AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

SCERT AP 10th Class Social Study Material Pdf 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

10th Class Social Studies 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భారతదేశంలో వివిధ బృందాలు, వ్యక్తులు రెండవ ప్రపంచ యుద్ధం పట్ల స్పందించిన విధానాన్ని పోల్చటానికి ఒక పట్టిక తయారు చెయ్యండి. ఈ బృందాలు ఎటువంటి సందిగ్ధతకు లోనయ్యాయి? (AS1)
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం పట్ల వివిధ బృందాలు, వ్యక్తులు స్పందించిన విషయాలు :

కాంగ్రెస్ :
అనేకమంది కాంగ్రెస్ నాయకులు, హిట్లర్ ని, ముస్సోలినిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు. కాని భారతీయుల అభిప్రాయం కనుక్కోకుండా, రాష్ట్రాలలో భారతీయులచే పరిపాలన జరుగుచుండగా వారి అనుమతి లేకుండా, నిర్బంధంగా భారతీయులు యుద్ధానికి సహాయం చేయవలెనని ఆంగ్లేయులు చెప్పడం భారతీయులను అవమానించడమే అని కాంగ్రెస్ అన్నది.

ముస్లిం లీగు (జిన్నా) :
జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగు కూడా తమ పార్టీని ఆంగ్లేయులు ఆమోదించి, లీగు అనుమతితోనే పరిపాలనా విధానాన్ని రూపొందిస్తామని ఒప్పుకుంటే తమ పక్షం ఆంగ్లేయులకు సహాయం చేస్తుందని హామీ ఇచ్చాడు. అయితే ‘క్రిప్స్” రాయబారం విఫలం అవడంతో ముస్లిం లీగు కూడా తిరస్కరించింది.

గాంధీజీ :
గాంధీజీ యుద్ధానికి విముఖుడే. అహింసయే పరమధర్మం అని నమ్మిన గాంధీజీ ఎన్నడూ యుద్ధానికి సుముఖుడు కాడు. అయినను ఇంగ్లాండు క్లిష్ట పరిస్థితులలో ఉండగా యుద్ధంలో పాల్గొనలేకపోయినా, దానికెటువంటి నష్టం కలిగించకూడదని తలచినాడు.

ఫార్వర్డ్ బ్లాక్ సుభాష్ చంద్రబోస్ :
బోసు, భారతీయులు ఆంగ్లేయులకు ఎటువంటి సహాయం చేయరాదన్నాడు. ఆ దేశానికి సహాయం చేసినట్లయితే, భారతీయులకు ఎన్నటికి స్వతంత్రం రాదని వారందరూ శాసనోల్లంఘనం చేయవలెనని ఉపన్యాసాలు ఇచ్చినాడు.
1) సంస్థానాధీశులు
2) హిందూమహాసభ
3) జస్టీస్ పార్టీ
4) అంబేద్కర్ నాయకత్వంలోని హరిజనులు
5) భారత కమ్యూనిస్టు పార్టీలు యుద్ధంలో ఇంగ్లాండుకు సహాయం చేయాలని నిర్ణయించినాయి. కాంగ్రెస్ కు ఇతర బృందాలు, వ్యక్తులకు ఇతర స్వతంత్ర దేశాలను జయించటానికి ప్రయత్నిస్తున్న నాజీ, ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవాలని ఉన్నా తమకు స్వాతంత్ర్యం ఇస్తామని కనీసం మాట కూడా ఇవ్వని బ్రిటిష్ వారికి ఎందుకు సహాయం చేయాలనే సందిగ్ధతకు లోనయ్యాయి.

AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 2.
యూదులు, ఇతర సమూహాల పట్ల జర్మనీ దారుణంగా వ్యవహరించిన నేపథ్యంలో జర్మనీకి గాని, జపానుకి గాని మద్దతు ఇవ్వడం నైతికంగా సరైనదేనా? (AS1)
జవాబు:
సరైనది కాదు. ఎందుకనగా :

  1. జర్మనీ అనేకమంది యూదులను చీకటి గదుల్లో, నేలమాలిగళ్ళో బంధించి చంపింది.
  2. జర్మనీలోని “నాజీ” జాతి ప్రపంచంలోనే గొప్పజాతి అనే జాత్యాహంకారంతో జర్మనీ ఇతర దేశాలను చిన్నచూపు చూసింది.
  3. సామ్రాజ్య కాంక్షతో ఇతర స్వతంత్ర దేశాలను ఆక్రమించుకోవాలని చూసింది.
  4. జపాన్ ఆసియా ఖండానికి చెందిన చిన్నదేశం అయిన, యూరోపియన్ దేశాలతో పోటీపడుతూ దూరప్రాచ్యంలో వలసలను ఏర్పాటు చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది.
  5. సామాజ్య కాంకకు లోనయి ఇతర పెద్ద దేశాలను కవ్విస్తూ అనేక దేశాల మీద దాడులు జరిపింది.

ఇటువంటి నేపథ్యంలో జర్మనీ, జపాన్లకు మద్దతు ఇవ్వడం సరైనది కాదని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
భారతదేశ విభజనకు దారితీసిన వివిధ కారణాల జాబితా తయారుచేయండి. (AS1)
జవాబు:
భారతదేశ విభజనకు దారి తీసిన వివిధ కారణాలు :

  1. ముస్లింలకు ప్రత్యేక దేశం అనే భావనకు తొలి ఆధారం కవి “మహ్మద్ ఇక్బాల్” చేసిన ప్రసంగంలో కనిపిస్తుంది.
  2. 1930లో ముస్లిం లీగ్ అధ్యక్షోపన్యాసంలో ఇక్బాల్ వాయవ్య “భారత ముస్లిం దేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సూచించాడు.
  3. వాస్తవానికి కేంబ్రిడ్జిలో చదువుతున్న పంజాబ్ ముస్లిం విద్యార్థి “చౌదరి రెహ్మత్ ఆలీ” వర్గం దేశ విభజన భావనకు ఊపిరిపోసిందని చెప్పవచ్చు. 1933లో ప్రచురించిన ఒక కర పత్రంలో ” రెహ్మత్ ఆలీ” ముస్లిం వర్గానికి ప్రత్యేక జాతీయ ప్రతిపత్తి కల్పించాలనే అభిప్రాయంతో “పాకిస్తాన్” అనే పదానికి రూపకల్పన చేసాడు. (పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింద్, బెలూచిస్తాన్స్ ఇంగ్లీష్ అక్షరాల నుంచి పాకిస్తాన్ ఏర్పరచారు.)
  4. 1937 నుంచి ముస్లింలకు ప్రత్యేక దేశం అవసరం అనే భావనపై లీగ్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
    ఎ) 1935 చట్టపు ఫెడరల్ క్లాజులు అమల్లోకి వస్తాయన్న నమ్మకం వారికి సన్నగిల్లింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో తాము హిందూ ఆధిక్యతకు తలవంచక తప్పదనే అభిప్రాయం కూడా వారికి కలిగింది.
    బి) రాష్ట్రాలలో ముస్లిం లీగ్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనే లీగ్ ప్రతిపాదనకు కాంగ్రెస్ వారు నిరాకరించడం జిన్నాకు, ముస్లిం లీగ్ కు అవమానంగా తోచింది. కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని లీగు సృష్టించగలిగింది.
  5. విద్యావంతులైన ముస్లింలు పాకిస్తాన్ ఏర్పాటు కావాలని భావించసాగారు. మొదట విద్యార్థుల పగటి కలగా కొట్టివేసిన “ముస్లింలకు ప్రత్యేక దేశం” అనే భావన చివరికి ముస్లిం లీగ్ ప్రధాన డిమాండ్ గా రూపొందింది.
  6. రెండవ ప్రపంచయుద్ధం తరువాత బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ నాయకులలో అనేకమంది భారతీయులు స్వాతంత్ర్యం పొందడానికి సుముఖంగా ఉన్నారు.
  7. బ్రిటన్ “విభజించి – పాలించు” అనే విధానాన్ని పాటిస్తూ కాంగ్రెస్ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ, ముస్లిం లీగు ప్రణాళికలకు మద్దతు ఇచ్చి, ముస్లిం లీగు బలపడేలా చేసింది.
  8. హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్, భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కలుగచేసారు.
  9. రెండవ ప్రపంచయుద్ధం తరువాత అగ్రరాజ్యాలుగా రూపొందిన అమెరికా, సోవియట్ యూనియన్లకు భారతదేశ స్వాతంత్ర్య డిమాండ్ ను సమర్ధించాయి.
  10. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలలో ప్రజల ప్రతిపాదన, ప్రత్యేక పాకిస్తాన్ దేశం కావాలని, ఇది కూడా పాకిస్తాన్ ఏర్పాటుకు ఒక కారణం.
  11. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగిన ఎన్నికలలో 569 స్థానాలలో 442 స్థానాలకు కేంద్రంలో 30 స్థానాలను గెలుచుకుంది. అంటే 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధానపార్టీగా ముస్లిం లీగు ఆవిర్భవించి, భారతీయ ముస్లింల “ఏకైక ప్రతినిధి” అన్న తన వాదనను నిజం చేసుకుంది.
  12. చర్చలతో స్వాతంత్ర్యం రాదని లీగు భావించి, ప్రజలను వీధులలోకి రమ్మని పిలుపునిస్తూ ‘ప్రత్యక్ష కార్యాచరణ”కు దిగటానికి నిర్ణయించుకొని 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. ఇది అనేక అల్లర్లు, హింసకు కారణమైంది.

