AP Board 8th Class Telugu Grammar

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions 8th Class Telugu Grammar Notes, Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Grammar

తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక :
పై వాక్యంలో “చిన్నప్పుడు” అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాలు కలవడం వల్ల వచ్చింది. దీనినే “సంధి పదం” అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినప్పుడు, లేదా రాయవలసినప్పుడు, “సంధి పదం” ఏర్పడుతుంది.

* తెలుగు సంధులు: రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను “తెలుగు సంధులు” అంటారు.

* సంధి : వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికను “సంధి” అని పిలుస్తారు.

* సంధి కార్యం : రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును “సంధి కార్యం” అని పిలుస్తారు.

* పూర్వ స్వరం : సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును, (స్వరాన్ని) “పూర్వ స్వరం” అని పిలుస్తారు.

* పర స్వరం : సంధి జరిగే రెండవ పదం మొదటి అక్షరంలోని అచ్చును (స్వరాన్ని) “పర స్వరం” అని పిలుస్తారు.
ఉదా :
రామ + అయ్య : ‘మ’ లో ‘అ’, పూర్వ స్వరం; ‘అయ్య’ లోని ‘అ’ పర స్వరం.

1. అత్వ సంధి సూత్రం : అత్తునకు సంధి బహుళం.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
మేనల్లుడు = మేన + అల్లుడు – (న్ +) అ + అ = అ – (అత్వ సంధి)
1) ఒకప్పుడు = ఒక + అప్పుడు – (అ + అ = అ) – (అత్వ సంధి)
2) వచ్చినందుకు = వచ్చిన + అందుకు – (అ + అ = అ) – (అత్వ సంధి)
3) రాకుంటే = రాక + ఉంటే – (అ + ఉ = ఉ) – (అత్వ సంధి)
4) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = ఏ) – (అత్వ సంధి)
5) పోవుటెట్లు = పోవుట + ఎట్లు – (అ + ఎ = ఎ) – (అత్వ సంధి)
6) చేసినంత = చేసిన + అంత – (అ + అ = అ) – (అత్వ సంధి)
7) విరిగినప్పుడు = విరిగిన + అప్పుడు – (అ + అ = అ) – (అత్వ సంధి)
8) చాలకున్న = చాలక + ఉన్న – (అ + ఉ = ఉ) – (అత్వ సంధి)
9) ఒకింత = ఒక + ఇంత = (అ + ఇ = ఇ) = (అత్వ సంధి)

గమనిక :
పై సంధి పదాలలోని పూర్వ స్వరం ‘అ’. అది పర స్వరంలోని అచ్చుతో కలిస్తే పూర్వ స్వరం ‘అ’ లోపిస్తుంది. ‘అ’ లోపించింది కాబట్టి ‘అత్వ సంధి’.

అత్వసంధి లేక ‘అకారసంధి’ అంటారు. పొట్టి ‘అ’ అనే అక్షరానికి అచ్చు పరమైతే ‘అత్వ సంధి’ వస్తుంది.

అత్వ సంధి (అకార సంధి) సూత్రం : అత్తునకు సంధి బహుళం.

AP Board 8th Class Telugu Grammar

2. ఇత్వ సంధి సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) ఏమంటివి = ఏమి + అంటివి – (ఇ + అ = అ) – (ఇత్వసంధి)
సంధి జరుగనప్పుడు “య కారం” ఆగమంగా వస్తుంది. దానినే ‘యడాగమం’ అని పిలుస్తారు.

ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి – (ఇ + అ = య) – (ఇకార సంధి రాని యడాగమ రూపం)
ఇ) వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు – (ఇ + ఇ = ఇ) – ఇత్వసంధి
ఈ) వచ్చిరిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు – (ఇ + ఇ + యి) – (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణలలో హ్రస్వ ఇకారానికి అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వసంధి” అంటారు. ఇత్వసంధి తప్పక జరగాలన్న నియమం లేదు.

* వైకల్పికం :
ఇత్వ సంధి జరగవచ్చు లేక జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అని పిలుస్తారు.

అభ్యాసం :
ఉదా :
1) ఏమంటివి = ఏమి + అంటివి – (మ్ + ఇ + అ = మ)
2) పైకెత్తినారు = పైకి + ఎత్తినారు – (ఇ + ఎ = ఎ) – ఇత్వసంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు – (ఇ + అ = అ) – ఇత్వసంధి
4) దారవుతుంది = దారి + అవుతుంది – (ఇ + అ = అ) – ఇత్వసంధి
5) పైకెత్తు = పైకి + ఎత్తు – (ఇ + ఎ = ఎ) – ఇత్వసంధి
6) జగానికంతా = జగానికి + అంతా – (ఇ + అ = ఆ) – ఇత్వసంధి
7) అదేమిటి = అది + ఏమిటి – (ఇ + ఏ = ఏ) – ఇత్వసంధి
8) వెళ్ళాలని = వెళ్ళాలి + అని – (ఇ + అ = అ) – ఇత్వ సంధి

ఇత్వసంధి సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.

3. ఉత్వ సంధి (ఉకారసంధి) సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
రాముడతడు = రాముడు + అతడు – (డ్ + ఉ + అ = డ) – (ఉత్వ సంధి)
1) అతడెక్కడ = అతడు + ఎక్కడ – (ఉ + ఎ = ఎ) – (ఉత్వ సంధి)
2) మనమున్నాము = మనము + ఉన్నాము – (ఉ + ఉ = ఉ) – (ఉత్వ సంధి)
3) మనసైన = మనసు + ఐన – (ఉ + ఐ = ఐ) – (ఉత్వ సంధి)
4) బాల్యమంతా = బాల్యము + అంతా – (ఉ + అ = అ) – (ఉత్వసంధి)
5) దేవతలంతా = దేవతలు + అంతా – (ఉ + అ = అ) – (ఉత్యసంధి)
6) అందమైన = అందము + ఐన – (ఉ + ఎ = ఐ) – (ఉత్వసంధి)
7) తలపెల్ల = తలపు + ఎల్ల (ఉ + ఎ = ఎ) – (ఉత్వసంధి)

గమనిక :
హ్రస్వ ఉకారానికి, అనగా ఉత్తుకు, అచ్చు కలిసినప్పుడు, పూర్వ స్వరం ఉకారం లోపించి, పర స్వరం కనిపిస్తుంది.
లోపించిన పూర్వ స్వరం ‘ఉ’ కాబట్టి, ఇది “ఉత్వ సంధి” అని పిలువబడుతుంది.

