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు తెరిచేసరికి, సాయంత్రం అయ్యింది. ఆ చింత కంప తనకి అక్కరలేదని అక్కడే వదిలేసి కుంకుడాకులు తట్ట నెత్తిన పెట్టుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడింది. కాలు నొప్పితో మంటగా ఉన్నది. కాలు దెబ్బని చూసుకొంది. బొప్పికట్టి ఎర్రబడింది. తన నిస్సహాయతకు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది.
ప్రశ్న 2.
కుంకుడాకు కథలోని సామాజిక, ఆర్థిక అంతరాలను వివరించండి.
జవాబు:
గవిరి కూలి చేసుకొనే చినదేముడి కూతురు. గోచీ పెట్టుకొని రాగికాడలు అలంకరించు కుంటుంది. తిండి లేకపోయినా తన తోటి పారమ్మతో రొయ్యలు నంచుకున్నానని అబద్ధం చెప్తుంది. లేనితనం అబద్దాలను ఆడిస్తుంది.
పారమ్మ మోతుబరి రైతు కూతురు అవడం వల్ల పరికిణి కట్టుకుంటుంది. గావంచా పైట వేస్తుంది. కాళ్ళకు చేతులకి సిల్వర్ కడియాలు, ముక్కుకి, చెవులకు బంగారు’ కాడలు ధరిస్తుంది. అంతరంగంలో కూడా డబ్బులేని గవిరి బేలగా నిస్సహాయంగా ఉంటుంది. పారమ్మ డబ్బున్నవాడి కూతురు, గాబట్టి నిర్భయం, ధైర్యం ఎక్కువ.
పారమ్మని బడికి పంపమని మేష్టారు చెప్పినప్పుడు అప్పలనాయుడు పంపిస్తానని అంటాడు. పారమ్మ బడిలోకి వెళుతున్నట్లు గవిరితో చెప్తుంది. దానికి సమాధానంగా గవిరి కూలివాడి కూతురుకి చదువెందుకని వాళ్ళ నాన్న అన్నాడని అంటుంది గవిరి. దీనిని బట్టి డబ్బుంటేనే చదువు లేకపోతే ఏదీ లేదని అర్థం అవుతుంది. ఆనాటి సమాజంలోనే కాదు ఈ నాటి సమాజంలోనూ ఈ ఆర్థిక అంతరాలు. మనుష్యులను నడిపిస్తాయనడంలో సందేహం లేదు.
కూలి చేసి తల్లీదండీ ఏదైనా తెస్తేనే పిల్లలకు ఇంత గంజి అయినా దొరుకుతుంది. లేకుంటే పస్తులుండాలి. పారమ్మ బుగతగారిచ్చిన ఊరగాయ చాల రుచిగా ఉందనడం బట్టి డబ్బు ఉన్నవాళ్ళకు బుగతలు ఊరగాయలు ఇస్తారని, కూరలైనా ఇస్తారని అర్థం అయింది. తిండి లేక ఆకలి ఆకలి అని ఏడ్చే గవిరికి తల్లి ఓదార్పు తప్ప తాగడానికి గంజి కూడా లేదని రచయిత వివరించారు. వయసు ఎనిమిదేళ్ళే అయినా కోనేటి నుండి నీళ్ళు తేవడం పొలాల్లో కంపా, కర్రా ఏరుకొని పొయ్యిలోకి వంట చెరకు ఏరుకోవడం వంటి బాధ్యత గవిరి మోస్తుంది.
రచయిత పరిచయం
1. కుంకుడాకు కథా రచయిత చాగంటి సోమయాజులు.
2. తొలితరం తెలుగు కథకుల్లో ప్రముఖులు ‘చాసో’గా సుప్రసిద్ధులు.
3. చాసో 17-01-1915వ సంవత్సరములో శ్రీకాకుళంలో జన్మించారు. తులశమ్మ, లక్ష్మీనారాయణ శర్మగారు వీరి తల్లిదండ్రులు.
4. చాసో అసలు పేరు కాసుకొలను నరహరిరావు.