1947లో “వావెల్” స్థానంలో మౌంట్ బాటెన్ వచ్చి ఆఖరి దఫా చర్చలకు ఆహ్వానించాడు. ఇవి కూడా విఫలం అవడంతో ఆగస్టు 14, 1947న పాకిస్తాన్‌కు, ఆగస్టు 15, 1947న భారత్ కు స్వాతంత్ర్యం ఇస్తామని ప్రకటన చేశాడు. ఈ విధంగా భారత్, పాక్లు విభజింపబడినాయి.

ప్రశ్న 4.
దేశ విభజనకు ముందు వివిధ సమూహాల మధ్య అధికారాన్ని పంచుకోటానికి ఏ ఏ విధానాలను అవలంభించారు? (AS1)
జవాబు:
దేశ విభజనకు ముందు ముస్లిం లీగు, కాంగ్రెస్ మధ్య అధికారాలను పంచుకున్నారు.

1945లో పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ముందుగా వైస్రాయ్, సైనికా దళాల కమాండర్ – ఇన్ – చీఫ్ మినహా కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని భారతీయులతోనే ఏర్పరచటానికి బ్రిటన్ సిద్ధం అయ్యింది. ఈ కార్యనిర్వాహక వర్గంలో ముస్లిం సభ్యులను ఎంపిక చెయ్యటానికి ముస్లిం లీగుకి సంపూర్ణ అధికారం ఉండాలని జిన్నా పట్టుబట్టడంతో అధికార బదిలీకి సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. జాతీయవాద ముస్లిములలో పలువురి మద్దతు కాంగ్రెస్ కు ఉంది. పంజాబ్ లోని యూనియనిస్టు పార్టీలో పలువురు ముస్లింలు సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు ముస్లిం లీగు కోరికను సమర్థించలేదు. 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధాన పార్టీగా ముస్లిం లీగు ఆవిర్భవించి భారతీయ ముస్లిముల ఏకైక ప్రతినిధి’ని అన్న తన వాదనను నిజం చేసుకుంది. ముస్లిం ఓట్లలో 86 శాతానికి పైగా ఆ పార్టీకి వచ్చాయి. 1946లో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91 శాతంతో అఖండ విజయం సాధించింది.

ప్రశ్న 5.
బ్రిటిష్ వలస పాలకులు తమ విభజించి, పాలించు అన్న విధానాన్ని భారతదేశంలో ఏ విధంగా అమలు చేశారు? నైజీరియాలో అవలంబించిన విధానానికీ, దీనికీ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
బ్రిటిష్ వలస పాలకులు భారతదేశంలో “విభజించి – పాలించు” అన్న విధానాన్ని ఈ క్రింది విధంగా అమలు చేసారు.

  1. హిందూ-ముస్లిం మత వైరుధ్యాన్ని పోషించారు.
  2. కమ్యూనల్ ఎలక్టోరేట్లను ప్రవేశపెట్టడం ద్వారా మొదట విద్యావంతులయిన భారతీయులలోనూ తరువాత సాధారణ ప్రజానీకంలోను ఈ శత్రుత్వాన్ని పెంచి పోషించారు.
  3. హిందీ, ఉర్దూ భాషల విషయంలో ఏర్పడ్డ వివాదాన్ని గోసంరక్షణ ఉద్యమాన్ని సైతం వీరు ఉపయోగించుకున్నారు.
  4. మితవాదులను ప్రోత్సహిస్తూ జాతీయవాదులలో చీలిక తీసుకువచ్చారు. దాదాబాయ్ నౌరోజీ వంటి వారి నుండి ‘జసిస్ రనడే’ వంటి విప్లవనాయకులను వేరు చేయడానికి ప్రయత్నించారు.
  5. అతివాదులకు వ్యతిరేకంగా మితవాదులను ప్రోత్సహించారు.
  6. శీఘ్రంగా పెరిగిపోతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని నిలువరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం విభిన్న విధానాలను అనుసరించింది. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహించింది.
భారతదేశం నైజీరియా
1) హిందూ-ముస్లిం మత వైరుధ్యాన్ని పోషించారు. 1) బ్రిటిష్ వలసపాలకుల విధానాల వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగాయి.
2) కమ్యూనల్ ఎలక్టోరేట్లను ప్రవేశపెట్టడం ద్వారా మొదట విద్యావంతులయిన భారతీయులలోనూ తరువాత సాధారణ ప్రజానీకంలోను ఈ శత్రుత్వాన్ని, పెంచి పోషించారు. 2) బ్రిటిష్ వలసపాలకులు పశ్చిమ, తూర్పు నైజీరియా ప్రాంతాలను ఏర్పరచి, మొరుబా, ఈబు తెగల మధ్య విభజనలు సృష్టించారు.
3) హిందీ, ఉర్దూ భాషల విషయంలో ఏర్పడ్డ వివాదాన్ని గోసంరక్షణ ఉద్యమాన్ని సైతం వీరు ఉపయోగించు కున్నారు. 3) విద్యావంతులైన ఆఫ్రికావాసులను సివిల్ సేవలకు అనుమతించకపోవడం, ఆఫ్రికా వ్యాపారవేత్తల పట్ల వివక్షత చూపడం జరిగింది.
4) మితవాదులను ప్రోత్సహిస్తూ జాతీయవాదులలో చీలిక తీసుకువచ్చారు. దాదాబాయ్ నౌరోజీ వంటి వారి నుండి “జస్టిస్ రనడే’ వంటి విప్లవనాయకులను వేరు చేయడానికి ప్రయత్నించారు. అతివాదులకు వ్యతిరేకంగా మితవాదులను ప్రోత్సహించారు. 4) ప్రజలపై మరింత నియంత్రణను సాధించటానికి వీలుగా గిరిజన తెగ నాయకులు, సంపన్నులతో సంబంధాలు నెరిపింది.
5) శీఘ్రంగా పెరిగిపోతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని నిలువరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం విభిన్న విధానాలను అనుసరించింది. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహించింది. 5) జాతీయ ఉద్యమ తీవ్రతకు లోబడి, మూడు ప్రధాన ప్రాంతాల స్వయం ప్రతిపత్తిని గుర్తిస్తూ సంక్లిష్ట సమాఖ్య వ్యవస్థను నెలకొల్పి నైజీరియాన్లకు అధికారాన్ని అప్పగించింది.