ఉత్వ సంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

నిత్యం :
నిత్యం అంటే, తప్పక సంధికార్యం జరుగుతుందని అర్థం.

4. యడాగమం :
సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అని పిలుస్తారు.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
ఆ) మాయిల్లు = మా + ఇల్లు = మాయిల్లు
ఇ) హరియతడు = హరి + అతడు = హరియతడు

గమనిక :
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కానీ కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.
అ) మా + య్ + అమ్మ : మా ‘య’ మ్మ
ఆ) మా + య్ + ఇల్లు : మా ‘యి’ ల్లు
ఇ) హరి + య్ + అతడు = హరి ‘య’ తడు

యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అంటారు.

AP Board 8th Class Telugu Grammar

5. ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా వస్తుంది.

ఆమ్రేడితం :
ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించగా, రెండవసారి ఉచ్చరించిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.
ఉదా :
1) ఆహాహా – ‘ఆహా + ఆహా’ ఆహా అనే పదం రెండుసార్లు వచ్చింది. అందులో రెండవ ‘ఆహా’ అనే దాన్ని ఆమ్రేడితం అని పిలవాలి.
2) అరెరె = అరె + అ = రెండవసారి వచ్చిన ‘అరె’ ఆమ్రేడితం.
3) ఔరౌర = ఔర + ఔర – రెండవసారి వచ్చిన ‘ఔర’ ఆమ్రేడితం.

గమనిక :
పై ఉదాహరణలలో ఒక్కొక్క పదం రెండుసార్లు వచ్చింది. రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.

ఆమ్రేడిత సంధికి ఉదాహరణములు :
ఔర + ఔర = ఔర్ + అ
ఆహా + ఆహా ఆహ్ + ఆ
ఓహో + ఓహో = ఓహ్ + ఓ

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ వంటి అచ్చులున్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే, సంధి వస్తుంది.

ఔర + ఔర = ఔరౌర – (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా = ఆహాహా – (ఆ + ఆ = ఆ)
ఓహోహో = ఏమి + ఏమి – (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి – (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు – (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి – (ఇ + ఏ = ఏ)
అరె + అరె = అరెరె – (ఎ + అ = అ)

పై విషయాలను గమనిస్తే ఆమ్రేడిత సంధి సూత్రాన్ని ఇలా తయారుచేయవచ్చు.

ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా వస్తుంది.

గమనిక :
ఆమ్రేడిత సంధి కింది ఉదాహరణలలో వికల్పంగా జరుగుతుంది. ఈ కింది ఉదాహరణలను గమనిస్తే సంధి జరిగిన రూపం, సంధిరాని రూపమూ కనబడతాయి.
ఉదా :
ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు, ఎట్లుయెట్లు (సంధి వైకల్పికం)
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత (సంధి వైకల్పికం)

6. ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి :
కింది ఉదాహరణలను గమనించండి.
1) పగలు + పగలు = పట్టపగలు
2) చివర + చివర = చిట్టచివర
3) కడ + కడ = కట్టకడ

గమనిక :
1) పగలు + పగలు = పట్టపగలు అవుతోంది. అంటే ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ అన్న అక్షరాలకు బదులుగా ‘ట్ట’ వచ్చింది. ‘ట్ట’ వచ్చి ‘పట్టపగలు’ అయింది.
2) చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘ట్ట’ వచ్చి, ‘చిట్టచివర’ అయింది.
3) కడ + కడ అన్నప్పుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి ‘కట్టకడ’ అయింది. ఇప్పుడు కింది వాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్ట యెదురు
కొన + కొన = కొట్టకొన
మొదట + మొదట = మొట్టమొదట
బయలు + బయలు = బట్ట బయలు
తుద + తుద = తుట్టతుద

గమనిక :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడ మొదలైన శబ్దాల మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకు ‘ట్ట’ వస్తుండడం గమనించాం.

సూత్రం :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడాదుల తొలి అచ్చు మీది అగ్ని అక్షరాలకు ఆద్యంతమైన ద్విరుక్తటకారం వస్తుంది.

AP Board 8th Class Telugu Grammar

7. ద్రుతప్రకృతిక సంధి (సరళాదేశ సంధి) :
ఈ కింది పదాలు చదివి పదంలోని చివర అక్షరం కింద గీత గీయండి.
1) పూచెను 2) చూచెన్ 3) తినెను 4) ఉండెన్

గమనిక :
పై పదాలను గమనిస్తే పదాల చివర, ను, చ్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ‘ద్రుతం’ అంటారు. ద్రుతము చివరన గల పదాలను “ద్రుత ప్రకృతికములు” అంటారు.

గమనిక :
పూచెను, చూచెన్, తినెన్, ఉండెన్ – అనేవి ద్రుత ప్రకృతికములు.

కింది ఉదాహరణములను గమనించండి.
ఉదా : అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి
ఊ) చేసెను + తల్లీ = చేసెను + దల్లీ
ఋ) దెసను + చూసి = దెసను + జూసి

గమనిక :
ద్రుతప్రకృతానికి ‘క’ పరమైతే ‘గ’, ‘చ’ పరమైతే ‘జ’, ‘ట’ పరమైతే ‘డ’, ‘త’ పరమైతే ‘ద’, ‘ప’ పరమైతే ‘బ’ ఆదేశంగా వస్తాయి.
1) క – ‘గ’ గా, 2) చ – ‘జ’ గా 3) ట – ‘డ’ గా 4) త – ‘ద’ గా 5) ప – ‘బ’ గా మార్పు వచ్చింది.

ఇందులో ‘క చ ట త ప’ లకు ‘పరుషములు’ అని పేరు, ‘గ జ డ ద బ’ లకు ‘సరళములు’ అని పేరు. దీనిని బట్టి సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉంటుంది.

సూత్రం :
ద్రుతప్రకృతికము మీది పరుషాలకు సరళాలు వస్తాయి.