5. చాగంటి తులశమ్మ, బాపిరాజు దంపతులు విజయనగరంలో వీరిని దత్తత తీసుకున్నారు.
6. అప్పటి నుండి నరహరిరావు పేరు కాస్తా చాగంటి సోమయాజులుగా స్థిరపడింది.
7. చాసో కథలు రాశిలో తక్కువే అయినా వాసిలో ఎక్కువే.
8. చాసో కథకులకే కథకులుగా, ఒక గ్రంథాలయంగా ప్రయోగశాలగా కీర్తింపబడ్డారు.
9. దాదాపు 40 కథలు సుప్రసిద్ధమైనవి. తొలి కథ చిన్నాజీ.
10. కర్మ సిద్ధాంతం, బొండు మల్లెలు, ఎందుకు పారేస్తాను నాన్నా, వాయులీనం వంటివి బహుళ ప్రచారం పొందాయి.
11. అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యులుగా ఉంటూ మరణానంతరం తన శరీర భాగాలను వైద్యశాస్త్ర ప్రయోగాలకు వినియోగించమని ఆశించిన కవి.
12. చాసో చెన్నైలో మరణించినప్పుడు వారి కోరికమేరకు కుటుంబ సభ్యులు రామచంద్ర . వైద్యశాలలో 2-01-1994న వారి పార్థివదేహాన్ని అందజేసారు.
13. తెలుగు సాహిత్యంలో తొలిసారిగా మార్క్సిజాన్ని ప్రవేశపెట్టిన రచయిత చాసో.
14. ధన స్వామ్యంలో ధసం ఏ విధంగా మనుష్యుల మధ్య అంతరాలను పెంచుతుందో . మానవత్వాన్ని మంటకలుపుతుందో బూర్జువా సమాజంలో మనుషుల మనస్తత్వాలను అద్దంపడతాయి చాసో కథలు.
15. ప్రస్తుత కథ కుంకుడాకులో ఈ దృశ్యాన్ని చిత్రించి సామాజిక వాస్తవాలను విద్యార్థులకు తెలియజేసే ప్రయత్నం చేసారు.
16. 1943 ఫిబ్రవరి ‘అరసం’ ప్రత్యేక సంచికలో తొలిసారి ప్రచురించబడింది.
17. భారతీయ భాషల్లోనే కాక రష్యన్ భాషలోకి అనువదింపబడ్డాయి చాసో గారి కథలు.
18. ప్రస్తుత పాఠ్యభాగం ‘చాసో కథలు (రెండవ కూర్పు) సంపుటి నుండి గ్రహించబడింది.
పాత్రల పరిచయం
1. అప్పలనాయుడు :
మోతుబరి రైతు, ఊరిలో పలుకుబడి ఉన్న రైతు.
2. చినదేముడు :
గోచిపాత కట్టుకుంటాడు. కూలి పని చేసుకొని జీవితం వెళ్ళదీస్తాడు.
3. పారమ్మ :
అప్పలనాయుడు, కూతురు. మోతుబరి రైతు కూతురు చింకి పరికిణి గావంచా కట్టుకుంటుంది. మెళ్ళో పగడాలు, కాళ్ళకి, చేతులకు సిల్వర్ కడియాలు, ముక్కు చెవులకు బంగారు కాడలు వేసుకుంటుంది. అహంకారం, ధైర్యం ఎక్కువగా ప్రదర్శిస్తుంది.
4. గవిరి :
చినదేవుడి కూతురు. గొప్పకోసం అబద్దాలు చెప్పగలదు. చదువుపై మంచి అభిప్రాయం లేనిది. వంట కోసం పుల్లలు ఏరుకొని రావడానికి పొలాల్లోకి వెళుతుంది. కుంకుడాకులు తట్టనిండా నింపుకుంటుంది. చింతకాయ కోసం చెట్టుపైకి రాయి విసురుతుంది. ఆ చెట్టు యజమాని కాంభుక్త చేత దెబ్బలు తింటుంది. తప్పు చేయలేదని ధైర్యంతో తిరిగి సమాధానం చెప్తుంది. పేదరికం వల్ల దెబ్బలు తింటుంది. ఎనిమిదేళ్ళ గవిరి ఇంటి బాధ్యతలు మోస్తుంది.