ప్రశ్న 6.
దేశ విభజనకు ముందు రాజకీయాలలో మతాన్ని ఏ ఏ విధంగా ఉపయోగించుకున్నారు? (AS1)
జవాబు:
దేశ విభజనకు ముందు రాజకీయాలలో మతం కీలకపాత్ర వహించి, చివరికి దేశ విభజనకు దారి తీసింది.

  1. వర్తకం, పరిశ్రమ, ప్రభుత్వ సర్వీసు, విద్య, వృత్తుల వంటి రంగాలలో హిందువుల ప్రాబల్యం కారణంగా అధిక సంఖ్యాకులయిన హిందూ సముదాయం పట్ల అల్పసంఖ్యాకులయిన ముస్లిం సముదాయం పెంచుకొన్న భేదభావాలే దేశ విభజనకు దారి తీసాయని చెప్పవచ్చు.
  2. 1857 సిపాయిల తిరుగుబాటు కేవలం మహమ్మదీయులు రాజకీయంగా అసంతృప్తి చెంది తెచ్చిన విప్లవమని భావించి బ్రిటిష్ వారు ముస్లింలను ఆ విధంగా వ్యతిరేకభావంతోనే చూశారు.
  3. ‘విభజించి – పాలించు’ విధానాన్ని అనుసరించి బ్రిటిష్ వారు హిందువులను-ముస్లింలను మతాలవారీగా విడదీయటానికి పరోక్షంగా పథకాలు వేశారు.
  4. ముస్లింలలో పాశ్చాత్య విద్యావ్యాప్తి మందకొడిగా సాగిన కారణంగా వారిని ఏదో విధంగా స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉంచడానికి ప్రభుత్వం కృషి చేసింది.
  5. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన విద్యాపరమైన అలిఘర్ ఉద్యమం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రాజకీయ అధికారుల కోసం ముస్లీమ్ మతతత్వాన్ని ప్రోత్సహించారు. ఈయన తన చివరి రోజులలో ముస్లింలను జాతీయోద్యమం నుంచి వైదొలగడమే కాక హిందువులు, మహమ్మదీయులు పరస్పర విరుద్ధ రాజకీయ ప్రయోజనాలున్న వర్గాలని ప్రకటించాడు.
  6. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కృషి వల్ల ‘బిద్రుద్దీన్ త్యాబ్ది’ లాంటివారు విద్యాధికులయ్యారు. వీరు అల్పసంఖ్యాకులైన తమకు ఉద్యోగాలు రావాలంటే బ్రిటిష్ వారికి విధేయులై ఉండాలని ఉద్భోదించారు.
  7. తిలక్, అరబిందు వంటివారు ప్రాచీన హిందూ సంస్కృతికి ప్రాధాన్యమిచ్చి, హిందూమత ప్రాతిపదికకు పిలుపునిచ్చారు.
  8. తిలక్ గణపతి పూజ, శివాజీ ఉత్సవాలకు ప్రాధాన్యమిచ్చి, హిందువులను ఐక్యం చేయడానికి ప్రయత్నించాడు.
  9. ముస్లింలను ప్రోత్సహించడానికి బ్రిటిష్ వారు 1906 లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను వేర్పాటు చేసి, ఏర్పాటు వాదాన్ని పెంచినారు.
  10. హిందువులు కూడా మతతత్వంను పెంచుతూ అనేకమంది హిందూ నాయకులు హిందూ జాతీయతను గురించి చెప్పడం, వారి హక్కుల పరిరక్షణ కొరకు “హిందూ మహాసభ”, ఆర్.ఎస్.ఎస్. వంటి సంస్థలను ఏర్పాటు చేసుకొన్నారు. భారతదేశం హిందువుల మాతృదేశమని, ముస్లింలు విదేశీయులని ప్రచారం చేసారు.

ప్రశ్న 7.
స్వాతంత్ర్య పోరాటం చివరి సంవత్సరాలలో కార్మికులను, రైతాంగాన్ని ఏ విధంగా సమీకరించారు? (AS1)
జవాబు:
భారతీయ కార్మిక వర్గానికి అక్షరాస్యత తక్కువే కాకుండా సాంస్కృతికంగా కూడా వెనుకబడి ఉంది. అందుకే మేధావులు, బూర్జువా వర్గాల కన్నా, వీరిలో జాతీయ, వర్గ చైతన్యం ఆలస్యంగా ప్రారంభమయిందని చెప్పవచ్చు. 1917లో రష్యన్ విప్లవం మూలంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి కార్మికసంఘ ఉద్యమాలకు కారణం అయ్యాయి. కార్మికుల యొక్క పని గంటలు, వేతనాలలో సంస్కరణలు తీసుకురావడం కొరకు అనేక కార్మికసంఘాలు, మద్రాస్ కార్మికసంఘం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ (ఐ.టి.యు.ఎఫ్), ఎ.ఐ.టి.యు.సి., నేషనల్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ల వంటివి ఆవిర్భవించాయి. 1935-39లో కార్మిక కార్యకలాపాలను పునరుద్ధరించడంలో సమ్మెలు కూడా తగ్గినాయి. 1935 చట్టం కార్మిక నియోజకవర్గాలను ఏర్పాటుచేసింది. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేశారు. సమ్మెలు చేశారు. భారత కమ్యూనిస్ట్, సోషలిస్ట్ పార్టీలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాయి. వివిధ దశల్లో చేసిన వివిధ చట్టాల వల్ల కార్మికుల పని పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. కార్మికులు తమ • నాయకుల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య పోరాటంలో జాతీయ నాయకులకు పూర్తి మద్దతు ఇచ్చారు.

“చంపారన్” సత్యాగ్రహం బీహార్ రైతులలో చైతన్యాన్ని కలిగించింది. “ఖేరా’ కరవు విషయంలో గాంధీజీ సత్యాగ్రహం చేయడం రైతులకు రక్షణ కలిగించింది. రైతులు తమ కోర్కెల సాధన కొరకు సత్యాగ్రహాన్ని ఉపయోగించుకోవచ్చని రైతులు భావించసాగారు. ఇటువంటి సమయంలో రైతులను రాజకీయాలవైపు ఆకర్షిస్తూ, లక్షలాది రైతులను సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేటట్టు చేయగలిగింది. దశాబ్దాల నుంచి రాజకీయ అంధకారంలో మగ్గుతున్న రైతులను రాజకీయ సుడిగుండంలోకి తీసుకురాగలిగింది. 1917 నుంచి గాంధీజీ ఆయన అనుచరులు భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రైతుల జీవితంలో జాతీయ రాజకీయాలను ప్రవేశపెట్టడంలో విజయం సాధించారు. 1923 లో ప్రముఖ రైతు నాయకుడు “యన్. జి. రంగా” “రైతుల సమాఖ్య”ను ఏర్పాటుచేశాడు. గుంటూరు జిల్లాలో రైతులు ఈయనకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఈ రైతు సమాఖ్యలు పశ్చిమగోదావరి, కృష్ణాలకు విస్తరించినాయి. 1929 లో “ఆంధ్రరైతుల ప్రొవిన్షియల్ సమాఖ్య” యన్.జి.రంగా అధ్యక్షతన సమావేశమై రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను సమర్ధించింది. 1942లో భారత రైతులు ‘శాసనోల్లంఘన’ ఉద్యమం పిలుపుకు వీరోచితంగా స్పందించినారు. బెంగాల్ లోని మిడ్నపూర్‌లో రైతుల తిరుగుబాటు కారణంగా కొన్ని సంవత్సరాలపాటు బ్రిటిష్ వారు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయారు.