గమనిక :
ఇప్పుడు పై ఉదాహరణలలో మార్పు గమనించండి.
ఉదా :
పూచెఁ గలువలు ; (ద్రుతం అరసున్నగా మారింది)
పూచెను + కలువలు (పూచెం గలువలు (ద్రుతం సున్నగా మారింది) పూచెన్గలువలు (ద్రుతం మీది హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయ్యింది) పూచెను గలువలు (ద్రుతము మార్పు చెందలేదు) దీనికి సూత్రం చెపితే సూత్రం ఇలా ఉంటుంది.

2వ సూత్రం :
ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
గమనిక :
అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

8. గసడదవాదేశ సంధి :
కింది పదాలను ఎలా విడదీశారో గమనించండి.
1) గొప్పవాడుగదా = గొప్పవాడు + కదా డు + క)
2) కొలువు సేసి = కొలువు + చేసి (వు + చే)
3) వాడుడక్కరి = వాడు + టక్కరి (డు + ట)
4) నిజముదెలిసి = నిజము + తెలిసి (ము + తె)
5) పాలువోయక = పాలు + పోయక (లు + పో)

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదం చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీద, ప్రత్యయాలు క, చ, ట, త, ప లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ, లు ఆదేశంగా వస్తాయి. అంటే –
1) క – గ – గా మారుతుంది
2) చ – స గా మారుతుంది
3) ట – డ గా మారుతుంది.
4) త – ద – గా మారుతుంది
5) ప – వ గా మారుతుంది

అంటే క, చ, ట, త, ప లకు, గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి.

AP Board 8th Class Telugu Grammar

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గ స డ ద వ లు బహుళంగా వస్తాయి.

ద్వంద్వ సమాసంలో గ స డ ద వా దేశ సంధి :
కింది పదాలను గమనించండి.
కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి + లు
టక్కుడెక్కులు = టక్కు + టెక్కు + లు
తల్లి దండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు : ఊరు + పల్లె + లు
నల్ల గలువలు = నల్ల + కలువ + లు

గమనిక :
పై ఉదాహరణలు ద్వంద్వ సమాసపదాలు. పై ఉదాహరణలలో కూడా క చట త ప లకు గ స డ ద వ లు వచ్చాయి. దీన్నే గ స డ ద వా దేశం అంటారు.

గసడదవాదేశ సంధి
సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న క చ ట త ప లకు గ స డ ద వ లు క్రమంగా వస్తాయి.
కింది పదాలను కలపండి.
1) అక్క + చెల్లి = అక్కాసెల్లెండ్రు
2) అన్న + తమ్ముడు = అన్నదమ్ములు
3) నల్ల + కలువ = నల్ల కలువలు

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ అనే వర్ణాలకు అవే (స)వర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం తప్పనిసరిగా వస్తుంది.

గమనిక :
‘అ’ వర్ణానికి – ‘అ, ఆ’ లు – సవర్ణాలు
‘ఇ’ వర్ణానికి – ‘ఇ, ఈ’ లు – సవర్ణాలు
‘ఉ’ వర్ణానికి – ‘ఉ, ఊ లు’ – సవర్ణాలు
‘ఋ’ వర్ణానికి – ‘బు, ఋ’ లు – సవర్ణాలు

ఉదా :
1) రామానుజుడు = రామ + అనుజుడు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
2) రామాలయం = రామ ఆలయం – (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
3) కవీంద్రుడు = ఇంద్రుడు – (ఇ + ఇ = ఈ) = సవర్లదీర్ఘ సంధి
4) భానూదయం = భాను + ఉదయం (ఉ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి
5) వధూ పేతుడు = వధూ + ఉపేతుడు – (ఊ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి
6) పిత్రణం = పితృ + ఋణం – (ఋ + ఋ = ఋ) – సవర్ణదీర్ఘ సంధి
7) మాత్రణం = మాతృ + ఋణం – (ఋ + ఋ = ఋ) – సవర్ణదీర్ఘ సంధి
8) విద్యాధికుడు = విద్య + అధికుడు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
9) విలాపాగ్నులు = విలాప + అగ్నులు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
10) విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
11) ప్రేమానురాగాలు = ప్రేమ + అనురాగాలు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
12) పవనాగ్ని = పవన + అగ్ని – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Grammar

2. గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ) – గుణసంధి
మహేంద్రుడు = మహా + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ) – గుణసంధి
నరేంద్రుడు = నర + ఇంద్రుడు – (అ + ఇ = ఏ) – గుణసంధి
సురేంద్రుడు = సుర + ఇంద్రుడు – (అ + ఇ = ఏ) – గుణసంధి
నిజేచ్ఛ = నిజ + ఇచ్చ – (అ + ఇ = ఏ) – గుణసంధి

2.ఉదా :
పరోపకారం = పర + ఉపకారం – (అ + అ + ఉ) – గుణసంధి
మహోన్నతి = మహా + ఉన్నతి – (ఆ + ఉ + ఓ) – గుణసంధి
దేశోన్నతి = దేశ + ఉన్నతి – (అ + ఉ = ఓ) – గుణసంధి
గృహోపకరణం = గృహ + ఉపకరణం – (అ + ఉ = ఓ) – గుణసంధి
రజోవృష్టి = రజ + వృష్టి – (అ + ఉ = ఓ) – గుణ సంధి
గుళోన్నతి = గుణ + ఉన్నతి – (అ + ఉ = ఓ) – గుణసంధి
సూర్యోదయం = సూర్య + ఉదయం = (అ + ఉ = ఓ) = గుణసంధి

3. ఉదా :
రాజర్షి = రాజ + ఋషి – (అ + ఋ = అర్) – గుణసంధి
మహర్షి = మహా + ఋషి – (ఆ + ఋ = అర్) – గుణసంధి

గమనిక :
1) అ, ఆ లకు, ఇ, ఈ లు కలిసి ‘ఏ’ గా మారడం
2) అ, ఆ లకు, ఉ, ఊ లు కలిసి ‘ఓ’ గా మారడం
3) అ, ఆ లకు, ఋ, ౠ లు కలిసి ‘అర్’ గా మారడం.

పై మూడు సందర్భాల్లోనూ, పూర్వ స్వరం అంటే సంధి విడదీసినపుడు మొదటి పదం చివరి అచ్చు, అ, ఆ లుగా ఉంది. పర స్వరం, అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు ఇ, ఉ, ఋలుగా ఉన్నాయి.