5. కాంభుక్త :
పొలాల యజమాని. భూస్వామి, పొలం గట్టుపై ఉన్న చెట్లు కూడ వారివే అన్న అహంకారి. చిన్నపిల్లలని జాలిలేని దయలేని కఠిన హృదయుడు. ఆకు అలము ఏరుకునే వాళ్ళనే కనికరం లేకుండా గవిరిని కొడతాడు. తప్పు చేయలేదనే ధైర్యంతో గవిరి బూతులు తిట్టినందుకు మరింత కోపంతో పాంకోడు తీసి విసురుతాడు. గవిరి నిజం చెప్పినా వినిపించుకోకుండా కొడతాడు. పాంకోడు దెబ్బకు క్రిందపడిన గవిరిని చూసి సంతృప్తిగా వెళ్ళిపోతాడు.
పాఠ్యభాగ సారాంశం
అప్పలనాయుడు కూతురు పారమ్మ, చిన దేముడి కూతురు గవిరి పొలాలవైపు వెళతారు. గవిరి పొయ్యిలోకి ఆకు అలము కంపా కర్రా ఏరి వంట చెరకు తేవాలి. పారమ్మ నాయుడు గారి కూతురవటం వల్ల బాధర బందీ లేదు. ఇద్దరికి వయసు ఒకటే అయినా డబ్బులో అంతరం ఉంది. కూలి పని చేసుకునే చినదేవుడు కుటుంబ బాధ్యత గవిరిపై ఉంది.
గొప్పకోసం గవిరి అబద్దాలు చెప్తుంది. పొరమ్మ గవిరి మాటలను విని ఎగతాళి చేస్తుంది. బడిలో చదవటానికి వెళతానని పారమ్మ అంటే చదువు ఎందుకు అని గవిరి అంటుంది. మా అయ్య నాయుడు మీ అయ్య కూలోడు అందుకే బడికి ఎందుకని అంటున్నావు అని పారమ్మ అనగానే గవిరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బడి పిల్లల పాట కూనిరాగం తీస్తోంది పారమ్మ. గవిరి కంపలేరుకోవాలని కళ్ళాలవైపు నడిచింది. వయసు ఎనిమిదేళ్ళే అయినా కొండంత సంసార భారం గవిరి మీద ఉన్నది. కోనేటికి పోయి ఇంట్లోకి నీళ్ళు తేవాలి. పొయ్యిలోకి ఆకు అలము ఏరి తేవాలి.
ప్రక్కనే పొలాల్లో పెసర గుత్తులున్నాయి. పారమ్మ నాలుగు మొక్కలు పీకి పెసర కాయల్ని తింటుంది. గవిరి కడుపులో కాలున్నా , పొలంలో మొక్కలు పీకే సాహసం చేయలేదు. రాత్రంతా తిండిలేక ఏడ్చింది. వాళ్ళమ్మ ఓదార్పు తప్ప తినడానికి తిండి లేదు. గవిరి కూలి వాడి కూతురు పొలాల్లో పడి తినడానికి ధైర్యం లేదు.
పేదవాళ్ళు చిన్న దొంగతనం చేసినా పెద్ద నేరాలు అవుతాయి. అదే డబ్బున్న వాళ్ళు చేస్తే కనపడవు. అందుకే పారమ్మ కడాకు తింటూనే ఉంది. పొలం గలవాళ్ళు చూస్తే తంతారని చెప్తే పారమ్మ నేను అప్పలనాయుడు కూతుర్ని ఎవరు ఏమంటారని నిర్భయంగా గవిరి మాటలను కొట్టి పారేస్తుంది. గవిరి కడుపు కాలుతోంది.