ఈ విధంగా భారతదేశంలోని రైతు ఉద్యమాలకు చైనాలోని ‘మావో’ లాగ సరైన నాయకత్వం గనుక లభించి ఉంటే భారతదేశ చరిత్ర మరోలా ఉండేదనడం నిర్వివాదాంశం. హైదరాబాద్లో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణా ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది.

ప్రశ్న 8.
సాధారణ ప్రజల జీవితాలను దేశ విభజన ఏ విధంగా ప్రభావితం చేసింది ? విభజన తరువాత జరిగిన వలసలకు రాజకీయ ప్రతిస్పందన ఏమిటి? (AS1)
జవాబు:
ముస్లిం మత పాకిస్తాన్ ఏర్పాటు కావటంతో చాలామంది ప్రజల ముందు ఊహించని బాధాకరమైన పరిస్థితి ఎదురయ్యింది. కొత్తగా గీసిన సరిహద్దు రేఖకి ఒకవైపున ఉన్న హిందువులలో అభద్రతా భావం ఏర్పడి వలస వెళ్లడం తప్పనిసరి అయ్యింది. ఈ కొత్త సరిహద్దు రేఖకు ఆవలివైపున ఉన్న ముస్లిములలో కూడా ఇదే పరిస్థితి. అందరూ దీనిని కోరుకుని ఉండకపోవచ్చు. ఇది ఎందుకు జరుగుతోందో అందరికీ అర్థం అయి ఉండకపోవచ్చు. తమ ఇళ్లు, ఊళ్లు, పట్టణాలను విడిచి వెళ్లవలసి రావటంతో ఒకరిపట్ల ఒకరికి కోపం, విద్వేషాలు చెలరేగాయి. మొత్తంగా 1.5 కోట్ల హిందువులు, ముస్లిములు నిర్వాసితులయ్యారు. హత్యలు, దోపిడి, దహనాలు యధేచ్ఛగా కొనసాగాయి. హిందువులు, ముస్లిములు కలిపి రెండు నుంచి అయిదు లక్షలమంది చంపబడ్డారు. వాళ్లు కాందిశీకులుగా మారారు, పునరావాస శిబిరాలలో గడిపారు. రైళ్లల్లో కొత్త ఇళ్ల అన్వేషణలో బయలుదేరారు. శాంతి, సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య, ఆసుపత్రులలో గడిపాడు. తను ఇంతగా కష్టపడింది ఇటువంటి స్వేచ్ఛ, స్వరాజ్యాల కోసం కాదు. జాతిపిత మొదటి స్వాతంత్ర్య దినోత్సవంనాడు సంబరాలు చేసుకోకుండా నిరాహారదీక్ష చేశాడు.

గాంధీజీ చొరవతో “అల్పసంఖ్యాక వర్గాల హక్కుల’ పై నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేశాయి. ఆ పార్టీ “రెండు దేశాల సిద్ధాంతాన్ని” ఎప్పుడూ అంగీకరించలేదు. తన ఇష్టానికి వ్యతిరేకంగా దేశవిభజనకు బలవంతంగా ఒప్పుకోవలసి వచ్చినప్పటికీ ‘భారతదేశం అనేక మతాల, జాతుల దేశమనీ, అలాగే కొనసాగాలని’ విశ్వసించింది. పాకిస్తాన్ ఎలా ఉన్నప్పటికీ భారతదేశం ‘ప్రజాస్వామిక లౌకికరాజ్యం ‘ గా ఉంటుంది. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుండి రక్షణ లభిస్తుంది. సమాన హక్కులు ఉంటాయి.

ప్రశ్న 9.
కొత్తగా ఏర్పడిన భారతదేశంలోకి వివిధ సంస్థానాలను విలీనం చేసే ప్రక్రియ ఒక సవాలుగా పరిణమించింది. చర్చించండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ అధికారం కింద వివిధ స్థాయిలలో సర్వసత్తాక పాలనతో సుమారుగా 550 సంస్థానాలు ఉండేవి. 1947 భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం సంస్థానాధీశులు తమ ఇష్ట ప్రకారం తమ భవిష్యత్తును నిర్ణయించుకొనే అధికారం పొందారు. దీని మూలంగా కొంతమంది రాజులు స్వతంత్రంగా ఉంటామని ప్రకటించినారు. భోపాల్ నవాబు కాంగ్రెస్ ప్రభావం ఉన్న భారతదేశం చేరడానికి సుముఖంగా లేక, అతడు భారత ప్రభుత్వ రాజకీయ శాఖతోనూ, ముస్లింలీగుతోను రహస్యంగా కుమ్మక్కవుతున్నాడని తెలిసి, దేశీయాంగ మంత్రి సర్దార్ వల్లభబాయి పటేల్ భోపాల్ పాకిస్తాన్లో కాని చేరినట్లయితే దేశ సమగ్రతకు భంగం కలిగే ప్రమాదం ఉండటంతో పటేల్, భోపాల్ ను భారతదేశంలో కలిపివేసినారు.

1947 ఆగష్టు 15 నుండి బ్రిటిష్ ఆధిపత్యం తొలగుతుందని సంస్థానాధీశులు ఇండియా, పాక్లో దేనిలో అయినా చేరనూవచ్చు లేదా స్వతంత్రంగా ఉండనూవచ్చు అని మౌంట్ బాటెన్ ప్రకటించాడు.

ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్యం, సంస్థానాధీశుల మూలంగా చిన్నాభిన్నం కావడం ఇష్టంలేని పటేల్ స్వతంత్ర రాజులను ఒప్పించడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. దాని ప్రకారం సంస్థానాధీశుల అధికారం బ్రిటిష్ ఆధీనంలో ఉన్నప్పటిలాగానే విదేశీ వ్యవహారాలు, రక్షణ, ప్రయాణ సౌకర్యాలు తప్ప మిగిలిన అధికారాలన్నీ రాజులకు కల్పించబడతాయి అని పటేల్ ప్రకటించగానే బరోడా, బికనీర్, కొచ్చిన్, జైపూర్, జోధ్ పూర్, పాటియాల, రేవా వంటి అనేక సంస్థానాలు భారత్ లో కలిసాయి.

1947 ఆగష్టు 15 నాటికి హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్ తప్ప తక్కిన సంస్థానాధీశులందరూ భారత్ లో చేరతామని ప్రకటించినారు. ఒక్క రక్తం చుక్క కూడా చిందించకుండా అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశ ఐక్యతకు తోడ్పడినాడు.

