These AP 8th Class Telugu Important Questions 7th Lesson చైతన్యమూర్తులు will help students prepare well for the exams.
చైతన్యమూర్తులు AP Board 8th Class Telugu 7th Lesson Important Questions and Answers
అ) క్రింది ప్రశ్నలకు పది వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
సంఘ సంస్కర్త వీరబ్రహ్మంగారి గురించి రాయండి. (SA-1:2022-23)
జవాబు:
పోతులూరి వీరబ్రహ్మం గారు క్రీ.శ. 1608లో ప్రకృతాంబ, పరిపూర్ణయ్య దంపతులకు జన్మించారు. సాంఘిక, మత దురాచారాలను ఖండించారు. ఆయన సరికొత్త తత్త్వాన్ని బోధించారు.
గరిమిరెడ్డి అచ్చమ్మగారింట్లో పశువులు కాయటానికి కుదిరాడు. వీరబ్రహ్మంగారు పశువుల చుట్టూ గీత గీసేవాడు. ఆయన రవ్వలకొండ గుహలో కూర్చొని తాళపత్ర గ్రంథాలపైన కాలజ్ఞానం వ్రాసుకొనేవాడు. అది తెలిసిన ‘అచ్చమ్మ’ గారు ఆయన శిష్యురాలైంది.
వీరబ్రహ్మంగారు శివకోటయ్య కుమార్తె గోవిందమ్మను వివాహం చేసుకొన్నాడు. వారికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. బ్రహ్మంగారు కర్మానుష్ఠానం చేస్తూనే కర్మ సన్యాసిగా ఉన్న రాజయోగి.
వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం, కాళికాంబ సప్తశతి మొదలైన గ్రంథాలు రచించారు. వీరబ్రహ్మంగారు స్త్రీలను గౌరవించాలి, అన్ని కులాలు సమానమే, సోమరితనం వద్దు వంటి నీతులను సమాజానికి తన బోధనలు, రచనల ద్వారా చెప్పారు. ఆయన సిద్ధయ్య, కక్కయ్య, అన్నాజయ్య మొదలైనవారిని శిష్యులుగా చేసుకొని తన ఆదర్శభావాలను చాటారు. తీర్థాలన్నీ. మన శరీరంలోనే ఉన్నాయని, మనుషులంతా కలసి మెలసి ఉండాలని చాటి చెప్పారు.
ప్రశ్న 2.
జానపద సాహిత్యానికి నేదునూరి గంగాధరం చేసిన సేవల గురించి రాయండి. (SA-1:2023-24)
జవాబు:
‘నేదునూరి గంగాధరం పథమంతా జానపదం’ అన్న వానపల్లి నూకరాజుగారి మాటలు అక్షర సత్యాలు. జనం నోటిలో నానుతూ వచ్చే పదాలే జానపదం. గంగాధరం గారు 28 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎన్నో జానపద రచనలు సేకరించారు. తను రచించారు. జానపద సాహితీ సేకరణలో తన బంగారాన్ని, విలువైన చీరలను కూడా ఇచ్చేసిన సాధ్వి ఆయన భార్య గంగమాంబ.
ఆంధ్రజాతి ప్రాచీనత, సంస్కృతి, భాష, సాహితీ వైభవం, జానపద వాఙ్మయంలోనే ఉంది. ఆయన రచించిన పదాలు పద కథలు, గేయాలు, హాస్యాలు, సంవాదాలు, లాలి పాటలు, చెక్క భజనలు మొదలైనవి వారి రచనలలో ఎన్నో ఉన్నాయి.
ఆయన ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తూనే సెలవులలో కాలి నడకన ఊరూరు తిరిగి జానపద సాహిత్యం సేకరించేవారు. ఆయనకున్న 6 ఎకరాల భూమి, భార్య మెడలో పుస్తెలు కూడా ఖర్చైపోయాయి.
జానపద సాహిత్యానికి రాజమండ్రిలో నేదునూరి గ్రంథాలయం ఉంది.
ప్రశ్న 3.
వడ్డాది పాపయ్య మేటి చిత్రకారుడని ఎలా చెప్పగలవు?
జవాబు:
వడ్డాది పాపయ్యగారి తండ్రి గారు చిత్రకళా ఉపాధ్యాయుడు అందుచేత వడ్డాది పాపయ్యగారికి బాల్యం నుండీ చిత్రకళపై ఆసక్తి ఎక్కువ.
ఆయన మొదట హనుమంతుని చిత్రం గీశారు. బాల్యం నుండీ బొమ్మలు గీయడంలోనే నిమగ్నమయ్యేవారు. చిత్రాలు గీయడంలో ఎన్నో ప్రయోగాలు చేసేవారు. రంగులను సొంతంగా తయారు చేసుకొనేవారు. ప్రకృతి రమణీయకతను హృదయానుభూతితో చిత్రీకరించేవారు. చిత్రకళలో ఎవ్వరూ అనుకరించలేని క్లిష్టత వారికే సొంతం. ఆయన గీసిన చిత్రాలపై తన పేరు వ.పా. అని వ్రాసుకొనేవారు.