గమనిక :
1) అ, ఆ లకు – ‘ఇ’ కలిస్తే ‘ఏ’ గా మారుతుంది.
2) అ, ఆ లకు – ‘ఉ’ కలిస్తే ‘ఓ’ గా మారుతుంది.
3) అ, ఆ లకు – ‘ఋ’ కలిస్తే ‘అర్’ గా మారుతుంది.

గమనిక :
ఏ, ఓ, అర్ అనే వాటిని గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణసంధి” అంటారు.

3. యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ, లకు అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా :
అ) అత్యానందం = అతి + ఆనందం – (త్ + ఇ + ఆ = యా) – యణాదేశ సంధి
1) అత్యంతం = అతి + అంతం – (అత్ + ఇ + అ + య) – యణాదేశ సంధి

ఉదా :
ఆ) అణ్వస్త్రం = అణు + అస్త్రం – (ణ్ + ఉ + అ = వ) – యణాదేశ సంధి
2) గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ – (ర్ + ఉ + ఆ = వ) – యణాదేశ సంధి

ఉదా :
ఇ) పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ – (బ + ఆ = రా) – యణాదేశ సంధి
3) మాత్రంశ = మాతృ + అంశ – (ఋ + అ = ర) – యణాదేశ సంధి

గమనిక :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు (వేరే అచ్చులు) పక్కన వచ్చినపుడు, క్రమంగా వాటికి య – వ – ర లు వచ్చాయి. యవరలను ‘యణ్ణులు’ అంటారు. యణ్ణులు చేరితే వచ్చే సంధిని ‘యణాదేశ సంధి అంటారు. యణాదేశ సంధిలో, ‘ఇ’ కి బదులుగా “య్”, ‘ఉ’ కి బదులుగా ‘వ్’, ‘ఋ’ కి బదులుగా ‘ర్‌’ వచ్చాయి.

యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు, అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

4. వృద్ధి సంధి
సూత్రం : అకారానికి ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారమూ వస్తాయి.
ఈ కింది పదాలను విడదీయండి.
1.ఉదా :
వసుధైక = వసుధా + ఏక- (అ + ఏ = ఐ) – వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక – (అ + ఏ = ఐ) – వృద్ధి సంధి
ఆ) సురైక = సుర + ఏక- (అ + ఏ = ఐ) – వృద్ధి సంధి

2. సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఇ) – వృద్ధి సంధి
అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం – (అ + ఐ = ఐ) – వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం – (అ + ఐ = ఐ) – వృద్ధి సంధి

3. పాపౌఘము = పాప + ఓఘము – (అ + ఓ = ఔ) – వృద్ధి సంధి
ఉ) వనౌకసులు = వన + ఓకసులు – (అ + ఓ = ఔ) – వృద్ధి సంధి
ఊ) వనౌషధి = వన + ఓషధి – (అ + ఓ = ఔ) – వృద్ధి సంధి

4. రసౌచిత్యం = రస + ఔచిత్యం – (అ + ఔ = ఔ) – వృద్ధి సంధి
ఋ) దివ్యౌషధం = దివ్య + ఔషధం – (అ + ఔ = ఔ) – వృద్ధి సంధి
ఋ) దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం – (అ + ఔ = ఔ) – వృద్ధి సంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనింపదగిన విషయం ఇది.
1. వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు, ప్రతిసారీ పూర్వస్వరంగా ‘అ’ వచ్చింది.
2. పర స్వరం స్థానంలో వరుసగా “ఏ, ఐ, ఓ, ఔ”లు ఉన్నాయి.
3. అకారానికి ఏ, ఐ లు కలిపినపుడు ‘ఐ’ వచ్చింది.
4. అకారానికి ఓ, ఔ లు కలిపినపుడు ‘ఔ’ వచ్చింది.

వృద్ధి సంధి
సూత్రం : అకారానికి ఏ, ఐ లు పరమైనపుడు ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైనపుడు ‘ఔ’ కారమూ వస్తాయి.

గమనిక :
ఐ, ఔ లను ‘వృద్దులు’ అంటారు.

AP Board 8th Class Telugu Grammar

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు గల రెండు పదాలు కలసి, ఏకపదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు.

గమనిక :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, క్రొత్తపదం ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని ఉత్తరపదం అంటారు.
ఉదా :
‘రామ బాణం’ అనే సమాసంలో, ‘రామ’ అనేది పూర్వపదం. ‘బాణం’ అనేది ఉత్తరపదం.

1. ద్వంద్వ సమాసం:
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని “ద్వంద్వ సమాసం” అంటారు. (సమాసంలోని రెండు పదాల అర్థానికి ప్రాధాన్యం గల సమాసం ద్వంద్వ సమాసం.)

ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.
1) ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు.
జవాబు:
అన్నదమ్ములు

2) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు

3) ప్రమాదంలో నా కాలుసేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలుసేతులు

I. ఈ కింది ద్వంద్వ సమాసాలను వివరించండి. విగ్రహవాక్యం రాయండి.
సమాస పదాలు – విగ్రహవాక్యాలు
1) ఎండవానలు – ఎండా, వానా
2) తల్లిదండ్రులు – తల్లి, తండ్రి
3) గంగాయమునలు – గంగ, యమున

II. ఈ కింది విగ్రహవాక్యాలను సమాసపదాలుగా మార్చండి.

విగ్రహము – సమాసపదం
1) కుజనుడూ, సజ్జనుడూ – కుజనసజ్జనులు
2) మంచి, చెడూ – మంచిచెడులు
3) కష్టమూ, సుఖమూ – కష్టసుఖములు
4) వజ్రమూ, వైడూర్యము – వజ్రవైఢూర్యాలు

2. ద్విగు సమాసం :
సమాసంలో మొదటి (పూర్వ) పదంలో సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసాలు అంటారు.
అభ్యాసం :
కింది సమాస పదాలను ఉదాహరణలలో చూపిన విధంగా వివరించండి.
ఉదా :
నవ రసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
1) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల జడలు
2) దశావతారాలు – దశ (10) సంఖ్య గల అవతారాలు
3) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్య గల రోజులు
4) నాలుగు వేదాలు – నాలుగు (4) సంఖ్య గల వేదాలు
5) మూడు రోజులు – మూడు (3) సంఖ్య గల రోజులు
6) రెండు రోజులు – రెండు (2) సంఖ్య గల రోజులు
7) రెండు చేతులు – రెండు (2) సంఖ్య గల చేతులు
8) ముగ్గురు దేవతలు- ముగ్గురు (3) సంఖ్య గల దేవతలు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్యావాచకం పూర్వపదంగా ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు “ద్విగు సమాసాలు”.