జునాగఢ్ :
ఈ సంస్థానంలో 75% ప్రజలు హిందువులు. కాని నవాబు జిన్నాకు అనుకూలుడు. అనేకమంది హిందువులను తరిమికొట్టాడు. జునాగఢ్ పాకిస్తాన్లో కలుస్తుందని ప్రకటించాడు. ప్రజలు తీవ్ర ఆందోళన లేవదీశారు. అందువల్ల సర్దార్ పటేల్ జునాగఢ్ మీదకి సైన్యాలను పంపాడు. ప్రజాభిప్రాయ సేకరణ చేశాడు. ప్రజాభిప్రాయం ప్రకారం జునాగఢ్ భారతదేశంలో విలీనమైంది. నవాబు పాకిస్తాన్ పారిపోయాడు.

హైదరాబాద్ :
నిజాంను ప్రభుత్వం సమానస్థాయి ఉన్న రాజ్యాధినేతగా పరిగణించింది. కాని సంతృప్తి చెందని నిజాం తన రాజ్యానికి సముద్రతీరం ఉండాలని ‘గోవా’ ను పోర్చుగీసు వారి నుండి కొనడానికి సన్నద్ధమయి, పాకిస్తాన్ నుండి సైన్యాన్ని, ఆయుధాలను చేరవేయడం జరిగింది. హైదరాబాదులోని భూస్వాములు, అధికారుల దురాగతాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం బయలుదేరింది. ఇది సాయుధ పోరాటంగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకొని కాసిం రజ్వీ’ నాయకత్వంలో రజాకార్లు బయలుదేరి పౌర జీవనాన్ని స్తంభింపచేశారు. జిన్నా, ప్రపంచ ముస్లింలందరూ దీనికి సానుభూతి చూపి భారతను ఎదిరించాలని ప్రకటించాడు. ఈ చర్యల మూలంగా దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందని పటేల్ భావించి 1948 సెప్టెంబరు 13న భారత సైన్యాలను హైదరాబాద్ మీదకి పంపినాడు. కాసీం రజ్వీ, అతని అనుచరులు పారిపోయారు. నిజాం 1948 సెప్టెంబరు 17వ తేదీన భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. భారత ప్రభుత్వం హైదరాబాదును భారతదేశంలో విలీనం చేసి, ఈ చర్యను “పోలీసు చర్య”గా ప్రకటించింది.

కాశ్మీర్ :
కాశ్మీర్ లో ముస్లిం జనాభా ఎక్కువ. కాని రాజు హిందువు. పాకిస్తాన్ సేనలు కాశ్మీర్ లోకి చొచ్చుకొని వచ్చాయి. దీని మూలంగా రాజు, కాశ్మీర్ భారత్ లో చేరిపోతుందని ప్రకటించి, భారత్ సహాయాన్ని కోరినాడు. భారత్, పాకు దాదాపు ఒక సంవత్సరం పోరాటం చేసారు. చివరికి ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన కమిషను మూలంగా పోరాటం ఆగింది. కాని కాశ్మీర్ లో కొంత భాగం పాక్ ఆక్రమణలో ఉండిపోయింది.

దేశ సమైక్యతకు భంగం కలిగించే ఈ సంస్థానాధీశులను చాలా చాకచక్యంగా ఎదుర్కొన్నవారు సర్దార్ పటేల్. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు పొందినాడు.

10th Class Social Studies 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 InText Questions and Answers

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 1.
ప్రభుత్వాలు రాజీనామా చేస్తే రోజు వారీ వ్యవహారాలను ఎవరు నిర్వర్తిస్తారు?
జవాబు:
ప్రభుత్వాలు రాజీనామా చేసినప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. కాబట్టి రోజువారీ కార్యక్రమాలను వారు నిర్వర్తిస్తారు. దైనందిన వ్యవహారాలు స్పందించకుండా ఉద్యోగులు తమ విధులను నిర్వర్తిస్తారు.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 2.
భారతీయులు తమ స్వాతంత్ర్య పోరాటాన్ని పక్కన పెట్టి స్వేచ్ఛాయుత ప్రపంచంపై దృష్టి కేంద్రీకరించాల్సినంతగా హిట్లర్ బలం పుంజుకుని మానవాళి స్వేచ్ఛకు ముప్పు కలిగించేవాదా?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం తరువాత ఆమోదించిన రెహ్మత్ ఆలివర్సయిల్స్ సంధి షరతులు జర్మనీకి అవమానకరంగా ఉన్నాయని హిట్లర్ భావించాడు. ఇతర దేశాల ఆధీనంలో ఉన్న జర్మన్ భూభాగాలను ఏకం చేయాలని ఆశించాడు. సంధి షరతులను ఉల్లంఘించినాడు. పెద్ద దేశాలను ఎదిరించి, దూర ప్రాచ్యంలో తమకు కూడా వలసలు కావాలని ఆశించాడు. జర్మనీని చూసి అగ్రరాజ్యలు భయపడేలా చేసాడు. అయితే మన స్వాతంత్ర్య పోరాటం వదిలి స్వేచ్ఛాయుత ప్రపంచం కొరకు దృష్టి పెట్టవలసినంత అవసరం లేదు. జర్మనీకి భారత జాతీయ పోరాటం మీద సానుభూతి కూడా ఉంది.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 3.
రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ని సమర్ధించటానికి, సమర్థించకపోవటానికి మీ కారణాలను పేర్కొనండి.
జవాబు:

  1. బ్రిటనను సమర్థిస్తాను. ఎందుకనగా జాత్యాహంకారంతో, సామ్రాజ్యకాంక్షతో ఇతర స్వతంత్రదేశాలను ఆక్రమించు కుంటున్న జర్మనీ, జపాన్ వంటి దేశాల ఆటకట్టించడానికి బ్రిటన్ యొక్క ప్రయత్నాన్ని నేను సమర్ధిస్తాను.
  2. భారతీయులను సంప్రదించకుండా, వారితో ప్రమేయం లేకుండా, యుద్ధం తరువాత స్వాతంత్ర్యం ఇస్తామని కనీసం మాట కూడా ఇవ్వకుండా, భారత్ యుద్ధంలో పాల్గొనాలని బ్రిటిష్ ప్రకటించడాన్ని నేను సమర్థించను.

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 4.
బ్రిటన్ దృక్పథం పట్ల నిరసన వ్యక్తపరచటానికి కాంగ్రెస్ ఏ చర్య చేపడితే బాగుండేది?
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటన్ దృక్పథం పట్ల నిరసన వ్యక్తపరచటానికి, భారతీయులు 1937లో జరిగిన ఎన్నికలలో 8 రాష్ట్రాలలో అధికారంలోనికి వచ్చిన ప్రభుత్వాలు రాజీనామా చేయకుండా, అధికారంలోనే ఉండి, బ్రిటిష్ వారికి సహకరించకుండా నిరసన తెలిపితే బాగుండేది.