ఆయన వ్యంగ్య చిత్రాలను కూడా గీసేవారు. పై వాటినన్నింటినీ పరిశీలించగా వడ్డాది పాపయ్యగారు సాటిలేని మేటి చిత్రకారుడని కచ్చితంగా చెప్పగలం.
ప్రశ్న 4.
తొలి ముస్లిం ఉపాధ్యాయురాలిగా ఫాతిమా షేక్ చేసిన సేవల గురించి రాయండి. (SA-1:2022-23)
జవాబు:
ఫాతిమా షేక్ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు. తనకు ఎన్ని అవమానాలెదురైనా పేద బాలికలకు విద్య నేర్పడానికి తన జీవితం త్యాగం చేశారు. ఆమె ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని మరాఠి, ఆంగ్ల భాషలను అభ్యసించారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయినిగా సేవలందించారు. ఆమె ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఉఫాధ్యాయినిగా సేవలందించిన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఆమెను కొందరు ఆకతాయిలు కూడా వేధించారు. భౌతికదాడులను కూడా ఆమె ఎదుర్కొన్నారు. ఫాతిమా షేక్ వాటన్నింటినీ ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్నారు. ఆడపిల్లలకు చదువు చెప్పాలనే తన లక్ష్యాన్ని సాధించారు.
ప్రశ్న 5.
రాగతి పండరి కార్టూనిస్టుగా ఎదిగిన విధానాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
తన వ్యంగ్య చిత్రాలతో సున్నితమైన హాస్యాన్ని, చమత్కారాన్ని, తెలుగు నుడికారాన్ని జతచేసి తన కార్టూన్ల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన మహిళామణి రాగతి పండరి. ఆమెది సాహితీ కుటుంబం కనుక అక్కగారి ప్రోత్సాహంతో చదువుకొంది. చిన్నతనంలోనే పోలియో సోకి దివ్యాంగురాలైనా అధైర్యపడలేదు. ‘శ్రీ జయదేవ్’ గారి చిత్రాల ప్రభావంతో కార్టూనిస్టుగా మారింది. జయదేవ్ గారి సలహాలతో తన 8వ ఏటనే ‘ఆంధ్రజ్యోతి’లో తొలి కార్టూన్ ప్రచురితమయింది. ఇక వెనుతిరగలేదు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, స్వాతి మొదలైన అన్ని పత్రికలలో ఆమె కార్టూన్లు పడ్డాయి. ఆమె కార్టూన్ లేని పేపరు కాని, పత్రిక కాని లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి వారామె ఫోటో కార్టూన్తో పరిచయం చేశారు. రాగతి పండరిని చూసిన ప్రేక్షకులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె కార్టూన్ సామ్రాజ్యానికి మహారాణి అయ్యింది. కార్టూన్లతో అనేక పత్రికలలో అనేక ప్రయోగాలు చేశారు. అన్ని సఫలమయ్యాయి. 1965 విశాఖలో జన్మించిన రాగతి పండరి 2015లో స్వర్గస్తులయ్యారు.
ప్రశ్న 6.
తాడి నాగమ్మ సమాజానికి చేసిన సేవలను రాయండి. (SA-1:2023-24)
జవాబు:
తాడి నాగమ్మ గారు రాజోలు తాలూకాలోని మామిడి కుదురు మండలంలోని ఆదుర్రు శివారు మోరి పొలం గ్రామ నివాసిని.
ఆమె ఉపాధ్యాయిని, తన పిల్లలను బాగా చదివించారు. మహిళా మండలిని స్థాపించారు. ఇళ్లలోనే ప్రాథమిక వైద్య సదుపాయాలను కల్పించారు. లైబ్రరీలు ఏర్పాటు చేశారు. పండుగలలో పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంచి పెట్టేవారు. వ్యవసాయ కూలీలకు రాత్రిబడులు నిర్వహించేవారు. పేద ప్రజలకు బడి పిల్లల పుస్తకాలకు ఆర్థిక సహాయం చేసేవారు. ప్రజలలో జాతీయ భావాలను రేకెత్తించడానికి భోజన, బుర్రకథ, నాటకం వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆమె రచనలు గృహలక్ష్మి పత్రికలో ప్రచురితం అయ్యాయి. జనజీవన సమస్యలు అనే కథాసంకలనం 1960లో ప్రచురించారు. ఈ విధంగా నాగమ్మగారు సంఘసేవ చేశారు.