3. తత్పురుష సమాసం :
విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

అభ్యాసము :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాయండి.
సమాసం – విగ్రహవాక్యం
1) రాజభటుడు – రాజు యొక్క భటుడు
2) తిండి గింజలు – తిండి కొఱకు గింజలు
3) పాపభీతి – పాపము వల్ల భీతి

గమనిక :
‘రాజ భటుడు’ అనే సమాసంలో ‘రాజు’ పూర్వ పదం. ‘భటుడు’ ఉత్తర పదం. ‘రాజభటుడు’ కు విగ్రహవాక్యం రాస్తే; ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో యొక్క అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు రాజుకు చెందినవాడు అని చెప్పడానికి షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని వాడారు. ఈ విధంగా విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు “తత్పురుష సమాసాలు”.

గమనిక :
పూర్వ పదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి.

తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ, విగ్రహవాక్యం
1) ప్రథమా తత్పురుష సమాసం డు, ము, వు, లు మధ్యాహ్నం – అహ్నం యొక్క మధ్యభాగం
2) ద్వితీయా తత్పురుష సమాసం ని, ను, ల, కూర్చి, గురించి జలధరం – జలమును ధరించినది
3) తృతీయా తత్పురుష సమాసం చేత, చే, తోడ, తో బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
4) చతుర్డీ తత్పురుష సమాసం కొఱకు, కై వంట కట్టెలు – వంట కొఱకు కట్టెలు
5) పంచమీ తత్పురుష సమాసం వలన, (వల్ల) కంటే, పట్టి దొంగభయం – దొంగ వల్ల భయం
6) షష్ఠీ తత్పురుష సమాసం కి, కు, యొక్క, లో, లోపల రామబాణం – రాముని యొక్క బాణం
7) సప్తమీ తత్పురుష సమాసం అందు, న దేశభక్తి – దేశము నందు భక్తి
8) నఃణ్ తత్పురుష సమాసం నఞ్ అంటే వ్యతిరేకము అసత్యం – సత్యం కానిది

అభ్యాసం :
కింది సమాసాలు చదివి, విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో తెలపండి.

సమాసం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) రాజ పూజితుడు రాజుచే పూజితుడు తృతీయా తత్పురుషము
ఆ) ధనాశ ధనము నందు ఆశ సప్తమీ తత్పురుషము
ఇ) పురజనులు పురమందు జనులు సప్తమీ తత్పురుషము
ఈ) జటాధారి జడలను ధరించినవాడు ద్వితీయా తత్పురుషము
ఉ) భుజబలం భుజముల యొక్క బలం షష్ఠీ తత్పురుషము
ఊ) అగ్నిభయం అగ్ని వల్ల భయం పంచమీ తత్పురుషము
ఋ) అక్రమం క్రమం కానిది నఞ్ తత్పురుష సమాసం

తత్పురుష సమాసాలు :
విభక్తుల ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను గూర్చి తెలిసికొన్నారు. కింది వాటిని కూడా పరిశీలించండి.
1) మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యము (మధ్య భాగం)
2) పూర్వకాలము – కాలము యొక్క పూర్వము (పూర్వ భాగం)

గమనిక :
పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘మధ్యము’, ‘పూర్వము’గా మారతాయి. ఇలా పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాము. కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం = అసత్యం – సత్యం కానిది
2) నఞ్ + భయం = అభయం – భయం కానిది
3) నఞ్ + అంతము = అనంతము – అంతము కానిది
4) నఞ్ + ఉచితం = అనుచితం – ఉచితము కానిది

గమనిక :
సంస్కృతంలో ‘నఃగ్’ అనే అవ్యయం వ్యతిరేకార్థక బోధకం. దీనికి బదులు తెలుగులో అ, అన్ అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నఇస్’ అనే అవ్యయాన్ని బట్టి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు.

అభ్యాసం :
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామం పేర్కొనండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) అర్ధరాత్రి రాత్రి యొక్క అర్ధము ప్రథమా తత్పురుషం
ఆ) అనూహ్యము ఊహ్యము కానిది నఞ్ తత్పురుషం
ఇ) అక్రమం క్రమము కానిది నఞ్ తత్పురుషం
ఈ) అవినయం వినయం కానిది నఞ్ తత్పురుషం

సమాపక – అసమాపక క్రియలు

ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.

1) ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
2) వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది.
3) అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు.

AP Board 8th Class Telugu Grammar

అ) సమాపక క్రియలు :
పై వాక్యాలలో ప్రతివాక్యం చివరన ఉన్న వెళ్ళాడు, పెట్టాడు వంటి క్రియలు పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని సమాపక క్రియలు అంటారు.

ఆ) అసమాపక క్రియలు :
వాక్యం మధ్యలో ఉన్న ‘చేసి’ ‘గీసి’ ‘చదివి’ – అన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. వీటిని అసమాపక క్రియలు అంటారు.

ఇ) అసమాపక క్రియా – భేదాలు

1) క్త్వార్థకం : (భూతకాలిక అసమాపక క్రియ)
భాస్కర్ ఆట ఆడి, అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఈ వాక్యంలో భాస్కర్ ‘కర్త’. ‘వచ్చాడు’ అనేది కర్త. వాచకానికి చెందిన ప్రధాన క్రియ.

ఆడి, అలసి అనేవి కర్తృవాచక పదానికి చెందిన ఇతరక్రియలు. ఆడి, అలసి అనే పదాలు క్రియలే కాని, వాటితో పూర్తి భావం తెలియడం లేదు. ఆడి, అలసిపోయి అనే క్రియల తర్వాత, ఏం చేస్తాడు? అనే ప్రశ్న వస్తోంది. ఆడి, అలసిపోయి అనే క్రియలు, భూతకాలంలోని పనిని సూచిస్తున్నాయి. వీటిని భూతకాలిక అసమాపక క్రియలని క్వార్థకం’ అని పిలుస్తారు.