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 5.
బ్రిటన్ మాట ఇచ్చి భారతీయుల మద్దతు ఎందుకు పొందలేదు? 1939లో భారతీయులు అడిగింది మాటే కదా ! తరగతిలో అందరూ చర్చించండి.
జవాబు:

  1. బ్రిటిష్ వారికి, తాము భారతదేశంలో నిర్మించిన సామ్రాజ్యాన్ని వదులుకోవటం ఇష్టం లేదు.
  2. 2వ ప్రపంచయుద్ధం తరువాత భారత్ కు డొమీనియన్ ప్రతిపత్తి ఇస్తామని చెప్పారు. కాని జాతీయవాదులు సంపూర్ణ స్వరాజ్యం కావాలని కోరినారు. ఇది బ్రిటిష్ కు ఇష్టం లేదు.
  3. కాంగ్రెస్ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం లేదని (ఉదా : ముస్లిం ప్రజలకు) బ్రిటిష్ భావించింది. అనేకమంది భారతీయుల ప్రయోజనాలను కాంగ్రెస్ పట్టించుకోవటం లేదని వాటిని కాపాడాల్సిన బాధ్యత ‘తమపైన ఉన్నదని బ్రిటన్ భావించి, భారతీయులకు 1939లో స్వాతంత్ర్యం ఇస్తామని బ్రిటన్ మాట ఇవ్వలేదని అర్థం అవుతుంది.

10th Class Social Textbook Page No.221

ప్రశ్న 6.
అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ప్రత్యేక నియోజకవర్గాలు ఒక విధానం. ఈ ఉద్దేశం నెరవేర్చటంలో సహాయపడగల -విధానాలు ఇంకేమైనా ఉన్నాయా? ఉదాహరణకు ముస్లింలకు సంబంధించిన అంశం మీద ఓటు వేయటానికి ముందు ముస్లిమేతర సభ్యులు తమ నియోజక వర్గంలోని ముస్లింలను సంప్రదించాలన్న షరతు పెడితే ఎలా ఉంటుంది? ఇటువంటి పద్ధతి ఎప్పుడు పని , చేస్తుంది? ఎటువంటి పరిస్థితులలో ఇది విఫలం అవుతుంది?
జవాబు:

  1. అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడటానికి ప్రత్యేక నియోజకవర్గాలతో పాటు చట్ట సభల్లో వారికి రిజర్వేషన్లు కూడా కల్పించవచ్చు.
  2. ముస్లిమేతర సభ్యులు తమ నియోజకవర్గంలోని ముస్లింలను సంప్రదించాలన్న షరతు పెడితే బాగుంటుంది. కాని ఈ ఈ పద్ధతి, ముస్లింలు చాలా తక్కువ సంఖ్యలో ఉండి, తమ హక్కులకు రక్షణ లభించగలదని నమ్మే పరిస్థితిలో పనిచేస్తుంది. ముస్లింలకు ఇతర వర్గాల మీద నమ్మకం లేనపుడు, వారి సంఖ్య అధికంగా ఉన్నప్పుడు ముస్లింలు, వారి వర్గ సభ్యులకే ఓటు వేసుకోవాలనుకుంటారు, కాని ఇతరులకు వేయాలనుకోరు.

10th Class Social Textbook Page No.229

ప్రశ్న 7.
తాము బందీలుగా పట్టుకున్న సైనికులను బోస్ తన సైన్యంలోకి తీసుకోవటాన్ని జపనీయులు ఎందుకు అనుమతించారు?
జవాబు:
జపాన్ ఆధ్వర్యంలో ‘గ్రేటర్ ఆసియా’ను స్థాపించడం కోసం స్థానికంగా సంబంధాలు ఏర్పరచుకోవాలనే, స్వార్ధ ప్రయోజనంతోనే జపాన్ వారు ‘భారత జాతీయ సేన’ ఏర్పాటును ప్రోత్సహించారు. తాము బందీలుగా పట్టుకున్న సైనికులతో జాతీయ సేనను ఏర్పాటుచేయుటకు ప్రోత్సహించారు.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 8.
భారత సైనికులు భారత జాతీయ సైన్యంలో ఎందుకు చేరారు?
జవాబు:
బ్రిటిష్ ఇండియా సైన్యంలో భారతీయ సైనికులు కూడా ఉన్నారు. జపాన్ వారు బర్మా, మలయాపై దాడి చేసి అక్కడి, బ్రిటిష్ సైన్యాన్ని ఓడించారు. మలయా కూడా బ్రిటన్ వలస దేశమే. బ్రిటిష్ సైన్యంలోని కెప్టెన్ ‘మోహన్ సింగ్’ తన జట్టు సైనికులతో జపనీయులకు లొంగిపోయాడు. ఈ లొంగిపోయిన యుద్ధ ఖైదీలతో ‘భారత జాతీయ సైన్యం’ ఏర్పడింది.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 9.
యుద్ధంలో ఓడిపోతే బ్రిటిష్ వాళ్ల చేతుల్లో చిక్కుతామన్న భయం భారతీయ సైనికులకు ఎందుకు లేకపోయింది? బ్రిటిష్ వాళ్లు వీరిని ఏమి చేసి ఉండేవాళ్లు?
జవాబు:
భారత జాతీయ సైన్యానికి, యుద్ధంలో ఓడిపోతే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చిక్కుతామన్న భయం లేదు. వారిలో దేశభక్తి మెండుగా ఉంది. తాము చేసే యుద్ధంలో ఇంగ్లాండు ఓడిపోయినట్లయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని ఆశించారు. భారత సైనికులు కేవలం కిరాయి హంతకులు కాదని, తమ ప్రాణాలను స్వదేశం కోసం పణంగా పెట్టగల దేశభక్తులని నిర్ధారణ అయింది. భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలు భారతీయులందరిలో జాతీయవాద భావనలను పురికొల్పాయి. భారతదేశాన్ని దాని సైన్యంతోనే లొంగదీసుకోవడం ఇకపై సాధ్యంకాదని బ్రిటిష్ వారు గ్రహించారు.

10th Class Social Textbook Page No.225

ప్రశ్న 10.
ఘటనలు ఈ విధమైన మలుపు తీసుకోవటం వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా ప్రభావితమై ఉంటాయి?
జవాబు:
భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులు, రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటన్ చేతిలో జపాన్ ఓడిపోవుట వలన ఓడిపోయారు. అయితే ఈ సైనికులను జైలుపాలు జేసి వారిని శిక్షించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించినారు. విద్రోహ చర్య క్రింద వారిని విచారించి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించాయి. సైనికులపై విచారణ కొనసాగుతుండగా దేశంలోని పలు ప్రాంతాలలో అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి.

10th Class Social Textbook Page No.225

ప్రశ్న 11.
నాయకులుగా ఆరాధించిన భారత జాతీయ సైనికులను బ్రిటిష్ వాళ్లు, విద్రోహులుగా పరిగణించి, విచారించి, ఉరి తీయటం ఇతర భారతీయులను ఎలా ప్రభావితం చేసి ఉంటుంది?
జవాబు:
జాతీయ సైనికులను అరెస్టు చేసి, విచారణ సాగుతుండగా చాలా ప్రాంతాలలో గొడవలు, అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి. జాతీయ చైతన్యంతో చెలరేగిన ఈ ప్రజా తిరుగుబాటులో హిందువులు, ముస్లింల గుర్తింపు, విభజన రాజకీయాలు వంటివి ప్రాముఖ్యత కోల్పోయాయి. ఉదా : భారత జాతీయ సైనికులలో విచారింపబడుతున్న వాళ్ళలో చాలామంది ముస్లింలు, అయితే వాళ్ళ పట్ల ప్రజలలో సానుభూతి వెల్లివిరిసి వాళ్ళ మతం గురించి ఎవరూ ఆలోచించలేదు.