తండ్రి కూలి చేసి తెస్తే రాత్రికి గంజి నీళ్ళు లేకపోతే పస్తే అది తలచుకొని గవిరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కుంకుడాకులు త్రోవంతా రాలి ఉన్నాయి. అవి ఏరి తట్ట నింపుకుంది. ఇంటి దోవ పట్టారు. పారమ్మ, గవిరి. కాంభుక్త గారి కళ్ళం దగ్గర చింత చెట్టు కనపడింది. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. పారమ్మ రాయితీసి కొట్టింది. చింతకాయలు రాలాయి. గవిరి ఎంత అడిగినా ఇవ్వలేదు.
ఆ రాయితో కొట్టుకో అని సలహా ఇచ్చింది. భయపడుతూ గవిరి ఒక రాయి వేసింది. మరొకసారి రాయి విసిరింది. చింతకాయలు రాలకపోయినా పెద్ద ఎండిపోయిన కొమ్మ విరిగి పడింది. పొయ్యిలోకి చాలా చితుకులు అనుకొని విరిచి తట్టలో కుక్కింది. ఎదురుగా కాంభుక్త వచ్చి చింతనిప్పుల్లాంటి కళ్ళతో, చూస్తున్నాడు. పొయ్యిలోకి అని గవిరి భయం భయంగా చెప్పింది.
తట్టని ఒక్క తన్ను తన్నాడు. భుక్త ఇంకా తట్టెడు పేడ కుప్ప చాటున చూసి దొంగతనం అంటగట్టి చేతి కర్రతో ఒక్కటి వేసాడు. తప్పు చేయలేదని గవిరి ప్రాధేయపడినా మనసు కరగలేదు. పేడ తట్ట గురించి తనకేమి తెలియదని ఎదురు తిరిగింది గవిరి.
గవిరి తిట్లు విని పాంకోడు తీసి విసిరాడు. అది గవిరి కాలిపిక్క మీద టక్కని తగిలి క్రింద పడిపోయింది. గవిరి పడిపోవడంతో సంతృప్తి చెందాడు కాంభుక్త. ఏడ్చి ఏడ్చి గవిరి కళ్ళు తెరిచే సరికి సాయంత్రం అయిపోయింది. ప్రక్కనే పిల్లలు బడిలో ఎక్కాలు చదువుతున్నారు. విరజిమ్మి ఉన్న కుంకుడాకుల్ని తట్టలోకి ఎత్తుకుంది.
చింతకంప అక్కడే వదిలేసింది. తండ్రి, చినదేముడు పొయ్యి మీదకు తెచ్చినా లేకపోయినా గవిరి పొయ్యిలోకి ఆకు అలము తెచ్చి తీరాల్సిన పరిస్థితి. తట్ట నెత్తిన పెట్టుకొని ఇంటిదారి పట్టింది. ఎముక మీద తగిలిన దెబ్బ బొప్పి కట్టింది. కాలు నొప్పితో ఏడ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది.
కఠిన పదాలకు అర్ధాలు
మోతుబరి రైతు = పొలం, డబ్బు ఉన్న రైతు
పాత = గుడ్డ ముక్క
గావంచా = తుడుచుకొనే తువ్వాలు (అంగవస్త్రం)
కడియాలు, కాడలు = ఆభరణాలు
బుగత = భూస్వామి
మచ్చరం = ఈర్ష్య
అగ్గేసుకోవడం = వంట చేయడం
దప్పిక = దాహం తీర్చే గంజి
కూడు = అన్నం, తిండి
గోర్జ = దారి (ఇరువైపుల చెట్లు మధ్యలో త్రోవ)
మొగలి పెండి = మొగలి తుప్పలు
కోరడి = పొలాల గట్టు
నాదారులు = పేదవారు
కమ్ముకుపోవు = కనబడకుండా పోవు
చితుకులు = ముక్కలుగా విరిచిన కట్టెలు సత్తువ
పాలేర్లు = పనివాళ్ళు
వక్కాణించు = గట్టిగా నొక్కి చెప్పడం
వల్లెవేయు = మళ్ళీ మళ్ళీ చదువుట
పాఠ్యభాగం వెనుక ఉన్న అర్థాలను అదనంగా ఉన్నవాటిని చేర్చవలెను.