ఈ క్రియలన్నీ ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే చివరి – ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం ‘క్వార్థం’.
ఉదాహరణ :
పుష్ప అన్నం తిని నిద్రపోయింది. ఇందులో ‘తిని’ అనేది క్వార్థం (అసమాపక క్రియ)

2) శత్రర్థకం : (వర్తమాన అసమాపక క్రియ)
అఖిలేశ్ మధుకర్ తో ‘మాట్లాడుతూ’ నడుస్తున్నాడు. ఈ వాక్యంలో ‘నడుస్తున్నాడు’ అనే ప్రధానక్రియకు ‘మాట్లాడుతూ’ అనే ఉపక్రియ వర్తమాన కాలంలో ఉండి, అసమాపక క్రియను సూచిస్తుంది.

ఈ విధంగా ‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల వర్తమాన అసమాపక క్రియగా మారుతుంది. వర్తమాన అసమాపక క్రియను ‘శత్రర్థకం’ అంటారు.
ఉదా :
1) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది.
2) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.
3) సలీమా పాడుతూ నాట్యం చేస్తుంది.

గమనిక :
పై వాక్యాలలో 1) చదువుతూ 2) ఆలోచిస్తూ 3) పాడుతూ అనేవి శత్రర్థకములు.

3) చేదర్థకం : (ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.)
కింది వాక్యం చదవండి.

“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది.”

పై వాక్యంలో ప్రధాన క్రియ ‘వస్తుంది’ – ఇది ఫలితాన్ని సూచిస్తుంది. ఈ ఫలితం రావాలంటే షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ చేస్తే ఇది కారణం. అది కార్యం. ఈ విధంగా సంశ్లేష వాక్యాల్లో ప్రధాన క్రియ సూచించే పని జరగటానికి షరతును సూచించే క్రియ ‘చేదర్థకం’ అంటారు. చేత్ అర్థాన్ని ఇచ్చేది – చేదర్థకం. వీటిలో ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :
1. మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.
2. మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది.

అభ్యాసం :
ఈ కింది వాక్యంలోని అసమాపక క్రియలను రాయండి.
1) రమ రోడ్డు మీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి దగ్గరలో ఉన్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
జవాబు:
తీసి, వేసి, ఎక్కి అనేవి అసమాపక క్రియలు.

తద్ధర్మ క్రియలు :
ఒక వస్తువు స్వభావాన్నీ , ధర్మాన్ని తెలిపే క్రియలనూ, నిత్య సత్యాలను తెలిపే వాటినీ, ‘తద్దర్మ క్రియలు’ అంటారు.
ఉదా :
1) సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
2) సూర్యుడు పడమట అస్తమిస్తాడు.
3) పక్షి ఆకాశంలో ఎగురుతుంది

ప్రశ్నా వాక్యాలు :
ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నా వాక్యంగా మార్చవచ్చు.
ఉదా :
1) మీరు బడికి వెళతారా?
2) దైన్య స్థితిని చూస్తారా?

అభ్యాసం :
కింది వాటిని జతపరచండి.

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి అ) చేదర్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే ఇ) ప్రశ్నార్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? ఈ) క్వార్థకం

జవాబు:

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి ఈ) క్వార్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే అ) చేదర్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? ఇ) ప్రశ్నార్థకం

వాక్య రకాలు

వాక్యాలు మూడు రకాలు

  1. సామాన్య వాక్యం
  2. సంక్లిష్ట వాక్యం
  3. సంయుక్త వాక్యం

1) ఉష పాఠం చదువుతున్నది.
2) మురళి మంచి బాలుడు.

1) సామాన్య వాక్యం :
గమనిక :
పై మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియ లేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.

AP Board 8th Class Telugu Grammar

2) సంక్లిష్ట వాక్యం : ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.
ఉదా :
1) శ్రీకాంత్ అన్నం తిన్నాడు.
2) శ్రీకాంత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీకాంత్ అన్నం తిని బడికి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)

గమనిక :
పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అసమాపక క్రియలు ఉంటాయి. ఇటువంటి వాక్యాలను ‘సంక్లిష్ట వాక్యాలు’ అంటారు.

3) సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను ‘సంయుక్త వాక్యాలు’ అంటారు.
ఉదా :
1) సీత చదువుతుంది, పాడుతుంది.
2) అతడు నటుడు, రచయిత.
3) అశ్విని, జ్యోతి అక్కా చెల్లెండ్రు.

సామాన్య వాక్యాలు :
అ) రాజు అన్నం తిన్నాడు.
ఆ) గోపి పరీక్ష రాశాడు.
ఇ) గీత బడికి వెళ్ళింది.

గమనిక :
పై వాక్యాల్లో తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు. ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది. ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే, ఆ వాక్యాలను ‘సామాన్య వాక్యాలు’ అంటారు.

కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని.

సంక్లిష్ట వాక్యాలు :
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.

గమనిక :
పై సామాన్య వాక్యాలలో రెంటిలోనూ ‘గీత’ అనే నామవాచకం ఉంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ అనే దాన్ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.
ఉదా :
గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) 1) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు:
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది. (సంక్లిష్ట వాక్యం)

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు:
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
1) తాత భారతం చదివి, నిద్రపోయాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. (సామాన్య వాక్యాలు)

2) చెట్లు పూత పూస్తే, కాయలు కాస్తాయి. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
చెట్లు పూత పూస్తాయి. చెట్లు కాయలు కాస్తాయి. (సామాన్య వాక్యాలు)

3) రాముడు నడుచుకుంటూ వెళ్ళి, తన ఊరు చేరాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. రాముడు తన ఊరు చేరాడు. (సామాన్య వాక్యాలు)

AP Board 8th Class Telugu Grammar

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది. (సంక్లిష్ట వాక్యం)

2) మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది. (సంక్లిష్ట వాక్యం)

3) నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
నారాయణ అన్నం తింటూ, నీళ్లు తాగుతాడు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు. (సామాన్య వాక్యాలు)

2) రజియా పాట పాడుతూ ఆడుకుంటున్నది. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రజియా పాట పాడుతుంది. రజియా ఆడుకుంటున్నది. (సామాన్య వాక్యాలు)

సంయుక్త వాక్యం:

కింది వాక్యాలను గమనించండి.

విమల తెలివైనది. విమల అందమైనది – విమల తెలివైనది, అందమైనది.
ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి, ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు.

సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు వచ్చే మార్పులు :
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది, అందమైనది. (రెండు నామపదాల్లో ఒకటి లోపించడం)

ఆ) అజిత అక్క. శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కా చెల్లెళ్ళు. (రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది)

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా? ప్రొఫెసరా? (రెండు సర్వనామాల్లో ఒకటి లోపించింది)

కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు

1) కింది వాక్యాలను పరిశీలించి మార్పులను గమనించండి.
అ) సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.

గమనిక :
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కానీ వాక్య నిర్మాణంలో తేడా ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య భేదం ఇది.
1) “సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు”.

AP Board 8th Class Telugu Grammar

1) కర్తరి వాక్యం :
ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ కర్తను సూచిస్తుంది. కర్మకు ద్వితీయా విభక్తి చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం’ అంటారు.

2) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. అనే రెండవ వాక్యంలో
1) కర్తకు తృతీయా విభక్తి ఉంది.
2) క్రియకు ‘బడు’ అనే ధాతువు చేరింది
3) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

2) కర్మణి వాక్యం :
వాక్యంలో క్రియకు ‘బడు’ ధాతువు చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని ‘కర్మణి వాక్యం’ అంటారు.

అభ్యాసం – 1: కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 2 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచింపబడిన గ్రంథం నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను రచించిన గ్రంథం నేతాజీ చరిత్ర. (కర్తరి వాక్యం)

అభ్యాసం – 3 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
ఆళ్వారుస్వామి చిన్నప్పుడే కథ రాశారు (కర్తరి వాక్యం)
జవాబు:
చిన్నప్పుడే ఆళ్వారుస్వామిచే కథ రాయబడింది. (కర్మణి వాక్యం)

అ) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఉసిరికాయ తీసి లింగయ్య చేత నాయకునికి ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పిల్లలతో నాయకుల చేత అరగంట కాలం గడుపబడింది. (కర్మణి వాక్యం)

ఇ) వాద్యాల చప్పుడు విన్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 4 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని తీసుకుపోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని తీసుకుపోయారు. (కర్తరి వాక్యం)

ఆ) కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
కాయలు అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)

ఇ) బాలురచే సెలవు తీసికోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసికొన్నారు. (కర్తరి వాక్యం)

అలంకారాలు

అలంకారం : చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.
అలంకారాలు రెండు రకాలు :
అ) శబ్దాలంకారాలు
ఆ) అర్థాలంకారాలు

అ) శబ్దాలంకారాలు :
శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు”.

కింది గేయాన్ని గమనించండి.
“అది గదిగో మే
మేడకున్నది గో
గోడ పక్కన నీ
నీడలో కోడె దూ
దూడ వేసింది పే

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం మళ్ళీ మళ్ళీ వచ్చింది (అంటే పునరావృతమయ్యింది). ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం, వినసొంపు – ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

1) అంత్యానుప్రాసాలంకారం :
ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ఉదా :
1) భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ”

గమనిక :
పై కవితలో ప్రతి వాక్యం చివర ‘క్తి’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

2) ‘గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము

పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతిపాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

AP Board 8th Class Telugu Grammar

1. అంత్యానుప్రాసాలంకారం : (లక్షణం) :
పాదాంతంలో, లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, లేదా అక్షరాలు ఉంటే, దాన్ని ‘అంత్యానుప్రాసాలంకారం’ అంటారు.
కింది గేయాలు గమనించండి :
1) “వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట

గమనిక :
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ ఉంది. కాబట్టి అంత్యానుప్రాసాలంకారం దీనిలో ఉంది.
2) ‘తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుర్రపు కళ్ళెం

పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.

2. వృత్త్యనుప్రాసాలంకారం :
అక్షరం అనేక సార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదా :
నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా? నీవు నన్నేమన్నా అన్నావా?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాస’ అనే శబ్దాలంకారం.

అభ్యాసం :
1) కా కి కో కికా దు దా !
2) లచ్చి పుచ్చకాయలు తెచ్చిచ్చింది.

గమనిక :
మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ‘వృత్త్యనుప్రాసాలంకారం. ఈ కింది వాక్యాలు చూడండి.
1) ఆమె కవతో వడి వడి అడుగులతో గపను దాటింది.
2) చి చినుకులు ప మని పడుతున్నవేళ

గమనిక :
మొదటివాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.
ఈ ఉదాహరణలు కూడా చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్షక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యంక్ష్యమా.

గమనిక :
ఈ విధంగా ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.

3. ఛేకానుప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.
ఉదా :
“నీకు వంద వందనాలు”.

పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరు సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’ వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.

ఛేకానుప్రాస (లక్షణం):
హల్లుల జంట, అర్థభేదంతో వెంట వెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.
ఛేకానుప్రాసకు మరో ఉదాహరణ :
1) పాప సంహరుడు హరుడు

ఆ) అర్థాలంకారాలు :
అర్థ వైచిత్రిచేత అందాన్ని కలిగించేవి అర్థాలంకారాలు.

1. ఉపమాలంకారం :
1) ఆమె ముఖం అందంగా ఉంది.
2) ఆమె ముఖం చంద్రబింబం లాగా అందంగా ఉన్నది.

గమనిక :
పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబం లాగా అందంగా ఉంది. అనే వాక్యం మనలను ఆకట్టుకుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికిగాను అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.
ఉదా :
సోముడు భీముడి వలె బలవంతుడు.

గమనిక :
ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)
2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3) బలవంతుడు – సమానధర్మం (పోల్చడానికి వీలయిన సమాన గుణం)
4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

ఉపమాలంకారం (లక్షణం) :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ‘ఉపమాలంకారం’.

2. ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం “ఉత్ప్రేక్షాలంకారం”.
ఉదా :
ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.
ఉదా :
1) ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లు ఉన్నవి.
2) ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.
పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు
2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)

అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము. కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారము”.

AP Board 8th Class Telugu Grammar

3. రూపకాలంకారం (లక్షణం) :
ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ ఆ భేదాన్ని (భేదం లేదని) చెప్పడమే రూపకాలంకారం అంటారు.
ఉదా :
‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో
1) ‘మనస్సు’ – అనేది ఉపమేయము.
2) వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.