10th Class Social Textbook Page No.226

ప్రశ్న 12.
పైన పేర్కొన్న పలు ప్రజా ఉద్యమాలలో మతపర తేడాలను పట్టించుకోలేదని గమనించాం. ఈ ఉద్యమాలలో ప్రజల ఐకమత్యానికి కారణం ఏమిటి?
జవాబు:
రైతు, కార్మిక, ఉద్యోగస్తుల, నౌకాదళంలోని భారత సైనికుల తిరుగుబాటు, జాతీయ సేనను బ్రిటిష్ వారు విచారించి శిక్షించాలనుకున్నపుడు, ఇటువంటి సందర్భాలలో భారత ప్రజలందరూ తామంతా ఒక్కటే అని కలిసికట్టుగా సమస్యల సాధనకొరకు కృషి చేసారు. వారిలో దేశభక్తి ఉప్పొంగింది. తామందరికీ శత్రువైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 13.
1935 చట్టం ఇచ్చిన అధికారాలకు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలా?
జవాబు:
1935 చట్టంలోని అంశాలు :

  1. ఈ చట్టం భారతదేశంలో ఫెడరల్ విధానాన్ని ఏర్పాటు చేయాలి.
  2. కేంద్రంలో రెండు సభలతో కూడిన శాసనసభ ఏర్పడింది.
  3. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దు అయ్యింది. మంత్రులకు అన్ని శాఖలు అప్పగించడం జరిగింది.

అయినప్పటికి 1935 చట్టం జాతీయవాదులను తృప్తి పరచలేదు. ఎందుకనగా :

  1. ఫెడరల్ విధానాన్ని అమలు జరపలేదు.
  2. గవర్నర్ లకు శాసనసభ తీర్మానాలను తోసిపుచ్చే అధికారం ఉండేది.
  3. చాలా తక్కువమంది ప్రజలకు ఓటుహక్కును కల్పించారు. భారతీయులు ఈ చట్టాన్ని ఎదిరించారు. కావున బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండనవసరం లేదు.

10th Class Social Textbook Page No.220

ప్రశ్న 14.
ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను కాంగ్రెస్ తీవ్రతరం చేసి ఉన్నట్లయితే ఏం జరిగి ఉండేది? ఇది స్వాతంత్ర్య పోరాటానికి బలం చేకూర్చి ఉండేదా?
జవాబు:

  1. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసాయి. కాబట్టి అధికారం నాయకుల చేతుల్లో లేదు. బ్రిటిష్ వారి చర్యలను ఎదిరించలేరు.
  2. యుద్ధ సమయంలో శాంతి భద్రతలను కాపాడటానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను పొందింది.
  3. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఎవరినైనా వెంటనే జైలుకి పంపించి, కోర్టుకి వెళ్ళకుండా కావలసినంత కాలం బందీగా ఉంచవచ్చు.
  4. వాక్ స్వాతంత్ర్యాన్ని కూడా పరిమితం చేశారు. ఇటువంటి గడ్డు పరిస్థితిలో కాంగ్రెస్ నిరసనలను తీవ్రతరం చేసినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం నాయకులను అరెస్టు చేసి జైలుకి పంపించి ఉండేది. జైలులో ఎంతకాలమైన ఉంచే చట్టాలను చేసింది. కాబట్టి అరెస్టు అయిన జాతీయ నాయకులు ఎప్పుడు విడుదల అవుతారో తెలీదు కావున స్వాతంత్ర్య పోరాటం చేయడానికి నాయకులు లేక పోరాటానికి బలం తగ్గిపోయేదని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.220

ప్రశ్న 15.
అల్ప సంఖ్యాక వర్గాల భయాలు, సమస్యలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను గురించి చర్చించండి. అధిక ఓట్లతో గెలిచే ఎన్నికలు అల్పసంఖ్యాక వర్గాలకు సహాయపడలేవని ఎందుకు భావించారు?
జవాబు:
భారతదేశంలో అధిక జనాభా హిందువులే. దీని మూలంగా భారతదేశంలో ఉన్న ముస్లింలకు తాము అల్ప సంఖ్యాక వర్గం అనే భావం వచ్చింది. మతరీత్యా కూడా వేరు అగుట మూలంగా కూడా తాము వేరు, హిందువులు వేరు అనే భావం ముస్లింలలో కలిగింది. అదే విధంగా కాంగ్రెస్ అధికారంలో తమకు న్యాయం జరగదని, తమ సమస్యలు పరిష్కరించబడవనే అపోహలకు ముస్లింలు లోనయ్యారని తెలుస్తుంది. అయితే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ – సమానమే అనే భావాన్ని కాంగ్రెస్ వారు ముస్లింలకు కల్పించాలి. వారు భయపడవలసిన అవసరం లేదని వారికి నమ్మకం కలిగించాలి. హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్. వంటి సంస్థల మూలంగా ముస్లింల భయాలు ఎక్కువయ్యాయి. అధిక మెజారిటీతో గెలిచే కాంగ్రెస్ నాయకత్వం ముస్లింలకు సహాయం చేయలేదని ముస్లింలు భావించారు.

10th Class Social Textbook Page No.223

ప్రశ్న 16.
ముస్లిం లీగు రాజకీయాల వల్ల ఒనగూరే ప్రయోజనాలను ప్రజలు ఏ విధంగా అంచనా వేసుకున్నారు? వాళ్లకి ఏమైనా ఆ ప్రశ్నలు తలెత్తాయా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:
ముస్లిం లీగ్ రాజకీయాల వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలు ఈ క్రింది విధంగా అంచనా వేసుకున్నారు.
1) హిందూ జమీందార్లు, వడ్డీ వ్యాపారస్తులు తమను దోచుకోని పరిస్థితి గురించి కలలు కన్నారు. వ్యాపారస్థులు, ఉద్యోగార్థులు హిందువుల నుంచి పోటీ ఉండదని ఆశించారు. మరింత మత స్వాతంత్ర్యం ఉంటుందని భావించారు.

2) హిందువుల ఆధిపత్యం గురించి ముస్లిం లీగుకు అనేక భయాలున్నాయని చెప్పవచ్చు. ముస్లింల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాల పట్ల ముస్లిం లీగుకు సందేహాలున్నాయి.
ఉదా : యునైటెడ్ ప్రావిన్స్ లో ఎక్కువ సీట్లనే గెలుచుకున్న ముస్లిం లీగుతో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయటాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం తమ సభ్యులు ముస్లిం లీగులో సభ్యత్వం తీసుకోవడాన్ని కాంగ్రెస్ నిషేధించింది. ఈ వ్యవహారాల పట్ల ముస్లిం లీగులో అనేక సందేహాలున్నాయని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 17.
1942-45 మధ్య కాలాన్ని సమీక్షించండి. అంతకుముందు కంటే ఇప్పుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల ప్రతిఘటన బలం పుంజుకుందా? వివరించండి.
జవాబు:
1942 – 45 మధ్యకాలాన్ని పరిశీలించినట్లయితే అంతకుముందు కంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల ప్రతిఘటన బలం పుంజుకుందని చెప్పవచ్చు.

  1. రెండవ ప్రపంచయుద్ధంలో భారతీయుల సహకారం కోసం పంపిన క్రిప్స్ రాయబారాన్ని కాంగ్రెస్, లీగులు తిరస్కరించినాయి.
  2. క్రిప్స్ రాయబారాన్ని తిరస్కరించిన తరువాత కాంగ్రెస్ కమిటీ సమావేశమై అనుసరించవలసిన విధానాన్ని ప్రకటించింది. 1942లో గాంధీజీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్వాతంత్ర్య పోరాటాన్ని తీవ్రతరం చేశారు. గాంధీజీ ఉద్యమకారులతో ప్రాణత్యాగాన్నెనా చేసి, స్వరాజ్యాన్ని సంపాదించవలెనని చెప్పినాడు. దానిని ‘Do or die’ అంటారు.
  3. 1942లో భారత జాతీయ సైన్యం ఏర్పడింది. ఇది సుభాష్ చంద్రబోసు నాయకత్వంలో దాదాపు 3 సంవత్సరాలు బ్రిటిష్ యుద్ధం చేసింది. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేసింది.
  4. 1946 భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను బ్రిటిష్ వారు శిక్షించాలని నిర్ణయించినారు. వారి మీద విచారణ జరుగుతుండగా దేశంలోని పలు ప్రాంతాలలో అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి. జాతీయ చైతన్యంతో చెలరేగిన ఈ ప్రజా తిరుగుబాటులో హిందువు – ముస్లింల గుర్తింపు, విభజన రాజకీయాలు వంటివి ప్రాముఖ్యత కోల్పోయాయి. పై సంఘటనలన్నింటితో జాతీయోద్యమం బలాన్ని పుంజుకుందని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.226

ప్రశ్న 18.
దేశంలోని సాధారణ ప్రజల చర్యలను సమీక్షించండి. వాళ్ల కోరికలు ఏమిటి?
జవాబు:
1) దేశంలోని సాధారణ ప్రజలు కొందరు జీవనాధారం కొరకు మిల్లులు, కర్మాగారాలలో పనిచేసేవారు. మరికొంతమంది వ్యవసాయం చేసేవారు. మొదటి కర్మాగారాలలో పని గంటలు అధికంగా ఉండేవి. పని పరిస్థితులు సరిగ్గా ఉండేవి కావు. వేతనాలు తక్కువ. కార్మికులు ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించేవారు. అనేక కార్మిక సంఘాలు ఆవిర్భవించాయి. భారతీయ కమ్యూనిస్ట్, సోషలిస్ట్ పార్టీలు ఆవిర్భవించి కార్మికుల సమస్యల సాధన కొరకు సమ్మెలలో మద్దతు ఇచ్చారు. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేశారు.

2) దేశంలోని చిన్న, పేద రైతులు ఆందోళన చేయసాగారు. కౌలు వ్యవసాయం చేస్తున్న వారు తమ వాటాని పెంచాలని, తెలంగాణా రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూ రైతుల రుణాలను మాఫీ చేయాలని, వెట్టిచాకిరిని నిర్మూలించాలని, దున్నే వాడికే భూమి ఇవ్వాలని కోరినారు. రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది. ఉద్యోగస్తులు, వేతనాల పెంపు కొరకు సమ్మెలు చేసారు. ట్రావెన్ కోర్, కాశ్మీరు లాంటి సంస్థానాలలో పెద్ద ఎత్తున సమ్మెలు జరిగినాయి.

10th Class Social Textbook Page No.227

ప్రశ్న 19.
కాంగ్రెస్ కి ఆమోదయోగ్యం కాని ముస్లిం లీగు కోరికలు ఏమిటి ? కాంగ్రెస్ పేర్కొన్న కారణాలతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
1944 లో సి. రాజగోపాలాచారి హిందూ-ముస్లింల మధ్య పరిష్కారం కొరకు ఒక ఫార్ములాను రూపొందించాడు. – అయితే దీనిని కాంగ్రెస్, ముస్లిం లీగులు రెండూ తిరస్కరించాయి.

1945 ‘వావెల్’ పథకంను అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వావెల్ రాజ్యాంగబద్ధమైన ప్రతిష్ఠంభనను అంతమొందించడానికి ఒక కొత్త పథకం రూపొందించాడు. దాని ప్రకారం “కమాండర్-ఇన్-చీఫ్ విషయంలో తప్ప కార్యనిర్వాహక మండలిని పూర్తిగా భారతీయులకే వదిలి పెట్టాలని, మండలిలో ముస్లింలకు, హిందువులకు సమాన ప్రాతినిధ్యం ఉండాలని ప్రతిపాదించడమైంది.

అయితే, జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్, కార్యనిర్వాహక మండలిలోని ముస్లిం సభ్యులను లీగ్ మాత్రమే ఎన్నుకోవాలని కోరాడు, ఈ పద్ధతిని కాంగ్రెస్ ఆమోదించలేదు. ఇది జిన్నా యొక్క అనుచిత వైఖరి అని, ఇవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయంతో ఏకీభవిస్తాను.

10th Class Social Textbook Page No.227

ప్రశ్న 20.
ప్రజల అభిప్రాయాలను 1946 ఎన్నికలు ఏ విధంగా సూచించాయి? మీ అభిప్రాయాలను పేర్కొనండి.
జవాబు:
1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో రిజర్వు చేసిన 30 స్థానాలనూ, రాష్ట్రంలోని 569 స్థానాలలో 442 స్థానాలనూ ముస్లిం లీగు గెలుచుకుంది. అంటే 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధాన పార్టీగా ముస్లింలీగు ఆవిర్భవించి భారతీయ ముస్లిముల ఏకైక ప్రతినిధి’ ని అన్న తన వాదనను నిజం చేసుకుంది. ముస్లిం ఓట్లలో 86 శాతానికి పైగా ఆ పార్టీకి వచ్చాయి. 1946లో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91 శాతంతో అఖండ విజయం సాధించింది.

నా అభిప్రాయాలు :

  1. 1946 ఎన్నికల ద్వారా ముస్లిం నియోజక వర్గాలలో వచ్చిన మెజారిటీని చూసినట్లయితే ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ముస్లింలీగ్ అధిక స్థానాలను గెలుచుకుంది.
  2. సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ ముస్లిమేతర ఓట్లలో 91% ఓట్లతో విజయం సాధించింది. దీని మూలంగా కొన్ని ప్రాంతాలలో ముస్లింలకు ఆధిక్యత ఉందని తెలుస్తుంది. లీగు ఏకైక ప్రతినిధి అని తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.228

ప్రశ్న 21.
భారతదేశ స్వాతంత్ర్యంపై దినపత్రిక నివేదిక. దీంట్లో ఏ ఏ అంశాలను గుర్తించారు? చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 1
జవాబు:
ఈ క్రింది విషయాలు గమనించాను.

  1. రెండు సార్వ భౌమాధికారం గల దేశాలు ఆవిర్భవించాయి.
  2. బ్రిటతో స్నేహ పూర్వకంగా సంబంధాలు కలిగి ఉంటామని నెహ్రూ, బ్రిటన్ ప్రధాని అట్లికి సమాధానం ఇచ్చారు.
  3. కలకత్తాలోని హిందూ, ముస్లింలు ఆనందంగా ఉన్న సంఘటనలు అని కనిపిస్తుంది.
  4. భారత మొదటి కాబినెట్ జరుపుకొంటున్న ఫంక్షను.
  5. పశ్చిమ బెంగాలకు మొదటి గవర్నర్ గా సి. ఆర్. ప్రమాణ స్వీకారం.
  6. కలకత్తాలో ఎటువంటి అంతరాయాలు, ఇబ్బందులు లేవు.
  7. గాంధీజీ, అంతరాయం లేకుండా మీటింగ్ ను ఆలకిస్తున్నారు.
  8. రాజ్యాంగ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
  9. ప్రక్కన “ఒమెగా” గడియారం ప్రకటన కనిపిస్తుంది – మొదలైన విషయాలు “ది స్టేట్స్మన్” అనే పత్రికలో కనిపిస్తున్నాయి.

Leave a Comment