అభ్యాసం :
కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.
1) మా అన్న చేసే వంట నలభీమపాకం
2) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం

గమనిక :
మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికీ భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికీ భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలు ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. – ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.
1) లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లారు.
2) రుద్రమ్మ చండీశ్వరీ దేవి జల జలా పారించె శాత్రవుల రక్తమ్ము.
3) ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.
4) మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.
5) మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.

గమనిక :
పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.

4. అతిశయోక్తి అలంకారం :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.
కింది వాక్యాన్ని గమనించండి.
ఉదా :
ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాము.

‘అతిశయోక్తి అలంకారం : (లక్షణం) :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పటం.

5. స్వభావోక్తి అలంకారం :
ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని ‘స్వభావోక్తి’ అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తరిచూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.

స్వభావోక్తికి మరియొక ఉదాహరణము :
1) ఆ లేళ్ళు బెదురుచూపులతో, నిక్కపొడుచుకున్న చెవులతో, భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.

సమన్వయం :
ఇక్కడ లేళ్ళ యొక్క సహజగుణాన్ని ఉన్నది ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది ‘స్వభావోక్తి’ అలంకారము.

ఛందస్సు

కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమములకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.

1) లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు). హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.

2) గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు”.

గురులఘువుల గుర్తులు

లఘువు అని తెలుపడానికి గుర్తు : 1
గురువు అని తెలుపడానికి గుర్తు : U

గురులఘువుల నిర్ణయం

ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం.
AP Board 8th Class Telugu Grammar 1
AP Board 8th Class Telugu Grammar 2

బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధము :
AP Board 8th Class Telugu Grammar 3
గమనిక :
గురువులు కాని అక్షరాలన్నీ లఘువులు :

AP Board 8th Class Telugu Grammar 4

గణ విభజన

1) ఒకే అక్షరం గణాలు :
ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణం ఉంటాయి.
AP Board 8th Class Telugu Grammar 5

2) రెండక్షరాల గణాలు :
రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.
అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.
AP Board 8th Class Telugu Grammar 6
ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిపి గణంగా ఏర్పడితే అది ‘లగం’, లేదా ‘వ’ గణం అని అంటారు.
AP Board 8th Class Telugu Grammar 7
ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.
AP Board 8th Class Telugu Grammar 8
ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.
AP Board 8th Class Telugu Grammar 9

అభ్యాసము :
రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.
AP Board 8th Class Telugu Grammar 10

మూడక్షరాల గణాలు

మూడక్షరాల గణాలు మొత్తం ఎనిమిది (8).
AP Board 8th Class Telugu Grammar 11 AP Board 8th Class Telugu Grammar 12

అ) మూడక్షరాల గణాలను గుర్తించే సులభ మార్గం :
AP Board 8th Class Telugu Grammar 13

య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణం పేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ, గురు లఘువులు ఏ క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి. ఉదా : మీకు య గణము యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా రాయండి.

AP Board 8th Class Telugu Grammar 14

అభ్యాసం -1:
కింది పాదాలు ఏ వృత్తాలకు సంబంధించినవో గుర్తించండి.

1) పరమ తపోని వేశన ముబంగ రుపంట లకున్ని వాసమ (బ్బు)
AP Board 8th Class Telugu Grammar 15
1) పై పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం.
2) యతి 11వ అక్షరం – (ప – బ).
3) ప్రాస నియమం కలదు.
4) పద్యపాదంలో 21 అక్షరాలున్నాయి.

2) రాతరు ణమ్మిదే మరల రాదుసు నా గత కాలమెప్పుడున్
AP Board 8th Class Telugu Grammar 16
1) పై పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదం.
2) యతి 10వ అక్షరం (రా – రా).
3) ప్రాసనియమం కలదు.
4) పద్యపాదంలో 20 అక్షరాలు ఉన్నాయి.

అభ్యాసం – 2 :
కింద సూచించిన పద్యపాదాన్ని పూరించి గణ విభజన చేసి, అది ఏ పద్యపాదమో గుర్తించండి.
1. జాతి శిరస్సు నెత్తికొని ……
AP Board 8th Class Telugu Grammar 17
గమనిక :
1) పై పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదం.
2) యతి 10వ అక్షరం (జా – క్ష్మా).
3) ప్రాస నియమం కలదు.
4) పద్యపాదంలో 20 అక్షరాలున్నాయి.

ఆ) మూడక్షరాల గణాల నిర్ణయంలో మరో పద్దతి :
AP Board 8th Class Telugu Grammar 18
అని రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణం పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువులు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా : 1) య గణం = యమాతా – IUU – ఆది లఘువు
2) మ గణం = మాతారా – UUU – సర్వ గురువులు
3) త గణం = తెరాజ – UUI – అంత్య లఘువు
4) ర గణం = రాజభా – UIU – మధ్య లఘువు
5) జ గణం = జభాన – I U I – మధ్య గురువు
6) భ గణం = భానస – U II – ఆది గురువు
7) న గణం = నసల – III – సర్వ లఘువులు
8) లగం (లేక ‘వ’ గణం = I U = లఘువు, గురువు)

నాలుగు అక్షరాల గణములు

AP Board 8th Class Telugu Grammar 19

సూర్య గణాలు – ఇంద్ర గణాలు

AP Board 8th Class Telugu Grammar 20

2) ఇంద్ర గణాలు : ఇవి ఆఱు రకాలు : నల, నగ, సల, భ, ర, త – అనేవి ఇంద్ర గణాలు.
AP Board 8th Class Telugu Grammar 21
AP Board 8th Class Telugu Grammar 22

యతి – ప్రాసలు

I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి : పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
2. ప్రాస : పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

II. గమనిక : నియమం చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికీ, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ సౌకర్యం కలుగుతుంది.

3. యతి మైత్రి :
పద్యపాదము యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యంలో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరం మైత్రి కలిగి ఉండడాన్ని యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.

1. ఉత్పలమాల
కింది పద్యపాదాలను పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 23

గమనిక :
పై పాదాల్లో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.

యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గాని ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతి మైత్రి’ లేదా యతి స్థానం అంటారు.

పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – న; జే – సి) యతి.

ప్రాస :
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘య’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.

ఉత్పలమాల పద్యం లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 10వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

2. చంపకమాల
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 24

చంపకమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.

3. శార్దూలం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 25

శార్దూల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.

4. మత్తేభం
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 26

మత్తేభ పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

Leave a Comment